• మెరిసే మేఘాలు

    మెరిసే మేఘాలు
  • కురిసే వర్షాలు

    కురిసే వర్షాలు
  • విరిసే పుష్పాలు

    విరిసే పుష్పాలు
  • మురిసే భువనాలు

    మురిసే భువనాలు
  • నాకు

    నాకు
  • కదిలే కావ్యాలు

    కదిలే కావ్యాలు

నటకిరీటికి నీరాజనం


(జూలై పంతొమ్మిది రాజేంద్రప్రసాద్ జన్మదినం.ఆ సందర్బంగా ఈ వ్యాసం )

వి నేను ఏడవ తరగతి చదివే రోజులు.వారం రోజులుగా మా స్కూల్ చుట్టుప్రక్కల ఒకటే సందడి.'ఏంటా సంగత'ని ఆరా తీస్తే రాజేంద్రప్రసాద్ సినిమా షూటింగ్ అన్నారు మా ఫ్రెండ్స్.స్కూల్ ప్రక్కనే వెస్ట్ రైల్వే స్టేషన్.దానికావల ఒక చర్చ్.ఆ చర్చ్ పరిసరాల్లో సినిమా తీస్తున్నారని చెప్పారు.క్లాస్ లో ఆ చుట్టుప్రక్కల ఇళ్ళల్లో ఉంటున్న పిల్లలు కొంతమందున్నారు. వాళ్ళొచ్చి రోజూ షూటింగ్ కబుర్లు చెబుతూంటే పసందుగా ఉండేది.క్లాస్ రూం కిటికీలోంచి కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కనిపించేది.దాంతో టీచర్లు చెప్పేది బుర్రకెక్కేది కాదు.రాజేంద్రప్రసాద్ అంతే తమాషానా? 'ఆహ నా పెళ్ళంట,వివాహభోజనంబు ' లాంటి భారీ విజయాలతో టాప్ హీరోలతో సమానమైన పాపులారిటీ తెచ్చుకొని,ఇంటిల్లీపాదీలో ఒకడిగా చెలామణీ అయిపోతున్న హీరో.అతని సినిమా వస్తోందంటే టాక్ తో సంబంధం లేకుండా జనం థియేటర్ల దగ్గర బారులు తీరేవాళ్ళు.హీరోగా అతనంటే ఇష్టపడని వాళ్ళు బహుతక్కువని చెప్పోచ్చు.

అప్పట్లో నేను ప్రొద్దున్నే లేచి మా క్లాస్ టీచర్ దగ్గర మాథ్స్ ట్యూషన్ కి వెళ్ళేవాన్ని.ఆవిడ ఉండేది మా స్కూల్ దగ్గరే.ఏడవ తరగతి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని కూడా చదివేవాన్ని.ఒకసారి అలా ట్యూషన్ ముగించుకొని సైకిలెక్కి ఇంటిముఖం పట్టబోతూంటే మా మిత్రబృందం ' అలా చర్చ్ వరకు వెళ్ళొద్దాం రా రా ' అన్నారు.'దేనిక'ని అడిగా.'రాజేంద్రప్రసాద్ షూటింగ్ ఉందంట వెళ్ళొద్దాం' అన్నారు.వాళ్ళలో ఒకడు రాజేంద్రప్రసాద్ వీరాభిమాని(అతను నిజంగా రాజేంద్రుడి ఫ్యాన్ కాదేమో అని నేను మొదట అనుమానపడ్డాను.అప్పటిదాకా మేమంతా ఏ చిరంజీవి ఫ్యానో, బాలయ్య ఫ్యానో,నాగార్జున ఫ్యానో,వెంకీ ఫ్యానో అని విన్నవాళ్ళమే గానీ ఇలా వేరైటిగా రాజేంద్రప్రసాద్ ఫ్యాన్ అని చెప్పుకోవటాన్ని వినలేదు.అందరూ రాజేంద్రప్రసాద్ ని అభిమానిస్తారని,అతనికిష్టమైన హీరో వేరొకరుండొచ్చని,చెబితే నవ్వుకుంటామని ఇలా చెప్పాడేమో అనుకున్నాను.నా అభిప్రాయం తప్పని అతను నిజంగానే కేవలం రాజేంద్రప్రసాద్ అభిమానని తర్వాత తెలిసింది).

రాజేంద్రప్రసాద్ పేరు వినగానే నేను ఎగిరి గంతేశాను.అతనంటే నాకూ ఇష్టమే.'ఆహ నా పెళ్ళంట' సన్నివేశాలు ఇంకా మదిలో ఫ్రెష్ గానే ఉన్నాయి.మా సైకిళ్ళు చర్చి వైపు దారి తీసాయి.కాంపౌండ్ లోకి ప్రవేశిస్తూండగా ఒక తెల్లటి అంబాసిడర్ కారు మమ్మల్ని దాటుకుంటూ దూసుకుపోయింది.మా స్నేహితుడొకడు ఆయాసపడుతూ సైకిల్ తొక్కుతూనే 'ఆ కార్లో ఉన్నాడేమో రా' అన్నాడు."నీ మొహం.అది ఎవరి కారో ఏంటో ? అయినా రాజేంద్ర ప్రసాద్ ఈ కార్లో ఎందుకొస్తాడు ?" అన్నాడు వీరాభిమాని.
మొదటివాడు మాత్రం ఊరుకోలేదు.అందులో ఉన్నది రాజేంద్రప్రసాదే అని నిర్ణయానికి వచ్చేశాడు.మేము వారించేలోగా 'ఒరేయ్ రాజేంద్రా' అని అరిచేశాడు గట్టిగా .

అంతే ! ముందు వెళ్తున్న కారు కిటికీలోంచి రాజేంద్రప్రసాద్ తల బయట పెట్టి చూట్టం...నవ్వుతూ మమ్మల్ని రమ్మని సైగ చెయ్యటం జరిగిపోయాయి.

మాకు ఒక్కక్షణం మతి పొయ్యింది.'ఒరేయ్ గిరేయ్' అని వాగినందుకు మమ్మల్ని తిడుతారేమో అనుకున్నాం.మర్యాద లేకుండా మాట్లాడినందుకు మా స్నేహితుడి మీద కోపం వచ్చింది.అభిమాన హీరోని చూడబోతున్న ఆనందం ఒకవైపు, మందలిస్తారేమో అన్న భయం ఒక వైపు.సైకిళ్ళు నిలబెట్టి అలానే షూటింగ్ స్పాట్ కి వెళ్ళాం.

ఆ రోజు షూటింగ్ ఇంకా మొదలవలేదు.విశాలమైన చెట్ల నీడలో కొన్ని టేబుళ్ళు,వాటి మీద ఏవో కొన్ని గిన్నెలు,చుట్టూ కొన్ని కుర్చీలు అమర్చబడి ఉన్నాయి.మల్లెపువ్వు లాంటి తెల్లటి పొడుగు చేతుల షర్టు,పంచె కట్టుకొని ఓ కుర్చీ వైపు వెళ్తూ 'రండి పిల్లలు టిఫన్ చేద్దురు గానీ' అన్నారు రాజేంద్రప్రసాద్ చిరునవ్వుతో.సినిమా వాళ్ళలో ఒకతను 'ఒరేయ్ అంటారా' అని మమ్మల్నేదో అనబోయాడు.రాజేంద్రప్రసాద్ అతన్ని వారించి 'వాళ్ళంతా నా ఫ్యాన్సయ్యా' అన్నారు.

మాకు చాలా సంతోషం వేసింది.తనొక పెద్ద ఆర్టిస్టనే అహంభావం లేదు.నవ్వుతూ సరదాగా ఉండే మనిషి.'వద్దు సార్ ' అన్జెప్పి నోటుపుస్తకాల్లో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకున్నాం.
ఆటోగ్రాఫ్లిస్తూండగా తెల్ల చీర కట్టుకొని ఒక అమ్మాయొచ్చింది.పరిచయం ఉన్న మొహంలా కనిపించలేదు.అప్పటికి మాకెవరికీ సితార,జ్యోతిచిత్ర లాంటి పత్రికలు చదివే అలవాటు లేదు కాబట్టి ఆమెవరో తెలియలేదు.ఆవిడే కాదు,ఒక్క రాజేంద్రప్రసాద్ తప్పితే అక్కడ ఉన్న మిగతా సినిమాజనంలో ఎవరు ఆర్టిస్టులో,ఎవరు అసిస్టెంట్లో తెలియదు.ఆటోగ్రాఫ్ పొందిన ఆనందంతో మా ఛాతీలు ఉప్పొంగాయి.మేం వచ్చేశాం.

తర్వాత ఆ సినిమా షూటింగ్ చాలా సార్లు చూశాను.కొన్ని నెలల తేడాతో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్నే దక్కించుకొంది.

ఆ సినిమా 'చెట్టు కింద ప్లీడరు'.
ఆ అమ్మాయి హీరోయిన్ 'కిన్నెర'.

రాజేంద్రప్రసాద్ ని ఆ తర్వాత చాలాసార్లు చుశాను.'సీతాపతి ఛలో తిరుపతి ' సినిమా అయితే మా ఇంటిదగ్గరే తీశారు. వాణీవిశ్వనాథ్ ని చూడ్డానికి జనం ఎగబడ్డారు.మా నాన్నగారు ఆ సినిమాలో ఒక వేషం వెయ్యాల్సింది.కలెక్టర్ ప్రోగ్రాం ఉండటంతో కుదర్లేదు.

'స్నేహం' సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్, తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.వంశీ,జంధ్యాల,బాపు,రేలంగి నరసింహారావు,ఎస్వీ కృష్ణారెడ్డి,ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లలో ఎన్నో మరపురాని హిట్సందించారు.'ఏప్రిల్ 1 విడుదల(ఈ సినిమా పోస్టర్ చూసి,రిలీజ్ డేటేదో,సినిమా పేరేదో తెలుసుకోలేక తికమకపడ్డాను),ఆ ఒక్కటీ అడక్కు,

పెళ్ళిపుస్తకం,మిస్టర్ పెళ్ళాం,బృందావనం, మేడం,అప్పుల అప్పారావు,ఆలీబాబా అరడజను దొంగలు,కొబ్బరిబొండాం,రాజేంద్రుడు గజేంద్రుడు,మాయలోడు ' ఇలా బోల్డన్ని.ఒకవైపు కామెడీ హీరోగా ఏకచ్ఛత్త్రాదిపత్యం వహిస్తూనే 'ప్రేమతపస్సు', 'ఎర్రమందారం' లాంటి సినిమాల్లో నటించి తన నటనకు రెండు వైపులా పదునుందని నిరూపించుకున్నారు.పాత్ర ఏదైనా పండించగల ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. పాటలు పాడి,కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు.కొన్ని పొరపాట్లు చేసి అప్రధాన్య పాత్రలు సైతం వేశారు( శ్రీకాంత్ 'తాళి ',జగపతిబాబు 'చిలక్కొట్టుడు' లాంటివి).1996 నుంచి అనుకుంటాను ఆయన సినిమాలు వరుసగా పరాజయాల బాట పట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను.ఇటువంటి టాలెంటెడ్ హీరోని జనం మిస్సవ్వకూడదు అనుకున్నాను.అంతలో 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ' వచ్చింది.ఆ టైపు సినిమాలు కొన్ని వరుసగా వచ్చి(శ్రీరామచంద్రులు,సందడే సందడి)విజయం సాధించాయి.మళ్ళీ అపజయాలు.ఆ క్రమంలో కొంతగ్యాప్ తరువాత వచ్చిన ' ఆ నలుగురు ' మళ్ళీ నటకిరీటిని సత్తాని చాటింది.'మీ శ్రేయోభిలాషి ' కూడా మంచి ప్రయత్నమే.'క్విక్ గన్ మురుగన్' పర్లేదనిపించింది.

అందం,నటన రెండూ ఉండి దాదాపు ఒక దశాబ్దం పాటు(1985 లేడీస్ టైలర్ to 1996 వద్దు బావా తప్పు వరకు ) తిరుగులేని కామెడీహీరోగా వెలుగొందిన ఏకైక తెలుగు కథానాయకుడు రాజేంద్రప్రసాద్.మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు సైతం మానసికోల్లాసానికి ఆయన సినిమాలు చూసేవారంటే అంతకు మించిన అవార్డులు,రివార్డు ఏముంటాయి.రాజేంద్రప్రసాద్ ను పూర్తిస్థాయిలో రిప్లేస్ చేయ్యగల నటుడు ఇంకా తెలుగుసినీరంగానికి దొరకలేదు.భగవంతుడు ఆయనకు చిరాయువునిచ్చి మరిన్ని మంచి చిత్రాలలో నటింపజేసి మనల్నందరినీ అలరింపజెయ్యాలని ఆశిస్తూ...

ఒక అభిమాని.


(కొన్ని హాస్యసన్నివేశాలు)






వాల్మీకి ఉత్తరకాండకు, లవకుశ సినిమాకు గల తేడాలు


వాల్మీకి ఉత్తరకాండకు,మన ఎంటీవోడి లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి.వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ పొందుపరిచాను.
  1. 1.   శూర్పణఖ విభీషణుడికి అక్క.

  2. 2.   రావణ, కుంభకర్ణ, శూర్పణఖా, విభీషణులు కన్యాపుత్రులు.

  3. 3.   మయుని కూతురు మండోదరి. ఆయన కోరిక మేరకే రావణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మామా అల్లుళ్ళకు యుద్ధం జరగదు ('భూకైలాస్' గుర్తొచ్చిందా).

  4. 4.   రావణుడు అంటే కైలాసాన్ని ఎత్తలేక బాధతో రావాలు చేసినవాడని(అరచినవాడని) అర్థం. అతని అసలు నామధేయం దశకంఠుడు.

  5. 5.   సీతాదేవి రావణుడి ఇంటి దగ్గర పుట్టదు. ఆమె మొదట దొరికేది జనక మహారాజుకే.

  6. 6.   శూర్పణఖ భర్తను రావణుడే చంపేస్తాడు. అయితే అది అనుకోకుండా జరుగుతుంది.

  7. 7.   యమధర్మరాజుకి రావణుడికి యుద్ధం జరుగుతుంది. యముడు ఆగ్రహించి యమదండం విసరబోతాడు. యమదండానికి ఎటువంటివారినైనా సంహరించే శక్తి ఉంది. అలాగే రావణుడికి మానవుల చేతిలో తప్ప అన్యుల చేతిలో చావు లేదు. బ్రహ్మ కలుగచేసుకొని యమున్ని వారించి, అతని చేత యుద్ధాన్ని విరమింపచేసి తను ఇచ్చిన రెండు వరాలలో ఏదీ నిష్ఫలమవకుండా చూస్తాడు.

  8. 8.   ఒక్క చాకలే కాదు, అయోధ్యా ప్రజలందరూ 'రావణుడి చెరలో ఎంతోకాలం గడిపిన సీతను రాముడు తెచ్చి ఏలుకున్నాడ 'ని కారుకూతలు కూస్తారు.

  9. 9.   కుశలవులు (కుశుడు పెద్దవాడు) జన్మించినప్పుడు శతృఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉంటాడు. లవణాసురున్ని అంతమొందించటానికి వెళ్తూ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు. సీతాదేవిని పరామర్శిస్తాడు కూడా.

  10. 10.   రాముడు అశ్వమేధయాగం తలపెట్టినది నైమిశారణ్యంలో. అయోధ్యలో కాదు.

  11. 11.   కుశలవులకు రాముడికి/రామసైన్యానికి మధ్య ఎటువంటి యుద్ధం జరుగదు. వారిద్దరూ యాగాశ్వాన్ని పట్టి బంధించటం అన్నది కూడా జరుగదు. అశ్వమేధయాగం సంధర్భంగా విచ్చేసిన కుశలవులు రామకథ రమ్యంగా గానం చేస్తుంటే, రాముడికి అనుమానం వచ్చి,'మీ తల్లిని వెంటబెట్టుకొని రండి ' అంటాడు. మరుసటి రోజు వాల్మీకి సీతా,కుశలవులతో వచ్చి సీత పాతివ్రత్యాన్ని శ్లాఘిస్తాడు. యాగానికి హాజరైన జనులందరి ముందూ తన పాతివ్రత్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని శ్రీరాముడు సీతను కోరుతాడు. ఆ తరువాత జరిగేది మీకు తెలిసిందే.

  12. 12.   సీత పృథ్విలో ఐక్యమైన తరువాత కూడా రాముడు చాలాకాలం రాజ్యం చేస్తాడు. పదివేల అశ్వమేధయాగాలు పూర్తి చేస్తాడు.


వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


చాలా రోజుల తర్వాత ఉషశ్రీ రామాయణం చదివాను. ఎప్పటినుంచో ఆ పుస్తకం ఇంట్లో ఉన్నా తెలిసిన కథే కదా అని ఇన్నాళ్ళూ చదవడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆ మధ్య రామాయణం గురుంచి చర్చ వచ్చినప్పుడు వ్యవహారికంలో రామాయణానికి ఆపాదించబడ్డ చాలా విషయాలు మూలకథలో లేవని తెలిసింది. అప్పటి నుంచీ వాల్మీకి రామాయణం చదవాలని ఒకటే కోరిక. అయితే సరైన పుస్తకం ఏదీ అన్నదే ప్రశ్న. వెబ్ లో మైలవరపు శ్రీనివాసరావు గారు వ్రాసిన బాలకాండ చదివాను. ఎంతో చక్కగా ప్రతి విషయాన్ని, అందులోని భావాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారాయన. అది చదివాక 'మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ' అర్థమయ్యింది. ఇన్నాళ్ళూ సినిమాలలో చూపిందో, లేక చిన్న చిన్న పుస్తకాలలో చదివిందో(బాలల బొమ్మల రామాయణం లాంటివి) అసలైన రామయణం అనుకునేవాన్ని. ఆ భ్రమలు తొలగించుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవక తప్పదు అనిపించింది. ఉషశ్రీ రామాయణం దాని ఆధారంగా వ్రాసిందే కాబట్టి నిన్నా మొన్న కూర్చొని ఎకబిగిన చదివేశాను.రామాయణం యొక్క గొప్పదనం, అందులోని పాత్రల వైశిష్ట్యం తెలుసుకొని చాలా సంతోషం వేసింది.అలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఈ టపా.



  1. 1.   దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.

  2. 2.   దశరథుడికి కైకంటే చాలా ఇష్టం. పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి. కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది. రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.

  3. 3.   దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు. అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.

  4. 4.   తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు.రాముడు అదే వంశంలో పుడతాడు.

  5. 5.   రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య, కైకేయి, సుమిత్ర.

  6. 6.   బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు. భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు .

  7. 7.   క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు. వీరిని ఎవ్వరూ వివాహమాడరు. సంచార వృత్తి కలిగివుంటారు. వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం), కౌస్తుభం.

  8. 8.   అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది. అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక,ఆయన్ని పరీక్షించడానికి,నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు. ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు. అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు. ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం. శారీరక కలయిక కాదు. మోక్షమన్న మాటవినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య. ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు. అహల్యకు అప్పుడు సత్యం బోధపడి 'నువ్వు వెళ్ళిపో' అని వేడుకుంటుంది. ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి,అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు. ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది. ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు. అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు.అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.

  9. 9.   శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు. సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు. సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు. ఇంకొంతమంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు. అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలా నగరం వస్తారు. రాముడు ధనువునెక్కుపెట్టి విరిచేస్తాడు.

  10. 10.   రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు. శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.

  11. 11.   వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు. సీత వయసు ఐదేళ్ళు.

  12. 12.   పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది. జనకుడి రాజమందిరంలో కాదు.

  13. 13.   శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు. లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను,తండ్రిని నానామాటలంటాడు. భరతుడు తల్లిని మందలిస్తాడు.శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి,భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.

  14. 14.   వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25 సంవత్సరాలు.

  15. 15.   దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు. అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.

  16. 16.   నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది. రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి 'ఎవరు తండ్రి,ఎవరు తల్లి' అంటూ నాస్తికవాదం చేస్తాడు. దీన్ని శ్రీరాముడు నిరసించి,'మీవంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో' అంటాడు.

  17. 17.   సీతారామలక్ష్మణులు వనవాసంలో మాంసాహారం తిన్నారు.

  18. 18.   ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది. ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు. అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి,సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి, రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు. వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు. మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు. శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.

  19. 19.   జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు

  20. 20.   రావణుడు ఎడమచేత్తో సీత జుట్టుపట్టుకొని,కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.

  21. 21.   రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు. వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.

  22. 22.   వాలి మహాబలవంతుడు. తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి. అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది. చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.

  23. 23.   కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి (అవతార్ గుర్తొచ్చిందా). అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.

  24. 24.   అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.

  25. 25.   రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు.శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.

  26. 26.   యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.

  27. 27.   రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు,విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి, రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు. అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు, సూర్యున్ని ధ్యానించి బాణప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.


నేను కనుక్కున్న రహస్యం !!

సిద్ధార్థుడికి బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం అయినట్లు నిన్ననే నాకొక రహస్యం బోధపడింది.అదేంటంటే పుట్టిన ప్రతి మనిషీ కాస్త తీర్థం పుచ్చుకోక తప్పదు. తీర్థం అంటే గుళ్ళో ఇచ్చే తులసి తీర్థం కాదండోయ్.అక్షరాలా ఆల్కహాలే.ఆడైనా మగైనా ఎవరికైనా ఇది తప్పదు.అలాగని ఎవరూ తప్పించుకోనూలేరు.ఎంతంటి సంప్రదాయవాదులైనా,బిర్రబిగుసుకొని ఎంత మడిగట్టుకు కూర్చున్నా,'హరిహర బ్రహ్మాదులు సైతం నా చేత ఆ పని చెయ్యించలేర'ని భీషణ ప్రతిజ్ఞలు చేసినా మీకు తెలియకుండా మీరే కాస్త మందు పుచ్చుకొని వొళ్ళు తూలుతూంటే,గాల్లో తేలిపోవటం ఖాయం.

నాకైతే ఇది మొదటిసారి కాదు.

పెళ్ళికి ముందు కూడా ఒకసారి ఇలాగే దగ్గు వదలకుండా పట్టి పీడిస్తూంటే అప్పటి నా కాబొయే శ్రీమతి కోరిక మేరకు బెనిడ్రిల్ కాఫ్ సిరప్ తాగా(సామాన్యంగా జ్వరాలు,జలుబులు వస్తే నేను వెంటనే ఇంగ్లీషు మందులు వాడను.వీలైతే కాస్త గృహ వైద్యం చేసుకుంటాను.శరీరానికి కొంచెం తట్టుకొనే శక్తి ఉండాలని అలా చేస్తూంటానన్నమాట.ఇలాగే ఒకసారి జ్వరంతో వొళ్ళంతా చలిచలిగా ఉంటే,ముల్లుని ముల్లుతోనే తియ్యాలని, మా తమ్ముళ్ళతో కలిసి ఊరి చెరువులో మునకలేశాను.నా అదృష్టం బావుండి వెంటనే జ్వరం తగ్గిపోయింది).ఒక కప్ తాగితే తగ్గదేమోనని,రెండు మూడు కప్స్ తాగాను.ఆ రోజు రాత్రి లేట్ నైట్ బస్ పట్టుకొని తిరుపతి వెళ్ళాలి.ఇహ చూస్కొండి నా పరిస్థితి.ఒక వైపు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.ఇంకో వైపు వోళ్ళు సోలిపోతొంది.ఒక తాగుబోతులాగా నా రూం నుంచి లోంచి బయటపడి,వాలిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచిపెట్టుకొనే ప్రయత్నం చేస్తూ అపసోపాలు పడతా వచ్చి ఆటో లో కూర్చున్నాను.అలాగే బస్టాండ్ చేరుకొని బస్సెక్కి నా సీట్లో వాలిపోయి నిద్రపోయాను.తిరుపతిలో దిగి,ఇంటికెళ్ళి నిద్రపోయి మళ్ళీ లేచాక కూడా ఆ హ్యాంగోవర్ వదల్లేదు.

చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న అదే పరిస్థితి వచ్చింది.ఈ సారి కూడా వేడి పాలల్లో పసుపు మిరియాలపొడి కలుపుకొని తాగటం లాంటివి చేశాను కాని ఏమీ ఫలితం కనిపించలేదు.బెనిడ్రిల్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని మా ఆవిడ వేరొక దగ్గుమందిచ్చింది.బెనిడ్రిల్ కాదు కదా అని చెప్పి ఈ మందు కూడా రెండు మూడు కప్స్ గటగటా తాగేశాను.కళ్ళు బైర్లు కమ్మటం,వొళ్ళు పట్టుతప్పిపోవటం,రాత్రంతా పడుకుని లేచి ఆఫీసుకెళ్ళాక కూడా నిద్ర ముంచుకురావటం..ఇలా చరిత్ర పునరావృత్తమైంది.

ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే ఏ దగ్గుమందులోనైనా ఆల్కహాల్ ఉంటుందని.టేస్ట్ బావుంటుందని మూడు నాలుగు కప్స్ తాగితే ఒళ్ళు తూలటం తప్పదని.దీని సంగతేంటో తేల్చుకుందామనుకొని కొంతమంది మందుబాబులను కదిపితే వాళ్ళు చెప్పిందేమిటంటే బీరు బాటిల్లో కంటే దగ్గుమందులోనే ఆల్కహాల్ శాతం ఎక్కువుంటుందని.ఆల్కహాల్ వల్ల ప్రత్యక్ష లాభం లేకపోయినా,శరీరాన్ని రిలాక్స్ చేయ్యటం వల్ల దగ్గుకి ఉపశమనం దొరుకుతుందని దగ్గుమందులో వాడుతారట.

కాబట్టి పుట్టిన ప్రతి మనిషీ తాగక తప్పదు.ఆ మాటకొస్తే శైశవ దశలోనే మందు రుచి చూడక తప్పదు.ఇది అనివార్యం.భగవద్గీతలో చెప్పినట్లు 'ఇట్టి దాని గురుంచి శోకింప తగదు '.



బాలకృష్ణ - కె.విశ్వనాథ్ ల జననీ జన్మభూమి


రస్పర భిన్నధృవాలైన నందమూరి బాలకృష్ణ,కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం జననీ జన్మభూమి.బాలనటుడిగా తెరంగేట్రం చేసి అడపాదడపా స్వంత సినిమాలలో ప్రాధాన్యమున్న పాత్రలలో తళుక్కున మెరిసిన బాలకృష్ణ సోలో హీరోగా తన ప్రస్థానం ప్రారంభించాక వచ్చిన మూడవ సినిమా ఇది.ఒకరు కళాత్మక చిత్రాలను అందంగా ఆవిక్ష్కరించిన దర్శకుడైతే,ఇంకొకరు విశ్వవిఖ్యాతనటుడికి నటవారసుడైన మాస్ హీరో (నిజానికి అప్పటికి ఏ ఘనవిజయాలు బాలయ్య స్వంతం కాకపోయినా,ఎన్.టి.యార్ కున్న పుష్కలమైన మాస్ ఇమేజ్, కొడుకుగా అతనికీ సంక్రమించింది).ఇటువంటి వ్యక్తుల కలయికలో సినిమా అంటే సినీప్రియులు ఉట్కంఠతతో ఎదురుచూడటం సహజం.అయితే ఈ చిత్రం సాదాసీదాగా సాగిపోయి అటు అభిమానుల్ని,ఇటు సగటు ప్రేక్షకుడిని నిరుత్సాహపరుస్తుంది.అసలు వీరి కాంబినేషన్లో ఒక సినిమా ఉందనే విషయం కుడా చాలామందికి తెలియదంటే అందులో వింతేమీ లేదు.

సినిమా అక్కడక్కడా బావుంటుంది.ప్రధానంగా ఆత్మ లోపించింది.పాశ్చత్య పోకడలు వంటబట్టించుకుని,ఏ పనీ పాటా లేకుండా సరదాగా గర్ల్ ఫ్రెండ్(సుమలత)తో గడిపే ఓ బిజినెస్ మాగ్నెట్ కొడుకు(బాలకృష్ణ),పై చదువుల కోసం అమెరికా వెళ్ళి,పూర్తిగా మారిపొయి స్వదేశం వచ్చి తమ వ్యాపారాల్లో మోసాల వల్ల ఇక్కట్లపాలౌతున్న నిరుపేద కుటుంబాలలో చైతన్యం తీసుకొచ్చి,తండ్రి (సత్యనారాయణ)కళ్ళు తెరిపించడం చిత్ర ఇతివృత్తం.ముఖ్యంగా నిరుద్యోగులైన యువతీయువకులకు సందేశాన్నివ్వాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే కథనంలో లోపాల వల్ల అనుకున్న కార్యం నెరవేరలేదు.అల్లరి చిల్లరిగా ఉండే యువకుడు అమెరికా వెళ్ళి అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడన్నదానికి సరైన కారణం లేదు.విదేశీయులు సైతం తనదేశం గురుంచి గొప్పగా చెబుతూంటే విని మారిపోయానంటాడు హీరో.అక్కడే కథ తేలిపోయింది.తండ్రిలాగా కోడుకులు ఎక్కడ పూర్తిగా వ్యాపార ధోరణి అలవర్చుకుంటారో అని తల్లడిల్లే తల్లి(శారద),తన పెద్దకొడుకులో వచ్చిన మార్పుకి సంతోషించి,తండ్రి బాధ్యతలు చేపట్టేముందు, ప్రజల కష్టనష్టాలు తెలియాలంటే ఊళ్ళు చుట్టాలని సలహా యిస్తుంది.అలా జనరల్ కంపార్టుమెంట్ లో తన ప్రయాణం ప్రారంభించిన కథానాయకుడు ఒక పల్లెటూరు చేరుకొని,ఆ ఊరిని బాగుచెయ్యాలని నిర్ణయించుకోవడం,తనలాగే జులాయైన తమ్ముడికి(శుభలేఖ సుధాకర్) జ్ఞానోదయం కలిగించి అతనితో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొని చైతన్యం తీసుకురావడం,ఊరి ప్రజల ఆదరాభిమానాలతో పాటు ఒక చేనేత కార్మికురాలి(రాజ్యలక్ష్మి) ప్రేమను సంపాదించటం,తండ్రికి తనకి మధ్య జరిగిన పోరాటంలో తమ్ముడిని కోల్పోవటం ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు. చిన్నకొడుకు మరణంతో కుమిలిపోయిన తండ్రి తన తప్పు తను తెలుసుకోవటంతో సినిమా సమాప్తమవుతుంది.

ఈ సినిమాలో హీరోయిజం లేదు.హీరోయిజం అంటే డాన్సులు,ఫైట్లు కాదు.క్యారేక్టర్ ఎలివేషన్ లేదు.అలాగే ఏ గ్లామర్ లేని రాజ్యలక్ష్మిని ప్రధాన కథానాయిక చేసి,సుమలత ని సైడ్ హీరోయిన్ కి పరిమితం చెయ్యటం ఇంకో తప్పు.చెప్పదల్చుకున్న విషయమేదో పూర్తిగా చెప్పకపోవడం(చేనేత కార్మికుల సమస్యలు,నిరుద్యోగుల సమస్యలు,అసాంఘిక శక్తుల చేతిలో పడి వారు సృష్టించే విధ్వంసం)మరో తప్పు.బలమైన ప్రతినాయకుడు లేకపోవటం తప్పున్నర తప్పు.సత్యనారాయణ విలన్ అన్నట్లు చెబుతారు కానీ,అతని విలనిజాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు ఏమీ లేవు ఇంజనీర్లకు లంచాలివ్వడం తప్ప.గోకిన రామారావు పల్లెటూర్లో ఆకురౌడీ.అతనే శుభలేఖ సుధాకర్ చావుకు కారకుడవుతాడు.ఎంతో హోంవర్కు చేసి గాని సినిమా ప్రారంభించని కె.విశ్వనాథ్ గారు,ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇంకొంచెం పరిశోధన చేసివుంటే,వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చుండేవేమో.

సామాన్యంగా విశ్వనాథ్ గారి సినిమాలలో సంగీతానికి పెద్ద పీట వేస్తారు.ఈ సినిమాలో పాటలు కూడా అంతంతమాత్రమే.ఇక ప్రధాన తారగణం నటన పాత్రోచితంగా ఉంది.ముఖ్యంగా బాలకృష్ణ నటన విస్మయపరుస్తుంది.సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే అది బాలకృష్ణ నటన ఒక్కటే.ఎంతో కంట్రోల్డ్ గా ఉండే ఆయన హావభావాలు,ఆయన నటనలోని మరో కోణాన్ని చూపుతాయి.మిగిలిన సినిమాలలోని నటనంతా ఒక ఎత్తు,ఇందులోని నటన ఇంకొకెత్తు అన్నట్లుంటుంది.ఇప్పుడు మనం చూస్తున్న బాలయ్య వేరు,ఈ సినిమాలోని బాలయ్య వేరు అన్నమాట.తర్వాత వచ్చిన 'మంగమ్మ గారి మనవడు' కంటే ముందు ఈ సినిమా హిట్టైయ్యుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో.


సినిమాలోంచి ఒక సన్నివేశం ఇక్కడ.




బెంగుళూరులో అక్షరాభ్యాసం

క్షరాభ్యాసం!

అసలు ఆ ప్రక్రియే నాకు కొత్త !

దీని గురుంచి ఎవరో చెబితే వినటం,సినిమాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నది ఎప్పుడూ లేదు.మాది రాయలసీమ గ్రామీణ నేపథ్యమున్న కుటుంబం కావటమే అందుకు ప్రధాన కారణం.ఇటువంటి ఆచారాలు పట్టింపులు మా పల్లెటూర్లో లేవు.ఏ మూడేళ్ళకో,ఐదేళ్ళకో మొక్కుబడిగా బళ్ళో చేర్పించడం తప్ప,దానికోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాసం లాంటి పూజా కార్యక్రమాలు చెయ్యటం ఎవరికీ అలవాటు లేదు.అయితే ఇలాంటి పండుగకొకటి మా ఇంట్లోనూ జరిగితే బావుంటుందని నేను అనుకునేవాన్ని.మనకు అలవాటు లేకపోయినా,మంచి ఎక్కడున్నా స్వీకరించమని పెద్దలు చెప్పారు కదా.

ఆ రోజు రానే వచ్చింది.మా పాపకు అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నాం,బాసరలో కాకుండా,బెంగుళూరులో.బెంగుళూరులో సరస్వతీదేవి ఆలయాలు ఉన్నాయా,కనీసం చిన్న గుడైనా వుందా, ఉంటే ఎక్కడుందో చెప్పమని మా కోలీగ్స్ ని ఆరాతీశాను.మిత్రులు నాలుగైదు గుళ్ళ పేర్లు చెప్పారు కానీ,నా మనస్సు మాత్రం ఒక గుడి చుట్టునే పరిభ్రమించింది.

అది చామరాజపేటలోని శ్రీ శారదాంబ గుడి.శివాంశ సంభూతుడైన ఆదిశంకరాచార్యులు శృంగేరి లో స్థాపించిన శారదా పీఠానికి అనుబంధ శాఖ ఈ గుడి.అమ్మవారి విగ్రహం దివ్యంగా ఉంటుంది.అలంకరణ విశేషంగా ఉంటుంది.శారదాంబతో పాటు,ఆదిశంకరునికి కూడా ఓ ఆలయం ఉందిక్కడ.చారిత్రాతక ప్రాశస్త్యమున్న ఆలయశాఖలో అక్షరాభ్యాసం చేయిస్తే శుభప్రదంగా ఉంటుందని భావించి అక్కడే చేయించాము.

లింకు

ఆక్షరాభ్యాసం చేయించాలనుకున్నవారు ముందుగా గుడికి వెళ్ళి,శారదాంబ ఆలయంలోని పూజారిని కలిసి తమ పిల్లల జన్మనక్షత్రాలు చెప్పి,వాటికి అనుకూలమైన మంచి రోజు చెప్పమని అడగాలి.ఈ వివరాలు ఫోన్లో వెల్లడించరు.పంచాంగం చూసి ఆయనొక తేదీ నిర్ణయించాక ఆలయ ప్రాంగణంలో ఆ తేదీకి టికెట్ కొనుక్కోవాలి.ధర 100 రూపాయిలు.టికెట్ తో పాటూ పూజకు కావల్సిన సరంజామా ఏంటొ ఒక లిస్టు యిస్తారు నిర్వాహకులు.ఆక్షరాభ్యాసం రోజు ఆ సామాన్లన్నీ పట్టుకొని అలయానికి హాజరైతే,మనం యిచ్చిన టోకెన్ల ప్రకరం పూజ నిర్వహిస్తారు.అరగంటసేపు పూజ కొనసాగుతుంది.రెండేసి జంటలను గర్భగుడి పక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తారు.మగవారు పంచెకట్టులోను(బనియన్ కి కూడా మినహాయింపు లేదు),ఆడవారు చీరలోను రావాలి.ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటారు.లిస్టులో ఇచ్చిన పూజాసామగ్రి మొత్తం మీరు తీసుకెళ్ళకపోయినా,దక్షిణ కొంచెం తక్కువైనా ఎవరూ కోపగించుకోరు.ఉదయం 8-11 వరకు,సాయంత్రం 5-8 వరకు పూజారులు అందుబాటులో ఉంటారు.

శారదాంబ ఆలయానికి పక్కనే శృంగేరి పీఠం వారి బుక్ ట్రస్టుంది.ఆధ్యాత్మిక పుస్తకాల పట్ల అభిరుచి గల పాఠకులకు అక్కడ అనేక పుస్తకాలు లభ్యమవుతాయి.

చామరాజపేటకు మెజస్టిక్ నుంచి చాలా బస్సులున్నాయి.అక్కడినుంచి ఆటోలో వెళ్ళినా 20 రూపాయిల కంటే ఎక్కువ కాదు.


పులి (వాటర్ పెయింటింగ్)


ది నేను ఇంటర్మీడియట్లో ఉండగా వేసిన బొమ్మ.'ఈనాడు' ఆదివారం మ్యాగ్ జైన్లోని ఫోటో ని చూసి చిత్రించిన చిత్రం ఇది. వేరొక పుస్తకంలో రఫ్ గా వేసుకొన్న నా ఫోటో స్కెచ్ ని మా నాన్నగారు కట్ చేసి ఈ పెయింటింగ్లో ఇరికించి ఫ్రేం చేయించారు.


తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వేలి - ఉగాది మ్యాగ్ జైన్లో నా కవితలు

పాత కవితలే అయినా మళ్ళీ ప్రచురించిన రవి పొట్లూరి గారికి నా కృతజ్ఞతలు.'తపస్వీ కళ్ళుతెరు' కవితలో చివరి రెండు వాక్యాలు 'ఆమె' కవితకు సంబంధించినవి.

Kavitalu


భేతాళ ప్రశ్నలు


చాన్నాళ్ళ తర్వాత నా బాల్యమిత్రుడు దివాకరం హైదరాబాద్ వచ్చాడు.కోల్ కత్తాలో ఉద్యోగం.ఏదో పని మీద హైదరాబాద్ వచ్చి పొద్దున్నే ఫ్లైటు దిగేశాడు.వారం రోజులు ముందే వస్తున్నానని చెప్పేశాడు కాబట్టి తప్పించుకోడానికి వేరే దారిలేక శంషాబాద్ దాకా కారులోపోయి అతన్ని రిసీవ్ చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చాను.

దివాకరం సత్తెకాలపు మనిషి.తనేదో,తనపనేదో అన్నట్లు ఉంటాడు.బాహ్య ప్రపంచంతో తనకెంత అవసరమో అంత మేరకే సంబంధబాంధవ్యాలు పెట్టుకొని,మిగతా సమయాల్లో,శత్రుభయం కలిగినప్పుడు డిప్పలోకి శరీరాన్ని లాక్కొనే కూర్మంలా తన లోకంలోకి జారిపోతాడు.ఆ తర్వాత,ఇల్లు కూలిపోతున్నా,ప్రపంచం తలక్రిందులైపోతున్నా అతనికి పట్టదు.పట్టించుకోవాలన్న ఆసక్తి ఉండదు.అంచేత కరెంట్ అఫైర్స్ లో కొంచెం వీకే.

స్నానాలు చేసి,టిఫన్లు గట్ర ముగించాక 'బ్రేవ్' మని తేంచి
"ఊళ్ళో మాంచి సినిమా ఎదైనా ఉంటే చెప్ప రా, చూసి చాన్నాళ్ళయ్యింది.వెళ్దాం" అన్నాడు హఠాత్తుగా.

నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.
"సినిమానా..ఇప్పుడా?..కుదరదు" అన్నాను తమాయించుకొని.

"అవున్లే.అసలే ఎండలు మండిపోతున్నాయి.దానికి తగ్గట్లు ఇప్పుడొచ్చే సినిమాల్లో కొత్తదనం ఉండటం లేదు.రోట్లో తలదూర్చి రోకలిపోటుకి ఏడవడమెందుకు? చల్లగా ఇంటిపట్టునే ఉండి సాయంత్రం అలా టాంక్ బండ్ వైపో రవీంద్రభారతి వైపో వెళ్దాం.కాస్త కాలాక్షేపం గా ఉంటుంది."

"అదీ కుదరదు !"

"అదీ కుదరదా? అదేమిట్రా అలా అంటావ్? హఠాత్తుగా ఊడిపడి నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా ?"

"ఎంతమాటనేశావ్ రా! స్నేహగుణంలో కర్ణుడి లాంటి వాన్ని.నన్నే శంకిస్తావా?"

"శంకించక ఏం చెయ్యమంటావ్? ఆర్నెళ్ళ క్రితం హైదరాబాదు వస్తే అప్పుడూ ఇలానే అన్నావు.ఇప్పుడూ అదే అంటున్నావ్.మళ్ళీ కర్ణుడినంటూ కబుర్లు.అసలు నీకు నాతో సరదాగా సమయం గడపాలనుందా లేదా?"

"అదా నీ అనుమానం.ఏం చెయ్యమంటావ్రా బాబు? మా ఖర్మ అలా తగలడింది.అప్పుడేమో మాహానుభావుడు చిదంబరం నిప్పురాజేశాడు.రోజు మార్చి రోజు బందులతో సతమతమయ్యి చచ్చాం.తుమ్మితే బందు,దగ్గితే బందు.వాళ్ళకేం దుక్కలా పుష్టిగా బానే ఉంటారు.కూలీనాలీ చేసుకునే కార్మికులే మధ్యలో ఖర్చైపోతున్నారు.ఇప్పుడేదో కాస్త ప్రశాంతంగా ఉందనుకుంటే ఓదార్పుయాత్రల వల్ల మళ్ళీ బందులు మొదలయ్యాయి."

"ఓదార్పుయాత్రా? తీర్థయాత్రలు,దండయాత్రలు విన్నాం కానీ ఈ ఓదార్పుయాత్ర ఏంట్రా,ఎప్పుడూ వినలేదు."

"నువ్వే కాదు,మొన్నటిదాకా ఎవరూ వినలేదు.ఇదో కొత్తసీసాలో పాతసారాయి టైపు కాన్సెప్టు లే.దుఃఖం లో ఉన్న వాళ్ళని ఓదార్చి రావటం,వీలైతే వాళ్ళకేదైనా నష్టపరిహారం ఇవ్వడం అన్నమాట.చెప్పుకోడానికి సింపుల్ గానే ఉన్నా, ఆచరణలో మాత్రం ఇందాక నువ్వు లిస్టు చేసిన రెండు యాత్రలలో,రెండో దానికి కాస్త దగ్గరగా ఉంటుంది."

"అంతా అయోమయంగా ఉంది.దుఃఖం లో ఉన్న వాళ్ళని ఓదార్చి రావటామా? ఎవరు దుఃఖంలో ఉన్నారు? ఎవరు ఓదారుస్తున్నారు? కాస్తా అర్థమయ్యేలా చెప్పరా బాబు"

"ఇదిగో ఇదే నీతో వచ్చిన చిక్కు.మునీంద్రుడిలా ముక్కుమూసుకొని నీ లోకంలో నువ్వు తప్పస్సు చేసుకోకుండా అప్పుడప్పుడూ జన జీవనస్రవంతిలోకి రా.అన్ని విషయాలూ అవగతమవుతాయి.నాకీ కంఠశోష తప్పుతుంది.ప్రస్తుతానికి తప్పదు కాబట్టి ,చెప్తాను విను.పొయిన సంవత్సరం సెప్టంబరులో జరిగిన ఘోర ప్రమాదంలో వైయస్సర్ దుర్మరణం పాలయ్యారు కదా ?"

"అవున్రా పాపం.అంత అర్థాంతరంగా పోతారని ఎవరూ ఊహించలేదు."

"మరే.'అయ్యో! ఇలా జరిగిందేమిట'ని అప్పుడు అంతా బాధపడ్డారు.తట్టుకోలేని అభిమానులు గుండెలాగిమరణిస్తే,ఇంకొంత మంది ఆత్మహత్య
చేసుకున్నారు.కూలీనాలీ చేసుకునే శ్రామికుల దగ్గర్నుంచి కార్లలో తిరిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దాక,అనకాపల్లి నుంచి అమెరికా దాక ఇదే తంతు అనుకో."

"జనాదరణ ఉన్న నాయకుడు కదా,హఠాత్తుగా పోయేసరికి జీర్ణించుకోవడం కష్టమయ్యుంటుంది.అయినా నీ పిచ్చిగానీ అభిమానానికి ఎల్లలేమిట్రా?"

"నిజమే.ఆ అభిమానం శృతిమించే ఆరొందల మంది ప్రాణాలు కోల్పోయారు."

"ఆరొందల మందే !!!!"

"అవున్రా.పదో పరకో కాదు,యాభైయ్యో వందా కాదు.అక్షరాలా ఆరొందల పైచిలుకు మంది అశువులు బాసారు !".

"ఏంట్రా నువ్వనేది ?! మనుషులనుకున్నావా,పిట్టలనుకున్నావా? అరోందల మందేంటి,ఉట్టి పుణ్యానికి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? గాంధీ నెహ్రూ లాంటి దేశనాయకులు,మదర్ థెరీసా లాంటి మనవతామూర్తులు చనిపోయినప్పుడే అంతమంది మరణించలేదు.వినడానికే విడ్డూరంగా ఉంది.యావరేజి సినిమాకి చూపించే హైప్డ్ కలెక్షన్స్ లా ఉన్నాయి ఈ లెక్కలు.నిజంగా అంతమంది పోయారంటావా?"

"ఇదిగో నువ్వలా భేతాళ ప్రశ్నలు వేస్తే నేను చెప్పనంతే."

"బాబ్బాబు.అంత మాటనకు."

"అయితే విను.తండ్రి కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసిన వీరాభిమానుల్ని చూసి జగన్ మనస్సు క్షోభించింది.చనిపోయిన ఆభిమానుల కుటుంబాలనన్న్నిటినీ పరామర్శించి,వాళ్ళను ఓదార్చి,బుగ్గలు నిమిరి,ఆత్మవిశ్వాసం నింపిరావాలని కంకణం కట్టుకున్నారు.అందుకే ఈ ఓదార్పుయాత్ర.ఎండా వానా లెక్కచెయ్యని మొండి బాటసారిలా గత వారం రోజులుగా ఆయన ఊళ్ళన్నీ చెడామడా తిరిగేస్తున్నారు.
అందులో భాగాంగా తెలంగాణలో అడుగుపెట్టారు."

"తండ్రికి తగ్గ తనయుడన్నమాట.మంచిదే కదా ?!"

"ఏం మంచో ఏమో కానీ,గిట్టని వాళ్ళు చాలా అనుకుంటున్నారు."

"గిట్టని వాళ్ళెప్పుడూ ఏదో ఒకటి అంటార్లే.లోకులు కాకులు అన్నారు కాదా.ఏమనుకుంటున్నారింతకీ ?"

"ఏముంది? 'ఓదార్పుయాత్రకింత మందీ మార్బలం దేనికి? హంగామా,మీడియా కవరేజి దేనికి? రాజకీయ ప్రసంగాలు దేనికి? ఇది ఓదార్పుయాత్రా,ఎన్నికల పర్యటనా? నిజంగా ఓదార్చాలనుకున్న వాళ్ళెవరూ ఇంత పబ్లిసిటీ ఇచ్చుకోరు.
ఓదార్చాలనుకున్నవాడు తన స్థాయికి తగ్గట్టు ఏ విమానంలోనో, హెలికాప్టర్లోనో, అధమపక్షం స్వంతవాహనాల్లోనో రాక,ఇలా రైలుపెట్టెల్లో తిరిగి,సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులపాలు చెయ్యడం దేనికని' చెవులు కొరుక్కుంటున్నారు."

"పాయింటే!అయితే దానికీ,తెలంగాణకీ,ఇప్పుడీ బంద్ కీ సంబంధం ఏమిటి? "

"అక్కడికే వస్తున్నా.జగన్ సమైక్యవాది కదా.తెలంగాణలో వచ్చి ఆయన ఓదార్పేదో ఆయన చేసుకోకుండా ఎక్కడ సమైక్యవాదాన్ని ప్రచారం చేస్తాడో అని తెలంగాణవాదులు భయపడుతున్నారు.ప్రత్యేక తెలంగాణ కోసం టీఆరెస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు బోలెడన్ని నిరాహారదీక్షలు,ధర్నాలు చేసి రాజీనామాలు చేసేశారు కదా."

"తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి టీఆరెస్ రాజీనామాల కేంలే.పదవిలో ఉండి వాళ్ళు పొడిచిందేమీ లేదు.కార్మికశాఖా మంత్రిగా కేంద్రంలో కేసియార్ నిర్వాకం చుశాం కదా.తప్పిపోయాడని వాళ్ళ పార్టీ వాళ్ళే పోలీస్ స్టేషన్లో రిపోర్టులిచ్చుకున్నారు.వాళ్ళ సంగతి చెప్పకు.నిరాహార దీక్షలు,ధర్నాలు అంటున్నావు.ఎవరైనా పోయారా?"

"నాయకులెవరూ పోలేదు కానీ,విద్యార్ధులు చాలా మంది అత్మహత్యలు చేసుకున్నారు"

"అరెరె...విద్యార్థులు చనిపోయారా? కామన్ సెన్స్ ఉన్నవాడెవడు కేసియార్ ని నమ్మడే.వాళ్ళెలా ఈ చట్రంలో ఇరుక్కున్నారు ?"

"పిచ్చివాడా! ఏ ఉద్యమంలోనైనా బలిపశువులయ్యేది కార్యకర్తలు,విద్యార్థులే.పథకం రూపొందించటం నాయకుల వంతైతే,ఆ నాయకుల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ కోసం,జీవితాలని పణంగా పెట్టేది కార్యకర్తలూ,విద్యార్థులే.తన అస్థిత్వం నిలుపుకోవడం కోసం కేసియార్ మొదలుపెట్టిన రాజకీయ డ్రామా,విద్యార్థుల రంగప్రవేశంతో సీరియస్నెస్ సంతరించుకొని ఇప్పుడు అతన్నే ధిక్కరించే స్థాయికి చేరుకొంది.
విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచి కావల్సిన విద్యారంగం బ్రష్టుపట్టిపోయింది.కోదండరాం లాంటి ప్రొఫెసర్లు,లెక్చరర్లు ఉన్నవీ లేనివి చెప్పి విద్యార్థుల భావావేశాలు రెచ్చగొట్టి, నిస్సుగ్గుగా వినోదం చూస్తున్నారు."

"ఏమిటేమిటీ ? గురువులే ఉన్నవీ లేనివీ చెప్పి విద్యార్థులను ఉసిగొల్పుతున్నారా? ఏం చెబుతున్నారు?"

"చాలా చెబుతున్నార్లే! మచ్చుకొకటి.తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయట."

"అదెలా సాధ్యం? తెలంగాణా వారికే ఉద్యోగం ఇవ్వాలనుకున్నా ఇప్పుడు తెలంగాణ జనాభా ఎంత? వాళ్ళలో తాతముత్తాతల కాలం నుంచీ తెలంగాణలో ఉంటున్నదని ఎందరు? వలసవాదులెంతమంది? ఉన్న ప్రభుత్వోద్యోగాలు ఎన్ని? తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులని ఏం చెయ్యమంటున్నారు కదా,మరి వాళ్ళ ఉద్యోగాల సంగతేంటి? అసలిది జరిగేపనేనా ?"

"చంపావు ఫో! అన్ని తెలివితేటలు ఎవరికి ఏడ్చాయి.ఎవడి అజెండా వాడు విద్యార్థుల మీదకు రుద్దుతున్నాడు.శివాలెత్తిన విద్యార్థులు విచక్షణాజ్ఞానం కోల్పోయి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు.ప్రజాప్రతినిధుల్ని రాజీనామా చెయ్యమని బెదిరిస్తున్నారు"

"ఇంతకీ అసలైన వాళ్ళు రాజీనామా చేశారా? "

"అసలైన వాళ్ళా ? వాళ్ళెవరు ? "

"తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులుగా తమను తాము గ్లోరిఫై చేసుకున్నకోదండరాం,ఆయనతో పాటూ ఉద్యమాలు చేస్తున్న ఇతర ప్రొఫెసర్లు,లెక్చరర్లు"

"లేదు"

"మరి ఏ అర్హతతో ఇతరులను రాజీనామా చెయ్యమని బెదిరిస్తున్నారు? ఇతరులకు చెప్పడానికేనా నీతులు?"

"నీ బుర్రకివాళ ఏదో అయిందిరోయ్."

"జగన్ విషయం మధ్యలోనే వదిలేశావు."

"వదిలేయ్యలేదు.అది చెబుతూంటేనే యక్ష ప్రశ్నలతో నువ్వు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశావు.టీఆరెస్ నాయకులంతా రాజీనామాలు చేసేశారు.ఇతరులెవ్వరూ తమకు ఎదురుగా పోటికి నిలబడరాదని,నిలబడితే తెలంగాణా ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.వేరుపడాలన్న కాంక్ష ప్రజల గుండెల్లో బలంగా రగులుతున్నంతవరకూ
వాళ్ళ ఆటలు సాగుతాయి.ఆ మంటలు చల్లారిపోకుండా అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ పైనో,థియేటర్ల పైనో, లేక కాలేజీల పైనో దాడి చేసి ప్రజల్ని రెచ్చగొడుతూంటారు.త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఇలాంటి సమయంలో జగన్ వచ్చి సమైక్యవాదం ప్రచారం చేస్తే,జనాల మనస్సు ఏకొంచెమైనా మారితే, తమ పని రెంటికీ చెడ్డ రేవడి లా తయారవుతుందని అతని ఫ్లెక్సీలు,బ్యానర్లు దగ్ధం చేసి,రావటానికి వీళ్ళేదని అల్టిమేటం జారీ చేశారు."

"ఇదేం అన్యాయంరా ? తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అక్కడికి వెళ్ళడానికి పాస్ పోర్టు,వీసా కావాలా? దేశంలో ఎక్కడైనా,ఎప్పుడైనా తిరిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది.తెలంగాణవాదులు సీమాంధ్రలలో పర్యటించి తమ వాదాన్ని ప్రచారం చేసుకోవచ్చు.సమైక్యవాదులెవరైనా తెలంగాణ వచ్చి తమ గోడు వెల్లబోసుకోవచ్చు.

కాదనడానికి వీళ్ళెవరు? వీళ్ళకేం హక్కుంది? సినిమా షూటింగ్స్ పైన,కాలేజీల పైన దాడి చెయ్యడమేంటి? సినిమాలు రిలీజైతే థియేటర్ల మీద పడటం ఏంటి? చూడాలనుకున్న వాడు సినిమా చూస్తాడు.ఇష్టం లేనివాడు ఇంట్లో కూర్చుంటాడు.మధ్యలో వీళ్ళ పెత్తనమేమిటి? అంటే సినిమాలు చూస్తేనో,ఫలానా కాలేజిలో చదువుకుంటేనో తెలంగాణా ఉద్యమం నీరుగారిపొతుందా? అంత బలహీనమైనదా ఉద్యమం ? అటువంటప్పుడు దాన్ని మొయ్యటం దేనికి? ఇతరులెవ్వరు ఎన్నికల్లో పోటీ చెయ్యరాదా ? ఏం పోటికి దిగితే గెలవలేమని భయమా? ఇంత జరుగుతూంటే లాయర్లు,పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎలా చూస్తూ కూర్చొంది?"

"ఒరెయ్ ఒరెయ్ అంతలా ఆవేశపడకు.నిదానించు.వ్యవస్థను సమూలంగా పెల్లగించేసే ప్రాథమిక ప్రశ్నలే లేవదీశావు కానీ నా దగ్గర జవాబులు లేవు.లాయార్లు,పోలీసులు మాత్రం మనుషులు కారా? వాళ్ళకూ ఇష్టాయిష్టాలు ఉండవా? ప్రభుత్వమా? భలేవాడివే.ఆయనే ఉంటే మంగలి దేనికని ప్రభుత్వమంటూ ఒకటేడిస్తే ఈ దుస్థితి దేనికి? నిన్న జరిగిన ఓదార్పుయాత్రలో తెలంగాణవాదులు,జగన్ వర్గీయులు ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటే,పదుల సంఖ్యలో నిలిచిపోయిన ట్రైన్లలో తిండీ నీళ్ళు దొరక్క అమాయకజనం అలమటించిపోయారు.కొంతమందికి బుల్లెట్ దెబ్బలు తగిలి విలవిలలాడిపోయారు.జగన్ కారణంగా గొడవలు జరిగి జనం గాయపడ్డారని ఇటు తెలంగాణలో,జగన్ ని అరెస్టు చేశారని అటు సీమలో బలవంతంగా బంద్ చేయిస్తున్నారు.కొంతమంది రైళ్ళకు నిప్పు పెట్టారు.ఇట్లాగే గత డిసెంబరులో,అటు తెలంగాణలో,ఇటు సీమాంధ్రలో, బస్సులు ధ్వంసం చేసి నిప్పు పెడితే,నష్టాలు పూడ్చుకోలేక ఆర్టిసీ రేట్లు పెంచి ప్రజల నడ్డివిరిచింది.ధ్వంసం చేసిందెవరు,శిక్ష అనుభవిస్తున్నదెవరు ?ఎవరు చేసుకున్న పాపం ఇది ? "

"దారుణం! అసలిది ప్రజాస్వామ్యమా లేకా నిరంకుశత్వమా ? ఆపత్కాలంలో నిజానిజాలు వెలికితీసి ప్రజలకు సత్యం బోధపరచి చైతన్యవంతుల్ని చెయ్యాల్సిన మీడియా ఏం చేస్తోంది ? "

"సరిపోయింది.అడగాల్సిన దాని గురుంచే అడిగావులే.మీడియా అంటేనే మాయాజాలం.నిజాన్ని నిర్భయంగా వెల్లడించే రోజులు ఎప్పుడో పోయాయి.

ఇప్పుడున్నదంతా స్వార్థం.ఒకళ్ళ మీద ఒకరికి బురదజల్లుకోడానికే తీరిక లేదు,ఇక వార్తలు సేకరించేదెవరు? ఏ వార్తయినా ఒకేవిధంగా అన్ని పేపర్లలోనూ,ఛానళ్ళలోనూ రావడం చూశావా? ఒక్కోక్కరిది ఒక్కో వర్షన్. ఏది నిజమో,ఏది అబద్ధమో ఎవడికి తెలుసు? "

"వ్యవస్థలన్నీ నాశనమైపోయాయన్నమాట.లాభం లేదు. నాకొక్కటే ఉపాయం కనిపిస్తోంది."

"ఏమిట్రా అది?"

"తాటిమట్ట లాంటి నాలుకలతో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే నాయకులను,వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్టు చేసి జైల్లో వెయ్యాలి.విద్యార్థుల ఉద్వేగాలతో ఆడుకుంటూ ఉద్యోగాలు చేసుకునే లెక్చరర్లను,ప్రొఫెసర్లని విధుల నుంచి తొలగించి ఇతరులతో రిప్లేస్ చెయ్యాలి.రాష్ట్రంలో నిరుద్యోగం ఆ విధంగానైన కొంత తగ్గుతుంది.ఇక ప్రభుత్వ ఆస్తులను,ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే,కఠిన కారాగార శిక్ష విధించి,నష్టపరిహారం నిందితుల దగ్గర్నుంచే ముక్కుపిండి వసూలు చెయ్యాలి.ఉద్యమాలంటూ ఉన్మాద ప్రవృత్తితో ప్రవర్తించే విద్యార్థులను రెండు మూడు వార్నింగులిచ్చి,రిపీటయితే కళాశాల నుంచి డీబార్ చెయ్యాలి.కళాశాలలు సంఘవిద్రోహ శక్తులకు వసతిగృహాల్లా మారిపోకుండా డేగకళ్ళతో పర్యవేక్షించాలి."

"ఒరేయ్ ఒరేయ్ నన్ను కాస్త ఊపిరిపీల్చుకోనియ్యి.ఇదంతా చెబుతోంది నువ్వేనా? ఏమీ పట్టనట్లుండే నీలో ఇంతటి ఆవేశమా ?"

"ప్రజలు కూడా నాలాంటి వాళ్ళేరా.వాళ్ళు కూడా అన్నీ గమనిస్తూ మౌనంగా ఉంటారు.సహనం నశించి తిక్కరేగితే మెత్తటి చెప్పుతో గట్టిగా బుద్ధిచెబుతారు"

"ఏదో నీ తాపత్రయం కానీ,ఆ రోజొస్తుందంటావా?"

"రాకపోతే మన రాష్ట్రం ఇంకో పాతికేళ్ళు వెనక్కిబడిపోయి,బీహార్ లా తయారవుతుంది."

"సర్లే! మాంచి వేడిమీదున్నట్లున్నావ్.టీవీ పెడతాను.కొంచెం చల్లబడు"

"ఆగాగు.ఏంటో బ్రేకింగ్ న్యూసట.స్క్రోలింగ్ వేస్తున్నారు...సరిగ్గా కనిపించడం లేదు"

"మరేం లేదు.జగన్ ఓదార్పుయాత్ర రద్దయిందని తెలిసి గుండె ఆగి కొంతమంది అభిమానులు మరణించారట..అరె..అదేమిట్రా అలా కూలబడిపోయావ్.ఏమయింది? "

" ఉన్నట్లుండి గుండె పట్టేసినట్లుంది."

"గుండెలో పట్టేసిందా! ఒక్క నిమిషం ఓపికపట్టరోయ్.యువ ఎంపి గారి ఓదార్పు లిస్టు అప్డేటు చెయ్యాలి.సమయానికి నా మొబైల్ ఫోను ఎక్కడ చచ్చిందో ఏంటో"

"హతోస్మి!! "


వక్రతుండం మహాకాయం (వాటర్ పెయింటింగ్)


ఫ్రేం పగిలిపోయింది మధ్యలో.


యండమూరి వీరేంద్రనాథ్ - ప్రేమ


నభైలలో అనుకుంటా,ఆంధ్రభూమి వారపత్రిక నలుగురు లబ్దప్రతిష్ఠులైన రచయితల(త్రుల)తో 'ప్రేమ' అనే నవలకు శ్రీకారం చుట్టింది. అలాగని ఇది గొలుసునవల కాదు. నలుగురూ భిన్న కథాంశాలు ఎన్నుకొని, ప్రేమని ఎలివేట్ చేస్తూ, అదే పేరుతో నవల వ్రాయాలి. ఎవరి కథలు వారివే అన్నమాట. అలా వ్రాసిన నవలే ఇది. ఆ నలుగురిలో నాకు గుర్తున్నదని ఇద్దరు. ఒకరు యద్దనపూడి, ఇంకొకరు యండమూరి. ప్రేమ మీద యండమూరి చేసిన రచనలలో సాదాసీదాగా అనిపించిన రచన ఇది.

కథ

వేదసంహిత అనే అందమైన అమ్మాయి అద్దె ఇల్లు కోసం ఆదిత్యపురం అనే గ్రామానికి రావటంతో కథ ప్రారంభం అవుతుంది.అంత అందమైన ఒంటరి ఆడపిల్లకు ఆశ్రయం ఇవ్వటానికి అంతా సందేహిస్తే,చలం అనే యువకుడు ఆమె అందానికి ముగ్ధుడై అమె పల్లెటూళ్ళో రీసెర్చ్ చెయ్యటానికి వచ్చిందని అబద్ధం చెబుతాడు.సోమయాజులు దయతలచి తన ఇంట్లో ఆమెకు చోటు కల్పిస్తారు.


చలం ఆమెను మూగగా ప్రేమిస్తూంటాడు.సోమయాజులు గారి కూతురు భారతి.ఒకరోజు అందరూ పొలాల్లో సంతోషంగా గడుపుతున్న సమయంలో,హఠాత్తుగా భారతి జలగ బారిన పడుతుంది. ఏం చెయ్యలో పాలుపోక అందరూ వృధా ప్రయత్నాలు చేస్తూంటే,అరుణ్ అనే యువకుడు వచ్చి ఆమెను రక్షిస్తాడు.వేదసంహితతో అతనికి పరిచయం కలుగుతుంది.అతను అంత్రోపాలజీలో మాస్టర్స్ చేసివుండటంతో వారి మధ్య కబుర్లు పెరిగి ఊళ్ళో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.ఇద్దరూ కలిసి పని మీద ఒకరోజు పట్నం వెళ్తారు.సంహిత అరుణ్ కి తెలియకుండా తన నగలు కుదువపెట్టబోతుంటే, అతను వారించి ఆమె నగలు ఆమెకు ఇప్పిస్తాడు.వారిద్దరూ కలిసి తిరగడం చూసి చలం ఊక్రోషానికి గురవుతాడు.తన ప్రేమను వెల్లడి చేస్తాడు.సంహిత షాకయ్యి తను వివాహితురాలని చెబుతుంది.ఒక వ్యక్తి మీద,ఒక వ్యవస్థ మీద తను వ్రాసిన థీసిస్ అతని చేతిలో పెట్టి అది చదువమంటుంది.చలం కొయ్యబారిపోతాడు.ఓ సాయంత్రం సంహిత కాఫీ తేవడానికి వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన ఉత్తరం చదువుతాడు అరుణ్.ఆమె అతనితో గొడవేసుకుంటుంది.ఆమె మీద తనకున్న వ్యామోహాన్ని వ్యక్తం చేస్తాడు అరుణ్.వాదులాట జరిగి కోపంతో వెళ్ళిపోయిన అతను,ఆమె మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తాడు.


అభిషేక్ ఆదిత్యపురం వస్తాడు.వేదసంహిత భర్తగా అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు చలం. అభిషేక్ మెక్సికో దీవుల్లో స్థిరపడ్డ భారతీయ సంతతి డాక్టర్. అపాచి తెగకు నాయకుడు. చట్టబద్ధంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారవుతాడు. అతన్ని వదిలించుకోవాలని ప్రభుత్వం కుట్రపన్ని బంధించి, ఉరిశిక్ష విదించి వో దీవికి పంపిస్తుంది. అక్కడి జైలర్ హెర్మన్ కార్టిస్.అతను మహాకౄరుడు. అభిషేక్ తన ప్రవర్తనతో అతన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. ఈ లోగా అభిషేక్ ను విడిపించుకు వెళ్ళాలని అపాచీలు మెరుపుదాడి చేసి విఫలులవుతారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్న కార్టిస్ కి రక్తదానం చేసి,శస్తచికిత్స చేసి,అతని ప్రాణం నిలబెడతాడు అభిషేక్. కార్టిస్ విచలితుడౌతాడు. అతనికి ప్రాణభిక్ష పెట్టి దూరంగా పంపిచేయాలని నిర్ణయించుకుంటాడు. అభిషేక్ ససేమిరా అంటాడు.విసిగిపోయిన కార్టిస్ అతని ఆఖరి కోరిక ఏమిటని అడుగుతాడు.తన పూర్వికులది భారతదేశంలోని అందమైన గ్రామం అని,ఆ గ్రామంలో గడపాలని తన కోరికని చెబుతాడు అభిషేక్. కార్టిస్ అతన్ని నెలరోజుల పాటూ భారతదేశం పంపిస్తాడు. వేదసంహిత అతని మీద రీసెర్చ్ చేసి ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా అతనికి స్నేహపాత్రమవుతుంది. అతనిచ్చిన గుర్తుల ఆధారంగా ఆమే ఆదిత్యపురం గ్రామాన్ని ఎన్నుకొని అతని రాకకోసం ఎదురుచూస్తూంటుంది. ఈ విషయాలు ఒక్క చలంకి తప్ప ఇతరులకి తెలియవు. అందరూ రీసెర్చ్ వర్కు మీదే సంహిత కొన్ని రోజులు గ్రామంలో ఉంటోందని, అభిషేక్,సంహిత భార్యభర్తలనే భావిస్తారు.

ఆదిత్యపురం వచ్చిన అభిషేక్ తన మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకొంటాడు. తనను జలగబారి నుండి రక్షించాడన్న కృతజ్ఞతతో భారతి అరుణ్ ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలియని సోమయాజులు ఆమెకు పెళ్ళి సంబంధం ఖాయం చేసి ఏర్పాట్లలో ఉంటారు. భారతి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అభిషేక్ తన వైద్యంతో ఆమె ప్రాణం నిలబెట్టి,జరిగిన విషయం తెలుసుకొని అరుణ్ నిజస్వరూపం ఆమెకు తేటతెల్లమయ్యేలా, సంహితతో కలిసి ఒక నాటకం ఆడుతాడు.భారతి అరుణ్ ని ఛీకొడుతుంది. సోమయాజులు గారి కుటుంబం పరువు నిలబడుతుంది.

అభిషేక్,సంహిత ఆదిత్యపురం విడిచి వెళ్ళాల్సిన రోజు రానే వస్తుంది. సంహిత దుఃఖితురాలవుతుంది. ఇద్దరూ ఒకటవుతారు. భారమైన హృదయాలతో ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూ కోసం సంహిత ఒకవైపు,కార్టిస్ కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మరో ట్రైన్ లో అభిషేక్ ప్రయాణమవుతారు. అప్పుడు చూస్తాడు చలం ఆమె మెడ మీద మచ్చని. అయితే అది త్రాగుబోతైన ఆమె అసలు భర్త చేసిన గాయం అన్న నిజం, అతనికి ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోతుంది.

కథనం

నవలలో పల్లెసీమల్లోని అందాలని,అలవాట్లని వర్ణించిన విధానం,అంత్రోపాలజి పరిణామక్రమాన్ని వివరించిన తీరు నాకు బాగా నచ్చాయి.మిగతా రచనంతా సాధారణంగా ఉంటుంది. కథారంభంలో సంహితని సృష్టించినప్పుడు ఆమె అందానికి వివశుడై బ్రహ్మదేవుడు ఆశువుగా శృంగార పద్యం చెబితే,సరస్వతీదేవి ఆగ్రహించి ఆ అమ్మాయి అందచందాలని ఏ మాత్రం గుర్తించలేని వ్యసనపరుడైన భర్త దొరకాలని శపిస్తుంది. ఆ భాగం చదివాక,ఇక నవలలో సంహిత అష్టకష్టాలు పడే సన్నివేశాలు వస్తాయని,ధైర్యంతోనే ఆమె తన జీవితాన్ని నిర్మించుకొని ప్రేమను పొందుతుందని ఊహించాను. అటువంటి సన్నివేశాలు ఎక్కడా లేవు.సంహిత పాత్ర పరిధిని తగ్గించి ప్రేమతత్వాన్ని బోధించే భారాన్ని మొత్తం అభిషేక్ మీద పేట్టేశారు రచయిత. సంహిత అభిషేక్ ని ఆరాధిస్తూ మిగిలిపోతుంది.ఆ మాత్రం దానికి కథానాయికకు అంత బిల్డప్ ఇవ్వాల్సిన పని లేదు. ఇది ప్రధానమైన లోపం అనుకోవచ్చు. ప్రేమ అనగానే మనకు సహజంగా స్పురించే యువతీయువకుల మధ్య ప్రేమని ఇందులో ఎక్కడా కూలంకుషంగా చర్చించలేదు. భారతి -అరుణ్,సంహిత -చలం ,సంహిత - అరుణ్ మధ్య అలాంటి సన్నివేశాలు వచ్చినా రచయిత లోతుగా వెళ్ళి విమర్శలు చెయ్యలేదు. విశ్వజనీయమైన మానవతా విలువలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి అభిషేక్ పాత్ర ద్వారా అదే చెప్పిద్దామని ప్రయత్నించారు.ఇక కథానాయకుడికి మెక్సికో బ్యాక్ డ్రాప్ పెట్టడం కూడా ఉరిశిక్ష ముందు 'నెలరోజుల ' సాధారణ జీవితాన్ని ఇవ్వటానికే.మనదేశపు చట్టాలతో అది సాధ్యం కాదు కదా. పైగా ఉరిశిక్షకు గురైన కథానాయకుడు విదేశాల నుండి స్వదేశానికి వచ్చి ప్రేమతత్వాన్ని చాటితే, కథానాయకుడి పరిధి,చుట్టూ అల్లుకున్న కథ పరిధి పెరిగి,ఇంకా బలోపేతమవుతుందని భావించి ఉండవచ్చు.

'ప్రేమ' అనే టాపిక్ మీద యండమూరి ఇంతకంటే మంచి రచనలే చేశారు.చాలమందికి ఏ ' వెన్నెల్లో ఆడపిల్లో ', ' ప్రియురాలు పిలిచే ' నచ్చినా నావరకు బాగా నచ్చిన పుస్తకం అంటే ' థ్రిల్లర్ ' మాత్రమే.ప్రేమంటే ఏమిటో తెలుసుకోడానికి,ప్రేమలో తన నిజాయితీ ఎంతో నిరూపించుకోవడానికి అనుదీప్ అనే కుర్రాడు ఏడు సంవత్సరాలు తపస్సు చేసి,ఆ తపశ్శక్తితో విద్యాధరి అనే అమ్మాయి ప్రేమను పొందాలని ప్రయత్నించి,విఫలుడై ,స్వశక్తితోనే దాన్ని సంపాదించే క్రమంలో చివరకు ప్రాణాలే కోల్పోతాడు. వెళ్తూ వెళ్తూ తన తాలూకు జ్ఞాపకాలు ఆమెను ఏమీ బాధించకుండా కాలగతినే మార్చి జరిగినదంతా కలే అనే భ్రమకు ఆమెను గురిచేస్తాడు. ఈ నవలని రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా ముత్యమంతముద్దు అనే పేరుతో తెరకెక్కించారు.సీత కథానాయిక. ఆఫ్ కోర్స్ సినిమాలో క్లైమాక్స్ మార్చారులెండి. అందులో కథానాయకుడు బ్రతుకుతాడు. లేకపోతే జనం చూడరుగా.


శీత ప్రత్యూషం - కవిత




రా
త్రి చెరలో మగ్గిపోయిన
వియత్సుందరి విరహోత్కంఠితను
విభాతనాధుడొచ్చి విడిపించాడు
ఆకాశం సిగ్గుపడితే
దిక్కుల మేనంతా ఎర్రబడింది.

వియద్వీధి వాకిట్లో విహరించే కొంగలు
ధవళ కాంతుల దివ్యతోరణం కడుతున్నాయి
కెంజాయ ఎండల కాళ్ళ పారాణి దిద్దుకొని
మిసిమి మేఘాలు పసిపాపల్లా పరుగులుతీస్తున్నాయి
కొండల మీదుగా తేలి వచ్చేకూని రాగాల శీత గాలి
వన్నెచిన్నెల కన్నెపైరులకి నేర్పుతోంది కొత్త నాట్య శైలి

ఆలయకోనేట్లో అరవిరిసిన తామర తరుణులు
తుషార జలకాలాడి తలలెత్తి చూస్తున్నాయి
తరుశాఖ పత్రాల చివుళ్ళ పెదవులపై
తళుక్కుమంటూన్న హిమబిందువులు
అగాధాల సంద్రంలో అవతరించిన ముత్యాలైనాయి

చౌరస్తాకూడలిలో చితికిపోయిన బడుగూపేక
చింతల చిదుగులు పేర్చి ఆశలనెగళ్ళు వెలిగించి
భయం చలిని పోగొట్టుకుంటున్నారు
భవితపై భరోసా నింపుకుంటున్నారు
వీధిమలుపులో విరిగిన ఫ్లాట్ ఫాంపై
వయసుడిగిపోయిన భిక్షువర్షీయసి
ఆకలి సెగల ఆవిర్లుకక్కి
మూలబడ్డ ధూమశకటంలా
ముడుచుకూంటూ మూలిగింది

పల్లెటూళ్ళో పశువుల పాకలో
తల్లిపాలకై చిట్టిలేగ సంచలించి చిందులేసింది
కలతనిద్రలో ఉలిక్కిపడ్డ పసిపాప
మాతృమూర్తి హృదయంపై వెచ్చగా వొత్తిగిల్లింది.
గవాక్షాల సరిహద్దులు దాటి
గదిలోకి ప్రసరించే గోర్వెచ్చని మయూఖాలు
మారుని శరాలై గిలిగింతలు పెడుతుంటే
ప్రియనాథుని పరిష్వంగంలో త్రుళ్ళిపడిందో పెళ్ళికూతురు
నిద్రాభూతం తరుముతూంటే
పరీక్షల ప్రేతం భయపెడుతూంటే
కంబళి ఖడ్గం చెలాయిస్తూ
పుస్తక మంత్రం పఠిస్తూ
కుస్తీపడుతున్నాడో కుర్ర పహిల్వాను.

జగమంతా పరుచుకున్న జలతారు మంచుతెర
జీర్ణకాలాంబరంలా జరీవూడుతోంది
తమస్సుల నిశీధి తొలగిపోయి
ఉషస్సుల సత్వం వెలుగుచూస్తోంది
పేడనీళ్ళ పసుపుకళ్ళాపి వొళ్ళంతా పులుముకొని
రంగేళి ముగ్గుల రతనాల చీర నిండుగా చుట్టుకొని
గొబ్బెమ్మ సింధూరం నొసటన గుండ్రంగా దిద్దుకొని
తెలుగు లోగిళ్ళలో భూమాత కొత్త పోకళ్ళు పొయింది.


నెచ్చెలి (వాటర్ పెయింటింగ్)



పె
ళ్ళికి ముందు నేను వేసిన చిత్రాలలో ఇదొకటి. IndiaArt.com వెబ్సైట్ లో కొన్ని నచ్చిన పేయింటింగ్స్ సిస్టంలోకి కాపీ చేసుకొని వాటికి కొన్ని మార్పులు చేసి పెయింటింగ్ చేస్తూంటాను. బాగా వస్తే ఫ్రేం చెయించుకొని ఇంట్లో పెట్టుకోవటం,రాకపొతే పడెయ్యటం అన్నమాట. నాకు తెలిసిన అతనొకరు తన పెయింటింగ్స్ ఫ్రేం చేయించి ఇంటి గోడలనిండా నింపేశాడు. అదీ స్పూర్తి. ఎలా వుంది?


పిల్లలు - రియాలిటి డాన్స్ షోలు




'ఆ
ట ' ప్రోగ్రాం పై ఆఖరుకి వేటు పడింది.టీ.వీ.లో ఆ ప్రోగ్రాం చూడాల్సి వచ్చినప్పుడల్లా ఉష్ట్రపక్షి ఇసుకలో తలదాచేసుకొని శతృవుల బారి నుంచి తప్పించుకున్నట్లు,వేరే రూంలోకి పారిపోయి ఇతర వ్యాపకాల్లో తలమునకలైపొయి నన్ను నేను కాపాడుకొనేవాడిని.ఆ అవసరం ఇప్పుడు తప్పింది.కళ పేరుతో వ్యాపారం చేస్తూ,ఆ కళకే వలువలు నిస్సుగుగా వొలిచేస్తూంటే,వస్త్రదానం చేసి పరువు నిలిపిన శ్రీకృష్ణ పరమాత్ముడిలా జస్టిస్ సుభాషిణ్ రెడ్డి నేతృత్వంలోని మానవహక్కుల కమీషన్ కరుణించి కొరడా ఝళిపించింది.ఈ పోలిక కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు గానీ దురదృష్టవశాత్తూ ఇది నిజం.

ఒక రకంగా ఈ పరిస్థితికి ఓంకారే బాధ్యుడు.మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా బుల్లితెర జీవితం ప్రారంభించి,అనతికాలంలోనే నిర్మాతగా,ప్రయోక్తగా పలు విజయవంతమైన కార్యక్రమాలు రూపొందించిన ఆయన,మెట్లెక్కే తొందరలో కొన్ని ప్రామాణిక విలువలు గాలికొదిలేశారు.అదే ఇంత రాద్ధాంతానికీ దారి తీసింది.పిల్లల స్పెషల్ గా 'ఆట ' ను ప్లాన్ చేసుకున్నప్పుడు,ప్రైం టైం లో దాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు అందులో అసభ్యత,అశ్లీలతకు తావుండకూడదు.కానీ ఓంకార్ ఆ ప్రాథమిక సూత్రం విస్మరించారు.అర్హతలేని వారిని కూడా అందలం ఎక్కించే ప్రయత్నం చేశారు.ముఖ్యంగా మెంటర్లు.మనం మాట్లాడేది కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారని,కాస్త హుందాగా వ్యవహరించాల్సిన అవసరం చాలా వుందని వాళ్ళకు ఏ కోశానా ఉండదు.ఏది మంచో,ఏది చెడో పిల్లలకు విడమరిచి చెప్పాల్సిన మెంటర్లే చిల్లర మాటలు మాట్లాడుతూ,వెకిలి వేషాలు వేస్తూ,పిచ్చి ఛాలెంజిలు చేసుకుంటూ ఉంటారు.ఆట-4 లో అయితే అచ్చం కుళాయిల దగ్గర ఆడవాళ్ళు తన్నులాటల్లానే ఉండేది.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన పిల్లలు వాటినే వేమన పద్యాల్లా,సుమతీ శతకాల్లా భావించి వల్లిస్తూంటారు.ఆట-4 లో వయసుకు మించిన మాట్లాడిన గీతిక,ఆట-5 లో ఆ పాపను మించి వల్గర్ డాన్సులు చేసే భువన..ఈ లిస్టు చాల పెద్దది.దానికితోడు కురచ దుస్తులు వేసుకొని,'నన్ను కొరికేయ్ రో,నా వయసు పదహారే,రింగరింగ రింగరింగా రే ' లాంటి పాటలకు డాన్సులు వెయ్యడం.అతిమాటలు మాట్లాడే పిల్లల్ని నాలుగు తగిలించి మంచి మాటలు చెప్పాల్సిన తల్లిదండ్రులు,తమ పిల్లలు ఎవో ఘనకార్యాలు చేసినట్లు నవ్వుకుంటూ చప్పట్లు కొట్టడం ఇంకో విడ్డూరమైన విషయం.ఇటువంటి షోలు చూసే పిల్లల్లో అవి ఎన్ని దుష్పరిణామాలకు దారితీస్తాయో చెప్పనక్కరలేదు.

ఒక్క ఆట మాత్రమే కాదు,నృత్య ప్రధానమైన రియాలిటీ షోస్ అన్నీ దాదపుగా అలానే తగలడ్డాయి.ఓంకారే నిర్వహించే ఛాలెంజ్ (మా టీవీ),నాగరాజ్/ఉదయభాను నిర్వహించే మగధీర (జీ టీవీ) అంతకంటే ఘోరంగా వుంటున్నాయి.మెంటర్లు గా పిలవబడే వ్యక్తులకు,పార్టిసిపెంట్లకు చాలా మందికి స్టేజి మీద ఎలా ప్రవర్తించాలో తెలియనట్లుంది.లేదా పుర్తిగా మరిచిపోతున్నట్లున్నారు.సగం కార్యక్రమం కేకలు,సవాళ్ళూ,ప్రతి సవాళ్ళతోనే నిండిపోతోంది.ఇలా చేస్తే గానీ రియాలిటి అనిపించుకోదనో లేక టీ.ఆర్.పీ రేటింగ్ లు పెరుగుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నదని కరక్టే అని భ్రమలో వాళ్ళు ఉన్నారో తెలియదు. ఆమ్మ రాజశేఖర్,నవనీత్ కౌర్ లాంటి జడ్జిలు కొన్ని సందర్భాల్లో శ్రుతి మీరి ఆసభ్యంగా ప్రవర్తించారు.అయితే అవన్నీ యువత ప్రధానంగా పాల్గొనే ప్రోగ్రాములు కాబట్టి 'ఆట ' కు ప్రజాసంఘాల నుంచి వచ్చినంత వ్యతిరేకత వాటికి రాలేదు.కాస్త సంసారపక్షం గా ఉండి,ఇంటిల్లిపాదీ చూడగలిగేలా ఉండే నృత్య ప్రధానమైన కార్యక్రమం ఎదైనా వుంది అంటే అది 'ఢీ' ఒక్కటే.అప్పుడప్పుడు ఉదయభాను కాస్త అతి చేసినా,ఏనాడూ,ఎబ్బెట్టుగా అనిపించలేదు.ఈ విషయం లో మల్లెమాల గారిని,ఈ టీవి యాజమాన్యాన్నీ అభినందించాలి.

ఓంకార్ గారు,ఇతర నిర్వాహకులు కూడా అసభ్యత,ఆశ్లీలతను పక్కన పెట్టి, సృజనాత్మకతకు పెద్దపీట వేసి మళ్ళీ జనరంజకరమైన కార్యక్రమాలు నిర్మించి ప్రజాదరణ పొందాలని ఆశిద్దాం.తమ పిల్లల ప్రగతి ఎదుగుదలని ఓర్వలేని వారే ఇలా అడ్డుకొంటున్నారని భావించే తల్లిదండ్రులు కూడా, పిల్లల మనస్తత్వ నిపుణులోకరు టివీలో చెప్పిన మాటను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.మీ పాపకో,బాబుకో నాట్యం మీద ఆసక్తి వుంటే తప్పకుండా నేర్పించండి.అది కూచిపూడి,భరత నాట్యమే కానవసరం లేదు.కానీ వాళ్ళ చేత ఆశ్లీల నృత్యాలను మాత్రం చేయించకండి.అటువంటి కార్యక్రమాలను మీరు చూస్తూ పరోక్షంగా వారిని ప్రోత్సాహించకండి.ఆశ్లీల నాట్యాల్లో వయసుకు మించిన భావాలు పలికించాల్సి వచ్చినప్పుడు పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు.ఆది అనేక అనర్థాలకు కారణం అవుతుంది.కోరి సమస్యలని తెచ్చుకోవద్దు.'ఆట ' ద్వారానో,మరింకొకటి ద్వారానో కొన్ని నిరుపేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియచ్చు.కానీ మీ పిల్లలు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మీరూ అలోచించండి.నేటి బాలలే కదా రేపటి పౌరులు.


ప్లేస్కూళ్ళు - కుటీర పరిశ్రమలు




' ఎదగడానికి ఎందుకురా తొందర ' అంటారు ఏఎన్నార్ బాపుగారి ' అందాలరాముడు ' సినిమాలో.అప్పట్లో ఆ మాటలు చెల్లుబాటయ్యాయేమో కానీ,వాటికి కాలం చెల్లిపోయి చాలా ఏళ్ళయింది.ఈ స్పీడ్ యుగంలో పుట్టినదగ్గర్నుంచి పిల్లలకు పోటీతత్వం అలవర్చకపోతే,ఆనక వెనుకబడిపోయి నవ్వులపాలయ్యేది వాళ్ళు,వాళ్ళతో పాటూ తల్లిదండ్రులుగా మనమూ అని తల్లిదండ్రులందరికీ తెలుసు.ఒకప్పుడు ఎల్.కే.జి,యూ.కే.జి తరువాత ఫస్ట్ క్లాస్ ఉండేవి.ఇప్పుడు వాటికంటే ముందుగా ప్రీకేజీ లేదా ప్లేస్కూల్ అని వొకటి తయారయ్యింది.వాటి గురుంచే ఈ టపా.

సాధారణంగా రెండున్నరేళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లల్ని ప్లేస్కూళ్ళలో చేర్చుకుంటారు.A నుంచి Z వరకు,1 నుంచి 10 వరకు ఆ వయసులోనే నేర్పించేస్తారు.ఎల్.కే.జి ని నేరుగా ఆంగ్ల పదాలతో మొదలుపెడతారు.జీవితంలో తిరిగిరానివి బాల్యం,యవ్వనం.ఏ బాదరబందీ లేకుండా,అమ్మానాన్నల గోరుముద్దలు తింటూ,గెంతుతూ ఆడుకోవల్సిన రెండున్నరేళ్ళ వయస్సులో,కాళ్ళు కట్టేసుకొని,అక్షరాలతో కుస్తీపడుతూ,వొత్తిడికీ గురయ్యే చిన్నపిల్లల్ని చూస్తే సున్నిత మనస్కులకు జాలి కలుగకమానదు. భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తే తప్ప రోజులు గడవని రోజులివి.కొన్ని కుటుంబాలలో మూడునెలల పిల్లల్ని సైతం డేకేర్ సెంటర్ లో వేసేసి ఉద్యోగాలకు వెళ్ళే మహిళల గురుంచి కూడా మనం వింటున్నాం,చూస్తున్నాం.సాంకేతిక విప్లవం మిగిల్చిన దుష్పలితాల్లో ఇదీ వొకటి.అవాంఛనీయమైనా అనివార్యమైన పరిణామం ఇది.

సరే,నాకిష్టమున్నా లేకున్నా మా చిన్నారిని ప్రీకేజిలో చేర్పించాల్సిన వయసొచ్చింది కాబట్టి,భార్యభర్తలం ఇద్దరం స్కూళ్ళ వేటలో పడ్డాం.ఇంటికి దగ్గరగా ఉంది కదా అని వో ప్లేస్కూలుకెళ్ళాం.అది రెండంతస్తుల ఇల్లు.గేటు తియ్యగానే కార్ పార్కింగ్ కోసం కేటాయించినట్లుండే స్థలంలో (నట్లు కాదు,నిజంగా అక్కడ ఉదయం ఏడు ఎనిమిది వరకు కార్ పార్క్ చెయ్యబడే ఉండటం ఓ రోజు చూశాను)ముందుకూ వెనక్కూ ఊగే మూడు నాలుగు ప్లాస్టిక్ బాతు బొమ్మలు,గుఱ్ఱం బొమ్మలు,ఒక జారేబండ అమర్చి ఉన్నాయి.కొంతమంది చిన్న పిల్లలు బిక్క మొహం వేసుకొని చూస్తుంటే,జైళ్ళో ఖైదీలను అజామాయిషీ చేసే జైలర్లలా,ఆయాలనబడే ఇద్దరమ్మాయిలు వాళ్ళని పరికిస్తూ కాపలా కాస్తున్నారు.కాస్త పక్కగా కాస్త పెద్ద హాలు,అందులో ఒక బోర్డు,'ABCD'లు తగిలించిన పటాలు,బొమ్మలు,కొన్ని కుర్చీలు,ఒక వైపున టీ.వీ. ఉన్నాయి.అది ఆఫీస్ రూం అనుకున్నా కానీ ప్రిన్సిపల్ వచ్చాక,అది ఆఫీస్ రూం + క్లాస్ రూం అని అర్థం అయ్యింది.అంతేకాదు,ప్రీస్కూల్,ఎల్.కే.జి,
యు.కే.జి పిల్లల్ని అందరినీ కలిపి ఆ స్థలం లోనే కూర్చోబెట్టి పాఠాలు(?) బోధిస్తారని తెలిసి అవాక్కయ్యాను.డేకేర్ పిల్లలకి వరండానే గతి పాపం.

ప్రిన్సిపల్ యథాప్రకారం గంభీరంగా స్కూలు గురుంచి,ఫీజుల గురుంచి వివరించి,పనిలో పనిగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర గురుంచి చిన్నపాటి లెక్చరు కూడా దంచింది.వాలెంటైన్స్ డే ని కూడా తమ స్కూలు సెలెబ్రేట్ చేసుకుంటుందని,కాకపోతే ఆ రోజున తల్లిదండ్రులని ప్రేమించమని,అన్నదమ్ములను,అక్క చెల్లెళ్ళను ప్రేమించమని పిల్లలకు చెబుతామని ఆవిడ చెప్పింది.పిల్లల పట్ల అంత ప్రేమ,సామజిక బాధ్యత ఉన్న ఆవిడ అంతే శ్రద్ధ ను,పాఠశాలకు ఇంకొక మూడు విశాలమైన గదులను కేటాయించటంలోనో,మెరుగైన సౌకర్యాలు కలిగించటంలోనో చూపించి ఉంటే ఇంకా బావుండేది. రాజకీయనాయకుల వాగ్దానాలనే వినీవినీ అరాయించుకున్న సగటు భారతీయుడు బుర్ర కాబట్టి ఆవిడ ఉపన్యాసం నన్నేం చెయ్యలేకపోయింది.అక్కడి నుంచి బయటపడి ఓ ప్రముఖ కార్పొరేట్ గురు నిర్వహిస్తున్న స్కూల్ కి వెళ్ళాం.ఆ శాఖను అప్పుడే ఏర్పాటు కొత్తగా ఏర్పాటు చేసారు.స్కూలు ఆవరణ విశాలంగానే ఉన్నా,'ఇది బడి ' అని చెప్పడానికి పనికివచ్చే పరికరాలు ఏవీ అక్కడ కనిపించలేదు.స్కూల్ మేనేజ్మెంట్ ని మాటల్లో దింపితే తల్లిదండ్రుల దగ్గర్నుంచి వసూలు చేసే నాన్-రిఫండబుల్ ఫీజులతో పరికరాలని త్వరలోనే కొనుగోలు చెయ్యనున్నట్లు తెలిసింది.మొహం మీద వాళ్ళా విషయం చెప్పకపోయినా, సారాంశం అదే.

ఇంటికి తిరిగి వస్తూండగా నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది.ఈ దేశంలో ప్లేస్కూళ్ళు కూడా కుటీర పరిశ్రమలు లాంటివి.కావలసిందల్లా లక్ష రూపాయిలు పెట్టుబడి,ఒక చిన్న ఇల్లు.అది అగ్గిపెట్టె లాంటి ఇల్లైనా పర్లేదు.అద్దె ఇల్లైనా పర్లేదు.స్వంత ఇల్లైతే మరీ మంచిది.అద్దె డబ్బులు,అడ్వాన్సు సొమ్ములు మిగులుతాయి.అనుమతుల సంగతి దేవుడెరుగు..కనీస అవసరాలు కూడా లేని ఇటువంటి ప్లేస్కూల్లలో చేరి పిల్లలెంతవరకు ప్రయోజకులవుతున్నారేమో కానీ,నిర్వాహకులకు మాత్రం అవి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.మనసు చంపుకుని పిల్లల్ని వదిలి ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగినుల సెంటిమెంట్లతో వారికి పని లేదు.వారికి కావల్సిందల్లా ఖర్చు-రాబడి,లాభ-నష్టాల బేరీజు పట్టిక మాత్రమే.వీధికి వీధికీ పుట్టగొడుగుల్లా మొలుస్తున్న ఇటువంటి ప్లేస్కూళ్ళ బారి నుండి ఈ దేశాన్ని ఆ భగవంతుడే రక్షించాలి.


తాతయ్యలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయం

దారుణం విన్నారా? మా చిన్నారి పుణ్యమా అని నాకీ సందేహం కలిగి ఒక నిష్టూర సత్యం బయటపడింది కానీ,లేకుంటే ఈ అన్యాయం కూడా,తరతరాలుగా మగజాతికి జరుగుతున్న వెలుగులోకిరాని అనేక పరాభవాల జాబితాలో చేరిపోయేది.

ఆగాండాగండి..విషయంలోకి వచ్చేస్తున్నాను.

అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటాం.
నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటాం.
కానీ అమ్మకు నాన్నైనా,నాన్నకు నాన్నైనా ముక్తసరిగా తాతయ్య అనేసి చేతులు దులుపుకుంటాం.అమ్మలకు రెండు పేర్లుంటే,నాన్నలకు మాత్రం ' తాతయ్య ' అని ఒకే పేరుతో సర్దిపెట్టేశారు.

దీనివల్ల బోలెడంత కష్టం ఉంది.

తాతయ్య అని ఒకరిని పరిచయం చేసి,ఇంకొకరి ఫోటో చూపించి మళ్ళీ తాతయ్య అంటే,మొదటి వ్యక్తి అమ్మకు నాన్నని,రెండో వ్యక్తి నాన్నకు నాన్నని అర్థం చేసుకోవటానికి బుడుగులు,సిగానపెసూనాంబలు ఎంత కష్టపడాలి.అంత చిన్న వయసులో వారి చిట్టి మెదళ్ళని మానసికశ్రమకు గురిచెయ్యడం అవసరమా? తాతలిద్దరిదీ వేర్వేరు ఊర్లయితే,ఏ హైదరాబాద్ తాతనో,తిరుపతి తాతనో చెప్పుకునే వెసులుబాటు ఉంది.అదే ఇద్దరిదీ ఒకే ఊరయితే,అప్పుడేమని పిలవాలి? గాంధీరోడ్ తాతనో, లేక నెహ్రూవీధి తాతనో నా? తాతయ్య గురుంచి చెప్పుకోవాల్సిన ప్రతిసారీ,ఏ తాత గురుంచి చెబుతున్నామో,ఆ విషయం మీద స్పష్టతనివ్వాల్సి రావటం భావ్యమా? వాగానుశాసనుడైన నన్నయ్య కూడా ఈ విషయం పై దృష్టి పెట్టకపోవటం శోచనీయం.

దీనిని నేను ఖండిస్తున్నాను.

అమ్మనాన్న,నాన్ననాన్న అంటే బావుండదు కాబట్టి అర్జంటుగా ఒక ఉద్యమం లాగా 'తాతయ్య ' పదానికి ప్రత్యామ్నాయాలు వెదకాల్సిన అవసరం మనకందరికీ ఉంది.స్త్రీ సమానత్వం,పురుషాహంకారం మీద ఉద్యమాలు నడిపే మహిళాశిరోమణులు కూడా మగజాతికి జరిగిన ఈ అన్యాయాన్ని సావధానంగా పరిశీలించి,మా ఉద్యామానికి సహకరించల్సిందిగా నా విన్నపం.

ఏమంటారు?


కాకతీయ కదనశార్దూలం గోనగన్నారెడ్డి


నాకు మొదట్నుంచి కథలూ, కాకరకాయలంటే చాలా ఇష్టం. అందునా జానపద,చారిత్రాత్మక, పౌరాణిక గాథలంటే చెవికోసేసుకుంటాను. గోనగన్నారెడ్డి గురుంచి విన్న తొలిసారి అతనెవరో తెలుసుకుందామని గూగులమ్మలో వెతికితే తెలుగువన్.కాంలో అడవిబాపిరాజు గారి నవల ధారావాహిక రూపంలో కనిపించింది. ఒక పేజి చదివగానే,ఇదేదో సులభంగా చదివి అర్థం చేసుకొనే కథ కాదని అర్థమై ఆ ప్రయత్నానికి విరామం యిచ్చాను. ఇన్నాళ్ళకు ఆ కథ చదవాలన్న కోరిక మళ్ళీ పుట్టి, పుస్తకం కొని చదవడం జరిగింది.మొదట కథలోకి వెళ్ళి,తర్వాత కథనంలోకి వెళ్దాం.

కథ

గణపతిదేవుడు ఓరుగల్లు రాజధానిగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి.

కాకతీయ సామ్రాజ్యానికున్న అనేకానేక సామంతులలో బుద్ధపురం మహారాజు గోన బుద్ధారెడ్డి ఒకడు. అతని తమ్ముడు లకుమయారెడ్డి. బుద్ధారెడ్డి ప్రభుభక్తి పరాయణుడు. యాభై యేళ్ళకు అతనికి సంతానం కలుగుతారు.వారు కుప్పాంబ, గన్నారెడ్డి, విఠలరెడ్డి. వయోభారం పెరిగి అవసానదశకి చేరిన ఆయన, తమ్ముడు లకుమయ్యని పిలిచి, తన పెద్ద కొడుకు గన్నారెడ్డి పేరుతో రాజ్యపాలన చెయ్యమని, అతను పెద్దయ్యాక రాజ్యం అతనికే అప్పగించి,వేరొక నగరం పరిపాలించుకొమ్మని చెప్పి కన్నుమూస్తాడు. లకుమయ్య పసివాడైన గన్నారెడ్డి పేరుతో రాజ్యం చేస్తూ, ఆ పిల్లల్ని విద్యాభ్యాసం కోసం ఓరుగల్లు పంపిస్తాడు.

గణపతిదేవునికి పుత్రసంతానం లేరు. ఇద్దరూ కుమార్తెలే .పెద్దామె రుద్రమ్మదేవి, చిన్నది గణపాంబ. తన తర్వాత, తన వంశీయులే రాజ్యపాలన చేయాలనే సదాశయంతో, మహామంత్రైన శివదేవయ్య ఆదేశాలకనుగుణంగా, రుద్రమ్మదేవిని చిన్ననాటి నుంచి పురుషునిలాగే పెంచుతారు. ఆఖరికి చెల్లెలైన గణపాంబకు కూడా ఈ విషయం తెలియనంత రహస్యంగా ఉంచుతారు. గణపాంబను ఒక సామంతరాజుకిచ్చి వివాహం చేస్తారు. రుద్రమ్మదేవి రహస్యం కాకతీయ సర్వసేనానైన జయాపసేనానికి చెప్పి, అతని కుమార్తె ముమ్ముడమ్మను రుద్రమ్మకిచ్చి వివాహం చేస్తారు. రుద్రమ్మ స్త్రీ అని లోకానికి వెల్లడించిన రోజున, ముమ్ముడమ్మను ఒక ఉత్తమ వీరునికిచ్చి వివాహం చేస్తామని చెబుతారు. శోభనం రోజు రాత్రి రుద్రమ్మదేవి ముమ్ముడమ్మను పిలిచి, తానొక వ్రతం చేస్తున్నాని,అది అయిన వెంటనే ఆమె కోరిక తీరుతుందని చెబుతుంది.

గణపతిదేవుడు వృద్ధుడవుతాడు. రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం అధిరోహిస్తుంది. రాజ్యంలో అల్లకల్లోలం బయలుదేరుతుంది. లకుమయ్య తన అన్న కుమారులకు ధనం పంపడం మానేస్తాడు. తనే రాజులా చెలామణి అవుతాడు. రుద్రమ్మ పీఠం ఎక్కాక, ‘ఒక ఆడదాని మోచేతినీళ్ళు తాగాలా’ అని హుంకరించి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే స్త్రీపాలనలో తలదాచుకోవడానికి ఇష్టపడని మిగతా సామంతరాజులతో, రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహరదేవులు, మురారిదేవులు, ఇతర శత్రురాజులతో చర్చలు జరుపుతూంటాడు.

గోనగన్నారెడ్డి తండ్రిలాగే కాకతీయవంశ వీరాభిమాని. పినతాండ్రి తనకు చేసిన అన్యాయం, దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనించి కొంతమంది వీరులను తయారుచేసి, రుద్రమ్మదేవిని కలుస్తాడు. తామంతా గజదొంగలగా అవతారమెత్తి, రాజ్యంలో చెలరేగుతున్న అక్రమాలను పారద్రోలి, తిరుగుబాట్లను అణిచివేస్తామని, అందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతాడు. రుద్రమ్మదేవి సరేనంటుంది. గన్నారెడ్డి నల్లమల అడవులలో ఒక పాడుబడిన దుర్గాన్ని బాగుచేయించి, తన సేనతో రహస్యంగా అక్కడ ఉంటూ అధర్మనిర్మూలనం చేస్తూంటాడు.

లకుమయ్య తన కుమారుడు వరదారెడ్డిని ఆదవోని రాకుమారి అన్నాంబికకిచ్చి వివాహం చెయ్యాలని తలపోస్తాడు. అన్నాంబికకు ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. గన్నారెడ్డి మెరుపులా వచ్చి వరదారెడ్డిని అపహరించుకుపోయి, కొంతకాలానికి విడిచిపెడతాడు. లకుమయ్య మళ్ళీ వివాహ ప్రయత్నం చెయ్యబోగా, గన్నారెడ్డి ఈ సారి వధువైన అన్నాంబికను అపహరించి, అక్క కుప్పాంబను తోడునిచ్చి బావగారి రాజ్యానికి చేరవేస్తాడు. యుద్ధానికి వచ్చిన వీరాధివీరుల తలలెగరగొట్టి,బేడ చెలువనాయకుని మహాఢక్కను స్వాధీనం చేసుకొని, అతనికి క్షమాభిక్ష పెడతాడు. కుప్పాంబ అన్నాంబికను ఓరుగల్లులో రుద్రమ్మ దగ్గర చేర్చి తిరిగి వస్తుంది.

వేటకు వెళ్ళి, ఏమరుపాటుగానున్న రుద్రమ్మని, పెద్దపులి బారినుంచి చాళుక్య వీరభధ్రుడనే సామంతుడు రక్షిస్తాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. స్త్రీ సహజమైన భావావేశాలకులోనై, రాజ్యభారం వదిలేసి, సాధారణ స్త్రీలా బ్రతకాలనుకుంటుంది. తన భుజస్కంధాలపై ఉన్న బాధ్యతలు గుర్తొచ్చి, తన మనః స్థితిని కప్పిపుచ్చుకొని సామ్రాజ్ఞిలా మెలుగుతూంటుంది. తను స్త్రీ అన్న విషయం ముమ్ముడమ్మకు తెలియజేసి, ఆమెను ఓదార్చి, ఉత్తముడైన ఒక వీరునితో ఆమె వివాహం జరిపిస్తానని మాటిస్తుంది. అన్నాంబిక గన్నారెడ్డి ప్రేమలో పడుతుంది. అతను గజదొంగ ఎందుకయ్యాడని బాధపడుతుంది. అతన్ని క్షమించమని రుద్రమ్మను కోరుతుంది. రుద్రమ్మ ఆజ్ఞ మేరకే గన్నారెడ్డి అదంతా చేస్తున్నాడని, పైకి మాత్రం ఆమె అశ్చర్యం నటించి, కోపం ప్రకటిస్తోందని అన్నాంబికకు తెలియదు. రుద్రమ్మ, అన్నాంబిక, ముమ్ముడమ్మ మంచి స్నేహితురాళ్ళు అవుతారు.

గోనగన్నారెడ్డి ఈలోగా రుద్రమ్మదేవిని ధిక్కరించిన కేశనాయకుడిని ఓడించి, అతని ధనం, సైన్యం, స్వాధీనం చేసుకొని వదిలేస్తాడు. గన్నారెడ్డిని హతమార్చాలని లకుమయ్య లక్షలాది సైన్యంతో బయలుదేరి శ్రీశైలం చేరుకుంటాడు.గన్నారెడ్డి మనుషులు శివభక్తులుగా వేషాలు దాల్చి, ఉత్సవాలు చేస్తూ, ప్రసాదంలో మత్తుమందు కలిపి లకుమయ్యను బంధించి ఓరుగల్లు చేరవేస్తారు. రుద్రమ్మదేవి లకుమయ్యను బుద్ధిగా తన దగ్గరే ఉండమని హెచ్చరిస్తుంది.

గోనగన్నారెడ్డి విజృంభిస్తాడు. తిరగబడిన కాచయనాయకున్ని పరాజితున్ని చేసి, మెడకు ఉచ్చి బిగించి అతని కళేబరాన్ని గుఱ్ఱంతో లాక్కుపోతాడు. ఇంతలో రుద్రమ్మదేవి బావగారిపై దాడిచేసి అతన్ని బంధిస్తారు పేర్మాడిరాయుడు, కాటయ్యలు. రాజ్యంలో తిరుగుబాట్లు అణిచివేయడనికి, శివదేవయ్య మంత్రి ఆదేశానుసారం రుద్రమ్మదేవి విజయయాత్రకు సంకల్పించి సైన్యంతో బయలుదేరుతుంది. అన్నాంబిక పురుషవేషం ధరించి అంగరక్షకురాలిగా ఆమె వెంట కదులుతుంది. గన్నారెడ్డి ఈలోగా పేర్మాడిరాయున్ని, కాటయ్యను తన కాలుమీద పడేసుకొని వదిలేస్తాడు. రుద్రమ్మ సైన్యం గుంటూరు నాగమహారాజుని సంహరించి కంచి వరకు నడిచిపోయి తిరిగి ఓరుగల్లు చేరుకుంటుంది.

వృద్ధుడైన గణపతిదేవుడు మరణిస్తాడు. రుద్రమ్మదేవి జరగబోయే పరిణామాలూహించి ఓరుగల్లును కట్టుదిట్టం చేస్తుంది.గణపతిదేవుడు చనిపోగానే అప్పటివరకూ వినయవిధేయతలతో ఉన్న రాజులు తిరుగుబాటు వ్యూహం రచిస్తారు. కాళ్యాణి చోడోదయుడు ఇతర ప్రాంతాలు ఆక్రమించుకుంటూ ఒకప్పుడు గన్నారెడ్డి తండ్రి పాలించిన వర్ధమానపురం మీద దాడి చేస్తాడు. గన్నారెడ్డి పులిలా అతనిమీదపడి అతన్ని బంధించి బుద్ధిచెబుతాడు. రాజేంద్రచోడున్ని, ఏరువ భీమున్ని, కొప్పరుజింగని తరిమికొడతాడు. వారి దగ్గర్నుంచి ధన,ధాన్యరాసుల్ని, సైన్యాన్ని కానుకగా రుద్రమ్మకు పంపిస్తాడు. గన్నారెడ్డి మీద ప్రేమతో అన్నాంబిక పురుషవేషంలో కొంతకాలం అతని రక్షణలో ఉండి అతనితో పాటూ యుద్ధాలలోపాల్గొని మళ్ళీ రుద్రమ్మను చేరుకుంటుంది.

ఒకనాడు రుద్రమ్మదేవి, అన్నాంబిక కొంతమంది వీరులతో కలిసి మొగిలిచెర్ల వెళ్ళి కాకతమ్మకు పూజలు చేస్తారు. తిరిగివస్తూండగా రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహర మురారిదేవులు సైన్యంతో విరుచుకపడతారు. చాళుక్య వీరభధ్రుడు సుడిగాలిలా ఊడిపడి వారిని తుదముట్టించి ఆమెను రక్షిస్తాడు. దేవగిరి యాదవ మహాదేవరాజు ఎనిమిది లక్షల మాహాసైన్యం పోగుచేసుకోని ఓరుగల్లు మీద దండయాత్రకు వస్తాడు. గన్నారెడ్డి అతని సైన్యంపై పడి అపారమైన ప్రాణనష్టం కలిగిస్తాడు. రుద్రమ్మదేవి మంత్ర దండనాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పక్కా ప్రణాళికతో, హోరాహోరీగా యుద్ధం చేసి అతన్ని తరిమికొడుతుంది. పారిపోతున్న అతని సైన్యాలని కొండలమాటున దాగి గన్నారెడ్డి సర్వనాశనం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో మహదేవరాజు రుద్రమ్మదేవి శరణుకోరి బ్రతికి బయటపడతాడు.

ఓరుగల్లులో సంబరాలు మిన్నంటుతాయి. నిండుసభలో గన్నారెడ్డి గజదొంగ కాదని స్పష్టం చేస్తాడు శివదేవయ్య మంత్రి. లకుమయ్యను, ఇతర స్వామిద్రోహులను క్షమించి విడిచిపెడతారు. రుద్రమ్మదేవి మారుపెళ్ళికి గణపతిదేవుడు విధించిన షరతులు మూడు. రుద్రమ్మను పెళ్ళాడిన పురుషుడు ఎంతగొప్పవాడైనా చక్రవర్తి కారాదు. రుద్రమ్మదేవియే రాజ్యాన్ని పాలించాలి. ఆమె కుమారుడు రాజ్యం వహించబోయే ముందు కాకతి వంశానికి దత్తత రావాలి. ఆ షరతులకన్నీ ఒప్పుకొని చాళుక్య వీరభధ్రుడు ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతని సోదరునితో ముమ్ముడమ్మకు వివాహం చేస్తారు. అన్నాంబిక తనరాజ్యం చేరుకుంటుంది. రుద్రమ్మదేవి, భర్తతో సహా ఆదవోని వచ్చి, అన్నాంబికకు గన్నారెడ్డికి వివాహం జరిపిస్తుంది. గోనగన్నారెడ్డి వర్ధమానపురం(నేటి వడ్డిమాని) రాజుగా పట్టాభిషక్తుడవుతాడు.

కథనం 


 అడవిబాపిరాజుగారు విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రుల సమకాలికుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంలోనే కాక సంగీత, చిత్రలేఖనాల్లోనూ వారికి ప్రవేశం ఉంది. వారికి చిరకీర్తి సంపాదించిపెట్టిన నవలల్లో గోనగన్నారెడ్డి ఒకటి. ’ గోనగన్నారెడ్డి ‘ నవల చదవడానికి చాలా ఓపిక, ఏకాగ్రత కావాలి. రచన గ్రాంథిక భాషలో సాగటం యిందుకు కారణం కాకపోయినా, వాక్యనిర్మాణం, రాజవంశీయుల చరిత్రలు, వారి పేర్లు(ఒకే పేరు ఇద్దరు ముగ్గరికి వుండటం), బిరుదులు కొన్నిసార్లు తికమకపెడతాయి. కథలో ప్రధాన పాత్రలకే కాకుండా, ఇతర పాత్రలకు కూడా స్తోత్రపాఠాలు వ్రాశారు బాపిరాజు గారు. సగం పేజీ ఆక్రమించే ఆ బిరుదపాఠాలు చాలా చోట్ల అనవసరమనిపిస్తాయి. సాధారణ పాఠకుడికి తెలుగు నిఘంటువు అవసరం చాలాసార్లు కలుగవచ్చు. ఈ లోటుపాట్లను తట్టుకొని ఆసాంతం చదవగలిగితే గోనగన్నారెడ్డి మంచినవల అనిపిస్తుంది.

చారిత్రాత్మక కథ వ్రాయటం చాలా కష్టంతో కూడుకున్నపని. ఎన్నో వంశాల చరితల్ని, వారి సమకాలికుల్ని, ఆ నాటి సంఘటనలని, శాసనాలని, ఇతర ఆధారాలని క్షుణ్ణంగా పరీశీలించి నేర్పుగా వ్రాయాల్సి ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నవ్వులపాలు కాకతప్పదు. ఈ విషయంలో బాపిరాజుగారు పడ్డ కష్టం నవలలో ప్రతిఫలిస్తుంది. కాకతీయుల కాలంనాటి జీవనశైలిని, ఆహరపుటలవాట్లను, యుద్ధరీతుల్ని, కోటలను కళ్ళకు కట్టినట్లు వర్ణించడంలో బాపిరాజు కృతకృత్యులయ్యారు. ఆనాటి కాకతి ఉత్సవాలే నేటి బ్రతుకమ్మ పండుగలని చెబుతారు ఒక చోట. అలాగే ప్రధానపాత్రల చిత్రణ కూడా బావుంది. ముఖ్యంగా అటు రాజ్యక్షేమం కోసం పురుషుడిగా చెలామణి అవుతూ, ఇటు స్త్రీగా ప్రేమించినవాడి కోసం పరితపించే రుద్రమ్మదేవి మనస్తత్వాన్ని,ధీరమూర్తియైన గన్నారెడ్డి వ్యక్తిత్వాన్ని, అన్నాంబిక ప్రేమతత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. గన్నారెడ్డి చిత్రవిచిత్ర యుద్ధవిన్యాసాలు, మహదేవరాజు, రుద్రమ్మ సైన్యం తలపడినప్పుడు జరిగే సంఘటనలు రోమాంచకంగా తీర్చిదిద్దారు. అడవిబాపిరాజు గారి సాహితీయాత్రలో ‘ గోనగన్నారెడ్డి ‘ ఒక మేలుమజిలీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ప్రతులకి విశాలాంధ్ర బుక్ హౌస్ ని సంప్రదించండి.

పుస్తకం వెల: 125
ప్రచురణకర్తలు:
ప్రతుల కోసం సంప్రదించాల్సిన చిరునామా:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
4-1-435, విజ్ఞాన భవన్, అబిడ్స్,
హైదరాబాద్-001
ఫోన్:24744580/24735905

పుస్తకం.నెట్ లో మార్చి 17,2010 న ప్రచురితం


నేను - నా సైకిలు - భద్రాచలం


ది కొత్తగా నేను ఇంటర్మీడియట్ లో చేరిన నాటి సంగతి.


పదో తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణున్నై క్లాస్ ఫస్ట్ రావటంతో మా నాన్నగారు హీరో రేంజర్ సైకిలు కొనిచ్చారు నాకు.అంతకుముందు మా నాన్నగారిది పెద్ద సైకిల్ అట్లాస్ ఉండేది.దాన్లో స్కూల్ కి వెళ్ళేవాడిని.ఇప్పుడు నాకంటూ స్వంత వస్తువు రావటంతో చాలా సంబరపడ్డాను.మంగళవారం పూట కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి చిన్నసైజు పూజలు అవీ చేసాను.చీకట్లో కుడా నా పేరు మిలమిల మెరిసేలా రేడియం స్టిక్కర్ అంటించాను. తళాతళాలాడే ఆ కొత్త సైకిల్ పై కూర్చొని,నలిగిపోని పువ్వుల చొక్కా,నిగనిగలాడే బ్యాగీప్యాంటు తొడుక్కుని,బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోలా కలలు కంటూ,యథాశక్తి నాకు వచ్చిన అరకొర విన్యాసాలు చేస్తూ మా కాలేజ్ వెళ్ళేవాడిని.






ఓ రోజు ఇలాగే నా సైకిల్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళాను.బయట చాలా సైకిళ్ళు,స్కూటర్లు పార్క్ చెయ్యబడి ఉన్నాయి.నేనూ నా సైకిల్ లాక్ చేసి స్టయిల్ గా లైబ్రరీ లోనికి వెళ్ళాను.అక్కడ దినపత్రికలు తప్ప ఏమీలేవు.వారపత్రికలు లేకపోతే పోయే కనీసం చందమామ,బాలమిత్ర లాంటివి కూడా లేకపొయ్యేసరికి మనకి బోర్ కొట్టింది.ఆ ఉన్న నాలుగైదు దినపత్రికలు చెల్లాచెదురైపోయి,చిరిగిపోయి పదిమంది చేతుల్లో విడివిడిగా దర్శనమిచ్చాయి.అపరాధ పరిశోధకుల్లా అందరూ తమ చేతుల్లోని పేపర్లలో తలమునకలైపోయి,వార్తలతో పాటూ,అందులోని అడ్వర్టైజ్మెంట్లు కూడా చదివివేస్తున్నారు.నాదాకా పేపర్ వచ్చే పరిస్థితి కనిపించలేదు.ఏం చెయ్యాలో పాలుపోక కాసేపు బిక్కమొగంవేసి 'ఓకే లెట్స్ గో హోం' అని నిర్ణయించుకొని బయటికి వచ్చాను.వచ్చి చూద్దును కదా నా సైకిల్ అక్కడ లేదు. గుండె గుభిల్లుమంది.






పధ్నాలుగువందలు పోసి కొన్న సైకిల్ అది.కొని పట్టుమని పదిరోజులు కుడా కాలేదు.నాకు చెమటలు పట్టేశాయి.ఎవరైనా దొంగలించారేమోనని చుట్టుపక్కల వీధులన్ని తిరిగేశాను.ఎక్కడా కనిపించలేదు.
మానవయత్నంతో పాటు దైవయత్నం కూడా ఉండాలని భధ్రాచలం రామున్ని కూడా వేడుకున్నాను.'నా సైకిల్ నాకు దొరికేలా చెయ్యి స్వామీ.సకుటుంబ సమేతంగా వచ్చి నీ దర్శనం చేసుకుంటా' అని మొక్కుకున్నాను.నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ లైబ్రరీ దగ్గరికే వచ్చాను.నా అవస్థనంతా చూసిన ఒక పెద్దమనిషి 'ఇందాకే ట్రాఫిక్ పోలీసులొచ్చి కొన్ని సైకిళ్ళు,స్కూటర్లు పట్టుకెళ్ళారు బాబు.ఎందుకైనా మంచిది వెస్ట్ పోలిస్ స్టేషన్లో వెదుకు ' అని ఆపద్భాంధవుడిలా మార్గదర్శనం చేశారు.నాలో ఆశ చిగురించింది.ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పోలిస్ స్టేషన్ కి వెళ్ళాను.వెళ్తూ దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను ' నా సైకిల్ ఏమైనా రోడ్డుకడ్డంగా పెట్టానా ' అని.అలాంటిదేమీ లేదు.అక్కడ నా సైకిల్ తో పాటుగా చాలా సైకిళ్ళున్నాయి.వాటిని వదిలేసి నా సైకిల్ మాత్రం ఎలా పట్టుకెళ్తారు అనిపించింది.


వెస్ట్ పోలీస్ స్టేషన్లో నా సైకిల్ కనిపించగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది.
కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి నా సైకిల్ ఇవ్వమని అడిగాను.ఆయన వయస్సు నలభై - యాభై మధ్యలో ఉంటుంది.బానపొట్ట.నావైపు ఎగాదిగా చూసి మా నాన్నేం పని చేస్తారో కనుక్కొని ' రోడ్డుకడ్డంగా సైకిల్ పెట్టావ్, ఫైన్ కట్టి తీసుకెళ్ళు ' అన్నాడు.' నేనేం సైకిల్ అడ్డంగా పెట్టలేదు ' అని అతనితో వాదించాలని నాకనిపించింది.కాని ధైర్యం చాలలేదు.అవతల పోలిసోడితో వ్యవహారం.నీళ్ళు నమిలి ' నా దగ్గర లేదు సార్ ' అన్నాను. ఆయన ముఖం చిట్లించి అయితే రేపు కోర్టుకొచ్చి జరిమానా కట్టి,సైకిల్ తీసుకు ఫో' అన్నాడు.నాకు ఏడుపు వచ్చినంత పనైయ్యింది.సైకిల్ కోసం మొదటిసారి కోర్టుగుమ్మం ఎక్కాలా దేవుడా,నేను నా పరువు,ఇంటి పరువు ఏం కావాలని అరవ సినిమాలో హీరోలా తెగ కుమిలిపోయాను.


ఇంతలో గజేంద్రుడి మొరవిన్న విష్ణుమూర్తిలా ఎస్సై వచ్చాడు.నేను నాగోడు వెల్లబోసుకున్నాను.ఆయన కానిస్టేబుల్ ని పిలిచి విచారించాడు.నా వైపు తిరిగి ' ఏం బాబు.మీ నాన్న ఆఫీసర్ అని ఏదో పొగరుగా మాట్లాడావట ' అని అడిగాడు.కానిస్టేబుల్ తప్పు కప్పిపుచ్చుకోడానికి చెయ్యని నేరం నామీద వేస్తున్నాడని తెలిసి నాకు ఏడుపు వచ్చేసింది.బావురుమని నేనా పని చెయ్యలేదని విన్నవించుకున్నాను.నా ఏడుపు చూసి ఎస్సై కి విషయం అర్థమయ్యింది.ఆయన కానిస్టేబుల్ ని చీవాట్లు పెట్టి ' అడ్డమైన కేసులన్నీ తీసుకొస్తావ్ గదయ్యా.ఆ సైకిల్ అతనికిచ్చెయ్ ' అని విసుక్కున్నాడు.


సైకిల్ నాకిచ్చేస్తూ ' ఐదు రూపాయిలివ్వు.రిక్షాలో తీసుకొచ్చా ' అన్నాడు కానిస్టేబుల్.నా దగ్గర నయాపైసా లేదు.అదే చెప్పాను.చావు గిరాకీ తగిలిందని గొణుక్కుంటూ ఆయన వెళ్ళిపోయాడు.సైకిల్ దొరికిందన్న ఆనందంతో నేను బయటపడ్డాను.


అయితే నా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.గిట్టనోళ్ళు ఎవరు గింజుకున్నారో కానీ,పి.హెచ్.డి చేస్తున్న మా బాబాయ్ నా సైకిల్ తీసుకెళ్ళి పెడల్ విరగొట్టుకొచ్చాడు.ఆ పెడల్ స్క్రూ టైప్.అప్పట్లో కొత్తమోడల్ .మళ్ళీ బిగిద్దామంటే అలాంటి స్క్రూ ఏ సైకిల్ షాప్ లోను విడిగా దొరకలేదు.వెల్డింగ్ చేయించినా పెడల్ తేడాగానే ఉండిపోయింది.


దాంతోపాటు నా భధ్రాచలం మొక్కు కూడా అలానే ఉండిపోయింది .


' తెలుగురత్న' లో నా కథ- బలిపశువులు

  ( ' తెలుగురత్న' లో మార్చి 2 2010న ప్రచురితం)












   

   

కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది.

ఊరి పొలిమేరలో !
తన చేను మధ్యలో !

అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా అతని నరనరాన్ని దహించి వేస్తున్నాయి.గురవయ్య విధించిన గడువు నేటితో తీరిపోయింది.జోళ్ళు అరిగేలా ఊళ్ళు తిరిగినా ఎక్కడా అప్పు పుట్టలేదు.ఇక పుట్టదనీ అర్థమైపోయింది.ఆఖరు బస్సుదిగి,ఇంటికి వెళ్ళడానికి మనసొప్పక ఇటువైపు వచ్చాడు.అప్పటికే అతనొక నిర్ణయానికి వచ్చేశాడు.

ఎండిపోయిన వేరుశెనగచేను వైపు పేలవంగా చూసి భారంగా నిశ్వసించాడతను.అతని కళ్ళలో జీవం లేదు.తడారిపోయిన నీటి చెలమల్లా ఉన్నాయి.గెడ్డం కలుపుమొక్కలా ఏపుగా పెరిగిపోయి అక్కడక్కడా నెరసిపోయింది.ముఖంపై ముడతలు ముంచుకొస్తున్న వార్ధక్యానికి సూచికల్లా ఉన్నాయి.చిరుగులు పడ్డ అతని పంచె పేదరికాన్ని మరుగున పెట్టలేక నానా అవస్థలు పడుతోంది.మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మెదలింది.

రేచీకట్లు ముసురుకుంటున్న గోధూళి వేళ.పక్షులన్నీ గూళ్ళకు చేరుకుంటున్నాయి.వయసుడిగిపోయి,వ్యాపకాలు లేని వృద్ధులు రావిచెట్టు క్రింద రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.తను పశువులు మేపుకొని అప్పుడే ఇంటికొచ్చాడు.దొడ్లో వాటిని కట్టేసి,వాటికి ఎండుగడ్డి వేసి,కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా అలజడి మొదలైంది.వీధిలోకి వచ్చి చూస్తే వడ్డీవ్యాపారి గురవయ్య,అతని మనుషులు.

గురవయ్య వీధిలోంచే తనకివ్వాల్సిన వడ్డీడబ్బుల గురుంచి గొడవ ప్రారంభించాడు.తను ' ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం ' అన్నా వినలేదు.ఈ రభసకు భార్య,కూతురు బయటికి వచ్చారు.నలుగురూ పోగయ్యారు.తాడోపేడో తేల్చుకోడానికి వచ్చినవాడిలా చిందులు తొక్కుతున్నాడు గురవయ్య.'కూతురు పెళ్ళి రెండునెలల్లో ఉంది.పెళ్ళయ్యాక తలతాకట్టు పెట్టైనా అప్పు తీర్చేస్తాను.అంతవరకూ ఆగమ 'ని తను వేడుకున్నా వినిపించుకోలేదు.గారపల్లు బయటపడేలా పెళుసుగా నవ్వి ' మింగ మెతుకు లేనోడికి మీసాలకు సంపెంగ నూనె దేనికిలే ? ఇప్పుడ్నీ కూతురికి పెండ్లికాకపోతే వచ్చే నష్టమేముంది? ' అనేశాడు తేలిగ్గా.తనకు తలకొట్టేసినట్లైంది.అప్పటికీ అక్కడ మూగిన జనంలో కొందరు తన వైపు వకాల్తా పుచ్చుకొని ' కూతురు పెండ్లంటున్నాడు కదా,కొన్ని రోజులు వోపికపట్టు.నీ సొమ్ము యాడికి బోదులే ' అన్నారు. గురవయ్య వాళ్ళ మీద కస్సుమంటూ పైకి లేచాడు.' చాల్చల్లేవయ్యా చెప్పొచ్చారు.పెతివోడూ నీతులు జెప్పేటోడే.మీకేం మీ సొమ్ముకాదు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెబ్తారు.అవతల ఈళ్ళ దగ్గర డబ్బులొసూలు చెయ్యలేక నా పేనాలు పొతావుండాయి.ఇప్పటికి మూడ్నెలలు వడ్డీబాకీ.మీరెవురైనా హామీ వుంటానంటే చెప్పండి,ఇప్పుడే వదిలేస్తా ' అని కసురుకున్నాడు.ఎవ్వరూ కిక్కురుమనలేదు.అతను తనకు మూడురోజుల గడువిచ్చి,అది దాటితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వెళ్ళిపోయాడు.ఇంతటి ఘోరమైన అవమానం తనకెప్పుడూ జరగలేదు.ఎన్నో ఏళ్ళుగా వ్యయప్రయాసలకోర్చి తను నిర్మించుకున్న పరువుప్రతిష్ఠ ఆ రోజు మట్టిలో కలిసిపోయాయి.

సినిమా వదిలేశాక దాన్ని సమీక్షిస్తూ జనం విడిపోయినట్లు,అక్కడ మూగిన జనం కూడా తలోమాట మాట్లాడుకుంటూ చెదరిపోయారు.చేష్టలుడిగిన శిలాప్రతిమలా నడివీధిలో తాను నిలబడిపోతే,శెలవులలో ఇంటికొస్తూ జరిగిన దారుణమంతా చూసిన తన కొడుకు సూర్యం,తనను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు.' తనిక డిగ్రీ చదవనని,పట్నంలో ఏదైనా పని చూసుకొని చేతనైన సహాయం చేస్తాన ' ని కొడుకు, ' ఇప్పట్లో పెళ్ళివద్దని ' కూతురు మొండికేశారు.అందరి కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.తనే వాళ్ళను సమాధానపరచి పట్టు సడలింపచేశాడు.అప్పట్నుంచి ఎక్కడైనా అప్పు దొరక్కపోదా అని తిరుగుతూనే ఉన్నాడు.తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.

కూతురిని తలచుకోగానే అనంతరామయ్య హృదయం దుఃఖంతో బరువెక్కింది.పెళ్ళిడొచ్చి ఏళ్ళు కావొస్తున్నా ఇంకా గడప దాటని కూతురు.తన ఈడు పిల్లలంతా తల్లులై సంసారాలీదుతుంటే తను మాత్రం ఇంకా వంటపని,పొలంపని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది.ఇప్పటికైనా ఆమెకు పెళ్ళి చెయ్యకపోతే తను విఫలమైనట్టే అనుకొని తనకున్న పరిమితులలో మంచి సంబంధం చూసి ఖాయం చేశాడు.కట్నకానుకలంటూ పెద్దగా లేకపోయినా కనీస ఖర్చులుంటాయి కదా.అతను అప్పు చేశాడు.వేరుశెనగ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సీజన్ లో వర్షాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి.ఒక పంటపండినా అతను కాస్త తెరపినపడ్డట్లే.

పంట ఏపుగా పెరిగి గింజపట్టే దశకు చేరుకొంది.అతని సంతోషానికి అవధుల్లేవు. ' ఇంకో పదును వానపడితే చాలు ' అనుకుంటూండగా పరిస్థితులు మళ్ళీ తిరుగుముఖం పట్టాయి.ఎలక్షన్లలో వాగ్దానాల్లా మెరిపించి మురిపించిన మేఘాలు,గెలిచిన నాయకుడికి మల్లే ముఖం చాటేశాయి.ఎండ తీక్షణత పుంజుకొంది.వేరుశెనగ వాడిపోవడం ప్రారంభించింది.ఊటబావిలోని కాసిని నీళ్ళతో కొన్నాళ్ళు నెట్టుకొచ్చాడు.తర్వాత అదీ ఎండిపోయింది.అతని నెత్తిన బండ పడ్డట్లైంది.గింజపట్టని నీళ్ళకాయలు అతనేం చేసుకోగలడు ?! హతాశుడయ్యాడు.

అనంతరామయ్యది వానాకాలం చదువు.ఉన్న ఆస్తల్లా తాతతండ్రుల ద్వారా సంక్రమించిన ఐదెకరాలే.తండ్రి కాలం చేశాక,తల్లి పోషణభారం కుటుంబబాధ్యతలు భుజానికెత్తుకొని కొన్నేళ్ళపాటూ పొలంలో బంగారమే పండించాడు.ఐదెకరాల ఆస్తికి మరో రెండెకరాలు జతచేసి ఏడెకరాలు చేశాడు. ఆ సమయంలోనే వొక ఇంటివాడై ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు.ఒక కూతురు,వో కొడుకు.

రోజులు దొర్లాయి.కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు.ఫెళఫెళకాస్తూ కరువొచ్చింది.అతను నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. ' ఒక్క ఏడాదేలే' అనుకున్న కరువు మరో మూడేళ్ళు కొనసాగింది.కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవక పొయ్యిమీది పెనంలా పొగలసెగలుపోయింది పుడమితల్లి.ఏనుగుదాహంతో అలమటిస్తున్నట్లు భూములన్నీ నోళ్ళు తెరచిపెట్టుకొని బీటలు వారాయి.అడుసునేలలో పరవళ్ళు త్రొక్కాల్సిన నాగళ్ళు మూలపడ్డాయి.కొమ్ములెగరేసి, కుప్పెలు ప్రదర్శిస్తూ ఠీవీగా తిరిగిన కాడెద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి.ఆకాశం పిండినా చుక్కచినుకు రాలేలా లేదు.పాతాళం తవ్వినా పచ్చిగంగ ముట్టేలా లేదు.జీవనోపాధి కరువైన జనం పొట్టచేతబట్టుకొని,

తిరునాళ్ళకెళ్ళినట్లు పొలోమంటూ వలసపోతున్నారు.పుట్టిన మట్టి,దుక్కిన నేలపై మమకారం చావని తత్తిమ్మా జనం అప్పోసప్పో చేసుకొని,కలోగంజో త్రాగుతూ జీవచ్ఛవాల్లా పడి ఉన్నారు.ఒకప్పుడు పిల్లాజెల్లా,ముసలీ ముతకాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు వీధులన్నీ బోసిపోయి మరుభూమిలా ఉంది.

అనంతరామయ్య తల్లి జబ్బునపడి మంచంపట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయ్యారు.అతని అవసరాలు పెరిగాయి.ఆసుపత్రులకి,మందులకి,బోర్లకి,మోటర్లకి,వాటి రిపేర్లకి తడిసిమోపెడయ్యింది. మునుపటిలా పిల్లలిద్దరినీ చదివించే స్థితిలో లేడు.కూతురు చదువు మానిపించేశాడు.ఖర్చుల కోసం,పంటల కోసం అప్పుచేశాడు.వాటిని తీర్చడానికి రెండెకరాలు అమ్మేశాడు.అలా విత్తుకున్న అప్పు మొక్క,ఏటేటా శాఖోపశాఖలు పరచుకొని కొడుకును కాలేజిలో చేర్పించేనాటికి గాఢంగా వేళ్ళూనిన వటవృక్షంలా రూపాంతరం చెందింది.వాటికి అదనంగా ఇప్పుడు కూతురు పెళ్ళి జతయ్యింది.
నడిసముద్రపు పెనుతుఫానులో చిక్కుకున్న ఒంటరి నావికుడిలా అయిపోయిందతని పరిస్థితి.తుఫాను ఎప్పుడు శాంతిస్తుందో తెలియదు.తీరం ఏవైపుందో తెలియదు.

చేయూతనివ్వడానికి ఎవ్వరూ లేరు.ఎంతకాలమని గుడ్డిగా ఎదురీత ఈదగలడు ?

ఆలోచనలతో అతని మనస్సంతా అతలాకుతలమైపోయింది.

కొడుకుగా,భర్తగా,తండ్రిగా అన్నిరకాలుగా తను విఫలమయ్యాడు.

ఇక మిగిలింది వొక్కటే !

ఆత్మహత్య !!

అతను తనచొక్కాజేబు తడుముకున్నాడు.బస్సెక్కబోతూ టౌనులో కొన్నాడు దాన్ని.అతని చేతికి చల్లగా తగిలింది పురుగులమందు సీసా !

ఒక్కసారి దాన్ని తేరిపార చూశాడు. చీడపురుగుల్ని మట్టుబెట్టడానికి ఉద్దేశించిన ద్రవాన్ని తను త్రాగబోతున్నాడు.తనూ చీడపురుగేనా ? మరి వీళ్ళంతా ఎవరు? మొలకెత్తని విత్తనాలతో మోసం చేసే విదేశీ కంపెనీలు,బ్లాక్ మార్కెట్ కి ఎరువులు తరలించి బ్యాంక్ బాలెన్సులు పెంచుకునే డీలర్లు,అసహాయతను ఆసరా చేసుకొని అధిక వడ్డీలతో పీల్చుకుతినే ఫైనాన్స్ కంపెనీలు,కొనుగోలుదారుడికి,రైతుకి మధ్య సైంధవుల్లా అడ్డుతగిలే దళారులు,పరిశ్రమల పేరుతో వ్యవసాయభూములు కారుచౌకగా కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తలు,ఎగువరాష్ట్రాలు అక్రమంగా నీళ్ళు వాడుకుంటున్నా చోద్యం చూసే రాజకీయనాయకులు,ప్రతి అరగంటకో రైతు బలవన్మరణం చెందుతున్నా సమస్యకు పరిష్కారం కనుక్కోకుండా డబ్బులు విదిలించి వదిలించుకొనే ప్రభుత్వాలు..వీళ్ళనేమనాలి ? కాదు..తను చీడపురుగు కాదు.ఆ మాటకొస్తే రైతనేవాడెవడూ చీడపురుగు కాదు.తామంతా బలిపశువులు.అనుక్షణం దగాపడుతూ,అవమానాల గ్రుక్కిళ్ళు దిగమింగుతూ బ్రతకడం చేతకాని బలిపశువులు.

అతను నిర్వేదంగా నవ్వి మూత తీశాడు !

మొండి ధైర్యంతో సీసాను గొంతులోకి వొంపుకున్నాడు !

మొదట నోరు....తర్వాత గొంతు...భగ్గున మండాయి !

అతను బాధను నొక్కిపట్టాడు.ఇంకెంత కొన్ని నిమిషాలేగా !!


* * *


అనంతరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్తతో ఆ ఊరు తెల్లారింది.శరాఘాతం తగిలిన లేడికూనలా ఆ కుటుంబం నిలువెల్లా వణికిపోయింది.ఒక్కసారిగా వాళ్ళ బ్రతుకులు అంధకారబంధురమైపోయాయి.

తండ్రి శవాన్ని చూడగానే సూర్యం మెదడు మొద్దుబారిపోయింది.
గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.రోదనలు మిన్నంటాయి.అనతరామయ్య భార్య దుఃఖంతో సొమ్మసిల్లిపడిపోయింది.
ఆడవాళ్ళు ఆమెకు సపర్యలు చేస్తున్నారు.బంధువులు వొక్కొక్కరుగా వస్తున్నారు.పరామర్శించి వోదారుస్తున్నారు.తమలో ఒకడిగా,తలలో నాలుకలా మెలిగిన అనంతరామయ్యను కడసారిగా చూడ్డానికి చుట్టుప్రక్కల ఊళ్ళనుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు జనం.అతని విగత శరీరం వొక నగ్నసత్యాన్ని ఆవిష్కరిస్తూ వాళ్ళల్లో భవిష్యత్తుపట్ల భయాందోళనలు రేకెత్తిస్తోంది.

పంచాయితీ పెద్దలకు కబురు వెళ్ళింది.వాళ్ళూ వచ్చారు.రెవిన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే అవకాశాలున్నాయని సూర్యంకు చెప్పారు.అయితే ప్రజాస్వామ్యభారతంలో ప్రతిదానికీ వో రేటున్నట్లే,
ప్రభుత్వాధికారులు,డాక్టర్ల చేతులు తడపడానికీ రేట్లున్నాయని కనీసం ఐదారువేలన్నా అందుకు కావల్సివుంటుందని అనుభవజ్ఞులు కొందరు హెచ్చరించారు.సూర్యంకు అసలు ఆ ప్రతిపాదనే నచ్చలేదు.పోస్టుమార్టం పేరుతో తండ్రి దేహాన్ని ఛిద్రం చేసి,ఆ పై దానికి ' యింత ' అని వెలకట్టడానికి అతనికి మనస్కరించలేదు.

ఈ లోగా విషయం గురవయ్యకు తెలిసింది.అతనితో పాటూ అనంతరామయ్యకు అప్పిచ్చిన మిగతా జనం రెక్కలుకట్టుకొని ఊడిపడ్డారు.ఇటువంటి వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు కొట్టిన పిండే.ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని వాళ్ళకు బాగా తెలుసు.ఎప్పటికైనా జరగాల్సిన తతంగమే కాబట్టి పెద్దమనుషులు కొందరు రంగప్రవేశం చేసి సూర్యం ను ప్రక్కకు పిలిపించి మంతనాలు నడిపారు.

అనంతరామయ్యకున్న ఐదెకరాలు తెగనమ్మి అప్పులు తీర్చేలా తీర్మానం చేశారు.కూతురు పెళ్ళికోసం తెచ్చిన డబ్బుకూడా ఆ జాబితాలో కలిసిపోయింది.చివరకు ఆ కుటుంబానికి తలదాచుకోను ఇల్లొక్కటి మిగిలింది.అప్పులవాళ్ళు శాంతించారు.
సూర్యం మస్తిష్కంలో మాత్రం అలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి.

చందాలు పోగయ్యాయి.ఏ మట్టిని నమ్ముకొని,ఎక్కడైతే అసువులు బాశాడో,అక్కడే ఆ సాయంత్రం అనంతరామయ్యకు అంత్యక్రియలు జరిగిపోయాయి.రైతుల పట్ల వివక్ష ప్రభుత్వాలకే కానీ,పంచభూతాలకు కాదన్నట్లుగా అగ్నిదేవుడు అతని దేహాన్ని ఆప్యాయంగా కౌగలించుకొని తనలో ఇముడ్చుకున్నాడు.ఎగసిపడుతున్న ఒక్కో అగ్నిశిఖ వైపు అనిమేషంగా చుస్తూ మనస్సులోనే యిలా ధృఢంగా అనుకున్నాడు సూర్యం.

" బ్రతుకుతెరువు కోసం కొద్దిరోజుల్లో నేను పట్నం వెళ్తున్నాను నాన్నా ! పుట్టినూరిని, కన్నతల్లిని,అక్కని,నానమ్మని..అందరినీ వదలి వెళ్తున్నాను.కడకు స్వంతరాష్ట్రం కూడా విడిచి వెళ్తున్నాను.ఎక్కడికని కదూ నీ ప్రశ్న? బెంగళూరు వెళ్తున్నాను.అక్కడ నా మిత్రులున్నారు.శెలవులలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తూ వేడినీళ్ళకు చన్నీళ్ళు లా తమ చదువుల కోసం డబ్బులు పోగుచేసుకుంటున్నారు.రోజుకి రెండొందల రూపాయులు జీతం.'అయ్యో ! డిగ్రీ చదువుతూ నా బిడ్డ కూలిపని చెయ్యాల్సి వచ్చిందే ' అని కించపడకు నాన్నా.చట్టబద్ధమైన ఏ పనికైనా కష్టపడటంలో తప్పు లేదు.అయినా ఎల్లకాలం కూలీగా ఉండిపోం కదా.స్వంత ఇల్లు తప్ప మనకింకేం మిగల్లేదు.అయినా సరే..నేను భయపడను.నా గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది.సాధించాలన్న కసి ఉంది. త్వరలోనే నేను ప్రయోజకుడినై తిరిగొస్తాను.అక్క పెళ్ళి ఘనంగా చేస్తాను.ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తాను.ఇప్పుడు మనం కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదిస్తాను.వ్యవసాయం వొక జూదం కాదని నిరుపిస్తాను.నిరాశా నిస్పృహలతో నీలా ఇంకొకరు ప్రాణాలు తీసుకోకుండా,వాళ్ళకు ప్రేరణలా నిలుస్తాను.నన్ను ఆశీర్వదించు."


తెలుగురత్న లంకె


ఈ అవమానాలు మనకు కొత్తా ?!

      

      మొన్నటికి మొన్న కడప జిల్లా మైదుకూరులో, తెలుగులో మాట్లాడిన ఇద్దరు విద్యార్థుల మెడలో 'నేను తెలుగులో మాట్లాడను ' అని వ్రాసున్న పలకలు వేలాడదీయించి స్కూలంతా తిప్పించిన ఉపాధ్యాయుని ఉదంతం విన్నాం.అది మర్చిపోకముందే దాన్ని మించిన దారుణం విజయవాడలో నిన్నతొంగిచూసింది.

పాఠశాలలో ఉపాధ్యాయురాలు అడిగిన ప్రశ్నకు తెలుగులో సమాధానమిచ్చిన నేరానికి,ముగ్గురు పిల్లలు తమ బట్టలు విప్పి బయట నిలబడాల్సి వచ్చింది.అవమానం భరించలేక ఓ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటే అప్పుడు విషయం బయటికి పొక్కింది.మొదట బెట్టు చేసిన యాజమాన్యం,వెల్లువెత్తిన నిరసనలకు,ఒత్తిళ్ళకు తలొగ్గి ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.యథాప్రకారంగా తప్పులన్ని టీచర్ల పై నెట్టి,తమకేమీ తెలియదని తప్పించుకుంది.అయితే తమకు జీతమిచ్చే యాజమాన్యం అదేశాలకు అనుగుణంగానే సదరు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు అలా చెయ్యాల్సి వస్తున్నారు గాని,అదంతా తెలుగుభాష పై వాళ్ళకున్న అకారణ ద్వేషం అనుకోలేం.మైదుకూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్,విజయవాడలో సెయింట్ ఆన్స్ స్కూల్..వెలుగులోకి వస్తున్న ఇటువంటి సంఘటనలు క్రిస్టియన్ మిషినరీ స్కూల్లల్లోనే జరుగుతూండటం కొసమెరుపు.కేవలం ఆ పాఠశాలల్లోనే ఈ దురాగతాలు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ,మిషినరీ స్కూల్లు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాయని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.

అయితే ఈ అవమానాలు మనకు కొత్త కాదు.తెలుగులో మాట్లాడరాదని హుకుం జారీ చేసి,మాట్లాడితే జరిమానాలు, శిక్షలు విధించే పాఠశాలలు మన రాష్ట్రంలో కోకొల్లలు.సెయింట్ ఆన్స్ స్కూల్లోని ఈ నిబంధనలు ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టినవి కావు.ఎన్నో ఎళ్ళుగా అమల్లో వున్నవే.మనకు చుచాయిగా అయినా తెలిసిన విషయాలే.కాబట్టి ఇప్పుడు కొత్తగా 'హవ్వ హవ్వ ' అని బుగ్గలు నొక్కుకొని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.కాకపోతే ఇటువంటి పెడ ధోరణులు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం చాలా వుంది.ఊహ తెలిశాక పిల్లలు తమ భావాల్ని వ్యక్తపరిచేది మాతృభాషలోనే.ఆ భాషని చిదిమేసి,పదజాలాన్ని రూపుమాపి,' అమ్మా' అనే బిడ్డ ఏడుపుని కూడా,తెలుగులో కాక ఇంగ్లీష్ లోకి అనువదించి,మార్చి ' ఓ మై గాడ్ ' అనేలా చేయాలనే తపన ప్రైవేటు పాఠశాలల్లో మితిమీరిపోతోంది. ఆ దుస్థితికి మనం దిగజారిపోకుండా చూసుకోవాలి.చిన్ననాటి నుండే తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లల్లో పెంపొందించి,తెలుగు లో మాట్లాడటం,ఆలోచించటం,పుస్తకాలు చదవటం నేర్పించాలి.మనకు మాత్రమే సొంతమైన కమ్మని పద్యాలని కొన్నైనా కంఠతా పట్టించాలి.' మా తెలుగు తల్లికి మల్లేపూదండ ' పాట వింటే గర్వంతో గుండె ఉప్పొంగి,ఉద్వేగంతో కళ్ళలో నీళ్ళు తిరిగే అభిమానం పిల్లల్లో కలగాలి.ఆ బాధ్యత తల్లిదండ్రులందరి మీదా ఉంది.దురదృష్టవశాత్తూ ఇద్దరు చదువుకున్న తెలుగువాళ్ళు ఒకరికొకరు తారసపడినా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు.ఈ జాడ్యాన్ని తొలగించుకోవాలి.మన భాషను మనమే గౌరవించుకోకపొతే పలుచనైపోతాం.కన్నతల్లిని,సొంత ఊరిని,మాతృభాషని అవమానించేవాళ్ళు పశువులతో సమానం.

ఎన్ని అవమానాలు జరిగినా,దున్నపోతు మీద జడివాన కురిసినట్లు కొన్ని సంవత్సరాలుగా తెలుగుభాష విషయంలో నిస్తేజంగా వున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే కళ్ళుతెరిచి కలయచూసే ప్రయత్నం చేస్తోంది.పాఠశాలల్లో ' మా తెలుగుతల్లికి మల్లెపూదండా ' పాడాలనే నిబంధన విధించింది.విద్యార్థులను దండించిన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకుంటూ సంఘటన పునరావృతమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది.ఇది ముదావహం.అప్పుడే భవిష్యత్తులో మరే పాఠశాల ఇటువంటి దుస్సాహసానికి పూనుకోదు.ఈ చొరవను అధికార కార్యకాలాపాలను తెలుగులో జరిపే విషయంలో కుడా చూపించాలి.తెలుగుతల్లి విగ్రహాలు ధ్వంసం చేసి,' మా తెలుగు తల్లికి ' పాటని అడ్డుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవలి.ప్రాచీనభాష హోదా విషయమై న్యాయస్థానంలో ఉన్న పేచిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.అప్పుడే తెగులు పట్టిన తెలుగుజాతికి విముక్తి.

జై తెలుగుతల్లి !