కీచక సంతతి




'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అని మనుస్మృతి చెబుతోంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారని దీని భావం. మన దేశం గురించి మన సంస్కృతి గురించి గొప్పగా ఎన్ని బాకాలు ఊదినా దేశ రాజధానిలోనే ఒక స్త్రీ మానప్రాణాలకు రక్షణ లేనప్పుడు అదంతా అపహాస్యం కాకమానదు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని తలచుకుంటేనే నెత్తురు మరిగి మనస్సు విచలితమవుతోంది. మృగత్వం మూర్తీభవించిన ఆరు మంది మగాళ్ళు పశువాంఛతో ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి ఆమెను, ఆమె స్నేహితున్ని ఇనుపరాడ్‌తో తీవ్రంగా గాయపరచి కదులుతున్న బస్సులోంచి నగ్నంగా నడిరోడ్డు మీదకు విసిరేశారు. ఆదుకొనే నాథుడు లేక అచేతనావస్థలో వారిద్దరూ ఎంతసేపలా పడిపోయారు తెలియదు. తగిలిన గాయాలలాంటివి. ఆ అమ్మాయి దయనీయ స్థితి వింటే మానవమాత్రుడికెవరికైనా కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరక్క మానదు. జరిగిన ఘోరం కారణంగా ఆమె ప్రేవులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్రతికినా భవిష్యత్తులో పెళ్ళి చేసుకొని సంసారం చెయ్యలేని దుస్థితి. ప్రేవులు దెబ్బతిన్న కారణంగా ఆహారాన్ని సైతం నరాల ద్వారా అందిస్తున్నారు వైద్యులు. హేయమైన కార్యానికి పాల్పడ్డ నేరస్తులు బాధితుల దుస్తులు కాల్చివేసి, బస్సును క్లీన్ చేసి నింపాదిగా యథావిధిగా మరుసటిరోజు విధులకు హాజరయ్యారు.

ఇంతటి ఘోరానికి పాల్పడ్డ నేరస్తులకి ఏ శిక్ష సరిపోతుంది? అసలు భారతీయ శిక్షా స్మృతిలో ఇటువంటి నేరాలకు శిక్ష ఉందా? కేవలం ఐదు నిమిషాల్లో దేహ బాధ నుంచి విముక్తి చేసే ఉరి, ఆ అమ్మాయి జీవితకాలం అనుభవించే మానసిక క్షోభకు సరితూగుతుందా?

దేశంలో కీచక సంతతి నానాటికీ ఎక్కువవుతోంది. ఒక్క ఢిల్లీలోనే ఈ సంవత్సరం 572 రేపులు నమోదయ్యాయి. మిగతా మహానగరాలన్నిటిలో నమోదైన కేసుల సంఖ్య కంటే ఇదెక్కువ. గ్యాంగ్‌రేప్ జరిగిన తర్వాత దేశ రాజధానిలో మహిళల భద్రత గురుంచి కవర్ చెయ్యటానికి వెళ్ళిన ఆజ్‌తక్ మహిళా జర్నలిస్టు కెమేరా సాక్షిగా ఈవ్ టీజింగ్‌కి గురయ్యారు. ఒకవైపు దేశం అట్టుడికి పోతున్నా, మరోవైపు ఎవడేం చేస్తాడన్న ధీమాతో కెమేరా సాక్షిగా ఈవ్ టిజీంగ్ పాల్పడటం  ఘనత వహించిన మనదేశ రాజధాని నేరచరిత్రకు పరాకాష్ఠ. వాళ్ళనని లాభం లేదు. యాథా రాజా తథా ప్రజా అన్నారు కదా. అనేక మోసాలు, నేరాలు చేసిన నిందితులు నాయకమాన్యులవుతున్న దేశంలో ప్రజలు అలా కాక మరోలా ఎలా ఉంటారు?

చెక్ రిపబ్లిక్, పోలాండ్, జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, అమెరికాలోని  కొన్ని రాష్ట్రాల్లో కెమికల్ కాస్ట్రేషన్ అవలంబిస్తారు. మందుల ద్వారా నేరస్తుల వాంఛలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది దీర్ఘకాలిక ప్రణాళిక లాంటిది. నేరస్తుడి పై నిఘా వుంచి సమయానుకూలంగా మందులు వేస్తూండాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలిపోయి నోరున్నవాడిదే రాజ్యమవుతున్న రోజులివి. తమ చేతకానితనానికి సహనమనే అందమైన ముసుగు తొడుక్కొని, మిన్ను విరిగి మీదపడిపోతున్నా మరేం పర్లేదన్నట్టు ప్రతి రోజూ  ఒకేలా నిబ్బరంగా గడపగల భారతీయ ప్రజలలో చైతన్యం జ్వలించాలంటే ఇటువంటి సున్నితమైన శిక్షలు సరిపోవు.

అనెస్తీషియా ఇవ్వకుండా అంగవిచ్ఛేదన చెయ్యాలి.

అరబిక్ దేశాల్లో అమలయ్యే ఆటవిక శిక్షలు కావాలి. రాళ్ళతో కొట్టి చంపడం, బహిరంగ శిరచ్ఛేదన లాంటివి.

అప్పుడే అమ్మాయి మీద చెయ్యివెయ్యాలనుకున్న ప్రతి ఆగంతకుడికి వెన్నులో వణుకు మొదలవుతుంది.


ఏటా ఎంతోమంది ఆయేషాలు, శ్రీలక్ష్మిలు, మరెంతో మంది అబలలు దారుణకృత్యాల బారినపడి దగ్ధమవుతున్నా, జడివానలో దున్నపోతులా  ఏ మాత్రం స్పందించని ప్రభుత్వ యంత్రాంగాలు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు చేబడుతాయా లేక కీచక సంతతికి దేశాన్ని చేజేతులా సమర్పించుకుంటాయా ? 


4 comments

Post a Comment

నా మొదటి పద్యం



ది నా మొదటి పద్యం. అమ్మవారిని స్తుతిస్తూ వ్రాశాను. పద్య నిర్మాణంలో సందేహ నివృత్తి చేసిన శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు, గురుతుల్యులు శ్రీ కంది శంకరయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

ఇది సీస పద్యం. తేటగీతితో పద్యాన్ని పూర్తిచేశాను. రెఫరెన్స్ కోసం వాటి వాటి లక్షణాలు క్రింద పొందుపరచాను.

సీసము - లక్షణాలు

నాలుగు పెద్ద పాదాలు . ప్రతి పాదానికి 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 4+ 4 గణాలుగా పాదం వ్రాస్తే ప్రతి పాదంలోనూ మూడవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతికి బదులు ప్రాసయతిని వాడవచ్చు. అన్ని పాదాల్లోనూ ఒకే యతి పాటించాలనీ లేదు, పాటించకూడదనీ లేదు. మొత్తం పద్యానికీ ఒకే యతి పాటించవచ్చు. ప్రాస నిమయం లేదు. అక్షర నియతి లేదు. సీస పద్యాన్ని ఆటవెలదితో కానీ తేటగీతితో కానీ తప్పనిసరిగా పూర్తిచెయ్యాలి.

తేటగీతి - లక్షణాలు

1 సూర్య గణం + 2 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 5 గణాలు ఏ పాదానికా పాదంగా ఉంటాయి. ప్రతి పాదంలోనూ నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. వీలైతే ప్రాసయతి వాడవచ్చు. ప్రాస నియమం లేదు. అక్షర నియతి లేదు.

నా పద్యం

శ్రీకరి సుందరి శ్రీవిష్ణు హృత్పద్మ
                మందిరా ఇందిర మంగళప్రియ
దాక్షాయణీ దుర్గి దైత్యసంహారిని
               
దీనసంసేవిని దేవదేవి
జ్ఞానసంజీవని నాదసంధాయని
               
శారదా సర్వజ్ఞ త్యరూప
 
ఓంకార రూపిణీ జస్స్వరూపిణి
                
ర్వలోకాత్మికా ర్వమాత 

మల భావాంతరంగిణి న్నపూర్ణ
విశ్వరూపిణి త్రినయని వేద వినుత
యోగమాయా వినోదిని త్పలాక్షి
పాహి మోక్షప్రదాయిని పాహి పాహి


 
భావం :

ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లీ, సుందరి ,శ్రీ మహావిష్ణువు హృదయపద్మమందిరంలో వసించు లక్ష్మీ, మంగళప్రియ, దాక్షాయని, దుర్గా (పార్వతి),దైత్య సంహారిని,దీనజన సంరక్షిణి, దేవ దేవి, జ్ఞానమనే సంజీవని ప్రసాదించి అజ్ఞానమనే మృత్యువు నుంచి రక్షించు సరస్వతి, నాదంతో (సంగీతంతో) అనుసంధానింపబడు శారదా,(సంగీతానికి సాహిత్యానికి నెలవు సరస్వతి, శరదృతువులో సరస్వతిని పూజిస్తారు), సర్వజ్ఞురాలా , సత్య రూపిణి, ఓంకార రూపిణి, ఓజస్స్వరూపిణి (ఓజస్సు = తేజము, బలము, ఉత్సాహము), సర్వలోకాత్మికా, సర్వమాత, నిర్మల(అమల=నిర్మల) హృదయాంతరంగముతో విశ్వాన్ని పోషించే అన్నపూర్ణ, విశ్వరూపిణి, త్రినయన, వేదముల చేత స్తుతింపబడి, యోగమాయతో వినోదించు కలువకన్నుల తల్లీ, మోక్షప్రదాయినీ రక్షించు తల్లీ రక్షించు .    


6 comments

Post a Comment

సుందర దృశ్యరూపం శిరిడిసాయి



నేను షిర్డీ సాయిబాబా భక్తున్ని కాను. దృశ్యరూపంగా సినిమాలలో గానీ సీరియల్స్‌లో గానీ ఆయన మహత్యాలు చూసిన సంఘటనలు గానీ, కర్ణాకర్ణిగా ఆయన చరిత్ర విన్న దాఖలాలు గానీ లేవు . అలాగని ఆయన పట్ల ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు. మా ఆవిడ మాత్రం సాయిబాబా భక్తురాలు. గురువారాలు ఉపవాసాలు ఉండటం, సాయి సచ్చరిత చదవడం లాంటివి  క్రమం తప్పకుండా చేస్తూంటుంది. పూర్తిగా ఆమెకోసమే కాకపోయినా, ఇటువంటి సినిమాల పట్ల నాలో మాములుగా ఉన్న ఆసక్తి, నాగార్జున ఎలా చేశాడోనన్న ఉత్సుకత ఏమూలనో ఉండటం చేత మొదటిరోజే సినిమాకు వెళ్ళిపోయాం. సినిమా చూస్తూ, చూశాక చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం.

శిరిడిసాయి చాలా బావుంది. సాయిబాబా జీవిత చరిత్రను నిజాయితీగా వివరించే ప్రయత్నమని సినిమా చూస్తున్నంతసేపూ అనిపించింది. కథ, కథనం చాలావరకు సాయి సచ్చరితలో ఉన్నట్లే చిత్రీకరించారని మా ఆవిడ ద్వారా తెలిసింది. ఎటువంటి సినిమాలలో అయినా చవకబారు హాస్యాన్ని, వెకిలి శృంగారాన్ని గుప్పించే రాఘవేంద్రరావు ఈ సినిమాలో స్కోపు లేవటం మూలంగానో, శ్రీ రామరాజ్యం విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని తన చిత్రాలతో పోల్చి జరిగిన చర్చల మూలానో కాస్త పద్ధతిగా తీశాడు. ఆయితే ఇందులోనూ చవకబారు సంభాషణలు లేకపోలేదు. ఆలీ, అనంత్ , బ్రహ్మానందం, శ్రీహరి ఆ కార్యాన్ని తమ పంథాలో నిర్వహించారు. బ్రహ్మానందం నటన ఎనభైలలో ప్రదర్శించిన ఆయన శైలిని గుర్తుచేస్తుంది. గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదు. ఒక్కటే దేవుడు పాట ప్రారంభంలో ఋషులు, ముల్లాలు, క్రైస్తవ మతపెద్దలు హిమాలయాల్లో లైన్‌గా కూర్చొని ప్రార్థనలు చేస్తూంటారు. ఆ సన్నివేశాలు కాస్త నవ్వు తెప్పించాయి. అమరారామ,శరణు శరణు శరణం పాటలు నాకు బాగా నచ్చాయి . మిగతా పాటలు సన్నివేశాలకు సరిపోయాయి అనిపించింది కానీ గొప్పగా అనిపించలేదు. బాబా పట్ల నాలో భక్తిభావం లేకపోవటం అందుకు కారణం కావచ్చు.

నాగర్జున నటన మీద నాకు మొదటినుంచీ పెద్ద భ్రమలు లేవు. అన్నమయ్య చుశాక ఫర్వాలేదు అనుకున్నాను. శ్రీరామదాసు ద్వితీయార్థంలో ప్రదర్శించిన హావభావాలు చుశాక నా ఆభిప్రాయం సడలింది. శిరిడిసాయి చూశాక నాగార్జున నటనలో పరిణితి కనబడింది. ఇటువంటి చిత్రాలు చేస్తున్నప్పుడు నటీనటుల ఆహర్యం ముఖ్యం. సగం మార్కులు అక్కడే పడిపోతాయి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయిలలో నాగార్జునకు ఆహర్యం బాగా నప్పింది. బాడీలాంగ్వేజ్‌లో సాయిబాబా శైలిని చక్కగా అనుకరించాడు. పతాక సన్నివేశాల్లో ముఖంలో సాత్వికతను ఆర్ద్రత బాగా ప్రకటించగలిగాడు. పూర్తిగా ఒన్‌మ్యాన్ షో. అతను గర్వంగా చెప్పుకునే చిత్రాలలో ఇదొకటని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మిగతా నటీనటులందరూ ఆయా పాత్రలకు సరిపోయారు. శ్రీకాంత్, శరత్‌బాబు, తదితరులు తమ పరిధి మేరకు బానే చేశారు. కమలినీ ముఖర్జీ తేలిపోయింది.

చవకబారు సినిమాలన్నీ కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించి  ఇటువంటి మరిన్ని చిత్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తున్నాను.


కురుపాండవుల తదుపరి జన్మలు -1


కురుపాండవులకు తదుపరి జన్మలున్నాయా? భవిష్య పురాణం ఉందనే చెబుతోంది.


కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరుకొంది. అటు పాండవ శిబిరంలోనూ ఇటు కౌరవ శిబిరంలోనూ యోధాగ్రేసరులందరో అసువులు బాశారు. కౌరవులు పరాజితులై పాండవులు విజేతలయ్యారు. యుద్ధం చివరి రోజైన పద్దెనిమిదవ రోజు సాయంత్రం, జరిగిన నష్టాన్ని తలచుకొని శ్రీకృష్ణుడు కాలస్వరూపుడైన పరమేశ్వరున్ని స్తుతించాడు. పాండవులకు రక్షణగా ఉండమని ప్రార్థించాడు.

నమ:శాంతాయ రుద్రాయ భూతేశాయ కపర్దినే
కాలకర్త్రే జగద్భర్త్రే పాపహర్త్రే నమోనమ:
పాండవాన్రక్ష భవన్మద్భక్తాన్ భూతభీరుకాన్

రుద్రుడు సంతుష్టుడై త్రిశూలం దాల్చి నందిని అధిరోహించి పాండవ శిబిరానికి కాపలాగా వచ్చాడు. శ్రీకృష్ణుడు సెలవు తీసుకొని గజస నగరానికి వెళ్ళిపోయాడు. తొడ విరిగిపోయి నెత్తుటిమడుగులో పడి ఉన్న దుర్యోధనుని చేత సర్వసైన్యాధ్యక్షునిగా నియమింపబడ్డ అశ్వత్థామ, కుంతిభోజుడు, కృపాచార్యుడు శతృసంహారం కోసం రాత్రి పూట పాండవ శిబిరానికి రహస్యంగా వస్తారు. రక్షకుడిగా సాక్షాత్తు రుద్రుడే నిలబడివుండటం చూసి నివ్వెరపోతారు. అశ్వత్థామ పరిపరివిధాలా పరమేశ్వరున్ని ప్రార్థించి దివ్యఖడ్గాన్ని పొందుతాడు. పరమేశ్వరుడు మార్గానికి అడ్డు తొలగి దారినిస్తాడు.అశ్వత్థామ రెట్టించిన ఉత్సాహంతో శిబిరాల్లోకి దూరి నిద్రిస్తున్న ఉపపాండవులను (పాండవ కుమారులు ఐదుమంది) పాండవులుగా భ్రమించి తన దివ్యఖడ్గానికి బలిస్తాడు. ధృష్టధ్యుమ్నాదులను పరలోకానికి పంపుతాడు.కార్యం ముగిశాక దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెవిన వేస్తాడు. శాత్రవ సంహారం జరిగిందన్న సంతృప్తితో రారాజు మరణిస్తాడు.

కుపితులైన పాండవులు దీనికంతటికి పరమేశ్వరుడే కారణమని అతన్ని నిందించి శస్త్రప్రయోగం చేస్తారు. ప్రయోగించిన ప్రతి ఆయుధం శివుడిలో ఐక్యమైపోతుంది. ఆగ్రహం చల్లారని పాండవులు తన మీద పడి పిడిగుద్దులు గుద్దితే పరమేశ్వరుడు కోపించి " మీరు కృష్ణ భక్తులు గనుక మిమ్మల్ని చంపగలిగీ సహించి రక్షించాను. పునర్జన్మలెత్తి ఈ నేరానికి శిక్షను అనుభవించండి" అని శపిస్తాడు. పాండవులు పశ్చాత్తాపం చెంది హరిని హరున్ని ఇద్దరినీ స్తోత్రం చేస్తారు. భక్తసులభుడైన పరమేశ్వరుడు శాంతించి ఏం వరం కావాలో కోరుకొమ్మంటాడు. శరీరంలో ఐక్యమైన ఆయుధాలు శస్త్రాలు తిరిగి పాండవులకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి త్వరపడి వారిని శపించానని ఆయినా తన వాక్కు వృధా కాదు కనుక వివిధ నామధేయాలతో పాండవులు పునర్జన్మలెత్తి పాపఫలం అనుభవిస్తారని చెబుతాడు.

ఆ ప్రకారం..

ధర్మరాజు బలఖానిగా
భీముడు వీరణుడిగా
అర్జునుడు బ్రహ్మానందుడిగా
నకులుడు లక్షణుడిగా
సహదేవుడు దేవసింహునిగా
ధృతరాష్ట్రుడు పృథ్వీరాజు గా
అతని కుమార్తె వేల గా ద్రౌపది
ఆమె అన్న తారకుడిగా కర్ణుడు
జయసింహుడనే పేరుతో శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మిస్తారు.
(సశేషం ..)


నన్నయ Vs పాల్కురికి సోమనాథుడు

చరా పుణ్యమా అని తెలుగులో ఆదికవి నన్నయా లేక పాలకురికి సోమనాథుడా అనే వివాదం బయలుదేరింది కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నన్నయ






నన్నయ పదకొండవ శతాబ్దానికి చెందిన కవి.ఆయనకు ముందు ఆంధ్ర సాహిత్యం అధ్వాన్న స్థితిలో ఉండేది. సంస్కృత భాషలో రచింపబడిన వేదవేదాంగాలు, పురాణాలు, కావ్యాలు సామాన్య ప్రజానీకానికి సులభంగా బోధపడేవి కావు. ఈ విషయాన్ని గ్రహించిన జినుడు, గౌతమ బుద్ధుడు తమ బోధనలు జనబాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషల్లోనే బోధించి విజయం సాధించారు. ఆరవ శతాబ్దం చివర్లో నిర్మింపబడ్డ శాసనాల్లోనే తెలుగు ఆనవాళ్ళు కనిపించినా, అప్పటికి తెలుగులో ప్రామాణికమైన రచనలు జరిగినట్లు దాఖలాలు లేవు. తెలుగు ప్రయోగం మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. చెదురుమదురుగా కొన్ని పద్యాలు ఉన్నప్పటికీ అవి సంస్కృత వృత్తాల వాసనలను పోలి ఉండేవి. దీనికి కారణం తెలుగులో తగిన పదజాలం లేకపోవటం. ఉన్న కొన్ని పదాలకు స్థిరమైన రూపం ఉండేది కాదు( ఉదాహరణకు  దేవుడు అనే శబ్దం దేవడు, దేవండు, దేవణ్డు ' గా, తూర్పు అనే శబ్దం తూఱ్వు, తూఱ్పు, తూఱ్గు గా వ్రాయబడేది).

తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా పొరుగుభాషలైన తమిళం,కన్నడంలో పరిస్థితి మరోలా ఉంది. తమిళంలో క్రీస్తుకు పూర్వమే తోల్కాప్పియం, తిరుక్కురళ్ వంటి గ్రంథాలు వెలువడితే క్రీస్తు తర్వాత సిలప్పదికారం, మణిమేకలై వంటి మహాకావ్యాలు వచ్చాయి. భారతం కూడా రచింపబడింది. కన్నడలో విక్రమార్క విజయం, గదాయుద్ధం వంటి గొప్ప కావ్యాలు వచ్చాయి. అటువంటి సమయంలోనే  ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్న చాళుక్యులు భాషాభిమానంతో  వ్యవహారిక తెలుగు భాషలోనే శాసనాలు వేయించటానికి ప్రయత్నించారు. చాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుడు వైదిక మతాభిమాని. అతని ఆస్థాన కవి నన్నయభట్టు. నారాయణభట్టు, భీమనభట్టు ఇతర ప్రముఖ కవులు. కన్నడ దేశంలో సాహితీ ప్రక్రియ ద్వారా విస్తరిస్తున్న జైనమతం రాజరాజనరేంద్రున్ని కలవరపెట్టింది. వైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావించాడు. కన్నడ, తమిళ బాషలలో అప్పటికే భారతం రచింపబడి ఉండగా తెలుగులో అప్పటివరకూ లిఖిత కావ్యరచన జరుగలేదన్న వాస్తవాన్ని గ్రహించి విచారించి, ఆ లోపాన్ని సరిదిద్దే బాధ్యతను నన్నయ భుజస్కందాల పై మోపాడు.

రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించే ప్రయత్నానికి నాంది స్థాపన చేశాడు నన్నయ.
సంస్కృతాన్ని ప్రధానంగా తీసుకొని సంస్కృత శబ్దాలతో సమ్మిళితమైన భాషను ఆంధ్రభాషగా స్వీకరించాడు . కొన్ని వేల సంవత్సరాల క్రితం సంస్కృత ప్రాకృత పదాల కలయికతో ఏర్పడ్డ పదాలకు వ్యుత్పత్తి అర్థాలు సృష్టించాడు. వివిధ రూపాలతో వ్యావహారికంలో నలుగుతున్న అనేక పదాలను సంస్కరించి, ప్రామాణికతను నిర్థారించి గ్రాంథికత కల్పించాడు. తెలుగు భాష ప్రత్యేకతైన అక్షరసామ్య యతిని, కన్నడ ప్రాసను మేళవించి సంస్కృత వృత్తాల యతినియమాలు మార్చి కొత్త చోట్ల యతిని ప్రవేశపెట్టాడు. ద్రవరూపంలో ఉన్న భాషకు స్థిరరూపాన్నిచ్చి సుసంపన్నం చేశాడు. ఋష్యత్వం సిద్ధించిన కవులకే తప్ప ఇతర కవులకు ఇది సాధ్యం కాదు

నన్నయ వ్యాస భారతాన్ని ఉన్నది ఉన్నట్లు తెనుగించలేదు. కొన్ని విడిచిపెట్టాడు. కొన్ని సృజించాడు. మరికొన్ని ఇతర పురాణాల్లోంచి స్వీకరించాడు. ఇది స్వేచ్ఛానువాదం. సంస్కృత భాషాభిమానులు తెలుగు భాషను నిరసిస్తున్న రోజుల్లోనే పంచమవేదమైన మహభారతాన్ని తెనుగించే సాహసాన్ని చెయ్యడం నన్నయ సామర్థాన్ని చాటిచెబుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాయపడినట్లు నారయణభట్టు తనకు పరిపూర్ణ సాయమందించాడని అవతారికలో వ్రాసుకొన్నాడు నన్నయ.

పాలకురికి సోమనాథుడు



పాలకురికి సోమనాథుడు 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇతని తల్లిదండ్రులు విష్ణూరమిదేవుడు, శ్రియాదేవి. బ్రాహ్మణుడిగా జన్మించి వేదవేదాంగాలు నేర్చుకొని బసవేశ్వరుని బోధనలతో ప్రభావితుడై జంగముడిగా మారాడని కొందరు, పుట్టుకతోనే జంగముడని మరికొందరు వాదిస్తారు. ఇతని జన్మస్థలం మీద కూడా వివాదం ఉంది. అధిక సంఖ్యాకులు ఇతనిది వరంగల్లు దగ్గర్లోని పాలకురికి అని భావిస్తే ఇంకొంతమంది కర్నాటకలోని పాలకురికి అని విబేధిస్తారు.

సోమనాథుడు సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలో కావ్యాలు వ్రాశాడు. తమిళ, మరాఠి ఇతర భాషలు కూడా వచ్చు.సంగీతంలో ప్రవేశం ఉంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, మల్లమ్మదేవి పురాణం, సోమనాథ స్తవం మొదలైన కావ్యాలు వ్రాశాడు. నన్నయ్య నడచిన బాటను విడిచిపెట్టి తనదైన ప్రత్యేక మార్గాన్ని తొలుచుకుంటూ వెళ్ళి విజయం సాధించాడు. నన్నయ్య సంస్కృత శబ్ద సమ్మిళతమైన తెలుగును స్వీకరిస్తే, సోమనాథుడు జానుతెలుగును అక్కునజేర్చుకున్నాడు. అచ్చ తెలుగు చంధస్సు ద్విపదలోనే అధికశాతం కృతులు వ్రాశాడు. సాధ్యమైనన్ని తెలుగు పదాలను రచనల్లో ప్రయోగించి తెలుగు పదాలకు పల్లకీ మ్రోశాడు. వాడుకలో ఉన్న శివ భక్తుల కథలన్నిటినీ కలిపి బసవని కథకు అన్వయించి కావ్యరచన చేశాడు. ఇతను వ్రాసిన వృషాదిప శతకం తెలుగులో తొలి శతకం. అలాగే చెన్నమల్లుసీసము మొదటి సీసపద్య శతకం.పశ్చిమ చాళుక్యుల వద్ద సేనానిగా పనిచేసిన సోమనాథుడు అంత్యకాలంలో శ్రీశైలం చేరి అక్కడ బసవేశ్వరుని మేనల్లుడైన చెన్నమల్లుని పై సీస పద్యాలు వ్రాశాడు.

సోమనాథుడి సమాధి వరంగల్లు దగ్గర్లోని పాలకురికిలో ఉందని కొందరంటే కాదు మైసూరు జిల్లాలో ఉందని ఇంకొందరంటారు.

సోమనాథుడు వ్రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర స్వతంత్ర్య రచనలైనప్పటికీ, సాహిత్యపరంగా నిర్జీవమైన భాషను బ్రతికించి పరిపుష్టం చేసింది నన్నయభట్టే. పైగా సోమనాథుని కంటే ముందు నన్నెచోడుడు కుమారసంభవ మనే కావ్యాన్ని ఇంచుమించు స్వతంత్ర్యంగానే వ్రాశాడు. అయితే కథా వస్తువు ప్రాచీనమైనది. జానుతెలుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇతనే. సోమనాథుని ఆదికవిగా భావించాల్సి వస్తే, అతనికి ముందు కాలం వాడైన నన్నెచోడున్ని ఆదికవిగా ఎందుకు భావించకూడదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే  ఎటువంటి పదకోశం లేని కాలంలోనే పంచమ వేదమైన మహాభారతాన్ని తెనుగించే ప్రయత్నం చేసి, దాని కోసం భాషను సంస్కరించిన నన్నయ్యభట్టునే ఆదికవిగా పరిగణించాలి. సోమనాథుడు, నన్నెచోడుడు లాంటి కవులు తప్పిస్తే అధిక శాతం కవులందరూ నన్నయ్య పరచిన బాటలోనే సాగిపోయి జైత్రయాత్రలు చేశారు. పెద్దానాదులు సైతం ఆదికవిగా నన్నయ్యను కీర్తించారు.

కాబట్టి తెలుగులో ఆదికవి నన్నయే.

(మూలం: సినారే  "ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు " )


7 comments

Post a Comment

సమాజ జీవచ్ఛవం

 ప ఎన్నికల ఫలితాలు చుశాక నాకు గాయం  సినిమాలోంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వ్రాసిన ఈ క్రింది పాట గుర్తొచ్చింది .



ఈ క్రింది వార్తలు చూశారా? నాకైతే మూడింటికీ పెద్ద తేడా కనబడలేదు.





















ఒకరు దేశాన్ని కుదిపేసిన 2జి కుంభకోణానికి ప్రధానసూత్రధారి.  ఇంకొకరు మతం ముసుగులో ఆశ్లీల కార్యకలాపాలకు అవకతవకలు పాల్పడ్డ స్వామీజీ.  మరొకరు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని నిలువునా దోచేసి అనతి కాలంలోనే వేలకోట్లకు పడగలెత్తి, మృతదేహం రాకముందే ముఖ్యమంత్రై పోదామని కలలు గని ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్న జగన్. ముగ్గురూ మేము నిర్దోషులమని బుకాయిస్తున్నవాళ్ళే. రాజా దళిత కార్డు ఉపయోగిస్తూంటే, నిత్యానంద మతం కార్డు ప్రయోగిస్తున్నాడు. జగన్ తండ్రి, తల్లి, చెల్లి ద్వారా సెంటిమెంటు పండించటానికి కృషి చేస్తున్నాడు.

ఒకప్పుడు నేరం చేసినవాళ్ళు పట్టుబడినప్పుడు అవమానభారంతో తలదించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది. కోట్లాది రూపాయిలు మింగేసిన వాళ్ళు, రేపులు హత్యలు చేసిన వాళ్ళు దేశోద్ధారకులుగా చలామణీ అయిపోతున్నారు. ఎన్ని అవలక్షణాలుంటే వాడే హీరో.   తమ కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆత్మార్పణలు   చేసుకునే వెఱ్ఱి జనాన్ని చూసి వీళ్ళంతా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జైళ్ళలో ఉన్నా రాజభోగాలు అనుభవిస్తూ  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  రోజుకొకటి చొప్పున తామర తంపరగా పుట్టుకొస్తున్న టి.వీ.ఛానళ్ళు  రేటింగులకోసం వీళ్ళను కవర్‌చేసి యథాశక్తి హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

 అఫ్‌కోర్స్. మనదేశంలో ఇంతకంటే అద్భుతాలు  జరుగుతాయని ఊహించలేం. గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది. జనాన్ని మోసం చెయ్యటం చాలా తేలిక.  నిరక్షరాస్యులనైతే చెప్పక్కర్లేదు. చదువుకున్న వాళ్ళనైతే మరీ సులభం. చదవేస్తే ఉన్నమతి పోయినట్లు వీళ్ళ సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోయింది. చేతిలో ఒక పేపరు, చూడ్డానికో ఛానలు, చెప్పడానికి కొన్ని అబద్ధాలు ఉంటే ఇక తిరుగులేదు. ఒక్కసారి వీళ్ళకు బ్రెయిన్‌వాష్ చెయ్యగలిగితే ఆ తర్వాత వీళ్ళను మించిన వీరాభిమానులు మరొకరుండరు. రకరకాల వాదనలు లేవనెత్తి తమ నేతను మించిన నేత మరొకడు లేడని ఢంకా భజాయించి ప్రచారం చేస్తారు. ఒక నాయకుడు చనిపోతే ఆరొందల మంది ఆత్మహత్యలు చేసుకోవటం, హఠాన్మరణం చెందటం ఏమిటన్న కనీస అనుమానం వీళ్ళకు రాదు. ఈ జాబితా మొత్తం ఫేక్ అయినా వీళ్ళకు పట్టింపు లేదు. అలా మరణించిన వాళ్ళను రెండున్నరేళ్ళు ఓదార్చమేమిటన్న తలంపూ రాదు. 2004లో 9.18 లక్షలున్న ఆస్తి 2011 నాటికి 365 కోట్లెలా అయ్యిందంటే అదంతా తమ నేత అసమాన వ్యాపార దక్షత అని గుడ్డిగా వాదిస్తారు తప్ప అందులో వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చెయ్యరు. ఒకవైపు వేల కోట్ల రూపాయిల కుంభకోణాలు కళ్ళకు కనపడుతున్నా, భూములు కోల్పోయి  ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి లబోదిబోమంటున్నా, అవినీతికి ఆధారాలున్నాయని కోర్టులు నొక్కివక్కాణిస్తున్నా, కరుడుగట్టిన నేరస్తులతో సంబంధ బాంధవ్యాలు బయటపడుతున్నా, అవన్నీ వొట్టి ఆరోపణలేనని రాజకీయ కుట్రలని బుకాయిస్తారు. ఇంకొంతమంది 'ఎవడు చెయ్యటం లేదు. అందరూ అదేగా చేస్తున్నది ' అని వేదాంతలు చెబుతారు. ఇంకొంతమంది ' ఎప్పుడూ అవినీతికి పాల్పడని వాళ్ళే జగన్‌ని విమర్శించాల ' ని సూత్రీకరిస్తారు. వీళ్ళ ప్రకారం సిగ్నల్‌జంప్ చేసి వందరూపాయిలు లంచమిచ్చిన వాడూ, వేలకోట్ల రూపాయిలు హవాలా మార్గంలో వెనకేసుకొని దేశద్రోహానికి పాల్పడ్డ వాడూ ఒకడే. ఈ గీతా సూత్రం తెలియక భారతీయ శిక్షా స్మృతి ఎన్నో సెక్షన్లు ఏర్పరచుకొంది పాపం.

ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అసమర్థ ప్రతిపక్షం, చవకబారు రాజకీయాలు, మీడియా, మేధావులు. మీడియా గురుంచి ఇదివరకే మాట్లాడుకున్నాం. ప్రభుత్వం గురుంచి, ప్రతిపక్షం గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేధావుల మౌనం దేశానికి శాపం అని ఊరికే అనలేదు.  దురదృష్టవశాత్తూ జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా జగన్ అరెస్టయ్యేంతవరకూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర ఖజానాని లూటీ చేసిన వ్యక్తి అభిమానులు కూడా ఏ మాత్రం మొహమాటం, సిగ్గూ లేకుండా పబ్లిక్‌గ్గా తమ నేతను వెనకేసుకొస్తున్నప్పుడు ఒక నేరస్తుడిని నేరస్తుడు అని చెప్పడానికి మేధావులు, విలువలున్న నేతలు ఎందుకు అధైర్యపడుతున్నారో ఆలోచించుకోవాలి. వీళ్ళ నోళ్ళు పెగలనంతకాలం సాక్షి చెప్పిందే వేదం, చూపించిందే భాగవతం.


 మూడేళ్ళ క్రితం ప్రమాదవశాత్తూ చనిపోయిన ఒక వ్యక్తిని సానుభూతి వోట్ల కోసం హత్య చేశారంటూ ప్రచారం చేసి, కనీళ్ళు పెట్టుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఆ ఉదంతం మీద ఇప్పటికే కొన్ని కమిటీలు విచారణ చేసి ఇది ప్రమాదవశాత్తూ జరిగిందేనని, ఇందులో ఏ కుట్రకోణమూ లేదని తేల్చేశాయి. అయినా సరే ఎవో కుంటిసాకులు వెతికి జనాన్ని మభ్య పెట్టటం వీళ్ళకు అలవాటైపోయింది. పోనీ, నిజంగానే ఒక స్పష్టమైన నివేదిక కోసం ఎదురుచూస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతిపక్షనాయకుడి ఆస్తుల విచారణ కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడంలో ఉన్న శ్రద్ధ, స్వంత మనిషి మృతి విచారణపై పోరాడటంలో లేదు. ఎక్కడో రైల్వే అకౌంట్స్‌లో పనిచేస్తున్న బ్రహ్మానందరెడ్డిని తీసుకొచ్చి ఏవియేషన్ కార్పొరేషన్‌కి ఎం.డి. ని చేసిన ఘనత వైయెస్సార్‌ది  . అకౌంట్స్ కి  ఏవియేషన్ కి ఏమైనా సంబంధముందా?  వ్యవస్థను అపహాస్యం చేసిన నియామకాల్లో ఇదొకటి. అర్హత లేని వ్యక్తుల్ని కీలకపదవుల్లో నియమించి ఆ తర్వాతి పరిణామాలకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం నిజంగా హాస్యాస్పదం. కిరణ్ ఎందుకు వైయస్‌తో పాటూ హెలికాప్టర్‌లో వెళ్ళలేదు అని వాదిస్తున్న జగన్ వర్గానికి దీని దగ్గర సమాధానముందా ? అసలు జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ ఆరోపణలుండేవా? ఏడుపులూ పెడబొబ్బలు ఉండేవా? కొన్ని వేలకోట్ల రూపాయిల హవాలా కుంభకోణానికి పాల్పడి, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాక కర్నాటక , సిక్కిం తదితర రాష్ట్రాలకు సైతం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన తన కొడుకుని అరెస్టు చేసినందుకు 'నా కొడుకు ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు ? నా కుటుంబానికి అన్యాయం చేశారు. పద్దెనిమిది నియోజక వర్గాల్లో మమ్మల్నే గెలిపించండి' అని కన్నీళ్ళు పెట్టుకోవటం విజయమ్మకే చెల్లింది.  జగన్‌ని ముఖ్యమంత్రి చెయ్యకపోవటం తప్ప వైయెస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏమీ లేదు. A1 నిందితున్ని ఎప్పుడో అరెస్టు చెయ్యకుండా ఎలెక్షన్ల ముందు అరెస్టు చేసి నిజానికి భారీ సాయమే చేసింది.


అబద్ధాలనే అక్షర సత్యాలుగా ప్రచారం చేసి జనం ఆలోచనా విధానంలో చాలా మార్పులే తీసుకొచ్చింది సాక్షి.  విపక్ష నాయకుల మీటింగులకు వెనుక నుంచి ఫోటోలు తీసి జనం రాలేదని ప్రచారం చెయ్యటం దగ్గర్నుంచి, జగన్ అరెస్ట్ అయ్యాడని తెలిసి తిండి మానేసిన చిన్నారి ఫోటోల వరకు ప్రతి వార్తా విలక్షమైనదే.  ఏళ్ళ తరబడి ప్రభుత్వ ప్రకటనలను ఏకపక్షంగా పొంది, తీరా ప్రభుత్వ నియంత్రణ విధించాక అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని, జర్నలిజంపై దాడని నెత్తీ నోరుబాదుకోవటం, దానికి కొంత మంది మేధావులు వంతపాడటం పెద్ద వింత. అసలు జర్నలిజం విలువలంటూ సాక్షిలో ఉన్నదెప్పుడని ? F.I.R లో రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చటం మహానేరంగా, జగన్‌ని అరెస్టు చెయ్యడం మహాపాపంగా, కోట్లు మింగేసిన వ్యక్తిని సాధారణ డొక్కు వ్యానులో కోర్టుకి తరలిస్తే ఉపద్రవం జరిగిపోయినట్లు  సాక్షి ప్రచారం చేసింది. అసలు వైయ్యెసార్ కుటుంబ చరిత్ర  ఎంతమందికి తెలుసు. (వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. పేజీ 64 నుంచి పేజి 78 వరకు, జగన్ గురించి పేజి 92 )  నెలకు రెండొందలు పింఛను ఇచ్చారనో, కాలేజీ ఫీజులు కట్టారనో, ఆరోగ్యశ్రీ అనో వైకాపాకి ఓట్లేసిన ప్రజలు దోపిడీకి గురైన వేల కోట్ల రూపాయిలు కూడా తమదేనని ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. నిరక్షరాస్యులైన ఎర్రచీరల అవ్వలకు, పచ్చచీరల అక్కలకు ఇప్పుడవి తెలియకపోవచ్చు . రోజుకి వందరూపాయిలు చూడ్డమే గగనమైపోయిన అమాయకులకు వేలకోట్లు ఎంతో బోధపడక పోవచ్చు. ఎలాగోలా వార్తల్లో కనబడాలనే జగన్ తాపత్రయం అర్థం కాకపోవచ్చు. ఏదో అన్యాయం జరిగిందన్న అపోహపడి వాళ్ళంతా గంపగుత్తగా ఫ్యాను గుర్తుకు వోటేసి ఉండవచ్చు. అంత మాత్రాన జగన్ నిర్దోషి అయిపోడు. ఒక రాజకీయ విశ్లేషకుడు విశ్లేషించినట్టు గాలి జనార్ధనరెడ్డిని జైల్లో పెట్టాక శ్రీరాములు యాభైవేల మెజారిటితో గెలిచాడు. బీహార్లో పప్పూయాదవ్ గెలిచాడు. శ్రీరాములు గెలిచినంత మాత్రాన  చేసిన అవినీతి మాయమైపోదు. గాలి నిజాయితీపరుడూ అయిపోడు.  పప్పూయాదవ్ ఉత్తముడూ అవడు. అలానే ఇదీ. సత్యమేవ జయతే.


11 comments

Post a Comment

శ్రీవాణీ వీణాజనితం

నాకు బాగా నచ్చిన సంగీత దర్శకులలో ఎం.ఎస్.విశ్వనాథన్ ఒకరు. కే.బాలచందర్ ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అంతులేని కథ ,ఇది కథ కాదు ,గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, కోకిలమ్మ మచ్చుకు కొన్ని. వీటిలో కోకిలమ్మ సినిమాలోని ఒక మంచి పాట గురుంచే ఈ టపా (మొదట పాట వినాలనుకున్న వాళ్ళు చివరి వాక్యానికి వెళ్తే లింకు దొరుకుతుంది).



1983లో విడుదలైన కోకిలమ్మ లో సరిత ప్రధాన పాత్ర పోషించారు.  ఈ సినిమా సమాచారం కోసం, వీడియో కోసం చాలా వెదికాను కానీ ఎక్కడా దొరకలేదు. చూడాలనుకున్నా అవకాశం రాక చూడలేకపోయిన సినిమాల్లో ఇదొకటి.  అంతర్జాలంలో యూట్యూబ్ లింకులు కొన్ని దొరికాయి కానీ ఆవీ పాటలకు సంబంధించినవే.  టైటిల్‌ని బట్టి కథానాయిక ప్రఖ్యాత గాయకురాలై ఉంటుందని ఊహించాను. యూట్యూబ్‌లో నాలుగు పాటలు  చూశాక నా అంచనాలు తప్పని అర్థమయ్యింది. బాలచందర్ సినిమాల్లో పాటలు  కథతో పెనవేసుకొని అర్థవంతంగా ఉంటాయి కాబట్టి స్టోరీలైన్ సులభంగానే బోధపడింది. అలాగే బాలచందర్ అంటేనే సీరియస్ సినిమాలు కాబట్టి, వాటిలో సుఖాంతాలు తక్కువే కాబట్టి నేనూహించుకున్న స్టోరీలైన్‌కి ఒక ట్రాజెడీ ముగింపుని జోడిస్తే కథ చిక్కుముడి తేలిగ్గా విడిపోయింది. 


కోకిలమ్మ (సరిత) ఒక పనిపిల్ల. తనలాగే నిరుపేదైన కథానాయకుడికి (రాజీవ్) ఆసరాగా నిలబడి అతని అభ్యున్నతికి ఎంతో సహాయం చేస్తుంది. అతను పెద్ద గాయకుడై ఎదిగి తన మూలాలు మరచిపోతాడు. ఒక గొప్పింటి అందమైన అమ్మాయి (స్వప్న) ప్రేమలో పడి కోకిలమ్మకు దూరంగా మెలగుతాడు. విషయం తెలుసుకున్న  కోకిలమ్మ నిస్వార్థంగా తప్పుకొని త్యాగం చెయ్యటంతో కథ  సమాప్తమవుతుంది.




ఈ చిత్రానికి కోకిలమ్మ అని పేరు పెట్టటంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. కోకిల నల్లగా అందవిహీనంగా ఉంటుంది. పుట్టక ముందే తల్లి తెచ్చి తనను కాకుల గూడులో విడిచిపెడుతుంది. కాకుల మధ్య కాకిలా పొదగబడ్డ కోయిల, కాకిపిల్లలతో కలిసి  తొలుత కాకిలానే ప్రవర్తిస్తుంది, అరుస్తుంది. క్రమంగా కూయటం అనే తన ప్రత్యేకత అవగతమయ్యాక, తన స్వరూపాన్ని గ్రహించి వేరుపడి వెళ్ళిపోతుంది. కథానాయిక కోకిలమ్మ కూడా అంతే. తనకంటూ ప్రత్యేకమైన స్వచ్ఛమైన మనసున్నా,కమ్మని పాటలు పాడగల నేర్పున్నా, కాకుల్లాంటి లోకులకు పరిచర్యలు చేస్తూ అవకాశవాదైన మరో కాకి లాంటి వ్యక్తిని ప్రేమిస్తుంది. చివరికి అతని నిజస్వరూపం గ్రహించి తనే తప్పుకొని వెళ్ళిపోతుంది.

కోకిలమ్మ అనగానే చాలా మందికి 'పల్లవించవా నా గొంతులో' అనే ఫాట గుర్తొచ్చినా, మిగతా పాటలూ చాలా బావుంటాయి. శ్రీవాణీ వీణాజనితం అలాంటి ఒక ఆణిముత్యం. మనసుకవిగా చిరపరిచితులైన ఆచార్య ఆత్రేయ ఈ పాటకు గేయరచన చేశారు . పాడినవారు పి.బి.శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట సందర్భం తెలియదు కానీ వింటూంటే, సంగీతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సభలో కథానాయకుడు పాడిన పాటలా అనిపిస్తుంది.


పి.బి.శ్రీనివాస్ గాత్రంతో పాట మొదలవుతుంది.

మధురం మధురం నాదం
అది అమరం అమరం వేదం
నాదం గానం సామం
స్వరకలితం లలితం రమ్యం

నాదం అంటే సంస్కృతంలో శబ్దతరంగం, జగత్సంబంధమైన స్పందనం అనే అర్థాలున్నాయి. అలాగే క్రమబద్ధమైన మధురమైన శబ్దం అని కూడా అర్థముంది . అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లుతో, అపసవ్యమైన జీవన విధానాలతో , విపరీతమైన మానసిక  శారీరక ఒత్తిళ్ళతో అతలాకుతలమయ్యే హృదయాలను, సేదతీర్చి, సత్తువనిచ్చే శక్తి నాదానికి ఉంది. వేదానికి మరో పేరు శృతి. నేరుగా వినడం ద్వారా బహిర్గతమైనవి కనుక శృతులంటారు. ఆ వేదాలలో ఉన్నవి మంత్రోచ్ఛాటనలు, శ్లోకాలు, స్తోత్రాలు .జీవాత్మలో పరమాత్మలా ఆ మంత్రోచ్ఛటనలు, శ్లోకాలు, స్తోత్రాలలో దాగున్నది స్వరాలతో సమ్మిళితమైన లలితమైన రమ్యమైన నాదమే.  క్రమపద్ధతిలో వినిపించే నాదం మనస్సుని పట్టి ఉంచి, ఏకాగ్రతని పెంచి, బుద్ధిని వికసింపజేసి శరీరాన్ని అమరం చేస్తుంది. అందుకే నాదం అమరం. నాదాలతో నిండిన వేదం అమరం. 

 శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం  మధ్యమదూతం
త్రైకాల సంచారం

ఓంకార నాదం వైశిష్ట్యాన్ని తెలిపే పల్లవి ఇది. ఇందులో నాకు అర్థం కాని కొన్ని వాక్యాలున్నాయి. నాకు తెలిసినంతలో విశ్లేషించటానికి ప్రయత్నిస్తాను. అకార (సృష్టి- బ్రహ్మ) ఉకార (స్థితి- విష్ణు) మకారాల (లయ-మహేశ్వరుడు) కలయికే ఓంకారం. అది ఆద్యంతాలు లేని ప్రణవ నాదం. అంటే అంతమూ, ఆరంభమూ రెండూ లేవన్నమాట. అన్ని శబ్దాలకి మూలమిదే. అటువంటి ఈ నాదాన్నే స్వర్గలోకంలో ఉన్న మహర్షులు, బ్రహ్మర్షులు నిత్యం స్మరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తూంటారు. (నా దగ్గరున్న శబ్దరత్నాకరంలో ' సరితం' అనే పదం లేదు. ఆంధ్రభారతి పదకోశంలో సరితం అంటే చరితం అని ఉంది. అలాగే ' సరిత్ ' అంటే నది అనే అర్థముంది. ఈ అర్థాన్ని స్వీకరిస్తే సురలోక మహర్షులు స్నానమాడి పునీతమయ్యే నది లాంటి ప్రణవనాదం అనుకోవాల్సి వస్తుంది )

ఓంకారానికి ఆద్యంతాలు లేవనుకున్నప్పుడు శ్రీవాణీ వీణాజనితం (సరస్వతీదేవి వీణలోంచి జన్మించినది) అనడం తప్పేమో అనిపించింది. అంతర్జాలాన్ని శోధిస్తే సంగీత రత్నాకరం ప్రకారం వీణ(సంగీత వాయిద్యం) దేవతలకు ఆవాసమని, మెడలో మహేశ్వరుడు, తీగలలో పార్వతీ దేవి, వాటిని పట్టి ఉంచుతూ లక్ష్మీదేవి, యాళిలో (పౌరాణిక జంతువు మెడ ఆకారం) విష్ణువు, రెండవ సొరకాయబుర్రలో బ్రహ్మ, ప్రతిధ్వనించే నాదంలో సరస్వతీదేవి కొలువై ఉంటారని  తెలిసింది. సరస్వతీదేవి చేతిలో ఉంటుంది కాబట్టి సరస్వతివీణ అని కూడా అంటారు. సరస్వతికి మరోపేరు శ్రీవాణి. ముగ్గురమ్మలు, త్రిమూర్తులు కలిసి కొలువై ఉన్న చోట ప్రణవనాదమైన ఓంకారమేగా వినిపిస్తుంది. కాబట్టి శ్రీవాణీ వీణాజనితం అన్నమాటకు లెక్కసరిపోయింది. పశువులకు,శిశువులకు, పాములకు సైతం తెలిసిన సంగీతం, పక్షుల కూతల్లో   మధ్యమస్వరంలో రాయాబారాలు నడుపుతూ(శౌకం అంటే శుక సమూహం,శుకం అంటే చిలుక, మధ్యమం సరిగమపదనిలో ఒక స్వరం, దూతం అంటే  రాయబారి)   అమితమైన అమృతంలా త్రికాలాల్లో(భూత,భవిష్యత్,వర్తమాన)   నిరంతరం ఉంటుందని ఆత్రేయ గారి భావమనుకుంటాను.

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి
గీతం కవితా హృదయం
సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం
త్రైమూర్తి రూపం

మొదటి చరణంలోని పై వాక్యాలకు పెద్దగా వివరణ అక్కర్లేదనుకుంటాను. మొదటి వాక్యం నాకు బాగా నచ్చింది. సాధారణమైన వెదురుబొంగు శ్రీకృష్ణుని చేతిలో పడి సుమధురగీతాల సుధల్ని కురిపించిందంటే అది భగవంతుని అనుగ్రహ విశేషమే కదా. ఇదే అర్థమిచ్చేలా  వేటురి గారు ఏదో ఒక పాటలో చిన్న వాక్యం వ్రాసినట్లు గుర్తు. సమయానికి గుర్తురావటం లేదు. అన్నయ్య అంటే అన్నమయ్య . మాములుగా రాగం, తానం, పల్లవి అంటూంటాం. ఇక్కడ పల్లవి బదులు మకుటం అనే పదం వాడారు . మకుటం అంటే కిరీటం. పాటకు మకుటం పల్లవే కదా. ఈ మూడింటినీ త్రిమూర్తులతో పోల్చారు ఆత్రేయ.

జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలికావ్య శ్లోకమై శ్రీరామ చరితై నిలచినది
తీరని దాహం గానం
కడతేర్చే జ్ఞానం గానం
రాగం మోదం మోక్షం సంగీత యోగం

జయదేవుడు 12వ శతాబ్దానికి చెందికి ఒక ప్రముఖ కవి. ఆయన భార్య పద్మావతి. ఇద్దరూ అన్యోన్య దంపతులు, పూరీ జగన్నాథస్వామి సేవకులు. జయదేవ కృతులలో గీతాగోవిందం అనే కావ్యం చాలా ప్రసిద్ది కెక్కింది. రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణిస్తూ వ్రాసిన వాటిని అష్టపదులంటారు. ఈ అష్టపదులలో పద్మావతి పేరు అనేక మార్లు దొర్లుతుంది. పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ, పద్మావతీ రమణ..ఇలా. అది తన భార్యపై జయదేవునికున్న మమకారానికి గుర్తు. జయదేవుడు వ్రాసి స్వరపరిచిన ప్రతి అష్టపదిని పద్మావతి తన అపూర్వమైన నృత్య ప్రతిభతో స్వామి సన్నిధిలో అభినయించి చూపేది.

క్రౌంచ పక్షుల జంటను వేటాడి, వాల్మీకి కోపానికి గురై తద్వారా తొలిశ్లోక రచనకు కారణభూతుడౌతాడు ఒక బోయవాడు. ఆ శ్లోకమే శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు శ్రీకారం చుడుతుంది.  గానం ఒక తీరని దాహమే కాదు, జ్ఞానం ప్రసాదించి సంతోషాన్ని,విముక్తిని కలిగించేది కూడా అంటూ ఈ చరణం ముగుస్తుంది. వాల్మీకి నుంచి జయదేవుని వరకు, త్యాగయ్య నుంచి అన్నమయ్య వరకూ నాదోపాసకులంతా అలా సంగీత సుధాంబుధిలో తేలియాడి స్వరపరమాత్మలో లీనమై శాశ్వతులైన వాళ్ళే .మనసుకవి ఆత్రేయలో మరో పార్శ్వాన్ని ఆవిష్కరించిన  ఈ పాటను ఇక్కడ వినండి.





2 comments

Post a Comment

పెట్రోలు రాజకీయాలు..కాదంటారా ?!



నం నెత్తిన మళ్ళీ పెట్రోబాంబు పడింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7.50 రూపాయిలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలకు నిచ్చెన వెయ్యలేక కాళ్ళు విరగొట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పిడుగుపాటు. షరా మాములుగా సవరించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా పెట్రోల్ పంపుల ముందు బారులు తీరి బూతులు తిట్టుకుంటూ నానా అవస్థలు పడ్డారు.   రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న చమురు కంపెనీలు ధరల పెంపుదల విషయాన్ని సాయంత్ర వేళ బహిర్గతపరచి ప్రతిపక్షానికి వెనువెంటనే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసుకునే అవకాశం లేకుండా చేసి కొంతవరకూ సఫలీకృతమైనా, పెంచిన ధరల విషయంలో అవి ఎంత వరకూ తమ మాట నిలబెట్టుకుంటాయో వేచి చూడాలి. డీజల్ ధరను 5 రూపాయల వరకు, గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయల వరకు పెంచే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఇంధన ఛార్జీలు పెంచితే రవాణా ఛార్జీలు తడిసి మోపెడై నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియమవుతాయి. పెనంలోంచి పొయ్యిలోకి పడినట్లవుతుంది అప్పుడు పరిస్థితి. ఏతావాతా సగటు మనిషి కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

 సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 73.14 రూపాయిలు. ఆ ధర నిర్ణయింపబడే క్రమం ఇంచుమించుగా ఇదీ .

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 106.02 డాలర్లు అనుకొందాం (ప్రస్తుత రేటు)


1 బ్యారెల్ = 106.02 డాలర్లు
1 డాలరు = 55.39 రూపాయిలు.


1 బ్యారెల్ = 106.02 * 55.39 = 5872.44 రూపాయిలు

1 బ్యారెల్ = 158.97 లీటర్లు

1 లీటరు = 36.94 రూపాయిలు (5872.44 / 158.97)
 
ఎక్సైజ్ డ్యూటీ      = 14.45 రూపాయిలు

ఎడ్యుకేషన్ టాక్స్ = 0.43 రూపాయిలు
డీలర్ కమీషన్     = 1.05 రూపాయిలు
రిఫైనింగ్               = 0.52 రూపాయిలు
క్యాపిటల్ కాస్ట్ }
ఆఫ్ రిఫైనరి          = 6.00 రూపాయిలు
వ్యాట్                   = 5.5 రూపాయిలు
క్రూడ్ ఆయిల్ }
కస్టం డ్యూటీ        = 1.1 రూపాయిలు
పెట్రోలు కస్టం      =  1.54 రూపాయిలు
రవాణా ఛార్జీలు   =  6.00 రూపాయిలు

మొత్తం 73.53 రూపాయిలు. పన్నులు లేని పక్షంలో లీటరు పెట్రోలు ధర 49.46 రూపాయిలు. గత కొద్ది నెలలుగా మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గుతూనే వస్తోంది. మార్కెట్లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినప్పుడు కూడా ఇప్పుడున్నంత ధరలు లేవు. పైగా ఇండియన్ ఆయిల్ కంపెనీలకు కొనుగోళ్ళలో డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి పెట్రో ధరలు ఇంకా తక్కువగా ఉండాలి.పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో కంటే మనదేశంలోనే పెట్రో ఛార్జీలు అధికంగా ఉండటం గమనార్హం. డాలర్ రేటు పెరగటం వలన తామెంతో నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీలు నమ్మబలుకుతున్నా, ఏటేటా పెరుగుతున్న లాభాలు, ఇరవై శాతం పడిపోయిన బ్యారెల్ ధరలు అదంతా కట్టుకథేనని తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు 2009-10 సంవత్సరానికి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ లాభాలు పన్నులు పోగా 1301.37 కోట్లు కాగా, 2010-11 సంవత్సరాంతానికి 1539.01 కోట్లు.  అలాగే సబ్సిడీ ఇస్తున్నామని ఉదరగొట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వాలు ఎన్ని పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నాయో పై క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది.


ఇంధన వనరుల పై ప్రభుత్వాలకు మొదటి నుంచి సరైన అవగాహన, శ్రద్ధ లేదు. ఎన్ని నిక్షేపాలు కనుగొని, బేసిన్ల కొద్దీ బావులు తవ్వుకున్నా శాశ్వతమైన, సూర్య శక్తికి అవి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాలేవు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి, పరిశోధనలు జరిపించి , ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం విడ్డూరం. ఆకు పసరులతోను, నీళ్ళతోనూ, గాలితోను, సౌర శక్తితోను వాహనాలు నడిపి చూపించిన యువ శాస్త్రజ్ఞులకు దక్కిన గుర్తింపేది? భారత ఆర్థిక ములాలను శాసిస్తున్న కంపెనీలపై చూపించే అవ్యాజమైన ప్రేమాభిమానాల్లో ఆవగింజంతైన వారిపై చూపించారా?


  పెరుగుతున్న జనాభాకు భవిష్యత్ తరాలకు సరిపడే ఇంధన నిల్వల గురుంచి ఆలోచించరు. సరైన రోడ్లుండవు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సవ్యంగా ఉండదు. ఉన్నా అన్ని రూట్లలో తిరగదు. ఇవేమీ లేకున్నా ఇబ్బడి ముబ్బడిగా కార్ల కంపెనీలకు, మోటారు వాహనాల పరిశ్రమలకు పర్మిట్లు మాత్రం ఇచ్చేస్తారు. అవన్నీ రోడ్ల పైకొచ్చి ఉన్న చమురంతా అరాయించుకొని, కాలుష్యాన్ని వెదజల్లుతూంటే, ఆ తర్వాత సబ్సిడీలని నష్టాలని ధరలు పెంచి, రెట్టింపు ధరలు చెల్లించి దిగుమతులు చేసుకుని, పైపులు తవ్వుకొని పక్క దేశాల దయా దాక్షణ్యాలపై అధారపడతారు. అమెరికా తుమ్మినా అదిరిపడటం నేర్చుకున్నారు కాబట్టి ఇతర దేశాలతో ఏవైనా చమురు ఒప్పందాలవీ చేసుకున్నా అవి సఫలమయ్యే ఛాన్సులు లేవు. అమెరికా వద్దంటే కిక్కురుమనకుండా ఒప్పుకోవాల్సిందే.( ఈ మధ్యే ఇరాన్ విషయంలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గి మనదేశం 11% శాతం దిగుమతులు తగ్గించుకోవడానికి ఒప్పుకొంది). ప్రపంచ చమురు సంక్షోభానికి భారత్ కారణం అని అమెరికా అంటే నంగి నంగిగా నీళ్ళు నమలటం తప్ప నోరు పెగల్చే సాహసం కూడా చెయ్యరు. కులం పేరుతో, మతం పేరుతో, కుటుంబం పేరుతో, సినీ అభిమానం పేరుతో వేలం వెర్రిగా రాజకీయ నాయకులని ఎన్నుకొనే ప్రజలకు అంతకంటే గొప్ప పాలకులని ఆశించటం తప్పేమో? అయినా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు ఈ తంతుని నిర్లిప్తంగా మనకేమి పట్టనట్లు గమనించలేదు. మహా అయితే వారం పది రోజులు గుండెలు బాదుకుంటాం. తర్వాత మళ్ళీ మాములే. ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర ఇంజను స్విచాఫ్ కూడా చెయ్యం.  కాదంటారా?



4 comments

Post a Comment

అంటరాని వసంతం


సంతం అంటేనే కొత్త శోభ, కొత్త ఉత్సాహం. అది అందరిదీ. చిగురించే మొక్కలోని కోమలత్వాన్ని , విరబూసిన  పువ్వులలోని స్వచ్ఛతని,  మత్తెక్కిన కోయిల సుస్వరాలని  ఎవరు మాత్రం ఆస్వాదించాలనుకోరు ? వసంతం, విషాదం ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. అయితే అందరి అనుభూతులు మాత్రం ఒకేలా  పరిగణింపబడటం లేదు. కులం పేరుతో మనుషుల్ని వెలివేసి వాళ్ళ సంస్కృతిని కించపరచి, హక్కుల్ని కబళించి, ఆనందాలని కాలరాస్తే అదే అంటరాని వసంతమవుతుంది.

ఎల్లన్నది ఎన్నెలదిన్నె అనే కుగ్రామం. అత్త పర్యవేక్షణలో ఆటపాటలతో పెరుగుతూంటాడు. అక్షరాలు వ్రాయడం రాకపోయినా స్పందించే హృదయం, ఉప్పోంగే రక్తం అతనికి పదాలు కూర్చడం, ఆ కూర్చిన పదాలకి అలవోకగా చిందులు వెయ్యడం నేర్పాయి. వీధినాటకాలాడే ఎర్రగొల్లలు ఆ గ్రామానికి వచ్చి రాత్రిళ్ళు ప్రదర్శనలిస్తూంటే, ఆటపాటల మీదున్న ఆసక్తి కొద్దీ వాళ్ళని కాస్త దగ్గరినుంచి చూడాలనుకుంటాడు. అత్త వద్దని వారిస్తుంది. ఆమెకు తెలియకుండా ఒకరోజు ప్రొద్దున్నే  ఊరిబయటనున్న ఎర్రగొల్లల డేరాలకు వెళ్తాడతను. అతని కులం అక్కడ పరిచయమవుతుంది.

ఆ గ్రామంలో కట్టుబాట్ల ప్రకారం కేవలం కరణాలు, కాపులు మాత్రమే ప్రదర్శనకు దగ్గరగా కూర్చునేవాళ్ళు. వారి వెనుక మంగలి, కుమ్మరి మిగత కులాల వాళ్ళు కూర్చునేవాళ్ళు. వీళ్ళందరికీ దూరంగా వెనుకున్న మాల దిబ్బ పై మాలవాళ్ళు, మాదిగ దిబ్బపై మాదిగలు కూర్చునేవారు. కరణం వచ్చిన తర్వాతే వీళ్ళందరూ దిబ్బలపైకి రావాలి.  ప్రదర్శన కనిపించకపోయినా కూర్చునే చూడాలి తప్ప నిలబడి చూడకూడదు. అటువంటిది ఒక మాలపిల్లవాడు  ఏకంగా డేరాల్లోకే రావటం అక్కడున్న గుంపులో కలకలాన్ని సృష్టిస్తుంది. రాళ్ళతో వెంటపడతారు . అర్థంకాకపోయినా అనాలోచితంగానే పరుగు తీసిన ఎల్లన్న పొదలు దూకి, కంపచెట్లను దాటి, బండరాళ్ళు తగిలి బోర్లాపడి, పైకిలేచి, రక్తమోడుతూనే ఏటికి ఎదురీది, ఊరుకి ఆవలిగట్టు చేరుకుంటాడు . అయినా నడక ఆపలేదు. భయంతో మొదలుపెట్టిన నడక చీకటయ్యాక, చీకటిలో తననెవరూ గుర్తుపట్టలేరని నిర్ణయించుకున్నాక ఆపుతాడు . అత్త ఎందుకు వద్దందో అప్పుడర్ధమయ్యింది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకెప్పుడూ అలా చెయ్యనని చెప్పాలనుకుంటాడు. చీకట్లో ఊరికి ఎంతదూరం వచ్చేశాడో, ఎటువైపు వెళ్ళాలో తెలియలేదు. తెల్లవారాక వెళ్ళాలనుకుంటాడు. ఎక్కడి నుంచో గాలి మోసుకొచ్చిన లయబద్దమైన శబ్దం అలసిపోయి నొప్పులతో బాధపడుతున్న అతని పాదాలకు తిరిగి సత్తువనిచ్చి ఉరుముల నాగన్న వద్దకు చేరుస్తుంది.

నాగన్న ఉరుముల నృత్యం ఆటగాడు. పక్కలదిన్నె అనే గ్రామంలో తన బృందంతో కలిసి ప్రదర్శనకు వచ్చినతను ఎల్లన్నలోని మెరుపుని అసహాయతను గుర్తించి అతన్ని చేరదీసి వివరాలు కనుక్కుంటాడు. గత జ్ఞాపకాలు అతని గుండె తలుపులు తట్టి మనసుని వికలం చేస్తాయి. నాగన్నదీ ఎన్నెలదిన్నే. అతనూ అక్కడినుంచి వలసపోయినవాడే. మాలాడు, మాదిగాడు వెట్టి చెయ్యకపోతే బ్రతకలేని ఊరు ఎన్నెలదిన్ని. మధ్యాహ్నం కూడు  తప్ప మరో కూలి వుండేది కాదు. దాని కోసం కూడా కొట్టుకు చచ్చేవాళ్ళు. కరణం పరమ క్రూరుడు. ' మీ కులం అంత గొప్పది ఇంత గొప్పది ' అని రెచ్చగొట్టి మాలల పైకి మాదిగల్ని, మాదిగల పైకి మాలల్ని ఉసిగొల్పేవాడు. అతని మాటకు ఎదురుతిరిగినివాళ్ళ బ్రతుకులు తాటితోపులో తెల్లారిపోయేవి. వరదలొచ్చినప్పుడల్లా ఏటికి దగ్గర్లో ఉన్న మాలపల్లి, మాదిగపల్లి మునిగిపోయేవి. ఊరికి పై భాగాన ఉన్న దిబ్బపై ఇళ్ళు కట్టుకోవాలని చూస్తే అంటరాని వాళ్ళు తలభాగాన ఉండరాదని అగ్రవర్ణాల వాళ్ళు హుకుం జారీ చేస్తారు . ఓ సారి వరదలొచ్చి,ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయినప్పుడు నాగన్న తండ్రి ధైర్యం చేసి గొడ్డలి భుజాన వేసుకొని అందరినీ దిబ్బలపైకి తీసుకు వెళ్తాడు . అగ్రవర్ణాల ఇళ్ళ మధ్య నుంచి, ఊరి మధ్యనుంచి, దేవాలయాల సందుల నుంచి దిబ్బలపైకి జనాన్ని తీసుకువెళ్తాడు . తిండిలేక పిల్లలు అలమటిస్తూంటే షావుకారు కొట్టు తాళం పగలకోట్టి ధాన్యం బస్తాలు తెచ్చుకుంటారు. రెండ్రోజుల తర్వాత అతని శవం అదే దిబ్బపై కనబడుతుంది . బిక్కచచ్చిన జనం వానవెలిసాక మళ్ళీ పాతచోటే గుడిసెలు వేసుకుంటారు. అప్పుడు తల్లితో పాటు ఊరుదాటిన నాగన్న మళ్ళీ ఇన్నాళ్ళకి తన ఊరి పేరు వింటాడు.  మనుషులు మారుతున్నారు తప్ప మనుగడలో మార్పు లేదని ఎల్లన్న కథతో తెలుసుకుంటాడు . ఎల్లన్న చెయ్యి పుచ్చుకుని ఎన్నెలదిన్ని మాలపల్లిలో అడుగుపెడతాడు.

నాగన్నని పోల్చుకున్న ఊరు అతన్ని అతని నృత్యాన్ని ఆదరిస్తుంది . ఏ దిబ్బపై తన తండ్రిని చంపారో అదే దిబ్బపై ఆ మరణానికి కారకుడైన కరణాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాదిగ మాతయ్య నరికేశాడని, ఇప్పుడంతా పిల్ల కరణం చెప్పుచేతుల్లో నడుస్తోందని  తెలుసుకుంటాడు.  ఎల్లన్నకి పాటలు, నృత్యం నేర్పించి అతని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంటాడు.

నాగన్న చొరవతో పెద్దలను ఇరుకున పడేసి దెయ్యాల దిబ్బను సాగులోకి తెచ్చుకుంటారు మాలమాదిగలు. అగ్రవర్ణాలకు ఆవేశాలు రగిలినా అంతకు ముందు లేని ఐక్యత ఇప్పుడు మాలమాదిగల్లో కనబడేసరికి కక్కలేక మింగలేక మిన్నకుండిపోతారు. నాగన్న తర్ఫీదులో  ఎల్లన్న రాటుదేలి గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను వేషం కడితే చూడ్డానికి చుట్టుపక్కల మాల మాదిగ పల్లెలు ఎగబడేవి. ఆటకు ముందు కరణం ,ఇతర పెద్దలు వచ్చారో లేదో తెలుసుకుని అప్పుడు మొదలెట్టడం ఆనవాయితీ. దాన్ని ధిక్కరించి 'ఘనత వహించిన పెద్ద మాల, అంతే ఘనత వహించిన పెద్ద మాదిగ  తమ స్థానాలు అలంకరించారా లేదా' నని తెలుసుకొని అప్పుడు ప్రదర్శన మొదలుపెట్టడం ప్రారంభిస్తారు . అగ్రవర్ణాలకు ఈ పరిణామం మింగుడుపడక నాగన్నని, ఎల్లన్నని పిలిపించి ఆటకు ముందు అలా పిలవకుండా ప్రదర్శనలిచ్చుకోమని లేకపోతే రెండు ఊళ్ళూ బూడిదవుతాయని హెచ్చరిస్తారు.  ఏం చెయ్యాలో తోచక నాగన్న తనవాళ్ళతో చర్చిస్తాడు. ఆత్మగౌరవం కోసం తెగించి పోరాడే ధృడచిత్తం కరువయ్యేసరికి నిరాశపడి ఆ దిగులుతోనే మరణిస్తాడు.

నాగన్న మాటలే మననం చేసుకుంటూ భార్యా పిల్లలను, గ్రామాన్ని విడిచిపెట్టి ఊళ్ళుపట్టిపోతాడు ఎల్లన్న. పెరిగే పైరు మీద, నాట్లు వేసే కూలీల కష్టం మీద, నేల మీద జరిగే ప్రతి విన్యాసం మీద పాటలల్లి పాడతాడు. భార్య పేరుని పల్లవిగా చేసుకోని పాడతాడు. మాలబైరాగిగా పేరు గడిస్తాడు. పెదకోటేశ్వరుడు అనే కుమ్మరి పోతులూరి వీరబ్రహ్మం గారిపై ద్విపద పద్యాలు వ్రాసి కులాల హెచ్చుతగ్గుల్ని నిరసిస్తూంటాడు . అతని కులం అతన్ని వెలివేస్తుంది. తాళపత్ర గ్రంథ సేకరణ కోసం బ్రౌన్‌దొర నియమించిన వాయసగాళ్ళు, పండితులు అతన్ని, అతని రచనలని అవహేళన చేస్తారు. పెదకోటేశ్వరుడు ఏ మాత్రం చలించకుండా బసవడిని, వీరబ్రహ్మాన్ని కలిపి ద్విపదలు రూపొందిస్తాడు. ఎల్లన్న గురుంచి విని అతన్ని కలుసుకోవాలని బయలుదేరుతాడు.  రాజవీధిలో వెళ్తున్న అతన్ని బ్రాహ్మణుడొకడు గుర్తించి అవమానించి కొట్టబోతాడు. పెదకోటేశ్వరుడు తన కాలికంటిన మట్టి విదిలించి, నేల మీద ఖాండ్రించి ఉమ్మి, ' నా చేత అపవిత్రమైన దీన్ని మీరు పవిత్రం చెయ్యండి' అని వెళ్ళిపోతాడు. ఎల్లన్నని కలిసి, అతని నేపథ్యం సాహిత్యం విని, తన రాతప్రతులను అతనికి అప్పగించి పులకరించిపోతాడు. తిరిగివెళ్తూ అగ్రవర్ణాల చేతిలో దారుణహత్యకు గురవుతాడు. అతని సమాధి ఒక సందర్శనీయ స్థలమవుతుంది.

పిల్లకరణం పట్నం వెళ్ళిపోతూ బంజరంతా మాలమాదిగలకు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ భూమిని ఆక్రమిద్దామనుకున్న అచ్చిరెడ్డికి ఇది ఆశనిపాతమవుతుంది. ఎన్నెలదిన్నెలో ముందు కరణం పొలాలు తడపాలి, తర్వాత పెద్ద రెడ్లు, సన్న రెడ్లు, ఇతరకులాలవి. మాలామాదిగల పొలాల వంతు వచ్చేసరికి నీళ్ళు మిగిలేవి కావు. గత్యంతరం లేక ఓ సారి నీళ్ళు దొంగలిస్తే మనుషుల్ని పంపించి చావగొట్టిస్తాడు అచ్చిరెడ్డి.  ఎల్లన్న భార్య సుభద్ర తిరగబడి కాళికావతారం ఎత్తటంతో ఆమెను 'దేవత ' ఆవహించిందని, అందుకే ఆమెకంత ధైర్యమొచ్చిందని భయపడతారు ఊరివాళ్ళు.

రాళ్ళను సైతం అరాయించుకునే కరువు రాచి రాంపాన పెడుతూంటే, పొట్ట చేతబట్టుకుని  ఊళ్ళకు ఊళ్ళకు వలసపోతూంటారు. ఆ గుంపుతో పాటూ ఎన్నెలదిన్నె ఎగిరివచ్చిన పండుటాకు లాంటి ఎల్లన్నని చూసి అతని భార్యాపిల్లలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎల్లన్న, సుభద్ర మరణిస్తారు. కొడుకు శివయ్య వాళ్ళను అక్కడే సమాధి చేసి  భార్యను వెంటబెట్టుకొని బకింగ్‌హాం కాల్వ కూలిపనులకు వెళ్తాడు .మాలవాడు పనికోసం వచ్చాడని ఆగ్రహించి అక్కడ పనిచేస్తున్న జనం వాళ్ళ మీద దాడిచేస్తారు. చాలా దూరం పారిపోయి జీవచ్ఛవాల్లా పడిపోయిన శివయ్యను అతని భార్యని క్రైస్తవ మతం చేరదీస్తుంది. శివయ్య సీమోను అవుతాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన  మార్టిన్‌దీ అటువంటి నేపథ్యమే.

ఇక్కడి నుంచి కథ రకారకాల మలుపులు తిరిగి సీమోను కొడుకు రూబేను, రూబేను కొడుకు ఇమ్మాన్యుయెల్, అతని కొడుకు జెస్సీ జీవితాలని, అంతః సంఘర్షణను స్పృశిస్తూ జెస్సీ నక్సలైట్‌గా రూపాంతరం చెందడం వరకు సాగుతుంది. అజ్ఞాతంలో ఉన్న మనవడిని చూడ్డానికి వెళ్తాడు రూబేను. అతని భార్య మరియు జెస్సీ నాన్నమ్మ అయిన రూతు, మనవడి విజయాన్ని ఆకాక్షిస్తూ ఉత్తరం వ్రాయటంతో నవల పరిసమాప్తమవుతుంది.

తరతరాలుగా అలగాజనంగా ముద్రపడ్డ మాలమాదిగల బ్రతుకు పొరాటానికి నిలువెత్తు దర్పణం అంటరాని వసంతం. కల్యాణరావుగారి శైలి చాలా సరళంగా శక్తివంతంగా ఉంది. మామూలు మాటలతోనే మనసులోతుల్ని స్ఫృశిస్తారు .మాలమాదిగల జీవనశైలిని, వారి దైన్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చచ్చిన గొడ్డు మాంసం తింటూ గొడ్డిచ్చిన పెద్దలకి దాన్ని చర్మంతో చెప్పులు కుట్టడం నుంచి, ఏ కులమూ తాకని తన దేహాన్ని ఒక తెల్లవాడు తాకి ' క్రీస్తుకు అంటరానితనం లేదు ' అన్నప్పుడు   ఆత్మగౌరవం కోసం క్రైస్తవ మతాన్ని అందిపుచ్చుకోవటం వరకూ, కాలిక్రింద చెప్పు నుంచి కొడవలిగా ఎదిగే వరకూ, మాలమాదిగల జీవితాల్లో వచ్చిన మార్పులను, అంతర్మథనాలను చక్కగా విశ్లేషించారు. కులం కారణంగానే మాలమాదిగలకు దక్కాల్సిన ఎన్నో గౌరవాలు దక్కలేదని, రవివర్మ, రాజమన్నారు, నండూరి వంటి వాళ్ళు వెలయించిన సాధారణ చిత్రాలని, రచనలని మాత్రం నెత్తిన పెట్టుకున్నారని ఆక్షేపిస్తారు. ప్రేరిణీ శివతాండవం కంటే ఉరుముల నృత్యంలో సహజత్వం ఉందని, పురాణాలను మంత్రాలను సైతం మహాకావ్యాలుగా ఆకాశానికెత్తిన పండితులు అంటరాని కులాలు పాడిన గీతాలు, ఆడిన వీధిభాగవతాల్లో గొప్పదనాన్ని గుర్తించలేకపోయారని ఎద్దేవా చేస్తారు. ఎంకి పాటలు నేను చదవలేదు కానీ ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఆత్మగౌరవం కోసం  పరమతాన్ని పుచ్చుకున్న మాలమాదిగల్ని సమర్థిస్తూనే ధనం కోసం మతం మార్చుకున్న అగ్రవర్ణాలను చూసి నవ్వుతారు. గాంధీజీ చేపట్టిన హరిజనోద్ధరణ, దేవాలయాల ప్రవేశం లాంటి కార్యక్రమాలని హిందూ మతచట్రంలో మాలమాదిగల్ని బంధించే ప్రయత్నమని, అందుకే అంబేద్కర్ వంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని చెప్పి ఆయా కార్యక్రమాలలోని డొల్లతనాన్ని వివరించి ఆశ్చర్యపరుస్తారు .

నవలలో ప్రస్తావించిన చాలా సంఘటనలు మనసుని మెలిపెట్టి బాధపెట్టేవే. కొన్ని విషయాలు మాత్రం కొత్తగా ఉన్నాయి . చెన్న పురాణం, జాంబ పురాణం అన్నపేర్లు  చదివి ఇటువంటి పురాణలు కొన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా వ్యాస భగవానుడు వ్రాసిన పద్దెనిమిది పురాణాల గురుంచి మాత్రమే విని ఉండటం చేత ఈ కొత్త పురాణాలేమిటి, వాటిని ఎవరు వ్రాశారన్న జిజ్ఞాస బయలుదేరింది. అంతర్జాలాన్ని శోధించాక వీటిని కుల పురాణాలంటారని ఇటువంటి పురాణాలు ఇంకా అనేకం ఉన్నాయని  అర్థమయ్యింది. ఎవరు ఎలా వ్రాశారో ఇతిమిత్థంగా తెలియకపోయినా కులాల పుట్టుకలు, చరిత్రలు, వాటి అనుబంధ కథలు తెలిపే కులపురాణాలు, కొన్నైనా ఆయా కులాల్లో (లేదా ఇతర కులాల్లో) బాగానే ప్రాచుర్యం పొందినట్లున్నాయి. కేవలం నోటిమాటలు, ఆటపాటల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయిపోయే ఈ పురాణలలో చెన్న పురాణం మాలలది. జాంబ పురాణం మాదిగలది (ఈ మధ్యనే జాంబపురాణం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దీనిపై దార్ల వారి వ్యాసం కూడా చదివాను). వీటిలో కథలు కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ వినని, చదవని కథలు. (ఈ పురాణ కథల గురుంచి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్‌చెయ్యండి .) ఎవరో జడల ఋషి వ్రాసింది చరిత్ర ఎలా అవుతుందని సామాజిక మూలాలను ప్రశ్నించిన రచయిత, కనీసం ఎవరు వ్రాశారో తెలియని పురాణాలని పట్టుకొని మాలా మాదిగలు అంటరానివారెలా అయ్యారని ప్రశ్నించుకొని ఉంటే సమాధానం అందులోనే దొరికేది. తేడా మతంలో లేదు. దాన్ని బోధించే మనుషుల్లో ఉంది.

పుట్టుకతో ఎవారూ ఫలానా కులానికి చెందరని, కర్మానుసారమే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని భగవానువాచ . నేను హిందువునేనయినా, హిందూమతం గురుంచి నాకున్న అవగాహన స్వల్పమే అయినా,  'బ్రాహ్మణత్వం' ' చాతుర్వర్ణ వ్యవస్థ ' వంటి పదాలకు తీసిన పెడార్థాలు మరే పదాలకీ తీయలేదని నిశ్చయంగా చెప్పగలను.  కుహానా పండితులు, మేధావుల కారణంగా సంఘానికి, తద్వారా హిందూ మతానికి ఎనలేని నష్టం జరిగింది. ఎందరో గురువులు, సాధకులు తమ బోధనలతో నయం చేసే ప్రయత్నం చేసినా, ఇంకా చేస్తున్నా అంటరానితనం అనే వ్యాధి ఇంకా పూర్తిగా  సమసిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ మనుషుల మనస్తత్వాలలో చాలా మార్పులొచ్చినా అంటరానితనం పేరుతో దళితులని అవమానించటం లాంటి సంఘటనలు ఇప్పటికీ అడపాదడపా  మనం వింటూనే ఉన్నాం. అలాగే బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా శబరిమలై లాంటి సుప్రసిద్ధ ఆలయాలలో అర్చక పదవులు నిర్వహించడం చూస్తున్నాం. ఆత్మగౌరవం మాటెలా ఉన్నా ఆర్థికంగా మాత్రం మాలమాదిగలు అర్చక స్వాముల కంటే ఇప్పుడొక మెట్టు పైనే ఉన్నారు. చరిత్రకెక్కిన రాజులని, మహాపురుషులని తమ కులానికి చెందిన వాళ్ళుగా ప్రకటించుకోవటం సర్వసాధారణం కాబట్టి, మాలమాదిగల చారిత్రక ప్రశస్తి మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో  తవ్వాల్సింది  పూడ్చాల్సింది చాలానే ఉంది. 

ఈ నవలని తెలుపు.కాం వెబ్‌సైట్ నుంచి  పొందవచ్చు.

వెల 70 రూపాయిలు .


3 comments

Post a Comment

రాత్రి కురిసిన వర్షం

 
 
రాత్రంతా కురిసిన వర్షం
తడి జ్ఞాపకాలను మిగిల్చివెళ్ళింది
చివికిపోయిన కన్నులచూరు నుండి
చుక్కలుగా తరలిపోతున్న దుఃఖం
కాలప్రవాహంలో జారి కరిగిపోతోంది
విరహ ఝంఝ ఉధృతవడిలో
శాఖలు తరిగిన శిథిల తరువునై
శోకనిశీధిలో చిక్కి ఉన్నాను
విచ్చుకుంటున్న వెల్గురేఖవై నన్నక్కున చేర్చుకొని
శుష్కించిన నా చైతన్యానికి స్వస్థత  చేకూర్చవూ
 
 
నీ తలపులతోనే తలారస్నానం చేసి
ఆరుబయట కురులారబెట్టుకున్నాను
విభాతకాంతుల దువ్వెనతో  
తడిసిన కురుల కరిమబ్బులని
తాపీగా దువ్వుకుంటున్న వియత్సుందరిని చూస్తూ నిల్చున్నాను
వెచ్చని నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు వీవెనలా వీతెంచి
ముచ్చెమటల ముత్యాలహారాలు నా మెడవంపులో కూర్చాయి
 
 
నీకు తెలుసో లేదో
తొలిసారి నా పై జారిన నీ తుంటరి చూపులు
తొలకరిజల్లులై నన్నింకా తబ్బిబ్బు చేస్తున్నాయి
ఆల్చిప్పల్లాంటి నా కన్రెప్పల్లో
అందమైన నీ ముఖబింబాన్ని ముత్యంలా పొదువుకున్నాను
అరవిచ్చిన పెదవులతో నువ్వు రువ్విన  ప్రతి నవ్వూ
మల్లెలుగా  ఏరుకొని మదిసీమలో నాటుకొన్నాను 
గుభాళించిన చిలిపి ఊహలన్నీ గిలిగింతలు రేపితే
గగనవీధులలో తేలి గాంధర్వ గీతాలు పాడాను
 
పరిచయాల పృథ్విపై  ప్రభవించిన మన ప్రేమ
భావాల కలయికతో బహుశాఖలు తొడిగి
పెద్దల అనుమతితో పరిణయమై 
                                  పొదరిల్లై మారినప్పుడు
ఫలించిన ఆశలన్నీ ప్రకాశించే తారలై
స్మరించిన నీ రూపం సుధాకరునిలా నన్నల్లుకున్నపుడు
చెలువములన్నీ చెంగలువలై
చలనములన్నీ కవనములై
తటాకమై నా మేను తాదాత్మ్యత చెందిన క్షణాలని
ఘనీభవించిన కాలానికి గుర్తుగా
గుండెపొరలలో నిక్షిప్తం చేసుకున్నాను
 
 
ఓర్వలేని వికృత విధి
ఉద్యోగం పేరిట నిన్ను విదేశాలకు విసిరికొట్టి
కారు మబ్బుల కర్కశ రాత్రిని కళ్ళ ముందు పులిమింది 
పొర్లుతున్న దుఃఖాన్ని పెదవంచున అదిమిపెట్టి
భారమైన కాలాన్ని భావరహితంగా మోస్తూ
సమూహంలో ఒంటరినై నే శిలాజమై మిగిలాను 

వాసంత సమీరం వెళ్ళిపోయింది వలపు వేణువులూదకనే
హేమంత తుషారం కరిగిపోయింది హృదయ సంతుష్ట రశ్మి సోకకనే
 
 
నీ మేనిపై తలవాల్చి
నీ చేతిని చుట్టిపట్టి
దయాపూరితమైన నీ కళ్ళలో
ద్యోతకమైన నా వలపుసౌధాలు
విస్ఫారిత నేత్రాలతో విస్మయంగా చూస్తూ
దొరలుతున్న మాటల మలయానిలంలో
దూదిపింజనై తేలిపోతూ
సైకత తీరాలలో సుప్రశాంత వనాలలో
నేను నడిచిన ప్రతి అడుగూ
గడిపిన ప్రతి ఘడియా
గవ్వలలో ఏరుకున్నాను
ఘనవృక్షసారముల మధ్య వెదుక్కొన్నాను
 

ఆధునిక ఉపకరణాలతో అంతరంగాన్ని శోధించి
అంతా బాగానే ఉందని సమాధానపడిపోకు
వెబ్‌చాట్లు, వీడియోఫోన్లు వియోగార్ణవాన్ని విశదం చెయ్యలేవు
అమావాస్య చీకట్లను తడుము
అలముకున్న నైరాశ్యం బోధపడుతుంది
ఎరుపెక్కిన దిక్కులు చూడు
బరువెక్కిన రెప్పల కావి కనబడుతుంది
ఘూర్ణిల్లే సముద్రపు హోరులో గతితప్పిన గుండె ఘోషను విను
ఆకుల ఆలింగనం వదిలి ఆర్తిగా జారిపోతున్న తుషారకన్యకల్లో నా కన్నీళ్ళు చూడు
 
వేయి తమస్సుల తపోవరమై
కోటి కోర్కెల ఉషోదయమై
విహంగ జతివై
ఉధృతగతివై
నా కోసం నువ్వు కదలి వచ్చేదెన్నడు
చారికలు గట్టిన చెంపలపై నీ పెదవి 
చేవ్రాలు పెట్టేదెన్నడు



14 comments

Post a Comment

గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తించని పాఠశాలలు



రిపబ్లిక్ డే వచ్చేసింది.  గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక నార్మల్ హాలిడే. సరదాగా ఇంటిపట్టున గడుపుతూనో లేక ఏ సినిమాతోనో, షాపింగ్‌మాల్ లోనో కాలం వెల్లిబుచ్చేస్తారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన త్యాగధనులని  ఈ రోజు ఎంత మంది ఎంతసేపు స్మరిస్తున్నారు, జాతీయ సెలవు దినాలలోనైనా ఎంత మంది  వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు, దేశ స్వాతంత్ర్యం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది, అన్న విషయాల మీద  ఎవరైనా
సర్వే నిర్వహిస్తే ఎంత బావుణ్ణు. దేశం సిగ్గుపడే విషయాలు బయటికి వస్తాయి.




అసలు రిపబ్లిక్‌డే ని ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి ?  చాలా మందికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియదు. 1950 జనవరి ఇరవయ్యారవ తేదినుంచి మనదేశ రాజ్యాంగం అమల్లోకికి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా అదే తేదిన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటారు కొంతమంది . ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే అసలు కారణం వేరే ఉంది. భారత రాజ్యాంగానికి నవంబరు 26 1949 లోనే ఆమోదం లభించింది. అమలు పరచే తారీఖుకి ఒక ప్రాముఖ్యత  ఉండాలని రెండు నెలలు ఆగారు.  ఏమిటా తారీఖు ? ఏమిటా ప్రాధాన్యత ? 1930 జనవరి 26వ తేదిన లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొదటిసారిగా దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని ప్రకటించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం లభిస్తే చాలు, సర్వోత్కృష్టమైన సంపూర్ణ అధికారం భ్రిటిషు వారి చెప్పు చేతుల్లోనే వుంచి సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకొనే వాళ్ళు మన రాజకీయ నాయకులు (!!) . జలియన్‌వాలాబాగ్ ఉదంతం జాతిని ఉలిక్కిపడేలా చేసింది. సుభాష్ చంద్రబోస్ , జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టించి పూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రకటన ఇప్పించగలిగారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో  నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి జనవరి 26 1950 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

అటువంటి రిపబ్లిక్‌డే ప్రైవేటు పాఠశాలలకు నేడొక ఆటవిడుపులా మారింది. గవర్నమెంటు హాలిడే కాబట్టి పిల్లలు స్కూళ్ళకు రానవసరం లేదని ముందు జాగ్రత్తగా హోం డైరీల్లో హెచ్చరించే పాఠశాలలు కొన్నైతే,  ఏ శనివారమో ఆదివారమో రిపబ్లిక్‌డే వస్తే ఎక్కడ ఆ రోజు మళ్ళీ పనిచేయాల్సి వస్తుందోనని ముందు రోజే తూతూ మంత్రంగా జెండావందనం జరిపించేసి మమ అనుకునే  స్కూలు యాజమాన్యాలు ఇంకొన్ని. ప్రేమికులరోజుకి రకరకాల భాష్యాలు చెప్పి పిల్లల చేత ఠంచనుగా సెలబ్రేట్ చేయించి స్వాతంత్ర్యదినోత్సవాన్ని మాత్రం ఆగస్టు పన్నెండవ తేదీనే జరుపుకున్నమిషనరీ స్కూలు, గురూజీ పూజ, సత్సంగం లాంటి కార్యక్రమాలను సెలవు రోజుల్లో అట్టహాసంగా నిర్వహించి రిపబ్లిక్‌డే ని విస్మరించే పాఠశాల మా ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. భావిభారత పౌరుల్ని తయారుచెయ్యాల్సిన పాఠశాలలు ఇంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించబట్టే  బాలబాలికల్లో దేశభక్తి నానాటికి తీసికట్టు నాగంబొట్లు చందంగా తయారవుతోంది. సెలవు దినాల్లో పిల్లలు బడికి వెళ్ళకపోతేనేం అనుకునే తల్లిదండ్రులూ ఉన్నారు. గాంధీ నెహ్రూలు తప్ప మరో స్వాతంత్ర్య సమరయోధుడు తెలియని పిల్లలున్నారంటే అది వీళ్ళ చలవే. సమస్యకు మరో పార్శ్వం వీళ్ళు. 


నా చిన్నతనంలో స్కూళ్ళో జరుపుకున్న జాతీయపండుగలు నాకింకా గుర్తున్నాయి. పాఠశాలంతా అలంకరించిన మూడు రంగుల పేపర్ తోరణాలు, విశాలమైన ఆవరణలో ఆవిష్కరింపబడి వినువీధులలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, తెల్లటి చొక్కాకి ఎడమవైపు పిన్నీసుతో గుచ్చబడి, పడిపోయిందో లేదోనని నేను అప్పుడప్పుడూ తడుముకొని గర్వంగా చూసుకున్న చిట్టి జెండా, భారతదేశము నా మాతృభూమి అని అందరితో కలిసి చేసిన ప్రతిజ్ఞ, ఒళ్ళు ఉప్పోంగేలా పాడిన వందేమాతరం, మైకు చేతబట్టుకొని వచ్చీ రానీ భాషా జ్ఞానంతో ' తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదమా ', ' శ్రీలు పొంగిన జీవ గడ్డై, పాలు వారిన భాగ్యసీమై' లాంటి  పాటలు శ్రావ్యంగా పాడిన మిత్రబృందం, వాడిపోయిన  మొహాలు చూసి కూడా ఉపన్యాసాలు విరమించని ముఖ్య అతిథులు, చివర్లో చాక్‌లెట్ల కోసం మేం సంబరంగా ఎగబడ్డ సన్నివేశాలు .. అన్నీ గుర్తున్నాయి.  

ఇప్పుడేవీ ఆ ప్రతిజ్ఞలు ?
ఏదీ ఆ జాతీయగీతాలాపన ?
ఏదీ ఆ ఆనందం ?

దేశంలో చాలా సమస్యలకు దేశభక్తి లేకపోవటం కూడా ఒక కారణం. భారతదేశ ప్రతిజ్ఞ ఎవరు వ్రాశారో తెలియకపోయినా, బూతులతో నిండిన తెలుగు సినిమా డైలాగులు, వాటి కలెక్షన్లు కంఠతా పట్టేసి, నటీనటులను గుడ్డిగా అరాధించే యువతరం తయారైతే అంతకంటే దరిద్రం ఈ దేశానికి మరొకటి లేదు. తల్లిదండ్రులు కనీసం జాతీయ పర్వదినాలోనైనా ప్రముఖుల ఆదర్శజీవితాల్లోంచి ముఖ్యమైన ఘట్టాలని, వారి పోరాట స్ఫూర్తిని, నిజాయితీని కళ్ళకు కట్టేలా పిల్లలకు విడమరిచి చెప్పి దేశభక్తిని పెంపొందింపజెయ్యాలి .ప్రైవేటు స్కూళ్ళు ఇప్పటికైనా తమ బాధ్యత గుర్తించి గణతంత్ర దినోత్సవం,స్వాతంత్ర దినోత్సవం లాంటి పండుగలను విధిగా నిర్వహించాలి. ప్రభుత్వం కళ్ళుతెరిచి జాతీయ పర్వదినాలను సెలబ్రేట్ చేసుకోని పాఠశాలల గుర్తింపు రద్దు చెయ్యాలి.


8 comments

Post a Comment

నా ఉప్మా ప్రహసనం !!


' ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ '  అని ముక్క తిమ్మన అన్నాడు గానీ నిజానికి ఏ ముద్దూ మురిపెం లేకపోయినా ఎటువంటి విద్యనైనా చాలా వీజీగా ఔపోసన పట్టేసే ధీరోదాత్తులు కార్యశూరులు మగవాళ్ళని నా ప్రగాఢ విశ్వాసం. అలాంటిది వంట విషయమైతే ఇక చెప్పక్కర్లేదు. మగపుంగవుల సామర్థ్యత ముందు ఆడవాళ్ళ నైపుణ్యం ఏ పాటిది? పైగా దానికి తిరుగులేని సాక్ష్యాధారాలు మనకి ఉండనే ఉన్నాయి. నలభీమపాకం అన్నారు గాని సీతా, ద్రౌపదీ పాకాలని ఎవరూ అనలేదు కదా? అసలంతవరకూ దేనికి? తెలుగు టి.వీ. ఛానాల్స్‌లో మధ్యాహ్నమయ్యేసరికి సహజ కవచ కుండలాల్లాంటి తెల్లటి కోటు, తలపై కిరీటం లాంటి టోపీ పెట్టుకొని దండయాత్ర చేసి వచ్చిన వీరాగ్రేసరుల్లా మగవాళ్ళు నోరూరే రకరకాల వంటలు ఎలా చెయ్యలో నేర్పుగా చేసి చూపెడుతూంటే, పక్కనే నిలబడి పళ్ళికిలిస్తూ మధ్య మధ్యలో ' బాణలిలో నూనె వెయ్యాలా లేక నూనెలో బాణలి వెయ్యాలా ' లాంటి చొప్పదంటు ప్రశ్నలేసి ' రెండూ నా మీద వెయ్యి ' అని ప్రేక్షకుడు విసుక్కోకముందే ' బ్రేక్ ' అంటూ విరామం తీసుకొని, తీరా వంట మొత్తం పూర్తయ్యాక లోట్టలేసుకుంటూ తినే వంట రాని మహిళా యాంకర్స్‌ని మనం చూస్తూనే ఉన్నాంగా ?




ఈ మాటే ఓ సారి యథాలాపంగా మా ఆవిడతో అంటే ' ఊరికే కబుర్లెందుకు చెబుతారు ? మీరు చెయ్యరాదూ ఈ పూట  వంట ' అనేసింది. ఈ ఆడవాళ్ళున్నారు చూశారు .వీళ్ళు మహా  గడుసరులు సుమండి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకీ బోలెడు అర్థాలుంటాయి. ఆచితూచి అడుగెయ్యకపోయారో అట్లకాడెతో అప్పడాన్ని వేయించినట్టు వేయించేస్తారు.  సామన్య మగమాత్రుడైతే వెంటనే అవేశపడిపోయి ' నువ్వలా కూర్చో. చూద్దువు గానీ నా ప్రతాపమేంటో ' అని హూంకరించి ఆపసోపాలు పడి అమాయాకంగా వంట మొత్తం చేసేసి కాలరెగరేసేవాడు.  ఆ తర్వాతే వస్తుంది అసలు చిక్కంతా . వంట ఏ మాత్రం బావున్నా  మొగుడనే  ఆ మానవమాత్రుడు ఇక చచ్చాడన్న మాటే. గోముగా గుండె మీద గోకి మెల్లగా  వంటింటి బాధ్యతను కూడా నేర్పుగా మొగుళ్ళకు బదలాయించేస్తారు పెళ్ళాలు . నేను గట్టిపిండాన్ని కాబట్టి ప్రమాదాన్ని పసిగట్టి ' కాలేజి రోజుల్లో మేం కూడా చేశాం లేవోయ్. నేను నాన్‌వెజ్ వండితే నాలుగు క్యాంపస్‌ల దాకా ఘుమఘుమలాడేది. అయినా నేను వంట చెయ్యాలంటే ఆ రోజుకొక ప్రత్యేకతుండాలి . ఆషామాషీగా వంట చేసెయ్యడం నాకిష్టం లేదు ' అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. ' మీరు వంట చేశారా ? I can imagine ' అని ఆ రోజంతా మా ఆవిడ పగలబడి నవ్వుతూనే ఉంది. ఇది ఇంకొక వెరైటి రెచ్చగొట్టే ప్రోగ్రాం అనుకొని నేను మిన్నకుండిపోయాను.


అయితే నేను వంట చెయ్యాల్సిన రోజు రానే వచ్చింది.


వేసవి సెలవులివ్వడంతో పాపను తీసుకొని మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా ఆవిడున్నప్పుడు పది సార్లు పిలిచినా భోజనానికి కదిలే వాన్ని కాదు. ఆ పనీ ఈ పని అంటూ సమయం వృధా చేసి తీరా తను టేబుల్ మీద ప్లేట్ పెట్టి అందులో అన్నీ వడ్డించేసాక తీరిగ్గా అప్పుడు పైకి లేచి పాదప్రక్షాళనం ,హస్త ప్రక్షాళనం, ముఖ ప్రక్షాళనం చేసుకొని అప్పుడు తినడానికి వెళ్ళేవాన్ని. ఇప్పుడు అంత సౌలభ్యం లేదు కాబట్టి నా ఏర్పాట్లేవో నేనే చేసుకోవాలి. అప్పటికీ చాలా రోజులు బయటి తిండి తింటూనే వచ్చాను.  కాస్త తేడా అయ్యి రెండు రోజులు కిందా మీదా అయ్యేసరికి, విజయదశమికి శాపగ్రస్తుడైన అర్జునుడు జమ్మి చెట్టు మీంచి గాండీవాన్ని తీసి టంకారావం చేసినట్లు నా పాకశాస్త్ర పాండిత్యాన్ని కూడా ప్రపంచానికి ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాను. ప్రొద్దున్నే టిఫన్ స్వయంగా చేసుకోవాలని అనుకున్నాను.




 నిజానికి ఇంత కష్టపడకుండా మా ఇంటిదగ్గర్లోనే ఒక టిఫన్స్ సెంటరుంది. అక్కడికి వెళ్ళి ఏ ఇడ్లీయో దోశెనో తిని మెల్లగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. కానీ మిన్ను విరిగి మీద పడినా ఆ హోటల్‌లో మాత్రం కాలు పెట్టనని ముందే భీషణ ప్రతిజ్ఞ చేసేశాను. దానికో కారణముంది. ఓ సారి ఇలాగే వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఆర్డరిచ్చాను. అదేం కర్మమో ఆ రోజు పని వాళ్ళు లేక ఓనరే సర్వింగ్ చేస్తున్నాడు. ఆర్డరిచ్చేటప్పుడు ' ఇడ్లీ మీద సాంబార్ కుమ్మరించకు. చెట్నీ మాత్రం సెపరేట్ గా ఇవ్వు చాలు ' నన్నాను. కన్నడిగులు సాంబార్లో బెల్లం వేస్తారు. అది నాకు నచ్చదు. ఓనరు నేను చెప్పినప్పుడు అన్నిటికి తలాడించి, సర్వింగ్ చేసేటప్పుడు మాత్రం తాను మైండ్‌లో దేనికి ఫిక్సయ్యాడో అలానే చేశాడు. ఇడ్లీల మీద గిన్నెల కొద్దీ సాంబార్ కుమ్మరించి తీసుకొచ్చాడు. ' నాకిలా వద్దు'  అంటే,  ' ఇప్పుడు ఇడ్లీ మీద సాంబార్ పోసేసాగా తీసుకో ' అన్నాడు. వాదనలు కొనసాగి నాకు తిక్క రేగి ' నీ హోటల్‌లో మళ్ళీ అడుగుపెడితే అప్పుడడుగు ' అని చెప్పి తినకుండానే వచ్చేశాను. అప్పటి నుంచి  ఆ హోటల్ గడప తొక్కటం లేదు.  


టిఫన్ చెద్దామని నిర్ణయించున్నాక ఉప్మా అయితే త్వరగా పూర్తవుతుందని, మా ఆవిడకు ఫోన్ చేసి ఎలా చెయ్యాలో కనుక్కున్నాను. అంతకు ముందెప్పుడూ ఉప్మా చేసిన అనుభవం లేదు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త తప్పలేదు. అవతల్నించి మా ఆవిడ కంఠంలో తలమునకలయ్యేంత ఆశ్చర్యం తన్నుకొచ్చి ఇవతల నా చెవులను తాకుతోంది. నేను నింపాదిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ మా ఆవిడ చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా ' ఈ మాత్రం చాలు. ఇక చెలరేగిపోతా ' అని భరోసా ఇచ్చి ఫోన్ పెట్టేశాను. స్టవ్ వెలిగించి ముందుగా రవ్వ ఫ్రై చేశాను. మరో వైపు ఇంకో పాత్రలో నీళ్ళు వేడి చేశాను.ఈ రెండూ జరుగుతూండగానే సవ్యసాచిలా ఉల్లిపాయలు కట్ చేశాను. నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్న సన్నివేశం చూసి మా పనిమనిషి పాత సినిమాలో నౌకర్లా ' బాబు గారూ ' అని తెగ ఎమోషనల్‌గా ఫీలయిపోయినా పట్టించుకోలేదు.  పక్షి కన్ను తప్ప పరిసరాలు పట్టించుకోని పార్థునిలా ఫ్రై చేసిన రవ్వని ఒక పాత్రలో పోసుకొని, బాణలిలో వేడి నీళ్ళు పోసి అందులోకి రవ్వని షిఫ్ట్‌చేశి ఉప్పు వేశాను. వేయించిన ఉల్లిపాయల్ని కుడా కలిపాను. కరివేపాకు  కొత్తిమీర  కనిపించలేదు కాబట్టి వదిలేశాను .  ఏ జానర్ సినిమా అయినా రాయలసీమ శైలిలోనే సంభాషణలు పలికే జయప్రకాష్‌రెడ్డిలా, వంటేదైనా కారం తగలాలని పచ్చి మిరపకాయలు కట్ చేసి, సరిపోదేమో అని కొంచెం కారంపొడి కూడా చివర్లో వేశాను.  రిలాక్సై హాల్లోకొచ్చి టీ.వి చూస్తూ  ' ఇక అయిపోయినట్లే ' అని గర్వంగా కూర్చున్నాను. ఇంకా ఎన్ని అకృత్యాలు చూడాల్సి వస్తుందనేమో మా  పనిమనిషి అప్పటికే చెప్పా పెట్టకుండా పరారైపోయింది.   




ఉప్మా పూర్తయ్యింది . వేడి వేడిగా దించి ప్లేట్‌లో వేసుకొని నోట్లో ఒక్క ముద్ద పెట్టుకున్నాను కదా . పొలమారి కడుపులో రసాయనిక చర్యలు బయలుదేరాయి. రెండో ముద్ద వేసుకోవడానికి ధైర్యం చాలక కళ్ళు తిరిగినంత పనైంది.


కాలుజారి పడ్డ సుయోధనుడనై,
ఖిన్నుడనై,
దీనికి కారణంబేమిటి  అని పరిపరివిధాలా ఆలోచిస్తూ మా ఆవిడకి ఉప్మా ఫోటో పంపి, ఫోన్ చేస్తే ' ఉప్మా లో కారప్పొడి వెయ్యాలన్న వెరైటీ ఆలోచన మీకెలా వచ్చినది ఆర్యపుత్రా ? ' అని సమాధానం వినిపించినది.


అవతల్నుంచి మా పాప 'వావ్! నాన్న కేక్ చేశారు ' అంటొంది ఫోటో చూస్తూ. మా బామ్మర్దేమో ' హల్వా నా ?!  ' అని అమాయకంగా అడుగుతున్నాడు వాళ్ళక్కని.


మగబ్లాగర్లారా .అధైర్యపడకండి. ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించే భిన్నత్వంలో ఏకత్వం లాంటి పరమాత్మ స్వరూపమైన ఉప్మా తయారు చెయ్యడం అంత సామన్యమైన విషయమేమి కాదు. ఆ విధంగా నేను విజయం సాధించినట్లే లెక్క.


అంతటి ఉప్మా ఫోటో ని మీకు చూడాలనుందా?


అయితే..క్రిందకు స్క్రోల్‌చెయ్యండి  
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.






7 comments

Post a Comment