• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

గోదావరి యాత్ర-3 (దక్షారామం,సామర్లకోట, అన్నవరం, పీఠాపురం, కాకినాడ)

దక్షారామం


దాక్షారామం గురుంచి చెప్పుకునే ముందు పంచారామాల గురించి తెలుసుకోవాలి.

తారకాసుర సంహార సమయంలో అతని గొంతులో ఉన్న తన తండ్రి పరమశివుడి ఆత్మలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో బేధిస్తాడు కార్తికేయుడు. ఆత్మలింగం ఐదు ముక్కలైపోయి ఒక్కో ముక్క ఒక్కో క్షేత్రంలో పడుతుంది. ముక్కలైన లింగాలు ఆకర్షణాశక్తితో తిరిగి ఏకమవ్వాలని, పెరిగిపోయి ఆకాశం వైపు సాగిపోతుంటే, దాన్ని నిలువరించటానికి  సూర్య చంద్రులు, కార్తికేయుడు, ఇంద్రుడు, మహావిష్ణువు ఆ లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అలా ఏర్పడినవే పంచారామ క్షేత్రాలు - అమరావతి, దక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, గునుపూడి. అమరావతి దూరమైపోతుంది కాబట్టి మిగతా నాలుగు ఆరామాలు దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం. 

దక్షారామానికి విశేషమైన పురాణ ప్రాశస్త్యంఉంది. ఇది పంచారామాలలో ఒకటి మాత్రమే కాదు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కూడా. దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేసి నిహతుడై మేకముఖంతో పునర్జీవితుడైన స్థలం ఆలయానికి దగ్గర్లోనే ఉంది. సతీవియోగంతో ఖిన్నుడైన పరమేశ్వరుడు  ఆగ్రహంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తూంటే  అఖిలలోకాలు గడగడలాడాయి. అందరూ స్థితికారకుడైన మహావిష్ణువు శరణు కోరితే, ఆయన శివున్ని శాంతపరచడానికి తన సుదర్శన చక్రం ప్రయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు. అలా ఖండింపబడ్డ శరీరభాగాలు పద్దెనిమిదిచోట్ల పడి అవే అష్టాదశ శక్తిపీఠాలయ్యాయి. ఇక్కడ అమ్మవారి నాభి పడింది. ఆమె మాణిక్యాంబగా కొలువై ఉంది. సూర్యభగవానుడు పూజించిన ఈ లింగానికి తూర్పు చాళుక్య భీముడు ఆలయం నిర్మించాడు. అందుకే భీమేశ్వరాలయం అయ్యింది. తనకు తన శిష్య పరివారానికి భిక్ష దొరకలేదన్న కారణంతో కాశీ నగరాన్ని శపించబోయి పరమేశ్వరుని ఆగ్రహానికి గురై వెలేయబడ్డ వ్యాస మహర్షి ఇక్కడే భీమేశ్వర-మాణిక్యాంబ సేవలో తరించి ఉపశమనం పొందారు.





ఆలయ ప్రవేశం చేయబోయేంతలో ద్వారం వద్దే బ్రాహ్మణుల గుంపు ఒకటి మమ్మల్ని  అటకాయించింది. వాళ్ళలో చొరవ కలిగిన బ్రాహ్మణుడొకరు ఆలయ విశేషాలన్నీ విపులంగా చెబుతామని,మరే క్షేత్రంలోనూ ఇంత వివరంగా చెప్పే వాళ్ళు దొరకరని,విశేషాలు చెప్పినందుకు ప్రతిగా భక్తులు తమకు తోచిన సొమ్ము  బ్రాహ్మణ సంఘానికి దానం చెయ్యాల్సి ఉంటుందని, ఆ ధనాన్ని తాము పేద బ్రాహ్మణ సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పాడు. ఇదేదో ఉభయ తారకంగా ఉందని, చొరవగా మాట్లాడిన బ్రాహ్మణున్నే మేం  కుదుర్చుకున్నాం.

ఆ బ్రహ్మణుడు నిజమే చెప్పాడని తర్వాత తెలిసింది. అమరావతి సంగతి తెలియదు గానీ, మిగతా పంచారామాల్లో ఇలా క్షేత్ర మహత్యాన్ని, విశేషాలని చెప్పే వాళ్ళు నిజంగానే లేరు. పైగా ఆయన స్వస్థలం మా ఊరి దగ్గరే - శ్రీకాళహస్తట. చాలా ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారట. ఎంతో ఓపికతో ఆలయం అంతా కలయతిప్పి సంగతులన్నీ తెలియజేశారు.

దక్షారామం భోగస్థానం. ఇక్కడికెవరైనా అనుకోకుండా వస్తారు కానీ ముందే ప్రణాళికలు వేసుకొని రావడం జరగదట. రావణ సంహారానంతరం బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనే ప్రయత్నంలో సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన లక్ష్మీనారాయణుడు ఇక్కడి  క్షేత్రపాలకుడు. ఆలయంలోపల ఓ వైపు గర్భాలయం నమునాలో ఏకశిలతో చెక్కిన మరుగుజ్జు కట్టడం ఉంది. అది నమునా కాదని, నమునాలు కట్టి నిర్మాణాలు చేసేది మానవులు కాని దేవతలు కారని, అది భవిష్యత్తులో పాపాలు పెరిగి మనుష్యులు అంగుష్ఠ మాత్రులైనప్పుడు వారి సౌకర్యార్థం నిర్మించిన ఆలయమని చెప్పారు.





గర్భాలయానికి అభిముఖంగా ఠీవిగా నిలబడ్డ నిలువెత్తు నందీశ్వరుడు అబ్బుర పరుస్తాడు. త్రివిక్రముడైన భీమేశ్వరుడు ఇక్కడ తన  ధవళ  స్వరూపాన్ని తొమ్మిడడుగులకు కుదించుకుని రెండంతస్థులు ఆక్రమించి  భక్తులను అలౌకికానుభూతికి గురి చేస్తాడు. ప్రాతఃకాలంలో ఉషాకిరణాలు స్వామి వారిపై పడినప్పుడు మరింత వైభవంగా ఉంటుందట. క్రింద పానవట్టం దర్శించుకొని  మెట్లెక్కి పైకి వెళ్ళి పూర్తి లింగస్వరూపాన్ని దర్శించుకోవాలి. లింగం పైనున్న చిహ్నాలు కుమారస్వామి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం గుర్తులని కొందరు, కిరాతుని రూపంలో అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ధరించిన పులిచర్మం గుర్తులని ఇంకొందరు అంటారు.  భీమేశ్వరుని ప్రక్కనే సతీదేవి కొలువై ఉంటుంది. గర్భాలయం లోపల చీకటిగా ఉంటుంది. పూర్వం వెలుతురు కోసం గోడలకు వజ్రాలు,మణులు తాపించారట. ఔరంగజేబ్ దండయాత్రల కాలంలో ఇతరుల పాలవడం ఇష్టం లేక వాటంత అవే రాళ్ళుగా మారిపోయాయని గోడలపై పొడుచుకొచ్చిన రాళ్ళను చూపించి చెబుతారు.




మాణిక్యాంబ అమ్మవారు వామాచార స్వరూపిణి. ఎడమవైపు చూస్తూంటారు. హిమవంతుడు-మేనకాదేవిల ముద్దులపట్టి కనుక పార్వతీదేవికి మైనాకాంబ అని మరో పేరుంది. అదే మాణిక్యాంబగా రూపాంతరం చెందింది. అమ్మవారి స్వరూపం క్రింద శ్రీచక్రాన్ని నిక్షిప్తం చేశారు. అమ్మవారు స్వామివారు సమాన స్థాయిలో వినుతికెక్కిన ఆలయాల్లో ఇదొకటి. మిగతా రెండు ఆలయాలు- కాశీ (అన్నపూర్ణ,విశ్వనాథుడు), శ్రీశైలం (భ్రమరాంబ,మల్లికార్జునుడు).శ్రీనాథ కవిసార్వభౌముని భీమఖండం దాక్షారామ వైభవాన్ని తెలియజేస్తుంది.

దర్శనం పూర్తయ్యాక మాకు గైడ్‌గా వ్యవరించిన బ్రాహ్మణుడికి సంతోషంతో కొంత సొమ్ము ముట్టజెప్పబోయాం. ఆయన తనకొద్దొంటూ యువకుడైన మరో బ్రాహ్మణున్ని చూపించి ఆయనకివ్వమన్నారు. ఆ యువకుడికి మేమిచ్చిన మొత్తం నచ్చలేదు. సొమ్ము పుచ్చుకోకుండా పెదవి విరిచి ఇక్కడికొచ్చే భక్తులు కనీసం మూడువేలకు తక్కువ కాకుండా విరాళాలు ఇస్తారని అలకబూనాడు. మేమంత తూగలేమని చెప్పాం. అతను వినలేదు. చివరికి మా గైడ్ ఏమనుకున్నాడో మరి అతనికి నచ్చజెప్పి సొమ్ము స్వీకరించేలా చేశాడు
.

సామర్లకోట కుమారారామ భీమేశ్వరాలయం

శివపుత్రుడైన కుమారస్వామి సేవించిన లింగం కాబట్టి కుమారారామ భీమేశ్వరుడంటారు. ఈ ఆలయం దక్షారామాన్ని పోలి ఉంటుంది. దక్షారామంలో లాగే ఇక్కడున్న శివలింగం కూడా పొడుగ్గా ధవళ కాంతులతో మెరిసిపోతూ రెండంతస్థులు ఆక్రమించి ఉంటుంది. పంచారామాల్లోని మిగతా లింగాలు భోగప్రదాయకమైనవైతే ఇది యోగకారక లింగం. అమ్మవారి పేరు బాలాత్రిపురసుందరి. చైత్ర  వైశాఖ మాసాలలో సహస్రకరములతో  సూర్యభగవానుడు  పగటి పూట స్వామివారి పాదాలకు, సాయంకాలం అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతాడని ప్రతీతి. 






సామర్లకోట పూర్వ నామధేయం స్వాములకోట లేదా శ్యామల కోట అట. పూర్వం వైష్ణవ స్వాములు ఎక్కువగా నివసించిన స్థలమని ఓ కథనం చెబితే, శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోట ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని మరో కథనం చెబుతుంది.  మా దర్శనం పూర్తైన వెంటనే  మధ్యహ్నమయ్యిందని గుడి మూసేయటంతో అదృష్టం కోద్దీ దర్శనం లభించిందనే చెప్పాలి.

సామర్లకోట నుంచి పీఠాపురం వెళ్ళేసరికి పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వర స్వామి వార్ల ఆలయం ముసేశారు. పునర్దర్శనం మధ్యహ్నం మూడున్నర తర్వాతే అని తెలిసింది. భోజనాల కోసం వీధులు వెదుక్కుని హోటళ్ళ చుట్టూ తిరగటం కంటే దేవాలయాల్లో జరిగే ఉచిత నిత్యాన్నదానంతో కడుపు నింపుకుంటే ఇటు పుణ్యం అటు సమయం కలిసొస్తుందని మాకు ముందే చెప్పాడు మా డ్రైవరు. దర్శనానికి విరామమిచ్చినా భోజనాలు వడ్డిస్తూండటం చేత గుడి తలుపులు తెరిచే ఉంచారు.ఆకలి రుచెరగదంటారు కదా. అందరం భోంచేసి, వేడి వేడి అన్నం తినటం చేత, ఉక్కబోత చేత పట్టిన చెమటని తుడుచుకుంటూ కాసేపు ఆలయ మండపంలో విశ్రాంతి తీసుకొని, మరో రెండు గంటలు ఏం చెయ్యాలో తెలియక తర్జనభర్జన పడి చివరికి అన్నవరం వెళ్ళిరావాలని నిర్ణయించుకున్నాం.

అన్నవరం


పంపానదీ తీరాన రత్నగిరిపై కొలువైన భక్తవరదుడు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. మేరువు కుమారులు భధ్రుడు,రత్నాకరుడు. ఘోర తపస్సు చేసి శ్రీరామచంద్రున్ని తనపై కొలువుంచుకునే వరం పొందిన అన్నయ్యను చూసి, రత్నాకరుడూ స్పూర్తిని పొందాడు. తదేక దీక్షతో శ్రీమహావిష్ణువును మెప్పించి త్రిమూర్త్యాత్మకమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణుని రూపంలో స్వామివారిని మోసే భాగ్యం పొందాడు.

స్వామివారి స్వరూపం అనేక విశేషాలకు ఆలవాలం. మూలవిరాట్టు క్రిందిభాగంలో ప్రతిష్టించిన నారాయణయంత్రం సర్వశక్తిమంతమైనది. అది బ్రహ్మస్వరూపం. పంచాయతనానికి గుర్తుగా ఆయనకు నలువైపులా వినాయకుడు, బాలాత్రిపురసుందరి, మహేశ్వరుడు, సూర్యనారాయణుడు కొలువై ఉంటారు. యంత్రం మీదుగా లింగాకృతిలో పైకి లేచిన మధ్యభాగం పరమశివుడికి ప్రతీక. ఊర్థ్వభాగంలో విష్ణు స్వరూపమై ధనుర్బాణాలు, వంపులు తిరిగిన



మీసకట్టుతో శ్రీ సత్యనారాయణుడు కనువిందు చేస్తాడు. స్వామివారికి ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు,కుడివైపున మహేశ్వరుడు నెలవై ఉంటారు. సృష్టి, స్థితి, లయకారకులను ముగ్గురినీ సూచించే స్వరూపం కనుకనే త్రిమూర్త్యాత్మకం  అన్నారు.  బ్రహ్మకు పూజలు జరిగే అతికొద్ది దేవాలయల్లో ఇదొకటి.  సీతారాములు ఈ ఆలయానికి క్షేత్రపాలకులు. దగ్గర్లోనే కొలువై ఉన్న వనదుర్గ ఆలయం మహామహిమాన్వితమైనది. ఆమె రాత్రి పూట నగర సంచారం చేస్తూ ప్రజలను రక్షిస్తూంటుందని ఓ నమ్మకం.

స్వయంభువుగా వెలసిన సత్యదేవుడు పూర్వం ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడి కలలో కనబడి తను రత్నగిరిపై వెలసి ఉన్నానని, తనను ప్రతిష్ఠించి శాస్త్రప్రకారం తనకు పూజాదులు నిర్వహించమని ఆదేశించారు .బ్రాహ్మణుడి స్వప్న వృత్తాంతం తెలుసుకున్న ఆ ఊరి జమిందారు గారు గ్రామస్తుల సాయంతో వెదికించి, స్వామివారిని గుర్తించి, వెలికితీయించి, ప్రతిష్ఠించి పూజాదులు ప్రారంభించారు. అన్న (అడిగిన) వరాలను తీర్చే క్షేత్రం కనుక అన్నవరమైంది.

అన్నవరం చిన్న టౌన్. క్షేత్రం, క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రీకుల కోసం వెలసిన హోటళ్ళు తప్ప పెద్ద వూరేం లేదు. భక్తులు వెళ్ళేందుకు ఉన్న నడకదారిని చూసి శంకరాభరణం సినిమాలోనున్న చంద్రమోహన్, రాజ్యలక్ష్మిల సన్నివేశం గుర్తొచ్చింది. కొండపైకి ప్రయాణం తిరుమల ఘాట్‌రోడ్లను తలపించింది. వాహనాలను నేరుగా గుడి వెనుక భాగం వరకు తీసుకువెళ్ళచ్చు కాబట్టి వయస్సుమీదపడినవాళ్ళు తిరుమలోలా ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేదు. భక్తుల రద్దీ లేకపోవటం చేత పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది.







వైష్ణవులు,శైవులు అన్న భేదం లేకుండా అన్ని విశ్వాసాలవాళ్ళు కొలిచే దైవం శ్రీ సత్యనారాయణస్వామి. గోధుమఊక, ఏలకులు, పచ్చకర్పూరం, పాలు, నెయ్యి మొదలైన పదార్థాలతో  చేసిన ప్రసాదం స్వామివారికి ప్రీతిపాత్రం. ఆలయంలో భక్తులు వ్రతాలు చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ఘాట్‌రోడ్ మీదుగా క్రిందకు దిగుతూంటే ప్రశాంతంగా ప్రవహిస్తున్న పంపానది  కాసేపు తన అందచందాలతో కట్టిపడేసింది.



పీఠాపురం (పురుహూతికా దేవి-శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం) 


పీఠాపురానికి మూడు ప్రత్యేకతలున్నాయి.

మొదటిది- దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఇక్కడ పరమశివుడు కుక్కుటేశ్వర స్వామి రూపంలో పూజలందుకుంటున్నాడు. కుక్కుటం అంటే కోడి. పూర్వం గయాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి శ్రీమహావిష్ణువును మెప్పించి ఒక విచిత్రమైన వరం పొందాడు. భూప్రపంచంలో తనను మించిన పవిత్రమైన ప్రాణి, తన శరీరాన్ని మించిన పవిత్రమైన స్థలం మరెక్కడా ఉండకూడదని, తనను ఎవరు దర్శించినా, స్పృశించినా వాళ్ళ పాపం తొలగిపోయి పునీతులవ్వాలని వరం పొందాడు. దీంతో ఇంద్రాది దేవతలకు కొత్త చిక్కు వచ్చి పడింది. భూలోకంలో పాపుల సంఖ్య నానాటికీ క్షీణించి సకల ప్రాణులతో స్వర్గం నిండిపోతూండటంతో వాళ్ళు తలలు పట్టుకున్నారు. త్రిమూర్తులను శరణు వేడారు. వాళ్ళు చిరునవ్వు నవ్వి బ్రాహ్మణ రూపాలు ధరించి గయాసురున్ని సమీపించారు. తామొక దివ్యయజ్ఞం తలపెడుతున్నామని అయితే దానికి అనువైన పవిత్ర స్థలం గయాసురుని శరీరం తప్ప మరొకటి లేదని, ఏడు రోజులపాటు తమ యజ్ఞానికి సహకరించాలని కోరారు.

గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని భారీగా విస్తరింపజేశాడు. త్రిమూర్తులు అతని శరీరంపై కూర్చుని యజ్ఞం ప్రారంభించారు. వేయినాల్కలలో ఎగిసిపడుతున్న యజ్ఞాగ్నిని భరిస్తూ కదలకుండా పడుకుని కోడికూతతో రోజులు లెక్కపెట్టుకొంటూ ఆరురోజులు నెట్టుకొచ్చాడు గయాసురుడు. ఏడవరోజు సమీపిస్తూండటంతో పరమశివుడు ఇక లాభం లేదని కుక్కుట రూపం ధరించి ముందుగానే కూతపెట్టాడు. గడువైపోయిందని గయాసురుడు తన దేహాన్ని కదిలించేసరికి యజ్ఞానికి విఘ్నం కలిగింది. ఏడురోజులపాటూ యజ్ఞాగ్ని భరించలేనివాడివి ఇతరులపాపాలు ఎలా భరించగలవని ప్రశ్నిస్తారు బ్రాహ్మణులు. యజ్ఞానికి ఆటంకం కలిగించావు కనుక సంహారం తప్పదంటే, వచ్చినవారు త్రిమూర్తులే అని గ్రహించిన  గయాసురుడు తన దేహానికి పూజార్హత కలిగించమని వేడుకున్నాడు. అలా


గయాసురుని శిరోభాగం (బుద్ధగయ-బీహార్), నాభి (జాజ్‌పూర్-ఒరిస్సా), పాదాలు (పీఠాపురం) పావనమయ్యాయి. పరమశివుడే ఇక్కడే కుక్కుటేశ్వరుడిగా వెలశాడు.



రెండవది -ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఇక్కడ అమ్మవారి ఎడమచేయి పడింది. గౌతమ మహర్షిచే శాపగ్రస్తుడైన ఇంద్రుడు ఇక్కడే అమ్మవారిని సేవించి పురుషత్వాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం చెబుతోంది. పురుహూతికా దేవి నాలుగు చేతులలో కమలము, బీజాలు, పరశువు, మధుపాత్ర ధరించి అలరారుతూంటుంది. బీజాలు కమలము ధరించిన రూపాన్ని పురుహూత లక్ష్మిగా సమయాచారులు, పరశువు, మధుపాత్ర ధరించిన రూపాన్ని పురుహూతాంబగా వామాచారులు కొలిచేవారని మరో కథనం.


మూడవది -శ్రీమహావిష్ణువు పరిపూర్ణ స్వరూపం దత్తాత్రేయుడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించిన క్షేత్రం పీఠాపురం.

పీఠాపురంలోనే ఉన్న కుంతిమాధవాలయం ప్రశస్తమైనది.పాండవమాత కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవాలయం ఇది.

కాకినాడ


కాకినాడ చేరేసరికి సాయంకాలమైంది .

అధ్యాత్మిక ప్రవచనాలు వినేవాళ్ళాందరికీ కాకినాడ అంటే ముందు గుర్తొచ్చేది పూజ్య గురువు శ్రీ చాగంటి కోటేశ్వర్రావు గారు. ఆయన వాగ్గంగలో మునకలేసి తమ జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నవాళ్ళు నాతో సహా ఎందరో. అటువంటి విద్వత్వరేణ్యులు కాకినాడలో ఉండటం కాకినాడ వాసుల అదృష్టం. కాకినాడ పూర్వనామం కోకనదమట. ఒకప్పుడు ఎర్రటి కలువలతో నిండిన ప్రదేశం కనుక ఆ పేరట. ఆంగ్లేయులకు  షరా మాములుగా నోరు తిరక్క గో కేనడా అనటం మొదలుపెట్టి జనబాహుళ్యానికి వచ్చేసరికి అది కాకినాడగా మార్పుచెందింది.





పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన మమ్మల్ని సముద్రతీరం సేదతీర్చింది. పొంగెత్తే కెరటాలను సవాలు చేస్తూ పొగరుగా నిల్చున్న కుర్రకారు, ఎగిసిపడే అలలని చూసి భయపడుతూనే వెనక్కి జరిగి, తీరా ఆ అలలు పాదాలను ముంచెత్తి కాళ్ళ క్రింద ఇసుకను లాగేస్తే చక్కిలిగింతలు పెట్టినట్లయ్యి కేరింతలు కొట్టే పసిమనస్సులు, జీవనసంధ్యలో ఉన్నా ఒడ్డున కూర్చుని, త్రుళ్ళిపడే తమ పిల్లల్లో ప్రాత:కాలపు ఉషస్సులు వెదుక్కుని మురిసిపోయే వయోవృద్ధులు, దగ్గరకొచ్చినట్లే వచ్చి అంతలోనే దూరం జరుగుతూ ఒడ్డుకు విరహతాపాన్ని పెంచుతున్న ఓడలు, గూట్లో పెట్టిన నేతి దీపాల్లా దూరంగా మిణుకుమిణుకుమంటూన్న విద్యుద్దీపాలు..ఓహ్.. కొన్ని క్షణాలు అజరామరాలు..

భారమైన హృదయాలతో రాజమండ్రికి తిరుగుప్రయాణమయ్యాం. కాకినాడలో సుబ్బయ్య హోటల్ చాలా ప్రఖ్యాతి కెక్కిందని మా డ్రైవరు చెబితే  రాత్రి భోజనాలకు అక్కడే పార్శిల్ చేయించుకున్నాం. హోటల్  చూడ్డానికి మాములుగా చిన్నగా ఉంటుంది కానీ రుచిలో మాత్రం దానికి తిరుగులేదు. అక్కడలేని వెరైటీలు లేవు. పూర్తి శాకాహార భోజనశాల. భోజనాలు చేసేవారందరికీ తమ దగ్గరున్న రకాలు చెప్పి యజమానే కొసరి కొసరి వడ్డిస్తాడని చెప్పాడు డ్రైవరు.ఇక్కడ పార్శిల్ బుట్టల్లో చేస్తారు. ఒక బుట్ట ఇద్దరికి పూర్తిగా సరిపోయి ఇంకొంత మిగులుతుందంటే  మేం రెండు బుట్టలు తీసుకున్నాం. ఒక్క బుట్ట ఖాళీచెయ్యడానికే ఆపసోపాలు పడ్డాం. మరో బుట్టను వృథాచెయ్యడం ఇష్టం లేక హోటల్‌లోని పనిపిల్లలకు ఇస్తే పాపం వాళ్ళు  చాలా సంతోషించారు.

మరుసటి రోజు యాత్రకు ప్రణాళికలు వేసుకొని కమ్మని జ్ఞాపకాలతో కలల్లోకి జారుకున్నాం.


-(సశేషం)



గోదావరి యాత్ర-2

రాజమండ్రిలో మేమున్న హోటల్ పేరు పర్ణశాల ప్రిన్స్‌లి. పుష్కరఘాట్ కి కాస్త దగ్గర్లో కుమారి థియేటర్ రోడ్డులో ఉంది. గదులూ అవీ ఫర్వాలేదు కానీ మూడు చిక్కులున్నాయి. ఒకటి - హోటల్ క్రిందనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. రెండవది-హోటల్ రెసెప్షన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి లిఫ్టున్నా అది పనిచెయ్యదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిగతా అంతస్తులకు మాత్రమే పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళెవరైనా ఉంటే  మొదటి అంతస్తు వరకు మెట్లెక్కి వెళ్ళడం కష్టం. మూడవ చిక్కు విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచెయ్యదు. గదులకు ఏ.సి మాత్రం పనిచేస్తుంది.

ఇలాంటి హోటల్‌లో ఎలా ఉన్నావయ్యా వారం రోజులంటే నా సమాధానాలు ఇవి - హోటల్‌లో మేము గడపదలచుకున్న సమయం చాలా తక్కువ. ప్రొద్దున్నే ఏడున్నర-ఎనిమిదికళ్ళా బయటపడి  మళ్ళీ రాత్రి ఏడుగంటలకు హోటల్ చేరుకొనేవాళ్ళం. కేవలం రాత్రి విశ్రమించడానికే అయితే సౌకర్యంగానే ఉంది .  పర్ణశాల ప్రిన్స్‌లి ప్రక్కనే అక్షయ్ రెసిడెన్సీ అని మరో హోటల్ ఉంది.  అందులో గదులు బావున్నాయి. ధర కూడా ఫర్వాలేదు. విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచేస్తుంది కాని ఏ.సి. పని చెయ్యదు. ఫ్యాన్లు పనిచేస్తాయి. రాజమండ్రిలో వేసవిని తట్టుకోవాలంటే ఫ్యాన్లు సరిపోవు. ఏ.సి ఉండాల్సిందే. హోటల్ ఎత్తులో కట్టడం వల్ల మెట్ల సమస్య దానికీ ఉంది. ఇక బార్ అండ్ రెస్టారెంట్ విషయానికొస్తే  దానికి జనాల తాకిడి లేకపోవటం పెద్ద ఊరటనిచ్చే అంశం. ఒకరిద్దరు కంటే ఎక్కువమందిని అక్కడ చూసినట్లు నాకు గుర్తులేదు. ఇదే తిరుపతిలో అయితే ఒక సూపర్‌స్టార్ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షోకి జనం ఎలా కొట్టుకుంటారో అలా ఎగబడేవాళ్ళు. బెంగుళూరులో కూడా ఈ తంతు కొన్ని చోట్ల గమనించాను. వేసవిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని మొన్నామధ్య పేపర్లో చదివి నేనేం ఆశ్చర్యపోలేదు. దేశంలో తాగడానికి మంచి నీళ్ళు లేనప్పుడు పుష్కలంగా దొరికేదేదో అది తాగి ప్రాణాలు నిలుపుకోవాలి కదా !

మరుసటి రోజు ప్రొద్దున్నే ఎనిమిదిన్నరకు  మారుతి టూరిజం వారి ఇన్నోవాలో అందరం  బయలుదేరాం.  

కోనసీమ అందాలతో పరిచయం, రాజమండ్రి నుంచి బిక్కవోలుకు వెళ్ళే దారితో ప్రారంభమయ్యింది. రోడ్డుకు ఇరువైపులా పంటకాలువలు, వాటి పక్కనే కంటిచూపు ఆనినంతవరకూ పచ్చటి పైరుపొలాలు. ఈడొచ్చిన  తెలుగుపిల్లలా భూకన్య పచ్చటివోణీ తొడుక్కుని సిగ్గుతో మురిసిపోతూంటే, ఆ సిగ్గును పల్చటి మేలి ముసుగుతో కప్పుతున్నట్లు జలతారు మంచుతెర, ఇంతటి సుందర సన్నివేశానికి ఆహ్వానాలు మోసుకెళ్తున్న నెచ్చెలుల్లా గగనసీమలో కొంగల బారు ..నయనమనోహర దృశ్యాలు దారిపొడవునా సాక్షాత్కరించాయి . శీతాకాలంలో మంచు తెరలు మాములే కానీ నిండు వేసవిలో బారెడు పొద్దెక్కాక మంచు తెరలు చూడటం ఇదే మొదటిసారి.

బిక్కవోలు 

బిక్కవోలు చిన్నగ్రామం. ఇక్కడున్న ప్రసిద్ధమైన ఆలయ సముదాయం శ్రీగోలింగేశ్వర స్వామి దేవాలయం. క్రీ.శ.9వ దశాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు తురుష్కుల దండయాత్రలలో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలక్రమంలో పుట్టలు,పొదలు పెరిగి అరణ్యంతో కప్పబడిపోయిన ఈ ఆలయాలని గోవులు తమ క్షీరధారలతో అభిషేకించటం గమనించి ఆశ్చర్యపోయిన కరణం, పుట్టలను తవ్వించి లింగాన్ని బహిర్గతం చేశారు. గోవుల క్షీరధారలతో అభిషిక్తమైన మూర్తి కనుక గోలింగేశ్వరుడయ్యాడు. ఆయననే ఆలింగన చంద్రశేఖరుడని కూడా అంటారు.




బిక్కవోలు పూర్వనామం బిరుదనవోలట. పూర్వం ఇక్కడి నుంచి పెద్దాపురానికి సొరంగమార్గం ఉండేదని , బ్రిటీషు వాళ్ళు బిగ్‌హోల్ అని పిలవటం మూలన కాలగర్భంలో అది బిక్కవోలుగా మారిందని ఒక కథనం.




గోలింగేశ్వరస్వామి వారి ఆలయానికి దగ్గర్లో పచ్చటి పోలాల మధ్యలోనున్న స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయం కనువిందు చేస్తుంది. గణపయ్య ఎంత బొద్దుగా ఉంటే అంత అందం. ఇక్కడ స్వామివారు విశాలమైన చెవులు, కుడివైపుకు తిరిగిన పొడవాటి తొండం, పెద్ద బొజ్జతో భూమిలో కూరుకుఫోయి ఉంటారు. స్వామి చెవులలో మన ఈప్సితాలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి.





బిక్కవోలు, గొల్లల మామిదాడ, దాక్షారామం, పీఠాపురం, అన్నవరం, కడియం - ఇవి ముందుగా మేం బుక్‌ చేసుకున్న ప్యాకేజి ప్రకారం  మొదటిరోజు వెళ్ళవలసిన  ప్రాంతాలు. బిక్కవోలు చూశాక స్థానిక ప్రాశస్త్యం ఉన్న చిన్న గుళ్ళ కంటే లోకప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు, ప్రాంతాలు దర్శించడం  ఉత్తమమనిపించింది . మా రూట్‌మ్యాప్‌లోంచి గొల్లల మామిదాడ , కడియం తొలగించి వాటి స్థానాల్లో సామర్లకోట, కాకినాడ చేర్చాం. మా డ్రైవరు  మాటకారి, బ్రతకనేర్చినవాడు కాబట్టి దానికి అంగీకరించాడు. పనిలో పనిగా మరుసటిరోజు ప్యాకేజ్‌కు బదులు వాహనాన్నే మాట్లాడుకోమని, దాని ద్వారా బోలెడంత డబ్బు ఆదా అవుతుందని (తనకూ, మాకూ) ,ఇష్టమొచ్చిన ప్రదేశాలు చూడవచ్చని సలహా ఇచ్చాడు. మాకా సలహా నచ్చింది.


కారు దాక్షారామం వైపు బయలుదేరింది.

(సశేషం..)


గోదావరి యాత్ర -1




నీటి ఆవశ్యకత దేహానికి ఎంత ముఖ్యమో, నాగరికత వికసించి ప్రజలు వర్థిల్లాలన్నా ఒక ప్రాంతానికి అంతే ముఖ్యం. నీరు పుష్కలంగా ఉన్న చోట పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు సమృద్ధిగా పండిన చోట సుఖసంతోషాలు తాండవిస్తాయి. కడుపు నిండిన చోట కళాభివృద్ధికి కొదవేముంది?

భారతీయ సంస్కృతిలో నదీనదాల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ' గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ' అని శ్లోకం. సప్తనదులలో ఒకటైన గోదావరి నదిని, ఆ మహానది ఒడ్డున వెలసిన శ్రీరామచంద్రున్నిదర్శించుకోవాలన్న కోర్కె చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దాన్ని తీర్చుకొనే అవకాశం ఈ వేసవిలో దక్కింది .సాక్షాత్తూ గంగానదికి ప్రతిరూపమైన గోదావరినది గొప్పదనం గురుంచి అనేక విధాలుగా ముందే విని ఉన్నాను. నాటి ' మూగమనసులు ' నుంచి నేటి ' గుండెల్లో గోదారి ' వరకు అటు మన తెలుగు సినిమా దర్శకులు, ఇటు ఇతర మీడియా వాళ్ళు గోదావరి అందాలని యథాశక్తి దృశ్యరూపంలో బంధించి కనువిందు చేశారు. దీంతో గోదావరిని చూడాలన్న కోరిక మరింత బలపడింది . కావల్సిన సమాచారం సేకరించి వారం రోజుల ప్రణాళిక వేసుకున్నాం. రాజమండ్రిలో దిగి ముందు గోదావరి జిల్లాల్లోని ముఖ్యప్రదేశాలు సందర్శించి , ఒక రోజు విశ్రాంతి తీసుకొని తర్వాత తమ్ముడి కుటుంబంతో కలిసి భద్రాద్రి  రామున్ని దర్శించుకుందామని ప్లాన్ వేశాం. బెంగుళూరు నుంచి బయలుదేరి వారం రోజులలో ఒంటికి శ్రమ తెలియకుండా అన్ని ఊళ్ళూ చుట్టి రావాలంటే విమాన ప్రయాణమే శ్రేయస్కరం అనిపించింది. ఆఫీసులో ఎల్.టి.ఏ క్లెయిం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరికీ రానూపోను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేశాను. 

రెక్కలిచ్చిన తల్లిదండ్రులతో కలిసి రెక్కలున్న లోహవిహంగంలో ప్రయాణించడం ఒక మధురమైన అనుభూతి. మా తల్లిదండ్రులకి, మా పాపకి అదే మొదటి విమానప్రయాణం. మా పాప అయితే  ఉత్సాహంతో గంతులు వేస్తునే ఉంది. విమానాశ్రయంలో ప్రవేశించాక చుట్టూ ఉన్న విమానాలను అబ్బురంగా చూడటం, టేకాఫ్, ల్యాండ్ అవుతున్న విమానాలను ఆసక్తితో గమనించటం, సీటులో కూర్చున్నాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచుడటం, టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ వేగానికి బెదిరిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, సర్ది చెప్పాక స్థిమితపడి కిటికిలోంచి ప్రక్కనే కనిపిస్తున్న మబ్బుడొంకలను , క్రింద లీలగా కనిపిస్తున్న ఊళ్ళను చూస్తూ ఆశ్చర్యపోవడం..ఇలా తన ప్రతిచర్యా అపురూపమైన క్షణాలే. ఇక అమ్మానాన్నల ముఖాల్లో ప్రస్ఫుటమైన భావావేశాలు చాలు జీవితాంతం పదిలపరచుకోడానికి.   

రాయలసీమ ఎండలకు రాళ్ళు కూడా ఆవిరైపోతాయని తెలుసు కానీ కోస్తా ఎండలకు కొండలైనా కరిగిపోతాయని కొత్తగా తెలిసింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి హోటల్‌కు కారులో వెళ్తూంటే వెచ్చటి గాలులు మొహంపై వాతలు పెట్టాయి .అసలే వేసవి. కాసేపు ఎండలో నిల్చుంటే చాలు గోదావరిలో స్నానం చేసినట్లే. దానికి తోడు విపరీతమైన విద్యుత్‌కోతలు. ఇంతటి ఉక్కబోతలో సామాన్యజనం జీవితాలు ఎలా వెళ్ళదీస్తున్నారో అర్థం కాలేదు. విద్యుత్ మీదే అధారపడి నడిచే జిరాక్స్‌సెంటర్లు, జ్యూస్‌షాపులు వగైరా వేసవిలో ఉచితంగా సర్వీస్ చేసినట్లే లెక్క. వచ్చే రాబడి జనరేటర్ డీజల్ ఖర్చులకే సరిపోదు. ఏప్రిల్ మాసాంతంలోనే రాజమండ్రి లాంటి పట్టణాలలో ఇంత అధ్వానంగా ఉంటే ఇక మారుమూలపల్లెల్లో పరిస్థితి ఊహించుకోవచ్చు. నేల నలుచెరగులా నీరున్నా విద్యుత్‌కు నోచుకోని దుస్థితికి కారణం నాయకులా? నిగ్గదీసి అడగలేని ప్రజలా ? 

ప్రకృతి ఎంత గొప్పదో ఆ సాయంత్రం పుష్కరఘాట్‌లో మళ్ళీ బోధపడింది.





సంధ్య వెలుగులో స్నానాలాచరిస్తూ కొందరు, బోటు షికారు చేస్తూ ఇంకొందరు, నీళ్ళలో ఆటలాడుకొంటూ మరికొందరు, ఘాట్ ప్రక్కనున్న 


పాత బ్రిడ్జినెక్కి అంత ఎత్తు నుంచి గోదావరిలో దూకి ఈతకొడుతూ కేరింతలు కొడుతూ ఇంకొందరు, ఒడ్డున నిల్చుని పిల్లల్ని పర్యవేక్షించే తల్లిలా పవిత్ర గోదావరి విగ్రహం, ఈ సందడికంతా కాస్త దూరంగా ముఖద్వారం వద్ద  సర్వం నాకు తెలుసన్నట్లు  తపస్సమాధిలోని పరమశివునిలా గంభీరంగా ఉన్న ఎత్తైన శివలింగం. పడవలో విహరిస్తున్నంతసేపు నాలో 'వేదంలా ఘోషించే 


గోదావరి '  మార్మ్రోగుతూనే ఉంది. తిరిగి వస్తూ రేవు గట్టునున్న గోదారమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించాను. నిజంగా ఈ గోదావరి నదే లేకపోతే వేసవిలో ఈ ప్రజలకు ఉపశాంతి ఎక్కడిది?


..(సశేషం)


నాట్య మయూరి

మా నాన్నగారు చాలా కాలం క్రితం వేసిన కొన్ని చిత్రాలు








విషాదాంధ్ర



బాధతో హృదయం ద్రవిస్తోంది !

గుండెల్లో నిరంతరం మార్మ్రోగి ఉత్తేజాన్ని రగిలించిన మా తెలుగుతల్లికీ మల్లెపూదండ నేడు రెండు ముక్కలైపోయి మూగబోయింది.

దేశానికే అన్నం పెట్టిన ఆంధ్రమాతా అన్నపూర్ణా, ఇకనుంచి నువ్వు ఢీల్లీ నడివీధుల్లో  అడుక్కుతినాలి.

నీ పిల్లలం మేం, నిధుల మెతుకుల కోసం కాట్లకుక్కల్లా  కొట్లాడుకుంటూ 
వైరివైషమ్యాలతో కలకాలం  వర్థిల్లుతాం. 

దేశ రాజకీయాల్లో ఇదో దుర్దశ.  


ఒకప్పటి భారతంలో వలువలు విప్పింది దుశ్శాసనుడొక్కడే, సహకరించింది మిగిలిన దుష్టచతుష్టయమే . నేటి భారతంలో ప్రజాస్వామ్యం ఓ పాంచాలి, అడుగడుక్కీ ఓ దుశ్శాసనుడు, అందరూ కౌరవులే. పాండవులు, పరమాత్మ శ్రీ కృష్ణుడే లేనే లేరు.

గోరంతను కొండంతలు చేసి,  కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, అనేకమంది అమాయకుల బలిదానం సాక్షిగా  కొన్ని శక్తులు నడిపిన ప్రత్యేకవాద  ఉద్యమం అనేక దిశలు, దశలు దాటి ఆఖరి మజిలీ చేరుకుంది . 

ఎనభైలకు ముందు తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ  ఆ తర్వాత జరగడానికి పెద్దగా ఆస్కారాలు లేవు. కొన్ని సంఘటనలు జరిగినా అవి రాష్ట్రాన్ని విభజించేటంత తీవ్రమైనవి కావని నా ప్రగాఢ విశ్వాసం . అసలు ఏ ప్రాతిపదిక మీద తెలంగాణ ఇచ్చారో ఇప్పటికీ చెప్పుకోలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వముంది. వెనుకబాటుతనం దోపిడీ కారణాలైతే  ముందు రాయలసీమ వేరుపడాలి. సెంటిమెంటు ప్రకారమైతే అనేక ప్రాంతాల్లో వేరుపడాలన్న సెంటిమెంటుంది. అంతకు రెట్టింపు ప్రాంతాల్లో కలిసుండాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. హేతుబద్ధత లేని ఇటువంటి విభజనలు మునుముందు దేశాన్ని ఏ సంక్షోభంలోకి నెడతాయో కాలమే సమాధానం చెప్పాలి.

సరే ..కారణాలేవైనా  ఒక ప్రాంతాన్ని విభజిద్దామనుకున్నాక  రెండు ప్రాంతాల వారికీ సమన్యాయం చెయ్యడం కనీస ధర్మం.  అలా కాకుండా విభజన కోరుతున్న వారి విజ్ఞప్తులన్నీ అంగీకరించి, అవశేష ఆంధ్రప్రదేశ్ వాసుల ఆక్రోశాన్ని పెడచెవిన పెట్టి కేంద్రం బిల్లును రూపొందించటం ఘోరం.  రాహుల్‌గాంధీని ప్రధానిని చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో తెరాస  అజెండాకు  అనుగుణంగా అసంబద్ధమైన బిల్లును హడావిడిగా రూపొందించి దాన్నే పదికోట్ల ఆంధ్రులపై ఏకపక్షంగా రుద్దాలనుకోవటం నీచాతి నీచం. సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణావాదులు కూడా లోపభూయిష్టమైన బిల్లును అక్కున చేర్చుకుని, సీమాంధ్రులు ఎలా పోయినా పర్లేదు ఇప్పటికిప్పుడు రాష్ట్రం దక్కితే చాలన్నట్లు ప్రవర్తించటం విడ్డూరం.

తెలంగాణా వ్యవహారం ద్వారా నాకు కొన్ని విషయాలు బోధపడ్డాయి.


విష రాజకీయాలలో కాంగెస్ పార్టీని తలదన్నే పార్టీ భారతదేశంలో లేదు.


 కాంగ్రెస్ పెద్దలకు అసాధ్యమైనదేదీ లేదు. పుట్టినరోజు కానుకలుగా రాష్ట్రాలనే పంచగలరు . ఎవరినైనా లొంగదీసుకోగలరు, లొంగని వాళ్ళను జైళ్ళకు పంపించగలరు, చివరికి అదే దొంగలతో జట్టు కట్టనూగలరు. అందుకే ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నా కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలసిపోకుండా ఇంకా సజీవంగా ఉంది.


నోరున్న పదిమంది కలిసి అవాస్తవాలు ప్రచారం చేసి, దాన్నే చరిత్రగా వక్రీకరించి వందమందిని మభ్యపెట్టో , భయపెట్టో , బాధపెట్టో ఏమైనా సాధించుకోవచ్చు. అడిగే నాథుడు లేడు.



తెలంగాణా నేతలకున్న తెగువ, పోరాట స్ఫూర్తి సీమాంధ్ర నాయకులలో ఏ కోశానా లేవు.

నిమ్మరసం తాగి నిద్రపోదాం అనుకున్న కచరా నడ్డి విరిచి ఉద్యమ వీధుల్లోకి లాక్కొచ్చారు. తమ మాట లక్ష్యపెట్టని ఎంపిలను, ఎమ్మెల్యేలను సామదానబేధదండోపాయాలతో తమదారికి తెచ్చుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. సీమాంధ్రుల శైలి వేరు,మా శైలి వేరంటే ఇన్నాళ్ళూ ఏదో అనుకున్నా కానీ ఈ రోజు ఆ మాటల్లో వాస్తవం తెలుస్తోంది. ఆంధ్రులు ఆరంభశూరులన్నమాట మరోసారి రుజువయ్యింది. ఐక్యతకు మనకూ ఆమడ దూరం. ఎవడి దారి వాడిదేసమైక్య సమావేశాలు సీమాంధ్రలో నిర్వహించే బదులు తెలంగాణలో నిర్వహించాల్సింది. జనం నాడి తెలిసేది. బలం పెరిగి సమైక్య నినాదానికున్న సత్తా తెలిసేది. విడిపోదామనుకున్నది తెలంగాణా వాదులు కానీ సీమాంధ్రులు కాదు కదా. సీమాంధ్ర వీధుల్లో స్వరతంత్రులు తెగేలా ఘోషించి, శోషించి పడిపోతే సమైక్యశక్తి లోకానికెలా తెలుస్తుంది ? ఏ.పి.ఎంజివోలు ఇతర ప్రజా సంఘాల నేతలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ?


కోట్లు ఖర్చుబెట్టి ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులని ఎన్నుకోవటం శుద్ధదండగ. 

క్యూలలో బారులుతీరి ఓపికతో ఓట్లు వేసే వయసుడిగిపోయిన అవ్వలారా, తాతలారా ! ఏమిటి మీ వెఱ్ఱి తాపత్రయం ? ఎవరిని ఉద్ధరిద్దామని మీ సంకల్పం? మీకు గానీ, మీ చేత  ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు కానీ  రాష్ట్రం మీద ఎటువంటి హక్కులూ లేవు. మెజారిటీ తగ్గిందనిపిస్తే పది సీట్ల కోసం  అధికారంలో ఉన్న ఏ జాతీయ పార్టీయైన రాష్ట్రాన్ని ముక్కలు చేయవచ్చు. ఈ  లోగా అమాయకంగా మా రాష్ట్రం, మా తల్లి, మా జాతి అని భ్రమలు పెట్టుకుని భావగీతాలు పాడుకుని మురిసిపోవడం మూర్ఖత్వం. కేంద్రం తలుచుకుంటే తల్లికి చెల్లిని, అమ్మమ్మని సృష్టించగలదు. 


జగన్ కాంగ్రెస్‌ల రుణానుబంధం 


 సీమాంధ్ర ఏ గంగలో కలిసినా పర్లేదన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందంటే దానికి  మూలకారకుడు ఆర్థిక ఉగ్రవాది వైయస్‌జగనే. కాంగ్రెస్ ఎంపీలే నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్న నగ్నసత్యం ఇది. జగన్‌కున్న ఏకైక అజెండా ఎలాగైనా ముఖ్యమంత్రి అవటం .శవరాజకీయాలు, ఓదార్పు యాత్రలు చేసి అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చటంతో సీమాంధ్రలో తన నూకలు చెల్లాయనే సత్యం కాంగ్రెస్ పార్టికీ బోధపడింది. నెంబర్‌గేంలో భాగంగా అటు బాబుకు,ఇటు జగన్‌కు చెక్‌పెట్టడానికి తెలంగాణను ముందుకు తీసుకొచ్చింది. సీమాంధ్ర ప్రజలు వినోదప్రియులు. జగన్ ద్వారా అది పుష్కలంగా లభిస్తూండటంతో అభిమానంతో కొంతమంది, ఆవేశంతో కొంతమంది ఓట్లవర్షం గుప్పించారు. విజయం తలకెక్కించిన ధీమాతో జగన్ తనకు తిరుగులేదనుకున్నాడు. జేడి లక్ష్మీనారాయణ రూపంలో అతని జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. కటకటాలపాలై ఏడాదికిపైగా ఊచలు లెక్కబెట్టేసరికి వాస్తవం కళ్ళముందు సాక్షాత్కరించింది. తనపై పెట్టిన కేసుల తీవ్రత తెలిసొచ్చి తప్పించుకొనే దారులు వెదకటం ప్రారంభించాడు. సోనియా ముంగిట సాష్టాంగప్రణామం చేసి త్వమేవ శరణం మమ అనటం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. అందుకు తగ్గట్లుగానే విజయమ్మ పలుమార్లు ఢిల్లీయాత్రలు చేసి బేరసారాలు కుదుర్చుకున్నారు. సోనియానే హంతకురాలన్న నోటితోనే సార్వత్రిక ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని జాతీయ మీడియాలో ప్రకటనలు చేశారు. జగన్‌కు స్వేచ్ఛా జీవితం లభించింది.  ఆపైన అధిష్థానం ఆదేశాలకు అనుగుణంగా సమైక్యనినాదాన్ని తలకెత్తుకోవటం, రాజీనామాలు చెయ్యటం, సభలు సమావేశాలు నిర్వహించటం చకచకా జరిగిపోయాయి. డిగ్గీరాజా కనిపిస్తే చెంప పగలగొట్టాలని తొడగొట్టి హూంకరించిన మడమతిప్పని పోరాటయోధుడు జగన్, స్వయంగా పీకల్లోతు బురదలో కూరుకుపోయి మళ్ళీ మిగతావారిపై బురదజల్లే ఆయన ఎం.పీ లు పార్లమెంటులో కుక్కిన పేనుల్లాగ ఎందుకు పడి ఉన్నారో తెలుసుకోలేనంత తెలివితక్కువ దద్దమ్మలుకారు తెలుగు ప్రజలు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం కలిగించాలకున్న అసమ్మతినేతలకు ఎటువంటి సాయం చేయకుండా మొహం చాటేయ్యడమూ మర్చిపోదగింది కాదు. ఈ రోజు ఎంత బుకాయించినా నివురుగప్పిన నిప్పు దహించక మానదు .   


ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల సొమ్ముతో పోషింపబడుతున్న ప్రజాప్రతినిధులు ఆ ప్రజల భావోద్వేగాలకు కట్టుబడాల్సిన పని లేదు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. 


ప్రజలని నమ్ముకుంటే ఏమొస్తుంది బూడిద ! ఇవాళ గుర్తించుకుంటారు, రేపు మర్చిపోతారు. అదే అధిష్టానం కాళ్ళముందర  అతివినయంతో తోకూపితే రాజ్యసభ బిస్కెట్టో, గవర్నరుగిరీ బిర్యానియో దక్కుతుంది. 





సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఆత్మాభిమానం అంటూ ఏమీ లేదు. ఎప్పుడో అధినేత్రి ముంగిట్లో తాకట్టు పెట్టేశారు .

ఒకవైపు సీమాంధ్ర తగలబడుతున్నా, సోనియాగాంధీని ఒక్కమాటంటే శివాలెత్తినట్టు చిందులువేసే వీళ్ళని తిట్టాలంటే తెలుగు భాష సరిపోదు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బిల్లును టేబుల్ఐటెంగా తెచ్చినప్పుడు, చదువుకోవడానికి రెండురోజుల సమయం కోరితే కుదరదన్నప్పుడు, ఆంటోనీ కమిటి పేరుతో ప్రజలను మభ్యపెట్టినప్పుడు, యుద్ధవిమానంలో ఆఘమేఘాల మీద బిల్లు తరలించినప్పుడు, ఇతర రాష్ట్రాల ఎం.పిలను ఉసిగొల్పి ముష్టిఘాతాలు కురిపించినప్పుడు, ప్రసారాలు నిలిపేసి బిల్లును నెగ్గించుకున్నప్పుడు ఆవేశంతో స్పందించిన సీమాంధ్ర నేతల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆస్తులు తగలబెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అధిష్టానాన్నే నమ్ముకుంటున్న బొత్స సత్యానారాయణ, ఇంత జరిగినా ఇంకా ఏదో వెలగబెట్టాలని పదవులు పట్టుకువేలాడుతున్న చిరంజీవి , ఆనం, రఘువీరా, డొక్కా లాంటి నేతల్ని చూస్తూంటే  జుగుప్స కలుగుతోంది.  నాటకమో నిజమో కిరణ్‌కుమార్ రెడ్డి తన ప్రయత్నమంటూ తను చేశాడు. బెనిఫిట్ ఆఫ్ డవుట్ కింద ప్రస్తుతానికి ఆయన్ని వదిలేద్దాం. మీరేం ఒరగబెట్టారని ఆయన్ని విమర్శిస్తున్నారు? యూ.టి వల్ల ఎవరికి ఉపయోగం ? సీమాంధ్రుల ఈగో చల్లారాలంటే యూ.టి చెయ్యాలా ? ఇంతకంటే మెరుగైన ప్రతిపాదనలేవీ లేవా మీ దగ్గర ? ముఖ్యమంత్రి పీఠం మీద మరీ ఇంత అలవిమాలిన మోజా ?


ఈ దేశంలో అధికారపక్షం ప్రతిపక్షం అంటూ రెండు లేవు. ఉన్నది ఒకే పక్షం. అది అధికారదాహ పక్షం.

ధికార దాహంతో విలువలకు తిలోదకాలు ఇచ్చి అడ్డమైన గడ్డీ కరచి   ' మేము ప్రత్యేకం ' అంటూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. అనిల్ అంబానీ విషయంలో కాంగ్రేస్‌తో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయిన భాజపా, తెలంగాణ బిల్లు విషయంలో మరింత నిర్లజ్జగా పట్టుబడిపోయింది. విపక్ష  పార్టీ నాయకురాలై ఉండి సీమాంధ్రులు  భారతీయులే కానట్ట్లు వారి కోసం ఒక్క అమెండుమెంటూ ప్రతిపాదించకుండా తెలంగాణాకు తలూపి, 'నన్ను గుర్తించుకోండి ' అని అధికారపక్షాన్ని దేబరించటం దిగజారిన విలువలకు పరాకాష్ట. ప్రజాగ్రహం వెల్లువెత్తాక కూడా  'అన్యాయం జరిగిన మాట వాస్తవమే. వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి  మేం చూసుకుంటాం ' అని ఎటువంటి సిగ్గూ బిడియం లేకుండా మాట్లాడుతున్న వీళ్ళని చూస్తే సిగ్గుకే సిగ్గొస్తుందేమో. రాజ్యసభలో ఓ వైపు సుశీల్‌కుమార్ షిండే్ ప్రభృతులు మేం విసిరే ఎంగిలి మెతుకులు ఇవే ,ఇష్టముంటే తీసుకోండి లేకపోతే ఇదీ లేదన్నట్లు  అహంకరిస్తూంటే సీమాంధ్రుడై ఉండీ సాటి సీమాంధ్రుల మేలు కోసం పట్టుబడకుండా చేతులెత్తేసి సంధి చేసుకున్న వెంకయ్య గారూ, వృద్ధాప్యంతో మీకు పౌరుషం పోతే పోయింది, కనీసం  సీమాంధ్రుల పట్ల జాలి కుడా కలుగలేదా ? తృణమూల్ కాంగ్రెస్  పార్టీ సభ్యులకున్న శక్తి కూడా మీ పార్టీకి  లేదా ? ఉమ్మడి రాజధాని నిధులు ఒక రాష్ట్రానికే పంచటం ఎంత దుర్మార్గమని నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? అణు ఒప్పందం నుంచి తెలంగాణ బిల్లు వరకు ప్రతీ బిల్లూ  లోపభూయిష్టమైనవే  అంటూ అన్నిటికీ సహకరించి బిల్లులు పాస్ చేయించిన  మీకూ, కాంగ్రెస్‌కు తేడా ఏంటి ? అభివృద్ధి పేరుతో చిన్న రాష్ట్రాలకు మద్దతు పలికే మీకు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గురుంచి మాట్లాడే హక్కు ఎక్కడిది ?


ప్రతిపక్షనాయకుడు మంచి పరిపాలనాదక్షుడైతే సరిపోదు అతనికి నాయకత్వ లక్షణాలూ ఉండాలి. 


తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రినని తంబూరా మీటే రెండుకళ్ళ సిద్ధాంతకర్త చంద్రబాబులో ఇదే లోపించింది.  తెలంగాణకు మద్దతిచ్చి  తెరాసతో పొత్తుపెట్టుకోవటం చారిత్రాత్మిక తప్పిదం.  పోనీ  మేధోపరమైన చర్చలు జరిపి, విడిపోతే తెలంగాణ, సీమాంధ్ర భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని లెక్కలు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. కేవలం చిరంజీవి చీల్చబోయే ఓట్ల శాతాన్ని తగ్గించటానికి తెలంగాణకు జైకొట్టారు. విభజన సాకారమవుతున్న దశలో కుడా స్పష్టత లేకుండా రెండు కళ్ళు, రెండు కొడుకుల సిద్ధాంతాలతో ముందుకొచ్చారు. సమన్యాయమంటే ఏమిటని జాతీయ మీడియా ప్రశ్నిస్తే ఉక్కిరి బిక్కిరయ్యి నీళ్ళునమిలారు. మీకు నిజంగా సమన్యాయమే కావల్సి వస్తే 'తెలంగాణకు కావల్సినవివీ, సీమాంధ్రకు కావల్సినవివీ, అప్పుడే మేం విభజనకు అనుకూలం ' అని ముందే ఎందుకు  ధైర్యంగా చెప్పలేకపోయారు ? అలా చేసుంటే మీ క్రెడిబిలిటీ పెరిగేది కదా ? సమైక్యతే మీ నినాదమైతే తెలంగాణలో ఉంటూ ' సమైక్య రాష్ట్రానికే నా ఓటు ' అని నిబ్బరంగా చెప్పుకున్న తూర్పు జయప్రకాష్‌రెడ్డికున్న కన్విక్షన్ మీకు లోపించిందా ? ఓ వైపు తెరాస నాయకులు వాగ్ధాటితో విజృంభిస్తూ చెడుగుడు ఆడుకుంటూంటే  ఆంగ్లం ఒక్క ముక్కారాని, సి.ఎం.రమేశ్ లాంటి వాళ్ళని  రాజ్యసభకు, జాతీయ మీడియాలో చర్చావేదికలకు పంపి మీరు సాధించిందేమిటి, మరింత గందరగోళం సృష్టించటం, నవ్వులపాలవటం తప్ప. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి పీఠంపైనా, పదేళ్ళు ప్రతిపక్షంలోనూ కూర్చున్న మీనుంచి ఇంత అపరిపక్వత ఆశించలేదు. పుసుక్కుమని పాదయాత్రలకు బయలదేరేముందు ఒంటరిగా కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోండి. లోపం ఎక్కడుందో తెలుస్తుంది. 


సీమాంధ్రులకున్న కులపిచ్చి తెలంగాణావాదులకు లేదు


కమ్మ, కాపు, రెడ్డి..ఇలా టాగ్‌ని బట్టి టోకున ఓట్లు కుమ్మరించే సీమాంధ్రలో ఇంతకంటే గొప్ప నాయకులని ఊహించటం ప్రజల అవివేకం. మనకులపోడు అందలమెక్కితే అదే మనకు గర్వకారణం. వాడెంత అసమర్థుడైనా, అయోగ్యుడైనా ,లక్షల కోట్లు దిగమింగినా మనకక్కర్లేదు. 'ఎందుకింత రాద్ధాంతం ? మావోడు ఒక్కడే తిన్నాడా ? ఎవడు తినటం లేదు ఈ లోకంలో ? .ఎంత దుర్మార్గుడైనా మన కులపోన్ని మనం చాకిరేవు పెట్టి కులానికి చెడ్డపేరు తీసుకురాకూడదు. మనోడికి మనమే మద్దతివ్వకపోతే ఇంకెవరు మద్ధతిస్తారు ' . ఇదీ.. .మన ఆలోచనా ధోరణి. చదువురానివాడి దగ్గర్నుంచి చదువుకున్నవాడి వరకు ఇదే మైండ్‌సెట్. ఇది మారనంత వరకు అద్భుతాలు ఊహించటం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది.

ఏతావాతా తెలంగాణ పదేళ్ళు ,సీమాంధ్ర ముప్పైయేళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డాయి !

సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన సీమాంధ్రులారా ! ఇకనైనా కళ్ళు తెరిచి సరైన నాయకులని ఎన్నుకోండి !

సినిమా నటుల మీద వ్యామోహాన్ని సినిమాల వరకే పరిమితం చేయండి. మీకో నటుడు నచ్చితే అతని సినిమాను వందసార్లు చూడండి. దానివల్ల దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. కానీ అతనికి లేనిపోని విశేషణాలు తగిలించి వ్యక్తి పూజలు చేయకండి. కులమతాల కంపునుంచి వెలుపలికి వచ్చి కొత్తలోకాన్ని సృష్టించడానికి శాయశక్తులా ప్రయత్నించండి. మిమ్మల్ని మళ్ళీ బుట్టలో వేసుకోవాలనే నేతలకు మీ కాళ్ళకు చెప్పులున్నాయనే వాస్తవం తెలియజేయండి. ఇప్పటి మీ నడవడిక మీదే మీ పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందన్న సత్యాన్ని మరచిపోకండి.


అంతవరకూ జై తెలుగు జాతి !






తెలుగు వెలుగులో నా కవిత ' ఏటిగట్టున '

తెలుగు వెలుగు ఫిబ్రవరి 14 సంచిక లో నా కవితను ప్రచురించినందుకు ఈనాడు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. 

చదివిన వెంటనే  ఐజ,గద్వాల్ నుంచి ఈనాడు ఏజెంటొకరు ఫోన్ చేసి అభినందించారు. ఇది నాకొచ్చిన మొదటి ప్రతిస్పందన. తర్వాత తిరుపతి నుంచి ప్రధానోపాధ్యాయుడొకరు, తాడేపల్లిగూడెం నుంచి అడ్వకేటుగారొకరు ఫోన్ చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు.  నాకిదో కొత్త అనుభూతి. వారికీ నా కృతజ్ఞతలు.



తెలుగు వెలుగుకు కవితను పంపించాక ప్రచురణకు ఎంపికయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఏడాది పాటు నీరీక్షించవలసి వచ్చింది. ఏడాది కాలం ఎక్కువే. ఈలోగా ఆశలు వదిలేసుకొని కవితకు ఇంకొన్ని మార్పులు చేసి ఓ అంతర్జాల సాహిత్య వారపత్రికకు పంపాను.అక్కడా అమోదం పొందింది.  ' హమ్మయ్య ఇక  ప్రచురితమవబోతోంది ' అనుకుంటూండగా తెలుగు వెలుగు  నుంచి సంక్షిప్త సమాచారం ..' మీ కవిత ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. వివరాలు పంపించండి ' అంటూ..


ఫిబ్రవరి సంచికలో చివరి మూడు వాక్యాలు ప్రచురించలేదు.

పూర్తి కవిత ఇక్కడ


టిగట్టున కూర్చున్నాను
కోటి ఊసులు వింటూ
ఈ ఏరు నా కన్నతల్లి
మమతానురాగాల పాలవెల్లి

ఊయలూగే శైశవంలో
ఉలిక్కిపడి గుక్కపడితే
చేలోఉన్న తండ్రి చెంగున చెంతకు చేరేలోగా
గలగలల లల్లాయి పాడి సుఖనిద్ర పుచ్చింది
జోల కాదది విమల గాంధర్వ డోల
మాతృహృదయానంద పారవశ్య హేల

ఉరకలేసే బాల్యంలో
కుప్పించి దుమికి కాళ్ళు తాటిస్తే
ఉప్పొంగిన ప్రేమై ఉవ్వెత్తున పైకిలేచి
అలల చేతులతో ఆశీర్వదించింది
ఈ ఏటి పొత్తిళ్ళలో కేరింతలు కొట్టి
సంబరపడిపోయారు సూరీడూ చంద్రుడు

అరకదున్నే ప్రాయంలో
మెరికనై వొళ్ళు వంచి
తూములు కట్టి తనువును తోడేస్తే
స్తన్యమిచ్చిన తల్లై సస్యాన్ని సజీవం చేసింది
పిండారబోసిన వెన్నెల్లో నిండార మెరిసే ఏటి తరగలు
మట్టి మనుషుల వెట్టి బ్రతుకుల్లో వెలిగించిన మతాబా దివ్వెలు

రెక్కలొచ్చీ  నేను
రేవు దాటెళ్ళబోతూంటే
అక్కరగా ఆవలిగట్టు చేర్చి బుంగమూతి పెట్టింది
సుళ్ళు తిరిగే దుఃఖాన్ని స్తబ్ధతలో దాచిపేట్టి సాగనంపింది  


ప్రవాసంలో ...రాలిన  ప్రతి చినుకులోనూ నా తల్లి పలకరింపు విన్నాను

ఆవాసం చేరి ఆశీస్సులు కోరబోతే అర్థమయ్యిందది పరామర్శ కాదు పరివేదనని !


 నాగరికత నేర్పిన ఏరు
నేడు నిరాదరణకు గురైన తల్లిలా నిర్వేదంగా ఉంది
ధనమదాంధులై మానవాధములు కొందరు
దురాక్రమణ చేసీ దోచుకుంటూంటే
బొమికల రేణువులు మిగిల్చుకొని బిక్కుబిక్కుమంటోంది
జీవవైవిధ్యం జాతర చేసిన చోట
శూన్యనైరాశ్యం తాండవిస్తూంటే
అశ్రుపూరిత నయనాలతో
ఎండిపోయిన ఏటిగుండెను తడిమాను
మూగబోయిన ఇసుకరేణువుల్లో మెల్లగా ఏదో ప్రతిస్పందన !
ఏదో సంచలనం ! !
ఉబికి జారిన నా కన్నీరు ఊటగా మారుతుందా ?
ఉద్రేక గంగాతరంగినియై నా తల్లి ఈ ఊరిని ముంచెత్తుతుందా ?
చరిత మరచిన ఈ జాతికి భవితనిస్తుందా ? ?



భోగుళ్ళో గోగుళ్ళో








భోగుళ్ళో గోగుళ్ళో
భోగిమంటల వెలుగుల్లో
వొళ్ళువిరిచే ఇళ్ళల్లో
రంగవల్లుల వాకిళ్ళో
చిందులేసే గొబ్బిళ్ళో
పైరుపచ్చల పల్లెల్లో
పొంగి మురిసే పొంగళ్ళో
తుళ్ళే పడతుల బుగ్గల్లో
పండే సిగ్గుల రేగుళ్ళో




మాగ్గావాలె !! (updated)



దంతా మాకు తెల్వద్

మా తెలంగాణా మాగ్గావాలె,
హైద్రాబాద్ మాగ్గావాలె,
పదేళ్ళ హైద్రాబాద్ ఆదాయం మాగ్గావాలె,
ఉద్యోగాలు మాగ్గావాలె,
ప్యాకేజి మాగ్గావాలె,
భద్రాచలం మాగ్గావాలె,
గోదావరి మాగ్గావాలె
కృష్ణా మాగ్గావాలె
మచిలీపట్నం ఓడరేవు మాగ్గావాలె
శ్రీశైలం మాగ్గావాలె
అది గావాలె,  గిది గావాలె, అన్నీ గావాలె, 

విద్యుత్‌కొరత మాత్రం సీమాంధ్ర తీర్చాలె !!






సమైక్య స్ఫూర్తికి జోహార్లు





బంద్‌లు చేసి, రహదారులు దిగ్బంధించి, రాళ్ళతో దాడి చేసినా, భయపడకుండా, సమైక్యతే శ్వాసగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి రాజధాని నడిబొడ్డులో సమైక్యనాదాన్ని సమర్థవంతంగా వినిపించిన సీమాంధ్ర ఉద్యోగులందరికీ నా జోహార్లు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఊడలు దిగిపోయిన ఏ రాజకీయ నాయకుడూ గత పదమూడేళ్ళుగా చెయ్యని సాహసాన్ని, కేవలం నెలరోజుల వ్యవధిలో  చేసి  చూపించారు. రాజధానిలో రెండో తరగతి పౌరుడిలా బ్రతుకుతున్న ప్రతి సమైక్యవాది గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపారు.  సీమాంధ్ర జిల్లాల్లో స్వచ్ఛందంగా జరుగుతున్న ఉద్యమానికి కొత్త శక్తినందించారు. ఇది నిజంగా ప్రశంసనీయం .

ఈ సందర్భంగా కొందరు తెలంగాణా వాదులు చేస్తున్న వాదనలు వింటూంటే ఇటువంటి చవకబారు వ్యక్తులా రేపు ఒక నూతన రాష్ట్రం ఏర్పడితే దాన్ని నడిపించబోయేది అన్న జాలి కలుగకమానదు.  రాజధానిలో సమైక్య సభ పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని కొందరు పొగలు కక్కితే, ఇంకొందరు విభజన జరిగిపోయింది కాబట్టి సమైక్య సభ పెడితే అది తెలంగాణా వాదులని రెచ్చగొట్టినట్లే అని తీర్మానించారు. తెరాస సంస్కృతిని నరనరానా జీర్ణించుకున్న ఒక విద్యార్థి నేతేమో 'సీమాంధ్రులు అడుగుపెడితే ఖచ్చితంగా తంతాం' అని తనకు మాత్రమే  బాగా అవగతమైన భాషలో బీరాలు పోయాడు. నాలుకలు చీరేస్తాం అని కొందరు పిల్లిమొగ్గలు వేస్తే  భౌతిక దాడులతో సత్కరిస్తామని మరికొందరు విఱ్ఱవీగారు . ఈ మాటలన్నీ వింటూ ఎంతో ఆశ్చర్యపోయాను .

కేవలం ఒక్క సమైక్య సభ...అదీ సీమాంధ్ర ఉద్యోగులు పెట్టుకుంటామంటే తెలంగాణవాదులకంత ఉలికిపాటు దేనికి? ఏపీ ఏంజీవోలు సభ పెట్టుకుంటామన్న రోజే శాంతియాత్రలకు, బంద్‌లకు పిలుపునివ్వటం  దేనికి సంకేతం ? రకరకాల సాకులు చెప్పి నెలకోసారి తెలంగాణ బంద్ చేసినప్పుడు, మిలియన్‌మార్చ్ పేరిట ట్యాంక్‌బండ్‌పై విధ్వంసం సృష్టించినప్పుడూ, సమైక్యవాదులు తమలో తాము బాధపడ్డారే కానీ ఏనాడూ అడ్డుపడలేదు. నాలుగు జిల్లాల వాదాన్ని నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్షగా చిత్రీకరించి, పద్దెనిమిదేళ్ళ ఉద్యమాన్ని(1969-72, 2001-2013) అరవైయేళ్ళ పోరాటంగా అభివర్ణించి డాంబికాలు పలికిన వాళ్ళు ఒక్క సభకే బెదరిపోయారా ? మీ ఉద్యమం నిజంగా ప్రజల గుండెల్లోంచి వస్తే భయపడాల్సిన అవసరం మీకేమిటి ? ఒక్క సమైక్య సభ దాన్ని ఆపగలుగుతుందా ? లేక ఇన్నేళ్ళుగా ఇతరులని మభ్యపెట్టి మాయచేసి నిర్మించుకున్న మృణ్మయ సౌధం కూలిపోవచ్చనే బెంగా ?  ప్రత్యక్ష ప్రసారాలు కూడా అడ్డుకోవాలని పిటిషన్ వేశారే ? దేనికింత అసహనం ? సి.డబ్ల్యూ.సీ తీర్మానం జరిగితే  విభజన జరిగిపోయినట్లేనా? బిల్లు పాసవ్వనక్కరలేదా ? రాష్ట్రపతి ఆమోదముద్ర పడనంత వరకూ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానే . రాజధానిలో తమ గోడు వెల్లబోసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది.  మిలియన్‌మార్చ్ నిర్వహించుకొనే హక్కు తెలంగాణావాదులకెంత వుందో, సమైక్య సభ పెట్టుకునే హక్కు ప్రతి సమైక్యవాదికీ ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం కాదు. వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు.

సమైక్య సభలో నన్ను ఆకట్టుకున్న అంశలు రెండు. ఉద్యమాల పేరుతో  ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు  సంతాపం ప్రకటిస్తూ  తెలంగాణ ప్రజలకూ తమ సంతాపం తెలియజేసినప్పుడు, రాళ్ళదెబ్బలు తిన్న సభికులు కూడా అభ్యంతరపెట్టలేదు. రాజకీయ విమర్శలు చేసినా, తెలంగాణ ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలనూ ఎవరూ కించపరచలేదు . రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని నిర్వాహకులు ఆద్యంతం హెచ్చరికలు చేస్తునే వచ్చారు . వేర్పాటువాదులు  సభలోకి జొరబడి చెప్పు చూపించినా సంయమనంతో వ్యవహరిస్తూ హుందాగా ప్రవర్తించడం నిజంగా గొప్ప విషయం. తెరాస - కోదండ శ్రేణుల్లో ఇటువంటి హుందాతనం భూతద్దం వేసి చూసినా కనిపించదు. సీమాంధ్రుల వేషభాషల్ని, సంస్కృతిని, ఆఖరుకి ఆహారాన్నీ వదలకుండా కించపరిచిన కే.సి.యార్‌కు సమైక్య సభలోని వక్తలకు ఎంత తేడా ? కనకపు సింహాసనమున అన్న సామెత బహూశా ఇలాగే ఉద్భవించి ఉంటుంది. సీమాంధ్ర మీద ద్వేషంతో తెలుగు భాష మీద కూడా విషం చిమ్మిన ఘన చరిత్ర తెరాసది. తెలుగు తల్లిని ఎవడికి తల్లి అన్నారు. తెలుగు ముందు పుట్టిందా ? తెలంగాణ ముందు పుట్టిందా ? తెలుగు భాషకు లేని తల్లి తెలంగాణకు ఎక్కడినుంచి వచ్చింది ?  సత్యవాణి గారన్నట్లు వీళ్ళెవరికీ అసలైన తెలంగాణా సంస్కృతి అబ్బినట్లు లేదు. కేసియార్ కుటుంబం విషయంలోనైతే అనుమానాలే అక్కర్లేదు. అసెంబ్లీ సాక్షిగా జే.పీ పై దాడిచేసినవాళ్ళు ఒకరైతే, ఏపీ.భవన్లో దూరి దళిత ఉద్యోగిపై దాడి చేసి, ఇప్పుడు నాలుకలు చీరేస్తామని ప్రగల్భాలు పలికినవాళ్ళు ఇంకొకరు. ఇక సుపుత్రికైతే నాలుగాకులు ఎక్కువే చదివింది. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులంతా తమ ఇంటిగోడలపై ' జై తెలంగాణా ' అని వ్రాసుకోవాలట. అప్పుడే ఈవిడ రాజధానిలో ఉండనిస్తుందట. నా చిన్నప్పుడు ఒక ఆడదెయ్యానికి భయపడి అమాయకులైన కొంతమంది తమ ఇంటిగోడలపై ' ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాసుకొనే వాళ్ళు. రాత్రిళ్ళు  వచ్చిన ఆడదెయ్యం గోడలపై నున్న వాక్యాలను చదివి ' రేపు రావాలి కాబోలు ' అనుకొని వెళ్ళిపోయేదట. సుపుత్రిక గారి మాటలు ఆ సంఘటనలను గుర్తుతెప్పించాయి. రాజధానిలో పోటీ చేస్తే ధరావతులు దక్కని పరిస్థితిల్లో ఉన్నా రాజ్ఞి లా ఆదేశాలు జారీ చెయ్యడం ఈవిడకే చెల్లు.

భావోద్వేగాలు, రెచ్చగొట్టడం లాంటి పదాలకు తెలంగాణావాదులు కొత్త అర్థాలు సృష్టించారు. వీళ్ళు ట్యాంక్ బండ్ పై విధ్వంసం సృష్టించి, సీమాంధ్రుల ఆస్తుల పై దాడి చేసి, బలవంతపు వసూళ్ళకు పాల్పడి, సినిమా షూటింగులకు అంతరాయం కలిగిస్తే అది భావోద్వేగం. తెలంగాణా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని సీమాంధ్రనేతలు ఎవరైనా అంటే అది రెచ్చగొట్టుడు. ' ఆంధ్రా బ్యాంకు' అని పేరెట్టుకున్నందుకు ఆంధ్రా బ్యాంకు ఏ.టి.ఏం.లు ధ్వంసం చేశారు. చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమలపైనో, జూనియర్ ఎంటియార్ సినిమాలపైనో దాడి చేస్తేనో ఆయా రాజకీయ నేతల యూటర్న్ కారణంగా దాడి చేశారని సరిపెట్టుకోవచ్చు.అల్లరి నరేష్, సునీల్ ఆఖరుకి నితిన్‌లని వదిలిపెట్టలేదంటే వీళ్ళకున్నది వసూళ్ళ పై ధ్యాసే కానీ తెలంగాణా అభివృద్ధి పట్ల కాదన్న మాటేగా ? తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ప్రశ్నలడిగిన జర్నలిస్టుని పట్టుకొని ' బాడఖోవ్, నీయమ్మ ' అని దుర్భాషలాడితే అది తెలంగాణా భాషలో భావ వ్యక్తీకరణ. తిరగబడితే అది దాడి. సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సీ.యం రాజీనామా చెయ్యాలి. సీమాంధ్రులు కూడా కట్టిన పన్నులతోనే జీతభత్యాలు పుచ్చుకుంటూ , మొత్తం రాష్ట్రానికి జవాబుదారీతనం వహించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు మాత్రం తెలంగాణాకు మాత్రమే మంత్రులుగా వ్యవహరించవచ్చు. ఎంత హాస్యాస్పదం. నవ్విపోదురు గాక నాకేటిమి సిగ్గు అన్నట్లు చివరికి కోదండరాందీ ఇదే డిమాండు. సమైక్యవాదులు సభపెట్టుకుంటే అది రెచ్చగొట్టుడు, దండయాత్ర వగైరా వగైరా. ఎ.పి.ఎంజీవోలు తమ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకుంటే  తెలంగాణా ఉద్యోగులు వెళ్ళి గొడవలు చెయ్యొచ్చు . విశాలాంధ్ర  సభ్యులపై భౌతిక దాడులు చెయ్యచ్చు. కళాశాలల్లో ప్రొఫెసర్లని, మెరిట్ విద్యార్థులని బెదిరించి పంపేయవచ్చు. అది తెలంగాణ వాదాన్ని వినిపించటం. గొంతు కోస్తామని సైగ చేసిన ఆంధ్రా ఉద్యోగి కసబ్ అయితే, రాళ్ళతో కొట్టిన వాళ్ళు, రక్తపాతం సృష్టిస్తామన్న వాళ్ళు, నాలుకలు చీరేస్తామన్న వాళ్ళు జాతిపితలు. ఈ ప్రశ్నలన్నీ సూటిగా సంధిస్తే సరైన సమాధానమిచ్చిన తెలంగాణా నేతని ఇంతవరకూ వినలేదు, కనలేదు. ఎంతసేపూ నోరేసుకొని సీమాంధ్ర దోపిడీ, మా ప్రాంతం, మా చావులు అంటూ అవతలి వారి నోరు నొక్కేసి నెట్టుకొచ్చిన వాళ్ళే . గల్లీ నుంచి లోక్‌సభల వరకూ ఇదే తంతు. వీళ్ళు వాదించేటప్పుడు అవతలి పక్షం ఓపికగా వినాలి. అవతలి పక్షం వాదనలు మాత్రం వీళ్ళు వినరు. తమను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు ఎవడైనా సంధిస్తే వాడు సీమాంధ్రా అహంకారి. మెడమీద కత్తి పెట్టి తెలంగాణా వాదాన్ని బలవంతంగా రుద్దిన వీళ్ళా నేడు నీతులు చెప్పేది ?

విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి విశ్రాంతి లేకుండా పోరాడుతున్న సీమాంధ్ర ప్రజలకు ఒక్కటే నా విన్నపం. సమైక్య శంఖారావాలు, బస్సుయాత్రల పేరిట మీ ముందుకొచ్చే రాజకీయ నాయకుల శుష్కవాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండండి. 2009లో ఒకసారి ఇలాగే మోసపోయారు. అప్పటి మీ ప్రతిస్పందన చూసైనా నాయకులు కళ్ళు తెరవకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరి లేకుండా ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసుకుంటూ వోట్లకు గాలాలు వేస్తున్నారు.  మీరు తగలబడిపోతుంటే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇటువంటి నేతలను చూసీ చూడనట్లు వదిలేయకండి. ఉరకలేస్తున్న మీ చైతన్యాన్ని వృథాగా  పోనివ్వకండి. నిలువరించి నిలదీయండి. సమైక్యమా, విభజనా స్పష్టమైన విధానం కావాలని ప్రతిఘటించండి. రానున్న రోజుల్లో రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, ముక్కలై వేరైనా భవిష్యత్తులో ఇటువంటి గోడ మీద పిల్లుల బెడద తగ్గి ప్రజలు హాయిగా జీవిస్తారు.


హంసినిలో నా కవిత

నిశ్చల గీతం

(ఆగష్టు 2013 సంచిక  లో  నా కవిత ప్రచురించినందుకు హంసిని యాజమాన్యానికి నా కృతజ్ఞతలు )





గళ్ళంతా పొట్టకూటికై పరిచర్యలు చేసి చేసి
రాత్రిళ్ళు రహస్య సుఖాల పరిష్వంగంలో అలసి సొలసి
ఆదమరచిన నా అస్తిత్వాన్ని
అలలు అలలుగా తట్టిలేపుతూ
నిశ్చల గీతం వినిపిస్తోంది !
నిద్రిత మనోసీమలలో !!

బలవంతుడి దమననీతి బరితెగించిన అవినీతి
నిరుపేదల డొక్కల రోదన 'నిర్భయ'ల మృత్యు వేదన
పేట్రేగిన తీవ్రవాదం ప్రభుత్వాల పలాయనవాదం
నలువేపులా కమ్ముకొని దేశాన్ని నిర్వీర్యం చేస్తూంటే
ప్రహరీలు కట్టుకుని పరదాలు మూసుకుని
అభిమాన తారల్ని అశ్లీలగీతాల్ని అలౌకిక హుక్కాగా ఆఘ్రానించి
కైపెక్కించే కలెక్షన్లని కులమతాల కొవ్వుని పీకల్దాకా పట్టించి
బాధ్యతల్ని భావితాశల్ని బాత్రూంగదిలో వాంతి చేసుకుని
నాదైన లోకంలో నిసిగ్గుగా  విహరించి
నిద్దురలో జోగే హద్దులులేని నా మూర్ఖత్వాన్ని
నిరసిస్తూ నిగ్గదీస్తూ
నిశ్చలగీతం వినిపిస్తోంది !
నిద్రిత మనోసీమలలో !!

మస్తిష్కపు మత్తిలిన పొరలమాటున 
మరుగునపడిపోయిన ధిక్కార స్వరం వొకటి
వ్యాధున్ని వాల్మీకిని చేసిన శోకంలా
మెల్లగా ఇన్నాళ్ళకు మృదుగీతమై బయల్పడి
శ్రుతి పెంచి, ధృతి పెంచి ప్రణవమై పరమేష్ఠి కేకై
దేహమంతా ప్రతిధ్వనించింది !
దశాబ్దాలుగా పేరుకున్న నిర్లిప్తతా  తుప్పు వదిలిపోతూంటే
అణువణువూ శ్రవణేంద్రియమై
ఆత్మగీతాన్ని రిక్కించి వింది !
అప్పుడే నాకోక జీవనవేదం బోధపడింది !!

ప్రాథమికంగా నేను బుద్ధిజీవిని
పరిణామక్రమంలో ఉత్కృష్ట జీవిని
సంఘహితం కోరి సంఘర్షించిన రోజు - విశుద్ధాత్మని, వామనున్ని !
స్వార్థచింతనతో శక్తులుడిగిన నాడు - పక్కలో నల్లిని, పేడ పురుగుని !!

సామాజిక స్పృహ శరీరమంతా పొటమరిస్తూంటే
గీతా సారం విన్న ధనుంజయున్నై దిగ్గున లేచి కూర్చున్నాను !
ప్రభాత కర్పూరం వెలిగించి
ప్రకృతి మాత నాకు దిష్టి తీసింది !!



తిలా పాపం తలా పిడికెడు


మా తెలుగుతల్లి మూగబోయింది.

జాతి కోసం జ్యోతిలా వెలిగిపోయిన పొట్టి శ్రీరాములుగారు.. మీ త్యాగస్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చేశారు.

ఒక తాగుబోతుని, వదరుబోతుని, మనుషుల రవాణా కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ సరసన సింహాసనం వేసి మరీ రాజ్యాభిషక్తున్ని చేస్తున్నారు.

ఈ పాపం ఎవరిది ?

శుష్కవాదనలతో రంగుల లోకం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి వారి బలిదానాలకు, రాజకీయ అస్థిరతకు కారకులైన రాజకీయ రాబందులదా, నిరుద్యోగులదా ?

ఏ వాదమూ వినిపించని 2000లోనే కేవలం చంద్రబాబుని, బి.జె.పి.ని రాజకీయంగా ఎదుర్కోవటానికి ప్రత్యేక తెలంగాణ తీర్మానంపై సంతకం పెట్టి తెలుగు జాతి సమైక్యతకు తూట్లు పొడిచిన  వై.యస్.ఆర్ దా ?

స్వార్థప్రయోజనల కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య సాంస్కృతిక, మానసిక వైషమ్యాలను ఎగదోసి సంబరాలు జరుపుకుంటున్న కే.సి.యార్ దా? 

వ్యాపార ప్రయోజనాల కోసం సమైక్యవాణిని నొక్కిపట్టి పనికిమాలిన విషయాలపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వ్రాసి, విశ్లేషణలు జరిపి కాలం వెల్లబుచ్చిన పత్రికా యాజమాన్యాలదా ?

ముఖ్యమంత్రి పీఠంపై మరులు పెంచుకొని సిద్ధాంతాల్లేని పార్టీని స్థాపించి, అనవసర రాజకీయ సమీకరణలకు కారకుడై, ప్రజాభిమానం నవ్వులపాలేయ్యేలా పార్టీని విలీనం చేసిన చిరంజీవిదా ?

తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పడిన పార్టీని అధికారవ్యామోహంతో తెలంగాణా వాదానికి తాకట్టు పెట్టి, తెలుగుదేశానికి తలకట్టు లేకుండా 
చేసిన విఫల ప్రతిపక్ష నేత చంద్రబాబుదా ?

రాజకీయ మనుగడ కోసం రాష్ట్రాలను ముక్కలుగా చీల్చి జైఆంధ్ర లాంటి నిర్జీవ ఉద్యమాలను లేవదీస్తున్న బి.జె.పి దా ?

అసెంబ్లీ సాక్షిగా దాడులు చేసి మరీ తెలంగాణవాదం తలకెక్కిస్తూంటే అదేమిటనే ధైర్యం చెయ్యలేక  దద్దమ్మల్లా కూర్చున్న సీమాంధ్ర నాయకులదా ? సమైక్యవాదులదా ?

బానిసత్వపు బొమికలతో తయారై అధినేత్రి కృపాకటాక్షం కోసం అనుక్షణం అంగలారుస్తూ వంగి వంగి దణ్ణాలు పెట్టి పారిశ్రామిక అవసరాల కోసం పూటకో మాటమాట్లాడే సీమాంధ్ర కాంగ్రెస్  శాసనసభ్యులదా, ఎం.పి.లదా ?

ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నప్పుడు సమగ్ర అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను  తెలుసుకోవాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని గృహమంత్రి చిదంబరానిదా ?

అఖిలపక్షంలో నిర్భయంగా నిజం చెప్పలేక నీళ్ళు నమిలి గోడమీద పిల్లి వాటం ప్రదర్శించిన  సీమాంధ్ర  శాసనసభ్యులదా?

ఆరంభ శూరత్వం అలసత్వమే తప్ప అంతిమ కార్యాచరణ లేని సమైక్య ఐకాసలదా ? 

 యాభైయేళ్ళ పాటూ వెన్నుదన్నుగా నిలిచిన ఒక రాష్ట్రాన్ని, ఎం.పి.సీట్ల కోసం, ఆ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో నిమిత్తం లేకుండా, ఆ ప్రాంతపు సమస్యలపై ప్రాథమిక అవగాహన కూడా లేని ఇతర రాష్ట్రాల నాయకుల అంగీకారంతో ముక్కలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సోనియా గాంధీ దా? తను ప్రధానమంత్రో డూ డూ బసవన్నో తేల్చుకోలేని మన్మోహన్‌సింగ్‌దా?

ఇన్ని జరుగుతున్నా ఎప్పట్లాగే సిద్ధాంతాలతో పనిలేకుండా కులం కోసం, మతం కోసం, సినిమా గ్లామర్ కోసం  కుత్తుకలు తెగ నరుక్కొని, నోట్ల మత్తులో వోట్లు తనఖా పెట్టి అసమర్థ ప్రజా ప్రతినిధులను అందలాలెక్కించి ఆ తర్వాత ఈసురోమంటున్న సీమాంధ్ర ప్రజలదా ? వాళ్ళ అజ్ఞానానిదా ?

ఈ పాపం అందరిదీ.

తిలా పాపం తలా పిడికెడు.






సరసిని



ల్లున అందెలు కదల్చనీక
మెల్లన దరిచేరి మాటునదాగి
కళ్ళను నీ మృదుకరముల గప్పి
అల్లరి చేతల నలరింతు వీవు 

చక్కని చుక్కగ చెంతకు చేరి
చక్కిలిగింతల చిక్కులు రేపి
చెక్కిలి నొక్కగ చేయి చాపితే
చిక్కక చల్లగా జారుకొనేవు

పట్టుకోవాలని పైకిలేవగానే
పిట్టవోలే బెదరి పారిపొయేవు
పట్టుకోలేనని పకపకా నవ్వి
బెట్టుతో నిలువెల్ల పొంగిపొయేవు

అల్లంత దూరన అప్సరవోలె
కళ్ళింతచేసి కవ్వింతువీవు
ఎలకోయిల వలె ఎలుగెత్తి పిలిచి
కలహంస నడకల కదలిపోయేవు

తొణికిసలాడేటి తొలిప్రాయమందు
తనరారు నీ మేను తూగాడిపోవ
కనరానియందాల కనువిందు జేసి
మనసులో చెరగని ముద్రవేసేవు

దుడుకు కోర్కెల నాలో తలపింపజేసి
ఉడికించి ఊరించి ఉరకలేయించి
కడగంటి చూపుల్లో కొసరేటి-వలపు
వేడిమిలో నేను వేగిపోవంగ

సుడిగాలిలా వచ్చి చుట్టేసి -ప్రేమ
జడివానలో నన్ను ముంచెత్తివేసేవు

(పాతికేళ్ళ క్రితం  మా నాన్నగారు వ్రాసిన కవిత )


నివేదన






వరు నువ్వంటే ఏమని చెప్పను?

నవ్యనాగరికతా దివ్య దీప్తుల
చూడలేక నా కళ్ళు చూద్కిపోయె
నింగికెగబ్రాకు విజ్ఞాన శిఖరాల
అందుకొనలేక నా వొళ్ళు అలసిపోయె

దయాధర్మరహిత దౌర్జన్య కౄర
కబంధ హస్తాల నా బ్రతుకు చితికిపోయె
ప్రేమాభిమాన విహీన పైశాచికారముల
విని విని నా మనసు మూగవోయె

ఆశల వెలుగేలేని అంధకారములోన
ఘోర భీకర దుర్భర జీవితారణ్యమున
కఠిన పాషాణ కంటకావృతముల బడి
దారి తెన్నులేక తిరుగాడు దీనుడను నేను

పంచభక్ష్య పరమాన్నములు తిని
విసరి పారవేసిన ఎంగిలాకులకై
ముసిరిన కాకుల మూగిన కుక్కల
విసిరి తరుమలేక కసరి కొట్టలేక
కాలే కడుపును కన్నీట తడుపలేక
చావలేక బ్రతుకుతున్న సజీవిని నేను

బంగారు భవనాల పారుగోడల నీడ
ఉప్పొంగి ప్రవహించు మురికి కాల్వ చెంత
నడిరోడ్డు దుమ్ము నిండు కౌగిలిలోన
అందరాని ఆనంద తీరాల
అందుకోజూస్తున్న అల్పజీవిని నేను

గుండెలవిసే మండుటెండలో
వొళ్ళు చివికే వడగళ్ళవానలో
ఎండుమాకుల చెంత ఇంటిచూరుల కింద
బితుకు బితుకుమను గుండెలు
పిడికిట బిగబట్టి
తలదాచుకోనింత చోటులేక
చీకుచింతాలేని చెట్టుచేమల జూచి
బాధలెరుగని బండరాళ్ళను చూచి
ఓర్వలేక  వగరుస్తున్న మనిషిని నేను 

కుక్కనై పుట్టినా కూడుతినేవాన్ని
గువ్వనైపోయినా గూడు కట్టుకొనేవాన్ని
మనిషినై పుట్టి మనిషిగా మసలలేక
నిత్యం చస్తున్న నిర్భాగ్యుడిని నేను
చచ్చి బ్రతుకున్న సౌభాగ్యుడను నేను

విసురు కసురులేక ఓపికతో విన్నావు
ఎంత సౌమ్యుడవీవు? ఎవరు నీవు ?

అరెరె ! అది ఏమి !..

ఉబికి ఉప్పొంగు దు:ఖమ్ము
వెక్కిళ్ళ వెలిగ్రక్క వినవచ్చె !
కడలిఘోషల దాగు బడబాగ్ని బాధ
నీ గుండె కుత్తులోన ఘూర్ణిల్ల సాగె !

ఏమి ? నీవూ నా బోటివాడవేనా ??
అంతుపొంతులేని మన బ్రతుకులొక్కటేనా ??

అవునులే ! మనముగాక మనకున్న దిక్కెవరు !
మనగోడు విని కడతేర్చు నాథుడెవ్వరు !!

(పాతికేళ్ళ  క్రితం  మా నాన్నగారు వ్రాసిన  కవిత)



రాగం పలికింది

(దాదాపు ఇరవైయేళ్ళ క్రితం మా నాన్నగారు వ్రాసిన కొన్ని భావగీతాలు ఆకాశవాణిలో వచ్చేవి. వాటిలో నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి.)



రాగం పలికింది -నాలో 
అనురాగం వొలికింది
                                                 || రాగం పలికింది 

విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై
                                                || రాగం పలికింది  

శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై

                                                 || రాగం పలికింది