సమైక్య స్ఫూర్తికి జోహార్లు





బంద్‌లు చేసి, రహదారులు దిగ్బంధించి, రాళ్ళతో దాడి చేసినా, భయపడకుండా, సమైక్యతే శ్వాసగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి రాజధాని నడిబొడ్డులో సమైక్యనాదాన్ని సమర్థవంతంగా వినిపించిన సీమాంధ్ర ఉద్యోగులందరికీ నా జోహార్లు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఊడలు దిగిపోయిన ఏ రాజకీయ నాయకుడూ గత పదమూడేళ్ళుగా చెయ్యని సాహసాన్ని, కేవలం నెలరోజుల వ్యవధిలో  చేసి  చూపించారు. రాజధానిలో రెండో తరగతి పౌరుడిలా బ్రతుకుతున్న ప్రతి సమైక్యవాది గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపారు.  సీమాంధ్ర జిల్లాల్లో స్వచ్ఛందంగా జరుగుతున్న ఉద్యమానికి కొత్త శక్తినందించారు. ఇది నిజంగా ప్రశంసనీయం .

ఈ సందర్భంగా కొందరు తెలంగాణా వాదులు చేస్తున్న వాదనలు వింటూంటే ఇటువంటి చవకబారు వ్యక్తులా రేపు ఒక నూతన రాష్ట్రం ఏర్పడితే దాన్ని నడిపించబోయేది అన్న జాలి కలుగకమానదు.  రాజధానిలో సమైక్య సభ పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని కొందరు పొగలు కక్కితే, ఇంకొందరు విభజన జరిగిపోయింది కాబట్టి సమైక్య సభ పెడితే అది తెలంగాణా వాదులని రెచ్చగొట్టినట్లే అని తీర్మానించారు. తెరాస సంస్కృతిని నరనరానా జీర్ణించుకున్న ఒక విద్యార్థి నేతేమో 'సీమాంధ్రులు అడుగుపెడితే ఖచ్చితంగా తంతాం' అని తనకు మాత్రమే  బాగా అవగతమైన భాషలో బీరాలు పోయాడు. నాలుకలు చీరేస్తాం అని కొందరు పిల్లిమొగ్గలు వేస్తే  భౌతిక దాడులతో సత్కరిస్తామని మరికొందరు విఱ్ఱవీగారు . ఈ మాటలన్నీ వింటూ ఎంతో ఆశ్చర్యపోయాను .

కేవలం ఒక్క సమైక్య సభ...అదీ సీమాంధ్ర ఉద్యోగులు పెట్టుకుంటామంటే తెలంగాణవాదులకంత ఉలికిపాటు దేనికి? ఏపీ ఏంజీవోలు సభ పెట్టుకుంటామన్న రోజే శాంతియాత్రలకు, బంద్‌లకు పిలుపునివ్వటం  దేనికి సంకేతం ? రకరకాల సాకులు చెప్పి నెలకోసారి తెలంగాణ బంద్ చేసినప్పుడు, మిలియన్‌మార్చ్ పేరిట ట్యాంక్‌బండ్‌పై విధ్వంసం సృష్టించినప్పుడూ, సమైక్యవాదులు తమలో తాము బాధపడ్డారే కానీ ఏనాడూ అడ్డుపడలేదు. నాలుగు జిల్లాల వాదాన్ని నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్షగా చిత్రీకరించి, పద్దెనిమిదేళ్ళ ఉద్యమాన్ని(1969-72, 2001-2013) అరవైయేళ్ళ పోరాటంగా అభివర్ణించి డాంబికాలు పలికిన వాళ్ళు ఒక్క సభకే బెదరిపోయారా ? మీ ఉద్యమం నిజంగా ప్రజల గుండెల్లోంచి వస్తే భయపడాల్సిన అవసరం మీకేమిటి ? ఒక్క సమైక్య సభ దాన్ని ఆపగలుగుతుందా ? లేక ఇన్నేళ్ళుగా ఇతరులని మభ్యపెట్టి మాయచేసి నిర్మించుకున్న మృణ్మయ సౌధం కూలిపోవచ్చనే బెంగా ?  ప్రత్యక్ష ప్రసారాలు కూడా అడ్డుకోవాలని పిటిషన్ వేశారే ? దేనికింత అసహనం ? సి.డబ్ల్యూ.సీ తీర్మానం జరిగితే  విభజన జరిగిపోయినట్లేనా? బిల్లు పాసవ్వనక్కరలేదా ? రాష్ట్రపతి ఆమోదముద్ర పడనంత వరకూ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానే . రాజధానిలో తమ గోడు వెల్లబోసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది.  మిలియన్‌మార్చ్ నిర్వహించుకొనే హక్కు తెలంగాణావాదులకెంత వుందో, సమైక్య సభ పెట్టుకునే హక్కు ప్రతి సమైక్యవాదికీ ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం కాదు. వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు.

సమైక్య సభలో నన్ను ఆకట్టుకున్న అంశలు రెండు. ఉద్యమాల పేరుతో  ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు  సంతాపం ప్రకటిస్తూ  తెలంగాణ ప్రజలకూ తమ సంతాపం తెలియజేసినప్పుడు, రాళ్ళదెబ్బలు తిన్న సభికులు కూడా అభ్యంతరపెట్టలేదు. రాజకీయ విమర్శలు చేసినా, తెలంగాణ ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలనూ ఎవరూ కించపరచలేదు . రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని నిర్వాహకులు ఆద్యంతం హెచ్చరికలు చేస్తునే వచ్చారు . వేర్పాటువాదులు  సభలోకి జొరబడి చెప్పు చూపించినా సంయమనంతో వ్యవహరిస్తూ హుందాగా ప్రవర్తించడం నిజంగా గొప్ప విషయం. తెరాస - కోదండ శ్రేణుల్లో ఇటువంటి హుందాతనం భూతద్దం వేసి చూసినా కనిపించదు. సీమాంధ్రుల వేషభాషల్ని, సంస్కృతిని, ఆఖరుకి ఆహారాన్నీ వదలకుండా కించపరిచిన కే.సి.యార్‌కు సమైక్య సభలోని వక్తలకు ఎంత తేడా ? కనకపు సింహాసనమున అన్న సామెత బహూశా ఇలాగే ఉద్భవించి ఉంటుంది. సీమాంధ్ర మీద ద్వేషంతో తెలుగు భాష మీద కూడా విషం చిమ్మిన ఘన చరిత్ర తెరాసది. తెలుగు తల్లిని ఎవడికి తల్లి అన్నారు. తెలుగు ముందు పుట్టిందా ? తెలంగాణ ముందు పుట్టిందా ? తెలుగు భాషకు లేని తల్లి తెలంగాణకు ఎక్కడినుంచి వచ్చింది ?  సత్యవాణి గారన్నట్లు వీళ్ళెవరికీ అసలైన తెలంగాణా సంస్కృతి అబ్బినట్లు లేదు. కేసియార్ కుటుంబం విషయంలోనైతే అనుమానాలే అక్కర్లేదు. అసెంబ్లీ సాక్షిగా జే.పీ పై దాడిచేసినవాళ్ళు ఒకరైతే, ఏపీ.భవన్లో దూరి దళిత ఉద్యోగిపై దాడి చేసి, ఇప్పుడు నాలుకలు చీరేస్తామని ప్రగల్భాలు పలికినవాళ్ళు ఇంకొకరు. ఇక సుపుత్రికైతే నాలుగాకులు ఎక్కువే చదివింది. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులంతా తమ ఇంటిగోడలపై ' జై తెలంగాణా ' అని వ్రాసుకోవాలట. అప్పుడే ఈవిడ రాజధానిలో ఉండనిస్తుందట. నా చిన్నప్పుడు ఒక ఆడదెయ్యానికి భయపడి అమాయకులైన కొంతమంది తమ ఇంటిగోడలపై ' ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాసుకొనే వాళ్ళు. రాత్రిళ్ళు  వచ్చిన ఆడదెయ్యం గోడలపై నున్న వాక్యాలను చదివి ' రేపు రావాలి కాబోలు ' అనుకొని వెళ్ళిపోయేదట. సుపుత్రిక గారి మాటలు ఆ సంఘటనలను గుర్తుతెప్పించాయి. రాజధానిలో పోటీ చేస్తే ధరావతులు దక్కని పరిస్థితిల్లో ఉన్నా రాజ్ఞి లా ఆదేశాలు జారీ చెయ్యడం ఈవిడకే చెల్లు.

భావోద్వేగాలు, రెచ్చగొట్టడం లాంటి పదాలకు తెలంగాణావాదులు కొత్త అర్థాలు సృష్టించారు. వీళ్ళు ట్యాంక్ బండ్ పై విధ్వంసం సృష్టించి, సీమాంధ్రుల ఆస్తుల పై దాడి చేసి, బలవంతపు వసూళ్ళకు పాల్పడి, సినిమా షూటింగులకు అంతరాయం కలిగిస్తే అది భావోద్వేగం. తెలంగాణా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని సీమాంధ్రనేతలు ఎవరైనా అంటే అది రెచ్చగొట్టుడు. ' ఆంధ్రా బ్యాంకు' అని పేరెట్టుకున్నందుకు ఆంధ్రా బ్యాంకు ఏ.టి.ఏం.లు ధ్వంసం చేశారు. చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమలపైనో, జూనియర్ ఎంటియార్ సినిమాలపైనో దాడి చేస్తేనో ఆయా రాజకీయ నేతల యూటర్న్ కారణంగా దాడి చేశారని సరిపెట్టుకోవచ్చు.అల్లరి నరేష్, సునీల్ ఆఖరుకి నితిన్‌లని వదిలిపెట్టలేదంటే వీళ్ళకున్నది వసూళ్ళ పై ధ్యాసే కానీ తెలంగాణా అభివృద్ధి పట్ల కాదన్న మాటేగా ? తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ప్రశ్నలడిగిన జర్నలిస్టుని పట్టుకొని ' బాడఖోవ్, నీయమ్మ ' అని దుర్భాషలాడితే అది తెలంగాణా భాషలో భావ వ్యక్తీకరణ. తిరగబడితే అది దాడి. సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సీ.యం రాజీనామా చెయ్యాలి. సీమాంధ్రులు కూడా కట్టిన పన్నులతోనే జీతభత్యాలు పుచ్చుకుంటూ , మొత్తం రాష్ట్రానికి జవాబుదారీతనం వహించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు మాత్రం తెలంగాణాకు మాత్రమే మంత్రులుగా వ్యవహరించవచ్చు. ఎంత హాస్యాస్పదం. నవ్విపోదురు గాక నాకేటిమి సిగ్గు అన్నట్లు చివరికి కోదండరాందీ ఇదే డిమాండు. సమైక్యవాదులు సభపెట్టుకుంటే అది రెచ్చగొట్టుడు, దండయాత్ర వగైరా వగైరా. ఎ.పి.ఎంజీవోలు తమ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకుంటే  తెలంగాణా ఉద్యోగులు వెళ్ళి గొడవలు చెయ్యొచ్చు . విశాలాంధ్ర  సభ్యులపై భౌతిక దాడులు చెయ్యచ్చు. కళాశాలల్లో ప్రొఫెసర్లని, మెరిట్ విద్యార్థులని బెదిరించి పంపేయవచ్చు. అది తెలంగాణ వాదాన్ని వినిపించటం. గొంతు కోస్తామని సైగ చేసిన ఆంధ్రా ఉద్యోగి కసబ్ అయితే, రాళ్ళతో కొట్టిన వాళ్ళు, రక్తపాతం సృష్టిస్తామన్న వాళ్ళు, నాలుకలు చీరేస్తామన్న వాళ్ళు జాతిపితలు. ఈ ప్రశ్నలన్నీ సూటిగా సంధిస్తే సరైన సమాధానమిచ్చిన తెలంగాణా నేతని ఇంతవరకూ వినలేదు, కనలేదు. ఎంతసేపూ నోరేసుకొని సీమాంధ్ర దోపిడీ, మా ప్రాంతం, మా చావులు అంటూ అవతలి వారి నోరు నొక్కేసి నెట్టుకొచ్చిన వాళ్ళే . గల్లీ నుంచి లోక్‌సభల వరకూ ఇదే తంతు. వీళ్ళు వాదించేటప్పుడు అవతలి పక్షం ఓపికగా వినాలి. అవతలి పక్షం వాదనలు మాత్రం వీళ్ళు వినరు. తమను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు ఎవడైనా సంధిస్తే వాడు సీమాంధ్రా అహంకారి. మెడమీద కత్తి పెట్టి తెలంగాణా వాదాన్ని బలవంతంగా రుద్దిన వీళ్ళా నేడు నీతులు చెప్పేది ?

విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి విశ్రాంతి లేకుండా పోరాడుతున్న సీమాంధ్ర ప్రజలకు ఒక్కటే నా విన్నపం. సమైక్య శంఖారావాలు, బస్సుయాత్రల పేరిట మీ ముందుకొచ్చే రాజకీయ నాయకుల శుష్కవాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండండి. 2009లో ఒకసారి ఇలాగే మోసపోయారు. అప్పటి మీ ప్రతిస్పందన చూసైనా నాయకులు కళ్ళు తెరవకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరి లేకుండా ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసుకుంటూ వోట్లకు గాలాలు వేస్తున్నారు.  మీరు తగలబడిపోతుంటే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇటువంటి నేతలను చూసీ చూడనట్లు వదిలేయకండి. ఉరకలేస్తున్న మీ చైతన్యాన్ని వృథాగా  పోనివ్వకండి. నిలువరించి నిలదీయండి. సమైక్యమా, విభజనా స్పష్టమైన విధానం కావాలని ప్రతిఘటించండి. రానున్న రోజుల్లో రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, ముక్కలై వేరైనా భవిష్యత్తులో ఇటువంటి గోడ మీద పిల్లుల బెడద తగ్గి ప్రజలు హాయిగా జీవిస్తారు.


5 comments

Post a Comment