పిల్లలు - రియాలిటి డాన్స్ షోలు




'ఆ
ట ' ప్రోగ్రాం పై ఆఖరుకి వేటు పడింది.టీ.వీ.లో ఆ ప్రోగ్రాం చూడాల్సి వచ్చినప్పుడల్లా ఉష్ట్రపక్షి ఇసుకలో తలదాచేసుకొని శతృవుల బారి నుంచి తప్పించుకున్నట్లు,వేరే రూంలోకి పారిపోయి ఇతర వ్యాపకాల్లో తలమునకలైపొయి నన్ను నేను కాపాడుకొనేవాడిని.ఆ అవసరం ఇప్పుడు తప్పింది.కళ పేరుతో వ్యాపారం చేస్తూ,ఆ కళకే వలువలు నిస్సుగుగా వొలిచేస్తూంటే,వస్త్రదానం చేసి పరువు నిలిపిన శ్రీకృష్ణ పరమాత్ముడిలా జస్టిస్ సుభాషిణ్ రెడ్డి నేతృత్వంలోని మానవహక్కుల కమీషన్ కరుణించి కొరడా ఝళిపించింది.ఈ పోలిక కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు గానీ దురదృష్టవశాత్తూ ఇది నిజం.

ఒక రకంగా ఈ పరిస్థితికి ఓంకారే బాధ్యుడు.మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా బుల్లితెర జీవితం ప్రారంభించి,అనతికాలంలోనే నిర్మాతగా,ప్రయోక్తగా పలు విజయవంతమైన కార్యక్రమాలు రూపొందించిన ఆయన,మెట్లెక్కే తొందరలో కొన్ని ప్రామాణిక విలువలు గాలికొదిలేశారు.అదే ఇంత రాద్ధాంతానికీ దారి తీసింది.పిల్లల స్పెషల్ గా 'ఆట ' ను ప్లాన్ చేసుకున్నప్పుడు,ప్రైం టైం లో దాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు అందులో అసభ్యత,అశ్లీలతకు తావుండకూడదు.కానీ ఓంకార్ ఆ ప్రాథమిక సూత్రం విస్మరించారు.అర్హతలేని వారిని కూడా అందలం ఎక్కించే ప్రయత్నం చేశారు.ముఖ్యంగా మెంటర్లు.మనం మాట్లాడేది కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారని,కాస్త హుందాగా వ్యవహరించాల్సిన అవసరం చాలా వుందని వాళ్ళకు ఏ కోశానా ఉండదు.ఏది మంచో,ఏది చెడో పిల్లలకు విడమరిచి చెప్పాల్సిన మెంటర్లే చిల్లర మాటలు మాట్లాడుతూ,వెకిలి వేషాలు వేస్తూ,పిచ్చి ఛాలెంజిలు చేసుకుంటూ ఉంటారు.ఆట-4 లో అయితే అచ్చం కుళాయిల దగ్గర ఆడవాళ్ళు తన్నులాటల్లానే ఉండేది.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన పిల్లలు వాటినే వేమన పద్యాల్లా,సుమతీ శతకాల్లా భావించి వల్లిస్తూంటారు.ఆట-4 లో వయసుకు మించిన మాట్లాడిన గీతిక,ఆట-5 లో ఆ పాపను మించి వల్గర్ డాన్సులు చేసే భువన..ఈ లిస్టు చాల పెద్దది.దానికితోడు కురచ దుస్తులు వేసుకొని,'నన్ను కొరికేయ్ రో,నా వయసు పదహారే,రింగరింగ రింగరింగా రే ' లాంటి పాటలకు డాన్సులు వెయ్యడం.అతిమాటలు మాట్లాడే పిల్లల్ని నాలుగు తగిలించి మంచి మాటలు చెప్పాల్సిన తల్లిదండ్రులు,తమ పిల్లలు ఎవో ఘనకార్యాలు చేసినట్లు నవ్వుకుంటూ చప్పట్లు కొట్టడం ఇంకో విడ్డూరమైన విషయం.ఇటువంటి షోలు చూసే పిల్లల్లో అవి ఎన్ని దుష్పరిణామాలకు దారితీస్తాయో చెప్పనక్కరలేదు.

ఒక్క ఆట మాత్రమే కాదు,నృత్య ప్రధానమైన రియాలిటీ షోస్ అన్నీ దాదపుగా అలానే తగలడ్డాయి.ఓంకారే నిర్వహించే ఛాలెంజ్ (మా టీవీ),నాగరాజ్/ఉదయభాను నిర్వహించే మగధీర (జీ టీవీ) అంతకంటే ఘోరంగా వుంటున్నాయి.మెంటర్లు గా పిలవబడే వ్యక్తులకు,పార్టిసిపెంట్లకు చాలా మందికి స్టేజి మీద ఎలా ప్రవర్తించాలో తెలియనట్లుంది.లేదా పుర్తిగా మరిచిపోతున్నట్లున్నారు.సగం కార్యక్రమం కేకలు,సవాళ్ళూ,ప్రతి సవాళ్ళతోనే నిండిపోతోంది.ఇలా చేస్తే గానీ రియాలిటి అనిపించుకోదనో లేక టీ.ఆర్.పీ రేటింగ్ లు పెరుగుతున్నాయి కాబట్టి మనం చేస్తున్నదని కరక్టే అని భ్రమలో వాళ్ళు ఉన్నారో తెలియదు. ఆమ్మ రాజశేఖర్,నవనీత్ కౌర్ లాంటి జడ్జిలు కొన్ని సందర్భాల్లో శ్రుతి మీరి ఆసభ్యంగా ప్రవర్తించారు.అయితే అవన్నీ యువత ప్రధానంగా పాల్గొనే ప్రోగ్రాములు కాబట్టి 'ఆట ' కు ప్రజాసంఘాల నుంచి వచ్చినంత వ్యతిరేకత వాటికి రాలేదు.కాస్త సంసారపక్షం గా ఉండి,ఇంటిల్లిపాదీ చూడగలిగేలా ఉండే నృత్య ప్రధానమైన కార్యక్రమం ఎదైనా వుంది అంటే అది 'ఢీ' ఒక్కటే.అప్పుడప్పుడు ఉదయభాను కాస్త అతి చేసినా,ఏనాడూ,ఎబ్బెట్టుగా అనిపించలేదు.ఈ విషయం లో మల్లెమాల గారిని,ఈ టీవి యాజమాన్యాన్నీ అభినందించాలి.

ఓంకార్ గారు,ఇతర నిర్వాహకులు కూడా అసభ్యత,ఆశ్లీలతను పక్కన పెట్టి, సృజనాత్మకతకు పెద్దపీట వేసి మళ్ళీ జనరంజకరమైన కార్యక్రమాలు నిర్మించి ప్రజాదరణ పొందాలని ఆశిద్దాం.తమ పిల్లల ప్రగతి ఎదుగుదలని ఓర్వలేని వారే ఇలా అడ్డుకొంటున్నారని భావించే తల్లిదండ్రులు కూడా, పిల్లల మనస్తత్వ నిపుణులోకరు టివీలో చెప్పిన మాటను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.మీ పాపకో,బాబుకో నాట్యం మీద ఆసక్తి వుంటే తప్పకుండా నేర్పించండి.అది కూచిపూడి,భరత నాట్యమే కానవసరం లేదు.కానీ వాళ్ళ చేత ఆశ్లీల నృత్యాలను మాత్రం చేయించకండి.అటువంటి కార్యక్రమాలను మీరు చూస్తూ పరోక్షంగా వారిని ప్రోత్సాహించకండి.ఆశ్లీల నాట్యాల్లో వయసుకు మించిన భావాలు పలికించాల్సి వచ్చినప్పుడు పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు.ఆది అనేక అనర్థాలకు కారణం అవుతుంది.కోరి సమస్యలని తెచ్చుకోవద్దు.'ఆట ' ద్వారానో,మరింకొకటి ద్వారానో కొన్ని నిరుపేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియచ్చు.కానీ మీ పిల్లలు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మీరూ అలోచించండి.నేటి బాలలే కదా రేపటి పౌరులు.


13 comments

Post a Comment

ప్లేస్కూళ్ళు - కుటీర పరిశ్రమలు




' ఎదగడానికి ఎందుకురా తొందర ' అంటారు ఏఎన్నార్ బాపుగారి ' అందాలరాముడు ' సినిమాలో.అప్పట్లో ఆ మాటలు చెల్లుబాటయ్యాయేమో కానీ,వాటికి కాలం చెల్లిపోయి చాలా ఏళ్ళయింది.ఈ స్పీడ్ యుగంలో పుట్టినదగ్గర్నుంచి పిల్లలకు పోటీతత్వం అలవర్చకపోతే,ఆనక వెనుకబడిపోయి నవ్వులపాలయ్యేది వాళ్ళు,వాళ్ళతో పాటూ తల్లిదండ్రులుగా మనమూ అని తల్లిదండ్రులందరికీ తెలుసు.ఒకప్పుడు ఎల్.కే.జి,యూ.కే.జి తరువాత ఫస్ట్ క్లాస్ ఉండేవి.ఇప్పుడు వాటికంటే ముందుగా ప్రీకేజీ లేదా ప్లేస్కూల్ అని వొకటి తయారయ్యింది.వాటి గురుంచే ఈ టపా.

సాధారణంగా రెండున్నరేళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లల్ని ప్లేస్కూళ్ళలో చేర్చుకుంటారు.A నుంచి Z వరకు,1 నుంచి 10 వరకు ఆ వయసులోనే నేర్పించేస్తారు.ఎల్.కే.జి ని నేరుగా ఆంగ్ల పదాలతో మొదలుపెడతారు.జీవితంలో తిరిగిరానివి బాల్యం,యవ్వనం.ఏ బాదరబందీ లేకుండా,అమ్మానాన్నల గోరుముద్దలు తింటూ,గెంతుతూ ఆడుకోవల్సిన రెండున్నరేళ్ళ వయస్సులో,కాళ్ళు కట్టేసుకొని,అక్షరాలతో కుస్తీపడుతూ,వొత్తిడికీ గురయ్యే చిన్నపిల్లల్ని చూస్తే సున్నిత మనస్కులకు జాలి కలుగకమానదు. భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తే తప్ప రోజులు గడవని రోజులివి.కొన్ని కుటుంబాలలో మూడునెలల పిల్లల్ని సైతం డేకేర్ సెంటర్ లో వేసేసి ఉద్యోగాలకు వెళ్ళే మహిళల గురుంచి కూడా మనం వింటున్నాం,చూస్తున్నాం.సాంకేతిక విప్లవం మిగిల్చిన దుష్పలితాల్లో ఇదీ వొకటి.అవాంఛనీయమైనా అనివార్యమైన పరిణామం ఇది.

సరే,నాకిష్టమున్నా లేకున్నా మా చిన్నారిని ప్రీకేజిలో చేర్పించాల్సిన వయసొచ్చింది కాబట్టి,భార్యభర్తలం ఇద్దరం స్కూళ్ళ వేటలో పడ్డాం.ఇంటికి దగ్గరగా ఉంది కదా అని వో ప్లేస్కూలుకెళ్ళాం.అది రెండంతస్తుల ఇల్లు.గేటు తియ్యగానే కార్ పార్కింగ్ కోసం కేటాయించినట్లుండే స్థలంలో (నట్లు కాదు,నిజంగా అక్కడ ఉదయం ఏడు ఎనిమిది వరకు కార్ పార్క్ చెయ్యబడే ఉండటం ఓ రోజు చూశాను)ముందుకూ వెనక్కూ ఊగే మూడు నాలుగు ప్లాస్టిక్ బాతు బొమ్మలు,గుఱ్ఱం బొమ్మలు,ఒక జారేబండ అమర్చి ఉన్నాయి.కొంతమంది చిన్న పిల్లలు బిక్క మొహం వేసుకొని చూస్తుంటే,జైళ్ళో ఖైదీలను అజామాయిషీ చేసే జైలర్లలా,ఆయాలనబడే ఇద్దరమ్మాయిలు వాళ్ళని పరికిస్తూ కాపలా కాస్తున్నారు.కాస్త పక్కగా కాస్త పెద్ద హాలు,అందులో ఒక బోర్డు,'ABCD'లు తగిలించిన పటాలు,బొమ్మలు,కొన్ని కుర్చీలు,ఒక వైపున టీ.వీ. ఉన్నాయి.అది ఆఫీస్ రూం అనుకున్నా కానీ ప్రిన్సిపల్ వచ్చాక,అది ఆఫీస్ రూం + క్లాస్ రూం అని అర్థం అయ్యింది.అంతేకాదు,ప్రీస్కూల్,ఎల్.కే.జి,
యు.కే.జి పిల్లల్ని అందరినీ కలిపి ఆ స్థలం లోనే కూర్చోబెట్టి పాఠాలు(?) బోధిస్తారని తెలిసి అవాక్కయ్యాను.డేకేర్ పిల్లలకి వరండానే గతి పాపం.

ప్రిన్సిపల్ యథాప్రకారం గంభీరంగా స్కూలు గురుంచి,ఫీజుల గురుంచి వివరించి,పనిలో పనిగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర గురుంచి చిన్నపాటి లెక్చరు కూడా దంచింది.వాలెంటైన్స్ డే ని కూడా తమ స్కూలు సెలెబ్రేట్ చేసుకుంటుందని,కాకపోతే ఆ రోజున తల్లిదండ్రులని ప్రేమించమని,అన్నదమ్ములను,అక్క చెల్లెళ్ళను ప్రేమించమని పిల్లలకు చెబుతామని ఆవిడ చెప్పింది.పిల్లల పట్ల అంత ప్రేమ,సామజిక బాధ్యత ఉన్న ఆవిడ అంతే శ్రద్ధ ను,పాఠశాలకు ఇంకొక మూడు విశాలమైన గదులను కేటాయించటంలోనో,మెరుగైన సౌకర్యాలు కలిగించటంలోనో చూపించి ఉంటే ఇంకా బావుండేది. రాజకీయనాయకుల వాగ్దానాలనే వినీవినీ అరాయించుకున్న సగటు భారతీయుడు బుర్ర కాబట్టి ఆవిడ ఉపన్యాసం నన్నేం చెయ్యలేకపోయింది.అక్కడి నుంచి బయటపడి ఓ ప్రముఖ కార్పొరేట్ గురు నిర్వహిస్తున్న స్కూల్ కి వెళ్ళాం.ఆ శాఖను అప్పుడే ఏర్పాటు కొత్తగా ఏర్పాటు చేసారు.స్కూలు ఆవరణ విశాలంగానే ఉన్నా,'ఇది బడి ' అని చెప్పడానికి పనికివచ్చే పరికరాలు ఏవీ అక్కడ కనిపించలేదు.స్కూల్ మేనేజ్మెంట్ ని మాటల్లో దింపితే తల్లిదండ్రుల దగ్గర్నుంచి వసూలు చేసే నాన్-రిఫండబుల్ ఫీజులతో పరికరాలని త్వరలోనే కొనుగోలు చెయ్యనున్నట్లు తెలిసింది.మొహం మీద వాళ్ళా విషయం చెప్పకపోయినా, సారాంశం అదే.

ఇంటికి తిరిగి వస్తూండగా నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది.ఈ దేశంలో ప్లేస్కూళ్ళు కూడా కుటీర పరిశ్రమలు లాంటివి.కావలసిందల్లా లక్ష రూపాయిలు పెట్టుబడి,ఒక చిన్న ఇల్లు.అది అగ్గిపెట్టె లాంటి ఇల్లైనా పర్లేదు.అద్దె ఇల్లైనా పర్లేదు.స్వంత ఇల్లైతే మరీ మంచిది.అద్దె డబ్బులు,అడ్వాన్సు సొమ్ములు మిగులుతాయి.అనుమతుల సంగతి దేవుడెరుగు..కనీస అవసరాలు కూడా లేని ఇటువంటి ప్లేస్కూల్లలో చేరి పిల్లలెంతవరకు ప్రయోజకులవుతున్నారేమో కానీ,నిర్వాహకులకు మాత్రం అవి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.మనసు చంపుకుని పిల్లల్ని వదిలి ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగినుల సెంటిమెంట్లతో వారికి పని లేదు.వారికి కావల్సిందల్లా ఖర్చు-రాబడి,లాభ-నష్టాల బేరీజు పట్టిక మాత్రమే.వీధికి వీధికీ పుట్టగొడుగుల్లా మొలుస్తున్న ఇటువంటి ప్లేస్కూళ్ళ బారి నుండి ఈ దేశాన్ని ఆ భగవంతుడే రక్షించాలి.


8 comments

Post a Comment

తాతయ్యలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయం

దారుణం విన్నారా? మా చిన్నారి పుణ్యమా అని నాకీ సందేహం కలిగి ఒక నిష్టూర సత్యం బయటపడింది కానీ,లేకుంటే ఈ అన్యాయం కూడా,తరతరాలుగా మగజాతికి జరుగుతున్న వెలుగులోకిరాని అనేక పరాభవాల జాబితాలో చేరిపోయేది.

ఆగాండాగండి..విషయంలోకి వచ్చేస్తున్నాను.

అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటాం.
నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటాం.
కానీ అమ్మకు నాన్నైనా,నాన్నకు నాన్నైనా ముక్తసరిగా తాతయ్య అనేసి చేతులు దులుపుకుంటాం.అమ్మలకు రెండు పేర్లుంటే,నాన్నలకు మాత్రం ' తాతయ్య ' అని ఒకే పేరుతో సర్దిపెట్టేశారు.

దీనివల్ల బోలెడంత కష్టం ఉంది.

తాతయ్య అని ఒకరిని పరిచయం చేసి,ఇంకొకరి ఫోటో చూపించి మళ్ళీ తాతయ్య అంటే,మొదటి వ్యక్తి అమ్మకు నాన్నని,రెండో వ్యక్తి నాన్నకు నాన్నని అర్థం చేసుకోవటానికి బుడుగులు,సిగానపెసూనాంబలు ఎంత కష్టపడాలి.అంత చిన్న వయసులో వారి చిట్టి మెదళ్ళని మానసికశ్రమకు గురిచెయ్యడం అవసరమా? తాతలిద్దరిదీ వేర్వేరు ఊర్లయితే,ఏ హైదరాబాద్ తాతనో,తిరుపతి తాతనో చెప్పుకునే వెసులుబాటు ఉంది.అదే ఇద్దరిదీ ఒకే ఊరయితే,అప్పుడేమని పిలవాలి? గాంధీరోడ్ తాతనో, లేక నెహ్రూవీధి తాతనో నా? తాతయ్య గురుంచి చెప్పుకోవాల్సిన ప్రతిసారీ,ఏ తాత గురుంచి చెబుతున్నామో,ఆ విషయం మీద స్పష్టతనివ్వాల్సి రావటం భావ్యమా? వాగానుశాసనుడైన నన్నయ్య కూడా ఈ విషయం పై దృష్టి పెట్టకపోవటం శోచనీయం.

దీనిని నేను ఖండిస్తున్నాను.

అమ్మనాన్న,నాన్ననాన్న అంటే బావుండదు కాబట్టి అర్జంటుగా ఒక ఉద్యమం లాగా 'తాతయ్య ' పదానికి ప్రత్యామ్నాయాలు వెదకాల్సిన అవసరం మనకందరికీ ఉంది.స్త్రీ సమానత్వం,పురుషాహంకారం మీద ఉద్యమాలు నడిపే మహిళాశిరోమణులు కూడా మగజాతికి జరిగిన ఈ అన్యాయాన్ని సావధానంగా పరిశీలించి,మా ఉద్యామానికి సహకరించల్సిందిగా నా విన్నపం.

ఏమంటారు?


12 comments

Post a Comment