గోదావరి యాత్ర-2

రాజమండ్రిలో మేమున్న హోటల్ పేరు పర్ణశాల ప్రిన్స్‌లి. పుష్కరఘాట్ కి కాస్త దగ్గర్లో కుమారి థియేటర్ రోడ్డులో ఉంది. గదులూ అవీ ఫర్వాలేదు కానీ మూడు చిక్కులున్నాయి. ఒకటి - హోటల్ క్రిందనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. రెండవది-హోటల్ రెసెప్షన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి లిఫ్టున్నా అది పనిచెయ్యదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిగతా అంతస్తులకు మాత్రమే పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళెవరైనా ఉంటే  మొదటి అంతస్తు వరకు మెట్లెక్కి వెళ్ళడం కష్టం. మూడవ చిక్కు విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచెయ్యదు. గదులకు ఏ.సి మాత్రం పనిచేస్తుంది.

ఇలాంటి హోటల్‌లో ఎలా ఉన్నావయ్యా వారం రోజులంటే నా సమాధానాలు ఇవి - హోటల్‌లో మేము గడపదలచుకున్న సమయం చాలా తక్కువ. ప్రొద్దున్నే ఏడున్నర-ఎనిమిదికళ్ళా బయటపడి  మళ్ళీ రాత్రి ఏడుగంటలకు హోటల్ చేరుకొనేవాళ్ళం. కేవలం రాత్రి విశ్రమించడానికే అయితే సౌకర్యంగానే ఉంది .  పర్ణశాల ప్రిన్స్‌లి ప్రక్కనే అక్షయ్ రెసిడెన్సీ అని మరో హోటల్ ఉంది.  అందులో గదులు బావున్నాయి. ధర కూడా ఫర్వాలేదు. విద్యుత్‌కోతలలో లిఫ్టు పనిచేస్తుంది కాని ఏ.సి. పని చెయ్యదు. ఫ్యాన్లు పనిచేస్తాయి. రాజమండ్రిలో వేసవిని తట్టుకోవాలంటే ఫ్యాన్లు సరిపోవు. ఏ.సి ఉండాల్సిందే. హోటల్ ఎత్తులో కట్టడం వల్ల మెట్ల సమస్య దానికీ ఉంది. ఇక బార్ అండ్ రెస్టారెంట్ విషయానికొస్తే  దానికి జనాల తాకిడి లేకపోవటం పెద్ద ఊరటనిచ్చే అంశం. ఒకరిద్దరు కంటే ఎక్కువమందిని అక్కడ చూసినట్లు నాకు గుర్తులేదు. ఇదే తిరుపతిలో అయితే ఒక సూపర్‌స్టార్ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షోకి జనం ఎలా కొట్టుకుంటారో అలా ఎగబడేవాళ్ళు. బెంగుళూరులో కూడా ఈ తంతు కొన్ని చోట్ల గమనించాను. వేసవిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని మొన్నామధ్య పేపర్లో చదివి నేనేం ఆశ్చర్యపోలేదు. దేశంలో తాగడానికి మంచి నీళ్ళు లేనప్పుడు పుష్కలంగా దొరికేదేదో అది తాగి ప్రాణాలు నిలుపుకోవాలి కదా !

మరుసటి రోజు ప్రొద్దున్నే ఎనిమిదిన్నరకు  మారుతి టూరిజం వారి ఇన్నోవాలో అందరం  బయలుదేరాం.  

కోనసీమ అందాలతో పరిచయం, రాజమండ్రి నుంచి బిక్కవోలుకు వెళ్ళే దారితో ప్రారంభమయ్యింది. రోడ్డుకు ఇరువైపులా పంటకాలువలు, వాటి పక్కనే కంటిచూపు ఆనినంతవరకూ పచ్చటి పైరుపొలాలు. ఈడొచ్చిన  తెలుగుపిల్లలా భూకన్య పచ్చటివోణీ తొడుక్కుని సిగ్గుతో మురిసిపోతూంటే, ఆ సిగ్గును పల్చటి మేలి ముసుగుతో కప్పుతున్నట్లు జలతారు మంచుతెర, ఇంతటి సుందర సన్నివేశానికి ఆహ్వానాలు మోసుకెళ్తున్న నెచ్చెలుల్లా గగనసీమలో కొంగల బారు ..నయనమనోహర దృశ్యాలు దారిపొడవునా సాక్షాత్కరించాయి . శీతాకాలంలో మంచు తెరలు మాములే కానీ నిండు వేసవిలో బారెడు పొద్దెక్కాక మంచు తెరలు చూడటం ఇదే మొదటిసారి.

బిక్కవోలు 

బిక్కవోలు చిన్నగ్రామం. ఇక్కడున్న ప్రసిద్ధమైన ఆలయ సముదాయం శ్రీగోలింగేశ్వర స్వామి దేవాలయం. క్రీ.శ.9వ దశాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు తురుష్కుల దండయాత్రలలో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలక్రమంలో పుట్టలు,పొదలు పెరిగి అరణ్యంతో కప్పబడిపోయిన ఈ ఆలయాలని గోవులు తమ క్షీరధారలతో అభిషేకించటం గమనించి ఆశ్చర్యపోయిన కరణం, పుట్టలను తవ్వించి లింగాన్ని బహిర్గతం చేశారు. గోవుల క్షీరధారలతో అభిషిక్తమైన మూర్తి కనుక గోలింగేశ్వరుడయ్యాడు. ఆయననే ఆలింగన చంద్రశేఖరుడని కూడా అంటారు.




బిక్కవోలు పూర్వనామం బిరుదనవోలట. పూర్వం ఇక్కడి నుంచి పెద్దాపురానికి సొరంగమార్గం ఉండేదని , బ్రిటీషు వాళ్ళు బిగ్‌హోల్ అని పిలవటం మూలన కాలగర్భంలో అది బిక్కవోలుగా మారిందని ఒక కథనం.




గోలింగేశ్వరస్వామి వారి ఆలయానికి దగ్గర్లో పచ్చటి పోలాల మధ్యలోనున్న స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయం కనువిందు చేస్తుంది. గణపయ్య ఎంత బొద్దుగా ఉంటే అంత అందం. ఇక్కడ స్వామివారు విశాలమైన చెవులు, కుడివైపుకు తిరిగిన పొడవాటి తొండం, పెద్ద బొజ్జతో భూమిలో కూరుకుఫోయి ఉంటారు. స్వామి చెవులలో మన ఈప్సితాలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి.





బిక్కవోలు, గొల్లల మామిదాడ, దాక్షారామం, పీఠాపురం, అన్నవరం, కడియం - ఇవి ముందుగా మేం బుక్‌ చేసుకున్న ప్యాకేజి ప్రకారం  మొదటిరోజు వెళ్ళవలసిన  ప్రాంతాలు. బిక్కవోలు చూశాక స్థానిక ప్రాశస్త్యం ఉన్న చిన్న గుళ్ళ కంటే లోకప్రాశస్త్యం ఉన్న దేవాలయాలు, ప్రాంతాలు దర్శించడం  ఉత్తమమనిపించింది . మా రూట్‌మ్యాప్‌లోంచి గొల్లల మామిదాడ , కడియం తొలగించి వాటి స్థానాల్లో సామర్లకోట, కాకినాడ చేర్చాం. మా డ్రైవరు  మాటకారి, బ్రతకనేర్చినవాడు కాబట్టి దానికి అంగీకరించాడు. పనిలో పనిగా మరుసటిరోజు ప్యాకేజ్‌కు బదులు వాహనాన్నే మాట్లాడుకోమని, దాని ద్వారా బోలెడంత డబ్బు ఆదా అవుతుందని (తనకూ, మాకూ) ,ఇష్టమొచ్చిన ప్రదేశాలు చూడవచ్చని సలహా ఇచ్చాడు. మాకా సలహా నచ్చింది.


కారు దాక్షారామం వైపు బయలుదేరింది.

(సశేషం..)


6 comments

Post a Comment

గోదావరి యాత్ర -1




నీటి ఆవశ్యకత దేహానికి ఎంత ముఖ్యమో, నాగరికత వికసించి ప్రజలు వర్థిల్లాలన్నా ఒక ప్రాంతానికి అంతే ముఖ్యం. నీరు పుష్కలంగా ఉన్న చోట పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు సమృద్ధిగా పండిన చోట సుఖసంతోషాలు తాండవిస్తాయి. కడుపు నిండిన చోట కళాభివృద్ధికి కొదవేముంది?

భారతీయ సంస్కృతిలో నదీనదాల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ' గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ' అని శ్లోకం. సప్తనదులలో ఒకటైన గోదావరి నదిని, ఆ మహానది ఒడ్డున వెలసిన శ్రీరామచంద్రున్నిదర్శించుకోవాలన్న కోర్కె చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దాన్ని తీర్చుకొనే అవకాశం ఈ వేసవిలో దక్కింది .సాక్షాత్తూ గంగానదికి ప్రతిరూపమైన గోదావరినది గొప్పదనం గురుంచి అనేక విధాలుగా ముందే విని ఉన్నాను. నాటి ' మూగమనసులు ' నుంచి నేటి ' గుండెల్లో గోదారి ' వరకు అటు మన తెలుగు సినిమా దర్శకులు, ఇటు ఇతర మీడియా వాళ్ళు గోదావరి అందాలని యథాశక్తి దృశ్యరూపంలో బంధించి కనువిందు చేశారు. దీంతో గోదావరిని చూడాలన్న కోరిక మరింత బలపడింది . కావల్సిన సమాచారం సేకరించి వారం రోజుల ప్రణాళిక వేసుకున్నాం. రాజమండ్రిలో దిగి ముందు గోదావరి జిల్లాల్లోని ముఖ్యప్రదేశాలు సందర్శించి , ఒక రోజు విశ్రాంతి తీసుకొని తర్వాత తమ్ముడి కుటుంబంతో కలిసి భద్రాద్రి  రామున్ని దర్శించుకుందామని ప్లాన్ వేశాం. బెంగుళూరు నుంచి బయలుదేరి వారం రోజులలో ఒంటికి శ్రమ తెలియకుండా అన్ని ఊళ్ళూ చుట్టి రావాలంటే విమాన ప్రయాణమే శ్రేయస్కరం అనిపించింది. ఆఫీసులో ఎల్.టి.ఏ క్లెయిం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరికీ రానూపోను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేశాను. 

రెక్కలిచ్చిన తల్లిదండ్రులతో కలిసి రెక్కలున్న లోహవిహంగంలో ప్రయాణించడం ఒక మధురమైన అనుభూతి. మా తల్లిదండ్రులకి, మా పాపకి అదే మొదటి విమానప్రయాణం. మా పాప అయితే  ఉత్సాహంతో గంతులు వేస్తునే ఉంది. విమానాశ్రయంలో ప్రవేశించాక చుట్టూ ఉన్న విమానాలను అబ్బురంగా చూడటం, టేకాఫ్, ల్యాండ్ అవుతున్న విమానాలను ఆసక్తితో గమనించటం, సీటులో కూర్చున్నాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచుడటం, టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ వేగానికి బెదిరిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, సర్ది చెప్పాక స్థిమితపడి కిటికిలోంచి ప్రక్కనే కనిపిస్తున్న మబ్బుడొంకలను , క్రింద లీలగా కనిపిస్తున్న ఊళ్ళను చూస్తూ ఆశ్చర్యపోవడం..ఇలా తన ప్రతిచర్యా అపురూపమైన క్షణాలే. ఇక అమ్మానాన్నల ముఖాల్లో ప్రస్ఫుటమైన భావావేశాలు చాలు జీవితాంతం పదిలపరచుకోడానికి.   

రాయలసీమ ఎండలకు రాళ్ళు కూడా ఆవిరైపోతాయని తెలుసు కానీ కోస్తా ఎండలకు కొండలైనా కరిగిపోతాయని కొత్తగా తెలిసింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి హోటల్‌కు కారులో వెళ్తూంటే వెచ్చటి గాలులు మొహంపై వాతలు పెట్టాయి .అసలే వేసవి. కాసేపు ఎండలో నిల్చుంటే చాలు గోదావరిలో స్నానం చేసినట్లే. దానికి తోడు విపరీతమైన విద్యుత్‌కోతలు. ఇంతటి ఉక్కబోతలో సామాన్యజనం జీవితాలు ఎలా వెళ్ళదీస్తున్నారో అర్థం కాలేదు. విద్యుత్ మీదే అధారపడి నడిచే జిరాక్స్‌సెంటర్లు, జ్యూస్‌షాపులు వగైరా వేసవిలో ఉచితంగా సర్వీస్ చేసినట్లే లెక్క. వచ్చే రాబడి జనరేటర్ డీజల్ ఖర్చులకే సరిపోదు. ఏప్రిల్ మాసాంతంలోనే రాజమండ్రి లాంటి పట్టణాలలో ఇంత అధ్వానంగా ఉంటే ఇక మారుమూలపల్లెల్లో పరిస్థితి ఊహించుకోవచ్చు. నేల నలుచెరగులా నీరున్నా విద్యుత్‌కు నోచుకోని దుస్థితికి కారణం నాయకులా? నిగ్గదీసి అడగలేని ప్రజలా ? 

ప్రకృతి ఎంత గొప్పదో ఆ సాయంత్రం పుష్కరఘాట్‌లో మళ్ళీ బోధపడింది.





సంధ్య వెలుగులో స్నానాలాచరిస్తూ కొందరు, బోటు షికారు చేస్తూ ఇంకొందరు, నీళ్ళలో ఆటలాడుకొంటూ మరికొందరు, ఘాట్ ప్రక్కనున్న 


పాత బ్రిడ్జినెక్కి అంత ఎత్తు నుంచి గోదావరిలో దూకి ఈతకొడుతూ కేరింతలు కొడుతూ ఇంకొందరు, ఒడ్డున నిల్చుని పిల్లల్ని పర్యవేక్షించే తల్లిలా పవిత్ర గోదావరి విగ్రహం, ఈ సందడికంతా కాస్త దూరంగా ముఖద్వారం వద్ద  సర్వం నాకు తెలుసన్నట్లు  తపస్సమాధిలోని పరమశివునిలా గంభీరంగా ఉన్న ఎత్తైన శివలింగం. పడవలో విహరిస్తున్నంతసేపు నాలో 'వేదంలా ఘోషించే 


గోదావరి '  మార్మ్రోగుతూనే ఉంది. తిరిగి వస్తూ రేవు గట్టునున్న గోదారమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించాను. నిజంగా ఈ గోదావరి నదే లేకపోతే వేసవిలో ఈ ప్రజలకు ఉపశాంతి ఎక్కడిది?


..(సశేషం)


3 comments

Post a Comment