ముగ్గురు ముఖ్యమంత్రుల కథ

మొదటి వ్యక్తి.. మన ప్రియతమ ( ?) ముఖ్యమంత్రి రోశయ్య .

వైయస్సార్ దుర్మరణం తర్వాత కురువృద్ధుడైన రోశయ్య నాయకత్వంలో రాష్ట్రానికి కాస్తైనా మంచి జరుగుతుందని ఆశించిన అనేకానేక వెర్రిబాగులోల్లలో నెనొకన్ని. అదేం ఖర్మమో కానీ ఆయన పీఠం ఎక్కిందగ్గర్నుంచి రాష్ట్రాన్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. తనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించి  మనల్ని గట్టున పడేస్తాడనుకుంటే  ఆయన వెలగబెడుతున్న నిర్వాకం, పెనం మీద నుంచి పొయ్యిలోకి త్రోస్తూ ఉంది. మూర్తీభవించిన నిష్క్రియాపరత్వం,  ఉన్న వాటిని పరిష్కరించటం పోయి లేనివాటిని సృష్టిస్తోంది. తన పదవిని కాపాడుకోవడమే ఆయనకు ప్రధాన కార్యక్రమమైపోయింది. మచ్చుకి 'ఈనాడు' లోని ఈ వార్త చదవండి.



కాంగ్రెస్ పార్టీ ఏర్పడి  125 సంవత్సరాలు, భారతదేశానికి స్వాతంత్ర్యం  సిద్ధించి 63 సంవత్సరాలు గడిచాయి. బానిస బుద్ధులు మాత్రం ఇంకా వదిలినట్టు లేదు. ఒక్క రోశయ్యకే కాదు, ఆ  పార్టీ నాయకులందరికీ ఇదే జాడ్యం. ముక్కు మూసుకొని నిత్యం దేవతా స్తోత్రాలు వల్లించే మునిపుంగవుల్లా వీళ్ళు కూడా  ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ అనే నాలుగు మంత్రాలు పఠిస్తూంటారు. బలహీన వర్గాల కార్యక్రమం నుంచి బహిర్భూమి పథకం వరకు ప్రతి అడ్డమైన పనికీ రాజీవ్ ,ఇందిరల పేర్లు వాడుకోవల్సిందే. ఇలా చేసే  ఎన్నో ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన కడప జిల్లాను, జగన్ వర్గీయులని అనునయించటం కోసం, ఒక్క కలంపోటుతో వైయస్సార్ కడప జిల్లాగా మార్చిపారేశారు. ఇప్పుడు వారి  దృక్కులు మెదక్ జిల్లాపై  ప్రసరించినట్లున్నాయి . మాహాత్ముల చూపులు సోకటమే మహద్భాగ్యంగా మనమంతా తన్మయమవ్వాలి. ఈ దివ్య మంత్రోపదేశాలు వినీ వినీ అలవాటు పడిపోయి రేప్పొద్దున్న మనం మన పిల్లలకు ఈ పేర్లే పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన  పని లేదు. వేంకటేశ్వరస్వామి పేరు పెట్టుకున్న పాఠశాలలకు,కళాశాలలకు  టి.టి.డి ధన సహాయం చేసినట్లు, కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషించి మనల్ని అనుగ్రహించే అవకాశం ఉంది . రోశయ్య గారి దృష్టిలో రాష్ట్రంలో ఇంతకంటే   ప్రధానమైన ఆంశాలు,సమస్యలు లేవు. ఒకవేళ ఉన్నా, రెండు పక్షాలుగా చీలి పరస్పరం రాళ్ళు రువ్వుకుంటున్న మంత్రులాయన మాట వినరు. అధికారుల సంగతి సరే సరి.వైయస్సార్ ఉన్నప్పుడే  అడిగే నాథుడు లేదు.ఇప్పుడెవరు చూడొచ్చారు? అది మన గ్రహచారం అనుకొని తృప్తిపడాలి .

ఇక రెండవ వ్యక్తి ,..  హేతువాదిగా తనను తాను అభివర్ణించుకొనే తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. ట్రాయ్ నిబంధనలు, ప్రధాని ఆదేశాలు బేఖాతరు చేసి లక్షల కోట్ల రూపాయిల నష్టానికి కారణభూతుడైన మాజీ మంత్రి అండిముత్తు రాజాను అంబేద్కర్‌తో పోల్చాడు కరుణానిధి. రాజా దళితుడు కాబట్టే ఓర్వలేని అగ్రవర్ణాల వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం  చేసి అతన్ని బజారుకీడుస్తున్నాయని ఆయన సూత్రీకరించారు. నాకు తెలిసి అంబేద్కర్ ఎటువంటి కుంభకోణాలకు పాల్పడలేదు. అటువంటి నాయకున్ని రాజా లాంటి అక్రమార్కుడితో  పోల్చి దారుణంగా అవమానించినందుకు దళితసంఘాలేవైనా ఉద్యమిస్తాయో లేదో వేచి చూడాలి. మనదేశంలో కులమతాలు, రాజకీయాలు అవిభక్త కవలల్లాంటివి. తమ గుట్టు బయటపడినప్పుడల్లా, ఓట్లు రాల్చుకోవాల్సినప్పుడల్లా ఉపయోగపడే తారక మంత్రాలివే. అందుకే మ్యాచ్  ఫిక్సింగ్  ఉదంతంలో అజారుద్దీన్ మైనారిటి కార్డు ప్రయోగించగలిగాడు, 2G స్కాములో కరుణానిధి దళితకార్డుని వినియోగించగలిగాడు. రాజా పై శిక్షను రాజీనామాతో సరిపెట్టేశారు. ఛార్జిషీటు లేదు, అరెస్టు లేదు. ఏడువేల కోట్ల రూపాయిల మోసానికి జైలుపాలైన రామలింగరాజు కిన్ని తెలివితేటలు, అంగబలమూ లేకపోయాయి. రాజాకి అవి రెండు ఉన్నాయి కాబట్టి అతన్ని రక్షించటానికి, ప్రతిపక్షాలని శాంతపరచటానికి  ప్రభుత్వం పార్లమెంటరీ కమిటి వేసి కాలయాపన చేయ్యొచ్చు. కరుణానిధి కథ మాటలు సమకూర్చుతున్న 75వ చిత్రంలో ఇటువంటి చమక్కులు ఏమైనా ఉంటాయేమో. ఆశించటంలో తప్పులేదు.

ఇక మూడవ వ్యక్తి.. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. ఏడ్చే మగవాన్ని నమ్మకూడదన్న సామెత ఈయన విషయంలో అతికినట్టు సరిపోతుంది. దక్షిణాదిన తొలిసారిగా అధికారం కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆనందం బి.జె.పి కి అట్టే నిలిచేలా లేదు.మొన్నటిదాక  అసమ్మతివాదులు పొగబెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తే ఇప్పుడు యడ్యూరప్ప తనయులే భూఆక్రమణల ఆరోపణలలో పీకలలోతు కూరుకుపోయారు. దానికి తోడు గోతి కాడ నక్కల్లా  కుమారస్వామి, దేవెగౌడ ఉండనే ఉన్నారు. యడ్యూరప్ప, ఆయన తనయులు తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టే  తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి సి.ఎం పదవి పై ఆశలు పెట్టుకోకుండా అధికారం ఉండగానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరని బీరాలు పోయే బి.జె.పి ప్రభుత్వంలో ఘనుల దొంగలు, స్నేహితుని భార్యను బలాత్కరించిన వాళ్ళు, నర్సుతో అక్రమసంబంధాలు పెట్టుకున్నవాళ్ళు, స్కాముల్లో పాత్రధారులు, మంత్రులుగా పనిచేశారు, చేస్తున్నారు.దీన్నిబట్టి తేలిందేమిటంటే రాజకీయం అన్నాక ఏ పార్టీయైనా ఒక్కటేనని, అంతా ఆ త్రాసులో ముక్కలేనని.

ఎటొచ్చీ ప్రజలే పిచ్చిమాలోకాలు. వాళ్ళకు నిలువుదోపిడీ తప్పదు


2 comments

Post a Comment

వడ్డాది పాపయ్య శాస్త్రి గారి చిత్రాలు ( 'స్వాతి' నుంచి) -1

నా అభిమాన చిత్రకారుల్లో వపా(వడ్డాది పాపయ్య శాస్త్రి) గారొకరు. చిత్రలేఖనం అంటే ఆయిల్‌పెయింటింగ్సే అనుకునే రోజుల్లో వాటర్ కలర్స్‌తోనే అద్భుతాలు సృష్టించి సంచలనం రేపారాయన. ఆంధ్రులందరికీ చిత్రకళ అనగానే బాపుగారే ముందు గుర్తొస్తారేమో కానీ నాకు మాత్రం మొదట పరిచయమైన చిత్రకారుడు వీరే. 'స్వాతి' వారపత్రికకు ఆ పుణ్యం దక్కుతుంది. ఆ పత్రిక కోసం వారు వేసిన కొన్నిచిత్రాలు ఇక్కడ చూడండి.




5 comments

Post a Comment

నరకాసుర వధ (చిత్రం)




అందరికీ దీపావళీ శుభాకాంక్షలు


2 comments

Post a Comment