శాలివాహన (వాటర్ పెయింటింగ్)


ఆంధ్రుల తొలి తెలుగు రాజులు శాతవాహనులు.ఆయితే వీళ్ళెవరనేదాని మీద బోల్డంత గందరగోళం ఉంది.శాలివాహనుడు విక్రమాదిత్యున్నే ఓడించిన రాజని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది.మన పురాణాల ప్రకారం శాలివాహనుడు విక్రమాదిత్యుని మనవడు, అగ్నివంశపు రాజు.విదేశీ చరిత్రకారుల ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణే శాలివాహనుడు.కొంతమంది స్వదేశీ చరిత్రకారులు దీనితో విభేదిస్తారు.అయితే ఇంద్రదత్తమైన సింహాసనం పొంది,భేతాళున్ని వశం చేసుకున్న విక్రమాదిత్యుడెవరు అనేదానిమీదే చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు.
అటువంటప్పుడు అతన్ని ఓడించి శక శకానికి శ్రీకారం చుట్టిన శాలివాహనుడెవరో తెలుసుకోవడం కష్టం.వీళ్ళు ఎవరైనా ఆంధ్రజాతికి వీళ్ళే మొదటి తెలుగు పాలకులన్నది సుస్పష్టం.

ఆ శాలివాహనుడి ఊహాచిత్రమే ఈ చిత్రం.


3 comments

Post a Comment

నీలాలు కారేనా కాలాలు మారేనా

శీరిక్షలో నాకు నచ్చిన కొన్ని మధురగీతాల్ని మీతో పంచుకుంటాను.

ముందుగా 'ముద్దమందారం' సినిమా లోంచి 'నీలాలు కారేనా కాలాలు మారేనా ' పాట గురుంచి ..

1981 లో విడుదలై అఖండ విజయాలు సాధించిన తెలుగు సినిమాలలో ఇదొకటి. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దర్శకుడిగా జంధ్యాల( వెంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి) గారికిదే మొదటి సినిమా. అప్పటికే ఆయన సినీరచయితగా సుప్రసిద్ధులు. హీరో హీరోయిన్ల(ప్రదీప్,పూర్ణిమ)లతో సహా నటీనటులందరూ చాలా వరకు కొత్తవాళ్ళే. 'సుత్తివేలు' గా ప్రసిద్ధులైన కురుముద్దాలి లక్ష్మీ నరసింహా రావు గారికీ,ఏ.వీ.ఎస్ గారికీ ఇదే మొదటి చిత్రం. సంగీతం రమేష్ నాయుడు గారు. పాటలన్నీ వేటూరి గారే వ్రాశారు. ఆ సాహితీ పారిజాతపు మహావృక్షం కొమ్మరెమ్మల్లో విరబూసిన పాటలు, సుమధుర మరందాల సువాసనలే వెదజల్లాయి. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమా విమర్శకులకు మాత్రం బాగా పని కల్పించింది. టీనేజ్ ప్రేమకథలతో యువతను పెడదోవ పట్టిస్తున్నారని వాళ్ళంతా జంధ్యాల పై అస్త్రశస్త్రాలను సంధించారు.





కథ మాములు ప్రేమ కథే.అమెరికా నుంచి తిరిగొచ్చిన ఒక లక్షాధికారి కొడుకు,తండ్రినెదిరించి ఒక పూలమ్ముకొనే పేదింటమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. ఆ తర్వాత వారి జీవితం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలలో ప్రియురాలిని ఓదారుస్తూ కథానాయకుడు పాడే పాట ఇది.

నీలాలు కారేనా
కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా




మొదటి చరణంలో సూర్యుడికి,చంద్రుడికీ పేదాగొప్ప భావం లేదని,నింగినీ,నేలను కొనగల సంపద లేదని చెబుతారు.

సూరీడు నెలఱేడు సిరిగల దొరలే కారులే
పూరి గుడిసెల్లో, తేడా మనసుల్లో
వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేరులే
కలిమి లేముల్లో, కరిగే ప్రేమల్లో
నిరుపేద లోగిళ్ళులే


ఈ క్రింది చరణం చూడండి ఎంత బావుందో,


ఈ గాలిలో తేలి వెతలన్నీ మరిచే వేళలో
కలికి వెన్నెల్లో, కలల కన్నుల్లో
కలతారిపోవాలి లే
ఆ తారలే తేరి తళతళమెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటే ,ఒదిగిపోతుంటే
కడతేరిపోవాలి లే


ఒక వైపు పుచ్చపువ్వులా వెన్నెల !
మరో వైపు చల్లని గాలి !

అటువంటి గాలిలో తేలిపోతూ కష్టాలన్నీ మరిచిపోయే వేళ, ప్రియురాలి కలతలన్నీ ఆరిపోవాలని,తన ఒడిలో ఆమె ఒదిగిపోతుంటే అలాగే తుదిశ్వాస విడవాలని కోరుకుంటాడు. ప్రతి ప్రేమికుడు కోరుకునేదిదే.పండు వెన్నెల్లో ఈ పాట వింటూ పడుకుంటే ఎటువంటి కష్టాలైనా మరచిపోతాం. సినిమా గురుంచి తెలియకపోయినా,పాట విన్న వెంటనే కథ,కథతో పాటు సన్నివేశం,రెండూ శ్రోతలకి అవగతమవుతాయి. సగటు ప్రేమికుడి హృదయాన్ని వేటూరి చక్కగా ఆవిష్కరిస్తే,రమేష్ నాయుడు సంగీతం దానికి మరింత సొగసులు దిద్దింది. ఇక బాలు గురించి చెప్పాల్సిన పని లేదు. గంధర్వ గాత్రంతో భావయుక్తంగా పాడి పాటకు ప్రాణం పోసారాయన.

చంద్రునికీ మచ్చలున్నట్లు ప్రదీప్ నటనొక్కటే ఈ పాటకు లోటు .


3 comments

Post a Comment

నటకిరీటికి నీరాజనం


(జూలై పంతొమ్మిది రాజేంద్రప్రసాద్ జన్మదినం.ఆ సందర్బంగా ఈ వ్యాసం )

వి నేను ఏడవ తరగతి చదివే రోజులు.వారం రోజులుగా మా స్కూల్ చుట్టుప్రక్కల ఒకటే సందడి.'ఏంటా సంగత'ని ఆరా తీస్తే రాజేంద్రప్రసాద్ సినిమా షూటింగ్ అన్నారు మా ఫ్రెండ్స్.స్కూల్ ప్రక్కనే వెస్ట్ రైల్వే స్టేషన్.దానికావల ఒక చర్చ్.ఆ చర్చ్ పరిసరాల్లో సినిమా తీస్తున్నారని చెప్పారు.క్లాస్ లో ఆ చుట్టుప్రక్కల ఇళ్ళల్లో ఉంటున్న పిల్లలు కొంతమందున్నారు. వాళ్ళొచ్చి రోజూ షూటింగ్ కబుర్లు చెబుతూంటే పసందుగా ఉండేది.క్లాస్ రూం కిటికీలోంచి కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కనిపించేది.దాంతో టీచర్లు చెప్పేది బుర్రకెక్కేది కాదు.రాజేంద్రప్రసాద్ అంతే తమాషానా? 'ఆహ నా పెళ్ళంట,వివాహభోజనంబు ' లాంటి భారీ విజయాలతో టాప్ హీరోలతో సమానమైన పాపులారిటీ తెచ్చుకొని,ఇంటిల్లీపాదీలో ఒకడిగా చెలామణీ అయిపోతున్న హీరో.అతని సినిమా వస్తోందంటే టాక్ తో సంబంధం లేకుండా జనం థియేటర్ల దగ్గర బారులు తీరేవాళ్ళు.హీరోగా అతనంటే ఇష్టపడని వాళ్ళు బహుతక్కువని చెప్పోచ్చు.

అప్పట్లో నేను ప్రొద్దున్నే లేచి మా క్లాస్ టీచర్ దగ్గర మాథ్స్ ట్యూషన్ కి వెళ్ళేవాన్ని.ఆవిడ ఉండేది మా స్కూల్ దగ్గరే.ఏడవ తరగతి కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని కూడా చదివేవాన్ని.ఒకసారి అలా ట్యూషన్ ముగించుకొని సైకిలెక్కి ఇంటిముఖం పట్టబోతూంటే మా మిత్రబృందం ' అలా చర్చ్ వరకు వెళ్ళొద్దాం రా రా ' అన్నారు.'దేనిక'ని అడిగా.'రాజేంద్రప్రసాద్ షూటింగ్ ఉందంట వెళ్ళొద్దాం' అన్నారు.వాళ్ళలో ఒకడు రాజేంద్రప్రసాద్ వీరాభిమాని(అతను నిజంగా రాజేంద్రుడి ఫ్యాన్ కాదేమో అని నేను మొదట అనుమానపడ్డాను.అప్పటిదాకా మేమంతా ఏ చిరంజీవి ఫ్యానో, బాలయ్య ఫ్యానో,నాగార్జున ఫ్యానో,వెంకీ ఫ్యానో అని విన్నవాళ్ళమే గానీ ఇలా వేరైటిగా రాజేంద్రప్రసాద్ ఫ్యాన్ అని చెప్పుకోవటాన్ని వినలేదు.అందరూ రాజేంద్రప్రసాద్ ని అభిమానిస్తారని,అతనికిష్టమైన హీరో వేరొకరుండొచ్చని,చెబితే నవ్వుకుంటామని ఇలా చెప్పాడేమో అనుకున్నాను.నా అభిప్రాయం తప్పని అతను నిజంగానే కేవలం రాజేంద్రప్రసాద్ అభిమానని తర్వాత తెలిసింది).

రాజేంద్రప్రసాద్ పేరు వినగానే నేను ఎగిరి గంతేశాను.అతనంటే నాకూ ఇష్టమే.'ఆహ నా పెళ్ళంట' సన్నివేశాలు ఇంకా మదిలో ఫ్రెష్ గానే ఉన్నాయి.మా సైకిళ్ళు చర్చి వైపు దారి తీసాయి.కాంపౌండ్ లోకి ప్రవేశిస్తూండగా ఒక తెల్లటి అంబాసిడర్ కారు మమ్మల్ని దాటుకుంటూ దూసుకుపోయింది.మా స్నేహితుడొకడు ఆయాసపడుతూ సైకిల్ తొక్కుతూనే 'ఆ కార్లో ఉన్నాడేమో రా' అన్నాడు."నీ మొహం.అది ఎవరి కారో ఏంటో ? అయినా రాజేంద్ర ప్రసాద్ ఈ కార్లో ఎందుకొస్తాడు ?" అన్నాడు వీరాభిమాని.
మొదటివాడు మాత్రం ఊరుకోలేదు.అందులో ఉన్నది రాజేంద్రప్రసాదే అని నిర్ణయానికి వచ్చేశాడు.మేము వారించేలోగా 'ఒరేయ్ రాజేంద్రా' అని అరిచేశాడు గట్టిగా .

అంతే ! ముందు వెళ్తున్న కారు కిటికీలోంచి రాజేంద్రప్రసాద్ తల బయట పెట్టి చూట్టం...నవ్వుతూ మమ్మల్ని రమ్మని సైగ చెయ్యటం జరిగిపోయాయి.

మాకు ఒక్కక్షణం మతి పొయ్యింది.'ఒరేయ్ గిరేయ్' అని వాగినందుకు మమ్మల్ని తిడుతారేమో అనుకున్నాం.మర్యాద లేకుండా మాట్లాడినందుకు మా స్నేహితుడి మీద కోపం వచ్చింది.అభిమాన హీరోని చూడబోతున్న ఆనందం ఒకవైపు, మందలిస్తారేమో అన్న భయం ఒక వైపు.సైకిళ్ళు నిలబెట్టి అలానే షూటింగ్ స్పాట్ కి వెళ్ళాం.

ఆ రోజు షూటింగ్ ఇంకా మొదలవలేదు.విశాలమైన చెట్ల నీడలో కొన్ని టేబుళ్ళు,వాటి మీద ఏవో కొన్ని గిన్నెలు,చుట్టూ కొన్ని కుర్చీలు అమర్చబడి ఉన్నాయి.మల్లెపువ్వు లాంటి తెల్లటి పొడుగు చేతుల షర్టు,పంచె కట్టుకొని ఓ కుర్చీ వైపు వెళ్తూ 'రండి పిల్లలు టిఫన్ చేద్దురు గానీ' అన్నారు రాజేంద్రప్రసాద్ చిరునవ్వుతో.సినిమా వాళ్ళలో ఒకతను 'ఒరేయ్ అంటారా' అని మమ్మల్నేదో అనబోయాడు.రాజేంద్రప్రసాద్ అతన్ని వారించి 'వాళ్ళంతా నా ఫ్యాన్సయ్యా' అన్నారు.

మాకు చాలా సంతోషం వేసింది.తనొక పెద్ద ఆర్టిస్టనే అహంభావం లేదు.నవ్వుతూ సరదాగా ఉండే మనిషి.'వద్దు సార్ ' అన్జెప్పి నోటుపుస్తకాల్లో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ లు తీసుకున్నాం.
ఆటోగ్రాఫ్లిస్తూండగా తెల్ల చీర కట్టుకొని ఒక అమ్మాయొచ్చింది.పరిచయం ఉన్న మొహంలా కనిపించలేదు.అప్పటికి మాకెవరికీ సితార,జ్యోతిచిత్ర లాంటి పత్రికలు చదివే అలవాటు లేదు కాబట్టి ఆమెవరో తెలియలేదు.ఆవిడే కాదు,ఒక్క రాజేంద్రప్రసాద్ తప్పితే అక్కడ ఉన్న మిగతా సినిమాజనంలో ఎవరు ఆర్టిస్టులో,ఎవరు అసిస్టెంట్లో తెలియదు.ఆటోగ్రాఫ్ పొందిన ఆనందంతో మా ఛాతీలు ఉప్పొంగాయి.మేం వచ్చేశాం.

తర్వాత ఆ సినిమా షూటింగ్ చాలా సార్లు చూశాను.కొన్ని నెలల తేడాతో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్నే దక్కించుకొంది.

ఆ సినిమా 'చెట్టు కింద ప్లీడరు'.
ఆ అమ్మాయి హీరోయిన్ 'కిన్నెర'.

రాజేంద్రప్రసాద్ ని ఆ తర్వాత చాలాసార్లు చుశాను.'సీతాపతి ఛలో తిరుపతి ' సినిమా అయితే మా ఇంటిదగ్గరే తీశారు. వాణీవిశ్వనాథ్ ని చూడ్డానికి జనం ఎగబడ్డారు.మా నాన్నగారు ఆ సినిమాలో ఒక వేషం వెయ్యాల్సింది.కలెక్టర్ ప్రోగ్రాం ఉండటంతో కుదర్లేదు.

'స్నేహం' సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్, తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.వంశీ,జంధ్యాల,బాపు,రేలంగి నరసింహారావు,ఎస్వీ కృష్ణారెడ్డి,ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లలో ఎన్నో మరపురాని హిట్సందించారు.'ఏప్రిల్ 1 విడుదల(ఈ సినిమా పోస్టర్ చూసి,రిలీజ్ డేటేదో,సినిమా పేరేదో తెలుసుకోలేక తికమకపడ్డాను),ఆ ఒక్కటీ అడక్కు,

పెళ్ళిపుస్తకం,మిస్టర్ పెళ్ళాం,బృందావనం, మేడం,అప్పుల అప్పారావు,ఆలీబాబా అరడజను దొంగలు,కొబ్బరిబొండాం,రాజేంద్రుడు గజేంద్రుడు,మాయలోడు ' ఇలా బోల్డన్ని.ఒకవైపు కామెడీ హీరోగా ఏకచ్ఛత్త్రాదిపత్యం వహిస్తూనే 'ప్రేమతపస్సు', 'ఎర్రమందారం' లాంటి సినిమాల్లో నటించి తన నటనకు రెండు వైపులా పదునుందని నిరూపించుకున్నారు.పాత్ర ఏదైనా పండించగల ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. పాటలు పాడి,కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు.కొన్ని పొరపాట్లు చేసి అప్రధాన్య పాత్రలు సైతం వేశారు( శ్రీకాంత్ 'తాళి ',జగపతిబాబు 'చిలక్కొట్టుడు' లాంటివి).1996 నుంచి అనుకుంటాను ఆయన సినిమాలు వరుసగా పరాజయాల బాట పట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను.ఇటువంటి టాలెంటెడ్ హీరోని జనం మిస్సవ్వకూడదు అనుకున్నాను.అంతలో 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ' వచ్చింది.ఆ టైపు సినిమాలు కొన్ని వరుసగా వచ్చి(శ్రీరామచంద్రులు,సందడే సందడి)విజయం సాధించాయి.మళ్ళీ అపజయాలు.ఆ క్రమంలో కొంతగ్యాప్ తరువాత వచ్చిన ' ఆ నలుగురు ' మళ్ళీ నటకిరీటిని సత్తాని చాటింది.'మీ శ్రేయోభిలాషి ' కూడా మంచి ప్రయత్నమే.'క్విక్ గన్ మురుగన్' పర్లేదనిపించింది.

అందం,నటన రెండూ ఉండి దాదాపు ఒక దశాబ్దం పాటు(1985 లేడీస్ టైలర్ to 1996 వద్దు బావా తప్పు వరకు ) తిరుగులేని కామెడీహీరోగా వెలుగొందిన ఏకైక తెలుగు కథానాయకుడు రాజేంద్రప్రసాద్.మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు సైతం మానసికోల్లాసానికి ఆయన సినిమాలు చూసేవారంటే అంతకు మించిన అవార్డులు,రివార్డు ఏముంటాయి.రాజేంద్రప్రసాద్ ను పూర్తిస్థాయిలో రిప్లేస్ చేయ్యగల నటుడు ఇంకా తెలుగుసినీరంగానికి దొరకలేదు.భగవంతుడు ఆయనకు చిరాయువునిచ్చి మరిన్ని మంచి చిత్రాలలో నటింపజేసి మనల్నందరినీ అలరింపజెయ్యాలని ఆశిస్తూ...

ఒక అభిమాని.


(కొన్ని హాస్యసన్నివేశాలు)






2 comments

Post a Comment

వాల్మీకి ఉత్తరకాండకు, లవకుశ సినిమాకు గల తేడాలు


వాల్మీకి ఉత్తరకాండకు,మన ఎంటీవోడి లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి.వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ పొందుపరిచాను.
  1. 1.   శూర్పణఖ విభీషణుడికి అక్క.

  2. 2.   రావణ, కుంభకర్ణ, శూర్పణఖా, విభీషణులు కన్యాపుత్రులు.

  3. 3.   మయుని కూతురు మండోదరి. ఆయన కోరిక మేరకే రావణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మామా అల్లుళ్ళకు యుద్ధం జరగదు ('భూకైలాస్' గుర్తొచ్చిందా).

  4. 4.   రావణుడు అంటే కైలాసాన్ని ఎత్తలేక బాధతో రావాలు చేసినవాడని(అరచినవాడని) అర్థం. అతని అసలు నామధేయం దశకంఠుడు.

  5. 5.   సీతాదేవి రావణుడి ఇంటి దగ్గర పుట్టదు. ఆమె మొదట దొరికేది జనక మహారాజుకే.

  6. 6.   శూర్పణఖ భర్తను రావణుడే చంపేస్తాడు. అయితే అది అనుకోకుండా జరుగుతుంది.

  7. 7.   యమధర్మరాజుకి రావణుడికి యుద్ధం జరుగుతుంది. యముడు ఆగ్రహించి యమదండం విసరబోతాడు. యమదండానికి ఎటువంటివారినైనా సంహరించే శక్తి ఉంది. అలాగే రావణుడికి మానవుల చేతిలో తప్ప అన్యుల చేతిలో చావు లేదు. బ్రహ్మ కలుగచేసుకొని యమున్ని వారించి, అతని చేత యుద్ధాన్ని విరమింపచేసి తను ఇచ్చిన రెండు వరాలలో ఏదీ నిష్ఫలమవకుండా చూస్తాడు.

  8. 8.   ఒక్క చాకలే కాదు, అయోధ్యా ప్రజలందరూ 'రావణుడి చెరలో ఎంతోకాలం గడిపిన సీతను రాముడు తెచ్చి ఏలుకున్నాడ 'ని కారుకూతలు కూస్తారు.

  9. 9.   కుశలవులు (కుశుడు పెద్దవాడు) జన్మించినప్పుడు శతృఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉంటాడు. లవణాసురున్ని అంతమొందించటానికి వెళ్తూ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు. సీతాదేవిని పరామర్శిస్తాడు కూడా.

  10. 10.   రాముడు అశ్వమేధయాగం తలపెట్టినది నైమిశారణ్యంలో. అయోధ్యలో కాదు.

  11. 11.   కుశలవులకు రాముడికి/రామసైన్యానికి మధ్య ఎటువంటి యుద్ధం జరుగదు. వారిద్దరూ యాగాశ్వాన్ని పట్టి బంధించటం అన్నది కూడా జరుగదు. అశ్వమేధయాగం సంధర్భంగా విచ్చేసిన కుశలవులు రామకథ రమ్యంగా గానం చేస్తుంటే, రాముడికి అనుమానం వచ్చి,'మీ తల్లిని వెంటబెట్టుకొని రండి ' అంటాడు. మరుసటి రోజు వాల్మీకి సీతా,కుశలవులతో వచ్చి సీత పాతివ్రత్యాన్ని శ్లాఘిస్తాడు. యాగానికి హాజరైన జనులందరి ముందూ తన పాతివ్రత్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని శ్రీరాముడు సీతను కోరుతాడు. ఆ తరువాత జరిగేది మీకు తెలిసిందే.

  12. 12.   సీత పృథ్విలో ఐక్యమైన తరువాత కూడా రాముడు చాలాకాలం రాజ్యం చేస్తాడు. పదివేల అశ్వమేధయాగాలు పూర్తి చేస్తాడు.


7 comments

Post a Comment

వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


చాలా రోజుల తర్వాత ఉషశ్రీ రామాయణం చదివాను. ఎప్పటినుంచో ఆ పుస్తకం ఇంట్లో ఉన్నా తెలిసిన కథే కదా అని ఇన్నాళ్ళూ చదవడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆ మధ్య రామాయణం గురుంచి చర్చ వచ్చినప్పుడు వ్యవహారికంలో రామాయణానికి ఆపాదించబడ్డ చాలా విషయాలు మూలకథలో లేవని తెలిసింది. అప్పటి నుంచీ వాల్మీకి రామాయణం చదవాలని ఒకటే కోరిక. అయితే సరైన పుస్తకం ఏదీ అన్నదే ప్రశ్న. వెబ్ లో మైలవరపు శ్రీనివాసరావు గారు వ్రాసిన బాలకాండ చదివాను. ఎంతో చక్కగా ప్రతి విషయాన్ని, అందులోని భావాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారాయన. అది చదివాక 'మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ' అర్థమయ్యింది. ఇన్నాళ్ళూ సినిమాలలో చూపిందో, లేక చిన్న చిన్న పుస్తకాలలో చదివిందో(బాలల బొమ్మల రామాయణం లాంటివి) అసలైన రామయణం అనుకునేవాన్ని. ఆ భ్రమలు తొలగించుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవక తప్పదు అనిపించింది. ఉషశ్రీ రామాయణం దాని ఆధారంగా వ్రాసిందే కాబట్టి నిన్నా మొన్న కూర్చొని ఎకబిగిన చదివేశాను.రామాయణం యొక్క గొప్పదనం, అందులోని పాత్రల వైశిష్ట్యం తెలుసుకొని చాలా సంతోషం వేసింది.అలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఈ టపా.



  1. 1.   దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.

  2. 2.   దశరథుడికి కైకంటే చాలా ఇష్టం. పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి. కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది. రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.

  3. 3.   దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు. అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.

  4. 4.   తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు.రాముడు అదే వంశంలో పుడతాడు.

  5. 5.   రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య, కైకేయి, సుమిత్ర.

  6. 6.   బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు. భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు .

  7. 7.   క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు. వీరిని ఎవ్వరూ వివాహమాడరు. సంచార వృత్తి కలిగివుంటారు. వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం), కౌస్తుభం.

  8. 8.   అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది. అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక,ఆయన్ని పరీక్షించడానికి,నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు. ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు. అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు. ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం. శారీరక కలయిక కాదు. మోక్షమన్న మాటవినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య. ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు. అహల్యకు అప్పుడు సత్యం బోధపడి 'నువ్వు వెళ్ళిపో' అని వేడుకుంటుంది. ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి,అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు. ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది. ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు. అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు.అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.

  9. 9.   శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు. సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు. సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు. ఇంకొంతమంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు. అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలా నగరం వస్తారు. రాముడు ధనువునెక్కుపెట్టి విరిచేస్తాడు.

  10. 10.   రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు. శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.

  11. 11.   వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు. సీత వయసు ఐదేళ్ళు.

  12. 12.   పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది. జనకుడి రాజమందిరంలో కాదు.

  13. 13.   శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు. లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను,తండ్రిని నానామాటలంటాడు. భరతుడు తల్లిని మందలిస్తాడు.శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి,భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.

  14. 14.   వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25 సంవత్సరాలు.

  15. 15.   దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు. అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.

  16. 16.   నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది. రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి 'ఎవరు తండ్రి,ఎవరు తల్లి' అంటూ నాస్తికవాదం చేస్తాడు. దీన్ని శ్రీరాముడు నిరసించి,'మీవంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో' అంటాడు.

  17. 17.   సీతారామలక్ష్మణులు వనవాసంలో మాంసాహారం తిన్నారు.

  18. 18.   ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది. ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు. అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి,సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి, రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు. వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు. మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు. శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.

  19. 19.   జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు

  20. 20.   రావణుడు ఎడమచేత్తో సీత జుట్టుపట్టుకొని,కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.

  21. 21.   రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు. వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.

  22. 22.   వాలి మహాబలవంతుడు. తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి. అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది. చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.

  23. 23.   కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి (అవతార్ గుర్తొచ్చిందా). అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.

  24. 24.   అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.

  25. 25.   రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు.శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.

  26. 26.   యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.

  27. 27.   రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు,విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి, రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు. అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు, సూర్యున్ని ధ్యానించి బాణప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.


11 comments

Post a Comment