• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మొదటి భాగం



విసమ్రాట్ అన్న బిరుదానికి కొత్త సొబగులు అద్ది దానికి పరిపూర్ణత చేకూర్చిన వారు విశ్వనాథ సత్యనారాయణ. సంస్కృతాంధ్ర,ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేసి మేరుసమానమైన ఖ్యాతి పొందారు. విద్వత్తులో,ఆయనతో పోల్చదగిన వారు ఆ కాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా అంధ్రదేశంలో పుట్టలేదంటే అతిశయోక్తి లేదు. ఆయనకు అజారమరమైన కీర్తిని సంపాదించి పెట్టిన వాటిలో వేయిపడగలు ప్రముఖమైనది. ధర్మశాస్త్రానికి ప్రతీకలా భాసించే ఈ పుస్తకానికి వేయికి పైగా పేజీలు,37 అధ్యాయాలు. ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్ స్టోయ్ 'వార్ అండ్ పీస్' రచనతో పాటూ సమానహోదా అందుకున్న ఈ పుస్తకం గురుంచి నేటి తరం పాఠకులకి తెలిసింది చాలా తక్కువ. (నిజానికి పుస్తకం చదివేంత వరకు నాకు దీని గొప్పదనం తెలియలేదు). ఆ ఉద్గ్రంథం ఔన్నత్యాన్ని తెలియచేసే చిరుప్రయత్నమే యిది. రచన మొత్తం గ్రాంథిక భాషలోనే సాగుతుంది.

కథ:

సుబ్బన్నపేట మూడువందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఊరు. మూడువందల సంవత్సరాల క్రితం ఈ సుబ్బన్నపేట ఒక మహారణ్యం. ఆ అడవిలో ఒక చిన్న పల్లెలో,ఒక పెదకాపు కట్టెలు కొట్టుకుంటూ తన భార్యా,కూతురుతో జీవనం సాగించేవాడు. అతనికి కామధేనువు లాంటి ఒక ఆవు ఉండేది. ఆ ఆవు రోజూ బిందెల కొద్దీ పాలిస్తుండేది.అలాంటి ఆ గోవు హఠాత్తుగా పాలివ్వటం మానేస్తుంది. పాలు పితకబోయిన కాపు ని అతని భార్యని తంతుంది. మేతకు తీసుకెళ్ళినప్పుడు ఎవరో దొంగతనంగా పాలు పితికేస్తున్నారని సందేహంతో కాపు తనే ఆవు వెంట వెళ్తాడు. ఆవు తన కనుగప్పి ఒక పెద్ద పుట్టలో పాలు పోయటం.ఆ పుట్ట లో నుంచి వేయి పడగల పాము ఒకటి వెలుపలకి వచ్చి ఆవు పాలు పూర్తిగా తాగెయ్యటం చూసి మూర్ఛపోతాడు. తర్వాత తెప్పరిల్లి ఇంటికి వెళ్ళి విషయం భార్యతో చెప్తాడు.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా వ్యాపిస్తుంది. ఆ రాత్రి కాపు కలలో సుబ్రమణ్యేశ్వరుడు కనిపించి తను పాలు త్రాగిన స్థలం లో గుడి కట్టించమని చెప్తాడు. ఆ సంగతి గ్రామస్తులకు చెబుతాడు కాపు. కాని గుడి నిర్మాణానికి అవసరమైన ధనం వారి దగ్గర వుండదు.

సుబ్రమణ్యేశ్వరుని మహిమ వలన ఆ ఊరిలో ప్రజల చిరకాల సమస్యలన్నీ పరిష్కారమవుతుంటాయి.స్వామి మహత్తు చుట్టుప్రక్కల ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.ప్రక్క ఊరిలోని ఒక బ్రాహ్మణుడు తనకు సంతానం కలిగితే స్వామి సన్నిధిలోనే వుంటానని మ్రొక్కుకుంటాడు.అతనికి పండంటి కొడుకు పుడతాడు.బ్రాహ్మణుడు భార్యాపిల్లలతో వచ్చి స్వామి కి సేవలు చేసుకుంటూంటాడు .ఆంగ్లేయులు దేశంలో తమ పట్టును పెంచుకుంటున్న కాలంలో,వ్యాపారంలో అనుహ్య సంపద పొందిన వీరన్ననాయుడనే భాగ్యవంతుడు ఒక కోట కట్టి, జమిందారుగా వెలగాలని అందుకు అనువైన స్థలం చూపమని అతన్ని అడుగుతాడు. బ్రాహ్మణుడు కోటని ఆ ఊరిలోనే కట్టమని,ఆ ప్రాంతం మూడువందల యేళ్ళవరకు సుభిక్షంగా వుంటుందని చెప్పి అతన్ని వొప్పిస్తాడు. అలా సుబ్బన్నపేట పేరుతో,ఆ ప్రాంతం అభివృద్ధి చెంది,ఎందరో వచ్చి అక్కడ స్థిరపడతారు.వీరన్న నాయుడు ఆ ఊళ్ళో శివలింగం ప్రతిష్ఠించి,నాగేశ్వరాలయం, సుబ్రమణ్యేశ్వరాలయం,వేణుగోపాలస్వామి ఆలయం నిర్మిస్తాడు. ఆయనికి దివానుగా బ్రాహ్మణుడు నియమింపబడతాడు.

ఏ ఆవు పాలు సుబ్రమణ్యేశ్వరుడు త్రాగాడో,ఆ ఆవు యజమానైన కాపు కి ఒక్క కూతురుంటుంది. ఆమెకు ఎప్పుడు పెళ్ళి చేయ నిశ్చయించినా సుబ్రమణ్యేశ్వరుడు ఆమెను పూనే వాడు. గ్రామస్తులంతా 'తప్పు తప్పు' అని లెంపలు వేసుకొనేవారు. అలా ఆ వంశంలో ఒక్కటే ఆడపిల్ల పుట్టం, ఆమె అవివాహితగా, గణాచారిగా మిగిలిపోవటం ఆనవాయితీగా మారిపోతుంది.స్వామి వారు,స్వామి కి ప్రతినిధులుగా వీరన్ననాయుని వంశీకులు ,ప్రచారకులుగా బ్రాహ్మణ వంశీయులు, వ్యాఖ్యాతలుగా కాపు వంశీయులు ఉంటూ ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తూ ఆ ఊరికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూంటారు.

మూడువందల యేళ్ళు గడుస్తాయి.బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే సుబ్బన్నపేట నాశనానికి బీజం పడుతుంది.

వీరన్ననాయుని వంశం నుంచి కృష్ణమనాయుడు జమిందారుగా వున్న కాలంలో, బ్రాహ్మణ వంశంలో ఐదవ తరం వాడైన రామేశ్వరశాస్త్రి దివానుగా ఉండేవాడు. ఆయనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులముల నుండి నలుగురు భార్యలు, రత్నగిరి అనే భోగాంగన ఉండేవారు. రామేశ్వరశాస్త్రి విద్వాంసుడు,ధీరోదాత్తుడు, ఉదార స్వభావుడు,గొప్ప దాత. ఆయన దానగుణం వికటించి ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఆయన మోచేతి నీళ్ళపై ఆధారపడి జీవితంలో స్థిరపడ్డ ఎందరో,ఆయనకే వడ్డీలకిచ్చి,చివరి రోజులలో డబ్బు కోసం పీక్కు తింటారు. దరిద్ర దేవత సహస్ర హస్తాలతో కబళించినట్లై, కట్టుకున్న బట్టలు కూడా దానం చేసి, తిండికి కూడా నోచుకోని స్థితిలో,ఆయన, తనకంటే దరిద్రుడైన ఆ ఊరి నాగేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడే తుదిశ్వాస విడుస్తాడు. ఆయన మరణంతో శాస్త్రి గారి ధర్మపత్ని,పదహారేళ్ళ కొడుకు ధర్మారావు వీధిన పడతారు.వారిని ఆదుకోటానికి బంధుమిత్రులెవ్వరూ ముందుకు రారు.

జమిందారు కృష్ణమనాయుడు,రామేశ్వరశాస్త్రి గొప్ప స్నేహితులు. ధర్మారావు దీన పరిస్థితిని తన సేవకుని ద్వారా తెలుసుకున్న ఆయన,అప్పులవారి బాధ నుండి అతన్ని రక్షించి, స్కూలులో చేర్పించి అతని బాగోగులు చూసుకోవటం మొదలుపెడతాడు.ఇదంతా నాయుడి కొడుకు రంగారావుకి నచ్చదు.


(మిగతా రెండవ భాగంలో..)


నా మొదటి కథ - కామేశం కవితాపారాయణం

(ఆంధ్రభూమి మాసపత్రికలో 2001-2002 మధ్యకాలం లో ప్రచురితం అయ్యింది.దురదృష్టవశాత్తూ అ కాపీని పోగొట్టుకున్నాను.అందుకే ప్రచురితమైన నెల,సంవత్సరం వివరాలు సరిగ్గా గుర్తులేవు.నా దగ్గరున్న కథ రఫ్ కాపీ నుంచి యిక్కడ పెడుతున్నాను)

కామేశం చిన్నప్పటినుంచి అంతే !

ఏదైనా ఆలొచన వస్తే దాన్ని అమలు జరిపేంతవరకూ ఊర్కోడు.ఆ విషయంలో పట్టూవిడుపులుండవు.తద్వారా ప్రళయం రావచ్చు,ప్రపంచమే తలక్రిందులవచ్చు,ప్రాణ సంకటం కలగవచ్చు.కానీ అతనవేం పట్టించుకోనే రకం కాదు !

అటువంటి కామేశానికి హఠాత్తుగా పెద్ద కవినైపోవాలనే కోరిక పుట్టింది !
మహాత్ముల మస్తిష్కాలలో మాములుగా పుట్టవు కదా ఆలొచనలు.అతనికి ఈ అలోచన రావటం వేనుకా వో రీజనుంది.

సదానందం సాధారణ ప్రభుత్వోద్యోగి.కామేశం అతని మేనేజరు.

సదానందం ఉబుసుపోక కవితలంటూ ఏవో వ్రాస్తూంటాడు.మొన్నామధ్య ఏదో సంఘం వాళ్ళు జిల్లా స్థాయి కవితా సమ్మేళనం నిర్వహించారు.అందులో మనవాడు పాల్గొని ఏకంగా మొదటి ఫ్రైజు కొట్టేశాడు.ఫ్రైజ్ మనీ ఐదువేలు.దాంతో వొక్కసారిగా ఆఫీసులో హీరో అయిపోయాడు.ఆఫీస్ స్టాఫ్ అతన్ని పొగడని రోజంటూలేదు.హఠాత్తుగా అతనికి లభిస్తున్న గౌరవానికి తలమునకలైపోయాడు కామేశం.నిన్నటిదాకా ఆఫీసులో తన కరిస్మాకు ఎదురులేదు.తను అవునంటే అవును,కాదంటే కాదు,అలాంటిది,ఇప్పుడు తన పాపులారిటికీ ప్రతిబంధకంగా సదానందం సాక్షాత్కరించాడు.

సదానందం పెద్దగా చదువుకోలేదు.తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.సాధారణ చదువులు చదివిన సదానందమే సొంత కవిత్వం వ్రాయగాలేంది,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తను ప్రబంధం వ్రాయలేడా అనుకున్నాడు.అందుకే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు.ముఖ్యంగా కవిత్వం వ్రాయటం పెద్ద గొప్ప విషయమేం కాదని నిరూపించదలచుకున్నాడు.అందుకు కావల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాడు.అయితే ఏ విషయం మీద కవిత్వం వ్రాయాలనే సందేహం కలిగింది.సడెన్ గా పాపులారిటీ పెరిగిన సదానందం మీద అసూయ కలిగింది.అతని మీద కసిగా వ్రాద్దామనుకున్నాడు.కానీ అతనేనాడు తనకు బదులు చెప్పింది లేదు.కయ్ మన్నా,గయ్ మన్నా కామ్ గా పడి వుంటాడు.'పాపం' అనిపించి ఆ ఆలోచన విరమించుకున్నాడు.అంతలోనే 'కుక్కపిల్లా,సబ్బుబిళ్ళా..కాదేదీ కవితకనర్హం' అన్న శ్రీశ్రీ కవిత గుర్తుకు వచ్చింది.వెంటనే తను మెచ్చిన,తనకు నచ్చిన సంగతుల మీద కవితలు వ్రాయటం మొదలుపెట్టాడు.అలా పుంఖానుపుంఖాలుగా పేజీలు నింపాక,తనివితీరా వాటిని చదువుకుని ఎవరెస్ట్ ని యెక్కినట్లుగా ఫీలైపోయాడు.

కవిత్వం వ్రాస్తే సరిపోదు.వ్రాసినట్టు అందరికీ తెలియాలి.అందుకే కామేశం వో ఉపాయం అలోచించాడు.ఓ సండే సాయంకాలం తన ఇంట్లో చిన్న పార్టీ అనౌన్స్ చేశాడు.పార్టీ చివర్నో సర్ ప్రైజ్ వుంటుందని కుడా సెలవిచ్చాడు.పిల్లికి బిచ్చంపెట్టని కామేశం పిలిచి పార్టీ యిస్తాననేసరికి,ఆఫీస్ స్టాఫ్ అంతా మొదట్లో అదిరిపడినా,తర్వాత తేరుకొని హుషారుగా వచ్చారు.పార్టీ కోసం కాకపోయినా,చివర్న ప్రకటించబడే 'సర్ ప్రైజ్' కోసం కొంతమంది కుతూహలజీవులు కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు.అతిథి మర్యాదలు అద్భుతంగా జరిగాయి.అందరు సుష్టుగా లాగించి తీరిగ్గా ఆసీనులయ్యాక,గొంతు సవరించుకుని,ఓ పేపర్ కట్టతో వారి ముందు ప్రత్యక్ష్యమయ్యాడు కామేశం.

"మరేం లేదు! నేను కొన్ని కవితలు వ్రాశాను.వాటిలో మచ్చుకు కొన్ని మీకు వినిపించాలని నా కోరిక" అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.

ఊహించని ఈ ఉత్పాతానికి అంతా ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకున్నారు !

టీవీ కొన్నాక అడ్డమైన సీరియల్స్ భరించక తప్పదు.అందరూ ధైర్యం చిక్కబట్టుకొని తప్పదన్నట్లుగా కుర్చున్నారు.

కామేశం ఈలోగా కాగితపు కట్టను దులిపి మొదటి పేజిని అందుకున్నాడు.
"వేయించి తిన్నాక దొండ
తాగాలి నీళ్ళు వో కుండ" అన్నాడు.

వెంటనే ధభీమన్న శబ్దం వినపడింది.వెనుక వరుస లో కూర్చున్న వామనరావు వెల్లకిల్లా విరుచుకుపడిపోయాడు.బిత్తరపోయి అంతా అటువైపు చూశారు.

"అబ్బే ఏంలేదు.నేను యింత అద్భుతంగా కవిత్వం వ్రాస్తానని అతను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.అందుకే ఆనందాతిశయంతో స్పృహ కోల్పోయాడు.అల్పజీవి కదా " తేల్చేశాడు కామేశం.

స్టాఫ్ కు ముచ్చెమటలు పట్టేశాయ్.

కామేశం మరో లైను అందుకున్నాడు
"శ్రీరాముని భార్య సీత !
సముద్ర తీరాన పీత !! " అన్నాడు.

మధ్యవరుసలో కూర్చున్న మాణిక్యానికి మతి స్థిమితం తప్పింది.సంధి ప్రేలాపనలు ఆరంభించి చేతికందిన వస్తువులు క్రిందవేస్తూ చిందులు తొక్కడం మొదలు పెట్టాడు.అతన్ని కంట్రోల్ చేసేసరికి ఆఫీస్ స్టాఫ్ కి తలప్రాణం తోకకొచ్చింది.

ఇంత జరుగుతున్నా కామేశంకు చీమ కుట్టినట్లు కూడా లేదు.మరో గంట నిర్విఘ్నంగా కవితాపారాయణం సాగించాడు.అతని కవిత్వం ధాటికి ఆఫీస్ స్టాఫ్ అంతా కుదేలైపోయారు.కొంతమంది ఎలాగోలా మెల్లగా జారుకుని,ఆ కంగారులో,గేటు తెరిచే వున్నా గోడ దూకి పారిపోయారు.మరికొందరు పక్షవాతం వచ్చిన రోగుల్లా కుర్చీలకు అతుక్కుపోయారు.
మొత్తానికి ఆ రోజు ప్రాణాలతోనే బయటపడ్డారు అందరు.

కామేశం చేపట్టిన కవితా వ్యాసంగం ఆ ఆదివారంతో ఆగిపోలేదు.
ఆంజనేయుడి తోకలా అలా సాగుతూపోయింది.ప్రతి ఆదివారం యిలా స్టాఫ్ నో,బంధువులనో,ఫ్రెండ్స్ నో ఎవరినో పిలవటం వాళ్ళకు తన కవితలు వినిపించి హడలుకొట్టటం అతనికి రివాజు గా మారిపోయింది.వచ్చిన వాళ్ళకు వండిపెట్టలేక,ఆ పై వాళ్ళు చేసే హాహాకారాలు భరించలేక అతని భార్యకు చిర్రెత్తుకొచ్చేది.అతని సంగతి తెలిసి ఆ యింటివైపు రావటం మానేశారు చాలా మంది.ఇది చాలదన్నట్లు కామేశం పదేళ్ళ పుత్రరత్నం అతని కవితలు కంఠతా పట్టేసి వాటిని బడిలో పిల్లలపై ప్రయోగించటం మొదలుపెట్టాడు.ఇవేవో కొత్త రకం తిట్లనుకొని పిల్లలు జడుసుకొని స్కూలుకు రావటం మానేశారు.ప్రిన్సిపల్ కి విషయం తెలిసి అతని తల్లిని పిలిపించి 'పిల్లాడి చేత ఆ పాడు మాటలు మానిపించేంతవరకు స్కూలుకి పంపకండని ' ముక్కు చీవాట్లు పెట్టాడు.ఆమెకు సహనం నశించి ఆ రాత్రి కామేశంతో తగువులాడి ,పిల్లాడితో సహా పుట్టింటి రైలుబండి ఎక్కేసింది.

పిడుగులు పడి,జడివానలు కురిసినా భగీరథుడు తన తపస్సు వదలనట్లు,కామేశం యివేవి మనసులో పెట్టుకోకుండా తన కవితా యజ్ఞం కొనసాగించాడు.అతని దెబ్బకు కొంతమందికి అదివరకు ఎన్నడూ లేని గుండె దడ ఆయాసం లాంటి అవలక్షణాలు పొడసూపాయి.ఇంకొంతమంది ఫైల్స్ లో ఆఫీస్ విషయాలకు బదులు అన్నమయ్య కీర్తనలు వ్రాయటం స్టార్ట్ చేశారు.ఇలా అయితే లాభం లేదని సదానందం వో మార్గం ఆలోచించి,ధైర్యం చేసి కామేశం కేబిన్లో దూరాడు.

అతన్ని చూడగానే కవితలు వ్రాసుకుంటున్న కామేశం సంతోషంతో మీదపడిపోయి కౌగిలించుకున్నంత పని చేశాడు."రావోయ్ సాదానందం.సరిగ్గా సమయానికొచ్చావ్.ఇప్పుడే వొక బ్రహ్మాండమైన కవిత వ్రాశాను.విసరమంటావా? " అన్నాడు

పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్లుగా అయిపోయింది సదానందం పరిస్థితి.అనవసరంగా లోపలికి వచ్చాననుకొని తనను తానే తిట్టుకొని "వద్దు సార్,ఇప్పుడు లంచ్ టైం.తర్వాత వినిపించండి" అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా.

కామేశం శాంతించి,అప్పుడే ఏదో వెలిగినవాడిలా

"ఈ మధ్యకాలం లో నేను ఎడాపెడా కవితలు వ్రాసేశాను.అన్నీ అద్భుతమైనవేననుకో ! కానీ వాటిలో అత్యద్భుతమైనవి,పత్రికల వాళ్ళ పల్స్ కు అనుగుణంగా వుండేవి పంపిస్తే బావుంటుంది కాదా.అందుకే నువ్వీ ఆదివారం మా ఇంటికి రావాలి" అన్నాడు.

అప్పుడే సున్నం కొట్టిన గోడ లా సదానందం మొహం తెల్లగా మారిపోయింది.కామేశం కవితల కట్టలు తలచుకోగానే అతని నాలుక తడారిపోయింది.తప్పించుకోకపోతే తనకీ భూప్రపంచంతో సంబంధాలు మిగలవని అనుకున్నాడు.చిన్నప్పుడెప్పుడో చనిపోయిన తాతయ్య ఈ మధ్యే హరీమన్నట్లు కథనల్లి ఈ ఆదివారం పెద్దకర్మ చేస్తున్నట్లు చెప్పి బావురుమన్నాడు.రాలేనని మొరపేట్టుకున్నాడు.

"మరైతే నా కవితల సంగతి ?!?" అడిగేడు కామేశం.

"మీకు ఏవి బాగా నచ్చితే అవే పంపండి సార్ ! మళ్ళీ నేనెందుకు" అన్నాడు సదానందం.

"అలాక్కాదోయ్ సదానందం.పోస్ట్ లో కవితలు పంపడం కాదు.పర్సనల్ గా మనమిద్దరమే వెళ్ళి పత్రికల వాళ్ళను కలుద్దాం.నా కవిత్వాన్ని నువ్వొక్కడివే బాగా అర్థం చేసుకున్నావు.నా సంక్లిష్ట భావాలు,కఠిన సమాసాలు ఒకవేళ ఎడిటర్ కి అర్థం కాకపోతే అతనికి విషయం విడమరచి చెప్పగల ఏకైక వ్యక్తివి నువ్వే.అందుకే నువ్వు తప్పకుండా నాతో రావాలి." అన్నాడు కామేశం.

"నీ బొంద !" నీరసంగా అనుకున్నాడు సదానందం.అతనికి వొప్పుకోక తప్పింది కాదు.

ఓ రోజు సాయంకాలం ఇద్దరూ పత్రికాఫీసు కు వెళ్ళారు.ఎడిటర్ తో సదానందానికి మంచి పరిచయం వుంది.నేరుగా ఆయన కేబిన్లోకి వెళ్ళిపోయారు.కామేశాన్ని పరిచయం చేసి వచ్చిన విషయం విశిదం చేసాడు సదానందం.

ఆయన సంతోషించి కామేశం వైపు ఎగాదిగా చూసి
"ఓహో అలాగా !ఏవి మచ్చుకు కొన్ని కవితలు వినిపించండి" అన్నాడు.

అనడమే ఆలశ్యం అన్నట్లు కామేశం తన సంచిలో నుంచి ఓ కట్ట ను బయటికి లాగి
"దురదగా వుంటుంది కంద !
నా జేబులో వుంది ఓ వంద !!" అన్నాడు.

వెంటనే ఎడిటర్ ముఖవళికలు మారిపోయాయి.నీళ్ళు నములుతూ సదానందం వైపు చుశాడు.విచిత్రంగా అతని మొహం చిరునవ్వుతో వెలిగిపోతోంది.

కామేశం రెండో కవిత అందుకున్నాడు.
"ముప్పుటలా మేస్తాను ములక్కాయ!
అప్పుడప్పుడు తింటాను ఆవకాయ!" అన్నాడు.

లాగిపెట్టి ఒక్కటిచ్చుకొని 'దీన్నంటారు లెంపకాయ '' అందామన్నంత కోపం వచ్చింది ఎడిటర్ కి.

కామేశం తన లోకంలో పడిపోయి 'కూరలో కావాలి టమోటా,నాకేమో యిష్టం సపోటా, వంటకి కావాలి గ్యాసు,బస్సులో వుండాలి పాసు లాంటి కవితలు తన్మయత్వంతో చెప్పుకుంటూపోతున్నాడు.

ఎడిటర్ కు ఏంచెయ్యాలో అర్థంకాలేదు.కుర్చీలో అసహనంగా కదిలాడు.గ్లాసులో నీళ్ళు ఖాళీ చేసి గట్టిగా దగ్గాడు.కాసేపు పైకిలేచి గదిలో అటూఇటూ పచార్లు చేశాడు.కొంతసేపు కుర్చీని టేబుల్ ను బరబరా యిడ్చాడు.చివరికి తిక్కరేగి పేపర్ వేయిట్ తీసి నేలకేసి విసిరికొట్టాడు.

..అయినా కామేశం కవితాపారాయణం ఆగలేదు.హతాశుడైపోయిన ఎడిటర్ కామేశం రెండు చేతులు పట్టుకొని "మహా ప్రభో! ఆపండి,దయచేసి ఇక ఆపండి." అంటూ వేడుకున్నాడు.

అప్పటికి కామేశం ఉపశమించాడు.

మరో గ్లాసు నీళ్ళు త్రాగేక కానీ మాములు మనిషి కాలేకపోయాడు ఎడిటర్.సదానందం తన చెవులలోంచి దూదిపింజలు తియ్యటం అప్పుడు గమనించాడతను.ఒళ్ళుమండి అతని కాలర్ పట్టుకొని
"ఏమయ్యా! దినీకంతటికీ కారణం నువ్వు కాదు?పోనీలే బాగా వ్రాస్తావని చనువిస్తే ఈ పిల్లినొకటి చంకనేసుకుని వస్తావా?ఇంకో సారి యిలా చేశావంటే నీ కవిత కాదు,కర్మకాండ ప్రచురిస్తాను" అంటూ హెచ్చరించాడు.

సదానందం భయంతో బిక్కచచ్చిపోయాడు.

కామేశానికి అవేశం వచ్చింది.
"మీకర్థం కాకపోతే మానేయండి! అంతే గానీ నా కవితల్ని యిన్సల్ట్ చెయ్యద్దు" అన్నాడు.

ఎడిటర్ కోపం నషాళానికి అంటింది.
"నోర్ముయ్! ఇవి కవితలా! నువ్వు రోజు తినే కూరగాయలు,నలుగురికీ తెలిసిన సంగతులు వాక్యాలుగా పేర్చి కవితలంటావా?..ఏమిటీ ?..'దురదగా ఉంటుంది కంద,నీ జేబులో వుంది వో వందా?'..నీ బొంద..వెళ్ళు.ముందు బయటికి వెళ్ళు..ఇంకోసారి ఈ పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాట్టుగా తెలిసిందో..న్యూసెన్స్ కేసు కింద జైళ్ళో వేయిస్తాను.జాగ్రత్త" అంటూ దులిపేశాడు.

కామేశానికి పౌరుషం పొడుచుకొచ్చింది.
"చాల్చాల్లేవయ్య ! నీ పత్రిక కాకపోతే,దాన్ని మించింది యింకొకటి' అంటూ తన కవితల సంచి తగిలించుకుని బయటికి వచ్చేశాడు.

సదానందం ఎడిటర్ కాళ్ళావేళ్ళాపడి క్షమాపణ కోరుకుని 'బ్రతుకు జీవుడా ' అంటూ బయటపడ్డాడు.

కొసమెరుపు: సదానందం వేరే బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు.కామేశం మాత్రం విరామెరుగని ధరిత్రిలా,పట్టువదలని విక్రమార్కుడిలా కవితల సంచి పట్టుకుని పత్రికల ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

అతని కోరిక ఫలించాలని ఆశిద్దామా ?!?



ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -2

భాగవతం, మహాభారతం


  1. 1.   మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.

  2. 2.   నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

  3. 3.   జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

  4. 4.   మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్


  1. 5.   శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా

  2. 6.   పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

  3. 7.   మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా

  4. 8.   నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

  5. 9.   వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

  6. 10.   నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

  7. 11.   వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్

  1. 12.   ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.

  2. 13.   సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.

  3. 14.   హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

  4. 15.   మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

  5. 16.   వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.

  6. 17.   కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.

  7. 18.   మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

  8. 19.   ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.

  9. 20.   గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

  10. 21.   కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

  11. 22.   పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.

  12. 23.   కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.



  1. 24.   శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.

  2. 25.   హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

  3. 26.   విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర

  4. 27.   కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర

  5. 28.   చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

  6. 29.   కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

  7. 30.   ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

  8. 31.   కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.


  1. 32.   పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

  2. 33.   కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.

  3. 34.   జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

  4. 35.   కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.

  5. 36.   మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

  6. 37.   విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్

  7. 38.   శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.

  8. 39.   ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.

  9. 40.   నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

  10. 41.   జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.



  1. 42.   కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.

  2. 43.   బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

  3. 44.   గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -1

రామాయణం



  1. 1.   భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

  2. 2.   కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

  3. 3.   కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

  4. 4.   రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

  5. 5.   పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
  6. 6.   సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

  7. 7.   మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

  8. 8.   కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

  9. 9.   దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

  10. 10.   సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

  11. 11.   ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

  12. 12.   తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

  13. 13.   అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

  14. 14.   కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

  15. 15.   గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

  16. 16   దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

  17. 17.   చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

  18. 18.   పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


  1. 19.   కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

  2. 20.   శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

  3. 21.   హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

  4. 22.   ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

  5. 23.   విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

  6. 24.   శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

  7. 25.   రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

  8. 26.   అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

  9. 27.   శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

  10. 28.   సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

  11. 29.   వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

  12. 30.   కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

  13. 31.   లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

  14. 32.   తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

  15. 33.   పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్


రుక్మిణీ కళ్యాణం

శ్రీమద్భాగవతంలోని అనేకమైన రసవద్ఘట్టాలలో రుక్మిణీ కళ్యాణం వొకటి.భక్తితో పాటూ,ప్రేమ,అరాధన,అనుబంధాలు ఇందులో ఒకదానితో వొకటి పెనవేసుకొని ఉన్నాయి.పరమాత్వతత్వంతో పాటూ,జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని,మారుతున్న కాల పరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో వుంచుకొని,సరళమైన పద్య సౌందర్యంతో,సర్వజనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది,తెరకెక్కించే ప్రయత్నం చేశారు మా నాన్నగారు..

రుక్మిణీ కళ్యాణం నాటిక పై అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల అభిప్రాయాలు ఇక్కడ జత చేస్తున్నాను.



ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలు:

జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.

సీ||

సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనమేల ?
మోహనాకార ! నీ మోవిపై మురళియై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?

ఆ||

ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !

తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి మనస్సు పలుపలు విధాలుగా అలోచిస్తూ,చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.

సీ||

ఏల నాస్వామి రాడేమి కతమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె, వృద్ధు
డాయసపడి, దుర్గమారణ్య మార్గమున్
గడచెనో? కడిచినా, కడలినధిగ
మించి ద్వారకపురమేగెనో? యేగిన
మాధవు దర్శన మతనికాయె
నో ! లేదో ! వినియేమను కొనెనో మనమున,
దయచేయతలచునో,తలుపడేమొ,

గీ||

కలికి ! శ్రీగౌరి యేరీతి కరుణ గొనునో ?
వ్రాలు నాతలనేమని వ్రాయబడెనో ?
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు,
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు.

రుక్మిణీదేవి లేఖను చదివి,తాను తక్షణమే వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని అగ్నిద్యోతునికి అభయం యిస్తూ శ్రీకృష్ణుడు వెల్లడించే సన్నివేశంలో వచ్చే పద్యం.

కు||

చెచ్చెర నేనచ్చోటికి
వచ్చెద,శిక్షించెద తులువలనెల్ల,జనుల్
మెచ్చగ నారీ రత్నము
దెచ్చెద,చేపట్టెద ప్రియ దేవేరియనన్ ||



నాన్నగారి పుస్తకాలు - ప్రదర్శనలు

న్నో నాటికలు,గేయాలు వ్రాసినా, ప్రచురింపబడ్డ పుస్తకాలు రెండు.
అవి రుక్మిణీ కళ్యాణం(1991) ,అరోగ్యగీత(2002).






2003(మే-జూన్) లో రాష్త్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవం-2002 పోటీలకు చిత్తూరు జిల్లా నుంచి ఎంపికై ప్రదర్శింపబడ్డ ఎకైక నాటిక 'దర్పణం' .



అదే సంవత్సరం(నవంబర్- డిసెంబర్) లో కిన్నెర, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాటకోత్సవాలలో కూడా ఈ నాటిక ప్రదర్శింపబడింది(బాక్స్ ఐటెం).




చలం -మైదానం - రెండవ భాగం



మైదానం(The open plain) ఒక సర్రియలిస్టిక్(surrealistic) నవల.

సర్రియలిజం అంటే సబ్-కాన్షియస్ మైండ్ ఆలోచనలకు భావాలకు ఒక రూపం యిస్తూ అంతర్లీనంగా ఒక సందేశాన్నిజోడించి చెప్పే ఒక కళ. 1920లలో ఫ్రెంచిలో ఊపిరిపోసుకున్న ఈ సాహిత్య ఉద్యమానికి ఆద్యుడు, మేనిఫెస్టో రచయితైన ఆండీ బ్రెటన్ మాటల్లో సర్రియలిజం అంటే



"ఎవరి అదుపాజ్ఞలు లేనప్పుడు,ఎటువంటి తర్కానికి కానీ,సాంఘిక కట్టుబాట్లకు కానీ,ఆచార వ్యవహారాలకు కానీ,నీతి నియమాలకు కానీ లొంగకుండా,మాటల ద్వారా కానీ,వ్రాతల ద్వారా కానీ,మరే విధాల ద్వారా కానీ,తన మస్తిష్కం లో రేగే అలోచనలు ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించే ప్రక్రియ"

సర్రియలిజం మూలాలు 1916 కాలంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ లో మొదలైన దాదా ఉద్యమం(Dadaism)లో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి ప్రధాన కారణం అప్పటి అప్పర్ మిడిల్ క్లాస్ యొక్క కాపిటలిస్ట్ రీజనింగ్,అలోచనా విధానాలు అని గాఢంగా నమ్మిన కొంతమంది, వాటికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటివరకు ఉన్న అలోచనా శైలి,నాగరికత మీద విశ్వాసం సన్నగిల్లి, ప్రజల విచక్షణా జ్ఞానాన్ని, అభిప్రాయాలను, విద్యా వ్యవస్థను,మంచీ-చెడులను..ఇలా ఒక్కటేమిటి మొత్తం వ్యవస్థనే సవాల్ చేసి, ఉలిక్కిపడి నిశ్చేష్ఠుల్ని చేసే సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది Anti-Art. ఇటువంటి Art (రచనలు కానీ,చిత్రాలు కానీ) చాలాసార్లు లాజిక్ వుండదు. ఉన్నా అందులో దాగున్ననిగూడార్థం సగటు పాఠకుడికి అర్థం కాదు. ఈ తరహా సాహిత్య ప్రక్రియని తెలుగు సాహిత్యంలో కొద్దిమందే అడపాదడపా అనుకరించారు.అటూవంటివాళ్ళలో చలం వొకడు.

సర్రియలిజం అనే కోణంలో చూసినప్పుడు మైదానం ఒక అద్భుతమైన నవల.ఇందులోని ప్రధాన పాత్రలు రాజేశ్వరి,అమీర్,మీరా. కథనంతా రాజేశ్వరి చుట్టూనే తిప్పుతూ,ఆమె ద్వారానే వివరిస్తాడు రచయిత. తన కథను సాటి స్త్రీతోనో, లేక పాఠకురాలితోనో, లేక సమాజంతోనో చెప్పుకుంటున్నట్లు కథనం సాగుతుంది. ఈ పాత్రల అలోచనాశైలి,మనస్తత్వ ధోరణులు ఏవీ తర్కానికి అందవు. ప్రస్తుత సమాజపు కట్టుబాట్లను, ఆచార వ్యవహారాలను ప్రశ్నిస్తూ,పూర్తి విప్లవాత్మక పద్ధతుల్లో ప్రవర్తిస్తాయి.

కథానాయిక మస్తిష్కమే ఇక్కడొక సువిశాలమైన మైదానం !

ఒక సువిశాలమైన మైదానం చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కాసేపు ఆడుకోవాలని,ఇంకాసేపు గెంతులేయాలని,స్వేచ్ఛగా చుట్టూ కలయతిరగాలని అనిపించదూ? అలాగే తన మస్తిష్కమనే మైదానంలో, ఆమె కలయతిరుగుతూ,తనలో రేగే రకరకాల అలజడులకు స్వేచ్ఛారూపం యిస్తే,అప్పుడు జరగబోయే విపరీత పరిణామాలకు,వాటి దుష్ఫలితాలకు దర్పణమే ఈ పుస్తకం. ఇప్పుడు మనకు కొత్తగా అనిపిస్తున్న సహజీవనం అనే concept ని,ఆ concept ఒక గృహిణి తన స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం అన్వయించుకొంటే, ఆమెకు ఎదురయ్యే దుస్థితులని చలం ఆనాడే ఇందులో చర్చించారు. అలాగే వివాహ వ్యవస్థ మీద కూడా కొన్ని పదునైన వ్యాఖ్యలు చేశారు. మనస్తత్వాలు, శరీరధర్మాలు పొసగని ఎన్నో పెళ్ళైన జంటలు కేవలం సంఘానికి భయపడి తమ బ్రతుకు బండిని లాగించటం మీద విమర్శలు ఉన్నాయి. తన పసితనంలో తనను లొంగదిసుకోవటానికి విఫలయత్నాలు చెసి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్పే మావయ్యను, అంతర్లీనంగా ఎంత కుళ్ళున్నా ఏనాడూ బయటపడకుండా గుట్టుగా కాపురాలు చేస్తూ నెట్టుకొచ్చే మనుషుల ద్వంద ప్రవృత్తులను, అటువంటి సమాజాన్ని రాజేశ్వరి పాత్ర 'ఛీ' కొడుతుంది. పురుషులతో సమానమైన శారీరక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుంది.

ఐతే,ఏ కళైనా సమాజ హితం కోరుకునే విధంగా ఉండాలి. అప్పుడే అ కళకొక అర్ధం పరమార్థం. మన సమాజంలో సర్రియలిజం గురుంచి ఎంతమందికి తెలుసు? మహా మహా మెధావులకే ఓ పట్టాన అర్థం కాని ఈ ప్రక్రియ ఇంక పామర జనులకు ఏం అర్థం అవుతుంది? తద్వారా వొరిగే ప్రయోజనం ఏమిటి? తను చెప్పదలచుకున్న విషయం పాఠకుడికి,లేదా వీక్షకుడికి సులభంగా అర్థమవ్వాలని ఒక రచయిత లేదా చిత్రకారుడు కోరుకుంటారు. అంతే కానీ తమ రచనలు చదివి,చిత్రాలు చూసి విషయం బోధపడక,వాటి సారాంశం తెలుసుకోడానికి ప్రత్యేక పరిశోధనలు చెయ్యాలని ఎవరూ అనుకోరు. పరిశోధన చేసి అర్థం చేసుకొనే వోపిక, తీరిక అందరికీ ఉండవు. ఒకవేళ ఉన్నా ఒక్కో వ్యక్తి ఒక్కో అర్థాన్ని తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు మంచి కంటే చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అందరి మనఃస్థితి ఒకేలా ఉండదు కదా. చలాన్ని,చలం రచనలని సమాజంలోని ఒక వర్గం బహిష్కరించడానికి ఇదొక కారణం.

సర్రియలిజం గురించి తెలియని సగటు పాఠకుడి దృష్టిలో మైదానం ఒక చవుకబారు నవల. మైదానం అంటే కథలో నాయిక నివసించే స్థలమని, ఇందులోని పాత్రలకు వ్యక్తిత్వం లోపించిందని,విశృంఖలత్వాన్ని రచయిత ప్రేరేపిస్తున్నాడని అనుకొనే ప్రమాదం కూడా ఉంది. అయితే, ముందే చెప్పినట్లు దీనికి కారణం,తన అభిప్రాయాల్ని వ్యక్తం చెయ్యడానికి చలం ఎన్నుకొన్న సాహితీ ప్రక్రియ, ఆనాటి కాల పరిస్థితులు. అది అర్థం కానప్పుడు ఆయన రచనలూ అర్థం కావు. సాధారణ పాఠకుడు ఈ పుస్తకాలను తన ఇంట్లొ పెట్టుకోడు. తను అర్థం చేసుకోగలిగినా తన పిల్లలు సరిగ్గా అర్థం చేసుకుంటారో లెదోనన్న బెంగ. ఇంకొకరిని చదవమని ప్రోత్సాహించడు. ఇతరులు ఏమనుకుంటారోనని భయం.అందుకే ఇటువంటివి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా, గ్రంథాలయాల్లో పి.హెచ్.డి విద్యార్థులకి పరిశోధనాంశంగా మగ్గిపోతూంటాయి. ఆనాడు చలం ప్రస్తావించిన సమస్యలు,లేవనెత్తిన ప్రశ్నలు నేటికీ సమాజంలో సజీవమై ఉన్నాయి. ఎందరు ఎలా అనుకున్నా,తెలుగు సాహిత్యం ఉన్నన్నాళ్ళు చలం మీదా,చలం రచనల మీదా చర్చలు జరుగుతూనే వుంటాయి.మైదానం అజరామరమై నిలిచి ఉంటుంది.



చలం - మైదానం - మొదటి భాగం



లం గారి గురించి,వారి స్త్రీవాద సాహిత్యం గురించి అనేకసార్లు విన్నాను కానీ,వారి రచన చదవడం ఇదే మొదలు.చదివిన మొదటి పుస్తకానికే సమీక్ష రాయటం నా దుస్సాహసమే అయినా,నా అభిప్రాయాలు చదివి దాని మీద కొంచెమైనా చర్చ జరిగి నాకు తెలియని విషయాలు బోధపడితే ఈ సమీక్షకు అర్థం పరమార్థం నెరవేరినట్లే.

కథ

రాజేశ్వరి ఒక సదాచార బ్రాహ్మణ గృహిణి.అందమైనది.

ఆమె భర్త ఒక ప్లీడరు. కోర్టు వాజ్యాల విషయమై ఆయన దగ్గరకు ఎంతోమంది క్లైంట్లు వస్తూపోతూంటారు. అలాంటి వాళ్ళలో ఒకడు అమీర్.

ఆఫీసు గదిలోంచి ఏవీ మాటలు వినబడకపొతే ఎవరూలేరనుకొని భర్త కోసం కాఫీ తీసుకెళ్ళిన రాజేశ్వరికి మొదటిసారి తారసపడతాడు అమీర్. తొలిచూపులొనే వాళ్ళిద్దరి మధ్య బలమైన ఆకర్షణ ఏర్పడుతుంది. అమీర్ మోహపారవశ్యపు ఉద్ధృతిలో ఉక్కిరిబిక్కిరైన ఆమె,అతని ప్రొద్బలంతో భర్త ఊరికి వెళ్ళిన ఒకనాటి రాత్రి అతనితో లేచిపోతుంది. అలా వెళ్ళిపోయి వాళ్ళు ఒక మైదానం చేరుకుంటారు..చుట్టూవున్న ఆకాశాన్ని,కొండల్ని, చింతచెట్లని,మైదానం ఆనుకొని ప్రవహిస్తున్న చిన్న సెలయేరుని చూసి ఆమె మనస్సు సంతోషంతో పరవళ్ళు తొక్కుతుంది. అక్కడే ఒక చిన్నిపాకలో అమీర్ తో తన క్రొత్త జీవితం ప్రారంభిస్తుంది ఆమె.

అమీర్ సహచర్యంలో ఆమెకు తనవాళ్ళు ఎవరూ గుర్తురారు. తినడానికి సరైన తిండి,కట్టుకొవడానికి సరైన బట్టలు లేకపొయినా, ఉన్నదాంతోనే సర్దుకుంటూ,అతనితో కలిసి మైదానం లో అటలాడుతూ,గెంతుతూ,ఏటిలో స్నానాలు చేస్తూ,సుఖిస్తూ అదే జీవిత పరమార్ధం అనుకుంటూంటుంది. ఒకప్పుడు తాను అసహ్యించుకున్న తురక తెలుగు, చేపల కూర ఇప్పుడు ఆమెకు ప్రియంగా కనిపిస్తాయి. వైష్ణవులకు విష్ణువే సర్వస్వం అయినట్లు,ఆమెకు అమీరే లోకం అవుతాడు. అలా కొన్ని రోజులు,నెలలూ దొర్లాక ఒకరోజు ఆమె స్వంత మావయ్య వస్తాడు. ఆమెకు నచ్చజెప్పి తీసుకువెళ్దాం అని పరిపరివిధాలా ప్రయతిస్తాడు. ఆమె ససేమిరా అంటుంది. పైగా మావయ్య ముందే అమీర్ తో కలిసి ఒకే మూకుట్లో అన్నం తింటుంది."ఏనాటికైనా మా గుమ్మం తొక్కవా" అని మావయ్య అంటే "మీ గుమ్మాలు తొక్కుతానని భయం లేకుండా బ్రతకండి" అంటుంది.

సాఫీగా సాగుతున్న రాజేశ్వరి జీవితంలోకి హఠాత్తుగా ఇంకో స్త్రీ ప్రవేశిస్తుంది. కొద్దిరోజులుగా అమీర్ దిగులుపడుతూ, అన్నం తినకుండా, పలక్కుండా, పలకరిస్తే విసుక్కొని ముసుగుపెట్టి పడుకోవటం ఆమె గమనిస్తుంది. మీరా అనే కుర్రవాడితో అమీర్ రహస్యంగా మట్లాడటం,అతనితో కలిసి చాలాసార్లు వూళ్ళోకి వెళ్ళిరావటం, వచ్చాక మరీ దిగాలుగా వుండటం చూసి పరిస్థితి విషమిస్తోందని ఆమె గ్రహిస్తుంది. మీరా ఒంటరిగా నడిచివస్తూండగా అతన్ని బ్రతిమాలి అసలు విషయం కనుక్కుంటుంది.

అమీర్ ఆ ఊరి తోళ్ళసాయిబు కూతురి మీద మనసుపడతాడు!

ఆ అమ్మాయి ఇతన్ని నిరాకరిస్తూంటుంది.మీరా ఆ అమ్మాయికి బంధువు.ఇద్దరికీ రాయబారం నడుపుతూంటాడు..!

విషయం తెలిసాక రాజేశ్వరి మనస్సులో రొద మొదలవుతుంది. ఆవేశంతో వెళ్ళి గుడిసెలో వున్న అమీర్ ను నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. అమీర్ ఏడుస్తాడు. ఆమె కరిగిపోయి అతన్ని దగ్గరకు తీసుకొని లాలిస్తుంది. మరుసటిరోజు మీరాని వెంటబెట్టుకొని వెళ్ళి సాయిబు కూతురుని కలిసి ఆమెను వొప్పిస్తుంది. రోజూ అమీర్ ను తనే తీసుకువెళ్ళి సాయిబు యింట్లో దిగబెట్టి తర్వాత తీసుకొని వచ్చేది.అమీర్ కు కొద్దిరోజుల్లోనే సాయిబుకూతురి మీద విముఖత కలుగుతుంది. ఆమెతో పోట్లాడి మళ్ళీ రాజేశ్వరికి దగ్గరవుతాడు.

కొంతకాలానికి రాజేశ్వరి గర్భవతి అవుతుంది. అమీర్ దాన్ని వదిలించుకోమంటాడు. ఆమె వినదు. మాతృత్వపు మమకారం పుట్టుకొచ్చి ఏమైనాసరే బిడ్డను రక్షించుకోవాలని నిశ్చయించుకుంటుంది.అమీర్ తాగొచ్చి ఆమెను కొడతాడు. తర్వాత ప్రేమ చూపిస్తాడు. అయినా వినకపోయేసరికి ఆరునెలలు ఆమెని విడిచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు.వెళ్తూ వెళ్తూ ఆమె పర్యవేక్షణ బాధ్యతలు మీరాకి అప్పగిస్తాడు.

మీరా పదహారేళ్ళ నాజూకైన కుర్రవాడు. అనుక్షణం తోడుగావుంటూ ఆమె బాగోగులు చూసుకుంటూంటాడు. ఆమె అతన్ని తమ్ముడిలా భావించి ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమను మరోరకంగా తీసుకుంటాడు అతను. ఆమె పురుడు పోసుకోవటానికి ఒక స్త్రీని తీసుకొస్తాడు. ఆమెను కాపాడటానికి ఒకరోజు రాత్రి ఓ త్రాగుబోతుతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాడు. ఆమె కష్టాలకు కారణం ఆ బిడ్డే అని భ్రమించి,ఆమె బిడ్డను కూడా లుంగచుట్టి తీసుకెళ్ళి పారేసి వస్తాడు. అమీర్ కోసం, ఆమె వద్దు అనదు. మీరా తనకోసం పడ్డ కష్టాలు చుసి ఆమె మనస్సు కరిగిపోతుంది. ఆఖరుకి తన సర్వస్వం అర్పించటానికి సైతం సిద్ధపడుతుంది.

మీరా కబురందుకొని అమీర్ వస్తాడు. వచ్చిన కొద్దిరోజుల్లోనే రాజేశ్వరి,మీరాల మధ్య వున్న చనువు అతనికి అర్థమవుతుంది. మీరా కూడా మొదట సంకోచించినా తర్వాత చనువుగా వస్తూపోతూంటాడు. అయితే ఇద్దరికీ పొసగదు. తనకు ఇద్దరూ కావాలి అనుకొనే ఆమె వాళ్ళిద్దరి మధ్యా సతమతం అవుతూంటుంది. ఒకరోజు రాత్రి మీరా లోయలో పడిపోతే అతన్ని రక్షిస్తాడు అమీర్.

ఓ రాత్రి ఆమె అమీర్ తో ఏకాంతంగా నిద్రిస్తూన్న సమయాన,మీరా వచ్చి "నువ్వు లేకుండా నేను వుండలేను" అని ఆమెను తీసుకువెళ్ళి తనదాన్ని చేసుకుంటాడు.ఆ దృశ్యం చూసి అమీర్ ఉద్రేకంతో కత్తి తీసుకొనివస్తాడు. మీరాని చంపబోయి, ఆమె అడ్డుపడేసరికి చివరికి తనకుతానే పొడుచుకుంటాడు. ఈ విషయం తెలియక,అమీర్ ని చంపింది రాజేశ్వరి అనుకొని,ఆమెను కాపాడ్డానికి డాక్టరుతో,పోలీసులతో తనే చంపినట్టు అబద్ధం ఆడుతాడు మీరా. అతన్ని రక్షించడానికి తనే హత్య చేసినట్లు చెబుతుంది ఆమె.

ఇదీ కథ..


(మిగతా సమీక్ష రెండవ భాగంలో.)


తపస్వీ.. కళ్ళుతెరు !




చీమలు దూరని చిట్టడవిలో !
చెట్టునీడన చట్రాతిపై !
పద్మాసనం వేసుక్కూర్చొని
ప్రపంచంతో పనిలేనట్లు
దేనికోసం ఓ తపస్వీ
దివారాత్రులు ధ్యానిస్తున్నావ్?!
మోక్షమే నీ లక్ష్యమైతే
కళ్ళు తెరుచుకొని !
ఒళ్ళు విరుచుకొని !
తపస్వీ కదలిరా !!
విధి కాటేస్తే !
వ్యథ కోసేస్తే !
బ్రతుకు దుర్భరమై !
భవిత బుద్బుదమై !
మందిరాల ముంగిట !
మసీదుల సందిట !
చౌరస్తా దారుల్లో !
చౌకబారు వాడల్లో !
అన్నిచోటులా !
అన్నివేళలా !
స్మృతిహీనుల్లా సంచరించే !
అభాగ్యులెందరో !
అనాథలెందరో !
ధరిత్రినిండా పండి ఉన్నారు !!
వాళ్ళంతా నీ తోబుట్టువులే !
నీ తల్లి వసుధ వొడిలో పాపలే !
నువ్వు వెదికే విశ్వేశ్వరుడు
పరివ్యాపితుడై పరివేష్ఠితుడై
ప్రతిప్రాణిలో వొదిగి ఉన్నాడు !!
ఉగ్రతపస్సులు !
యజ్ఞహవిస్సులు !
ఉన్న సమయం వృథాచేస్తాయ్ !!
జగత్సత్యాన్ని అవలోకించి !
జపతపాలను విసర్జించి !
జనస్రవంతిలో మమేకం కా !
అన్నార్తులకూ ఆపన్నులకూ
నీ ఆత్మీయహస్తం అందించు !
దీనులసేవలో దేవుడున్నాడు
సేవించి తరించు !
దర్శించి తరించు !!





స్మృతులు




చిరుమబ్బు సాగితే
తొలిచినుకు రాలితే
నీ రాకనూహించి
నీ నిశ్చలమయ్యా !

హరివిల్లు విరిస్తే
విరిజల్లు కురిస్తే
నీ నవ్వుల కొరకై
నే దొసిలి పట్టా !

వెన్నెల చిగురిస్తే
వన్నెలు పులకిస్తే
నీ వయారాలేరి
వెఱ్ఱికేక పెట్టా !

మల్లియలు విరిస్తే
మారుతం చలిస్తే
నీ స్పర్శనే తలచి
నన్ను నేను మరిచా !

ప్రకృతిలో ప్రతి అణువూ
తెలిపేది నీ ఉనికే
పలికేది నీ ఊసే
నీ స్మృతులే నాకు శ్వాస !
నీ వలపే జీవితాశ !!

('ఆంధ్రభూమి' మాసపత్రిక ఫిభ్రవరి 2001 ఎడిషన్లో ప్రచురితం )


ఆమె..!




రత్కాల సుందర రాత్రి
సిగ్గులొలికే మొగ్గ ధాత్రి ఆమె..!

ఆమె వదనం
పూర్ణ చంద్రం
లలిత నయనాలు
చలిత మీనాలు
వినీలాకాశమే వేణీభరము
శతకోటి తారలు
సిగముడిలో పూలు

కరుణభరితం
ఆమె హృదయం
మధుర హాసాలు
మువ్వ లాస్యాలు
సౌందర్యాస్వాదనే శ్వాస
ప్రేమే మతం
ప్రపంచ సౌఖ్యం అభిమతం

వశుడనై
వివశుడనై
వలపంతా మూటకట్టి
నే వనిత చెంత వాలితే
చిరునవ్వులు రువ్వుతూ
చకచకా వెళ్ళిపోయింది !!


(ప్రముఖ మాసపత్రిక 'ఆంధ్రభూమి' (డిసెంబరు 98) ఎడిషన్లో ప్రచురితం..)


ఎవరో..?

ళుకు సోకుల త్రుళ్ళి మురిసే తారకామణో
కళాశోభిత చంద్ర వికసిత కలువ కన్యకో
వలపు కొలనులో వన్నెలుబోవు వయ్యారి హంసో
ఎవరో ఆమెవరో
వెన్నెలనాటి వెలుగుల రాత్రి
విరితోటల పెరటిలో
విరజాజుల మధ్యలో
వాల్చిన ప్రక్కపై వివశంతో వాలి
కంబళిని లాగి కన్నుల్ని మూసి
కునుకు కోరేటి కమ్మటి వేళల
ఊహల ఊయలలో
ఊసుల బాసలలో
సుశంత సుషుప్తిలో
స్వప్నాల సొంపులో
మదిని దోచి మైమరపించు మానినీలతికమెవరో ?


ఉపోద్ఘాతం



మెరిసే మేఘాలు
కురిసే వర్షాలు
విరిసే పుష్పాలు 

మురిసే భువనాలు 
నాకు కదిలే కావ్యాలు !

ఇది నా కవితల పుస్తకానికి నేను వ్రాసుకున్న ఉపోద్ఘాతం ..



ప్రేరణ




నాకు ఈ మాత్రం సాహిత్యాభిలాష అబ్బిందంటే దానికి కారణం మా నాన్న గారే !

నాన్న గారు స్వతహాగా కవి,రచయిత,చిత్రకారుడు,రంగస్థల నటుడు.వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగైనా ప్రవృత్తులను ఆయన ఏనాడు అలక్ష్యం చెయ్యలేదు.వారు వ్రాసిన ఎన్నో గేయాలు,నాటికలు ఆకాశవాణి,దూరదర్శన్ లో ప్రసారం అయ్యాయి.'రుక్మిణీ కళ్యాణం' అనే పద్యనాటిక, అవధాన చక్రవర్తి,శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ ,శతాధిక నాటకకర్త,నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖుల మన్ననలను పొంది జన బాహుళ్యంలో మంచి ప్రాచుర్యం తెచ్చి పెట్టింది.సారా వ్యతిరేక ఉద్యమం ఉద్దృతంగా ఉన్న రోజుల్లో 'సారసుర సంహారం' అనే నాటిక వ్రాసి అనేక ప్రదర్శనలు యిచ్చి చిత్తూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకొన్నారు.ఎయిడ్స్ మహమ్మరి మీద వారు వ్రాసిన 'దర్పణం'
నాటిక 2002 లో చిత్తూరు జిల్లా నుంచి చాలా కాలం తర్వాత నంది నాటక పోటీలకు ఎంపికైన నాటకం గా సంచలనం సృష్టించింది.ప్రజారోగ్యం,పర్యావరణం మీద కూడా ఆయన ఎన్నో గేయాలు,పద్యాలు వ్రాశారు.ప్రముఖ వైద్య నిపుణుల సహకారంతో,అరోగ్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ తేటగీతి పద్యాలతో 'అరోగ్యగీత' అనే పుస్తకాన్ని వ్రాశారు.

ఆ పరిమళం, సహజంగానే పిల్లలైన మాకు కూడా కాస్తొ కూస్తొ అబ్బింది.నాకు వీలైనంతలో అన్ని పుస్తకాలు చదవడానికి ప్రయత్నించాను.ఆ క్రమం లొ నాకు నచ్చిన కవులు శ్రీ బమ్మెర పోతన,శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి మరియు శ్రీశ్రీ.



తొలి పలుకులు


డిసెంబరు 28,2007..

కొన్ని బ్లాగులు చదివాక నాకంటూ ఒక బ్లాగ్ వుంటే బావుండు అని చాలా సార్లు అనిపించింది. అది కార్యరూపం దాల్చటానికి ఇన్ని రోజులు పట్టి ఇప్పటికి కుదిరింది.

మొదట్లో ఈ బ్లాగ్ లో ఏం వ్రాయాలో ఆలోచించలేదు...కానీ బ్లాగ్ పేరు గురుంచి ఆలోచిస్తూండగా భావ నిక్షిప్త అనే పేరు తట్టింది..

భావ నిక్షిప్త -- భావాలను దాచుకొనేది !

నా కుర్రతనంలో నేను వ్రాసుకొన్న కవితల పుస్తకానికి ఈ పేరు పెట్టుకొన్నాను.ఇప్పుడు బ్లాగ్ కి కూడా అదే పేరు పెట్టాను.

నా భావాలను దాచుకొనేది,వెల్లడించేది కాబట్టి భావ నిక్షిప్త అని పేరు పెట్టాను.