రుద్రమదేవి - సమీక్ష




వెయ్యేళ్ళ పాటు తమ విజయపతాకాన్ని రెపరెపలాడించి శాతవాహనుల తర్వాత తెలుగుదేశాన్నంతా ఒక్క తాటిపై నడిపి జాతి సంస్కృతి సంప్రదాయాలపై బలమైన ముద్ర వేసిన ఘనత కాకతీయులది. ఆ ఇంటపుట్టిన శార్దూలం రాణీ రుద్రమదేవి. వంశరక్షణతో పాటూ రాజ్యసంరక్షణ అనే బృహత్తర ఆశయాన్ని తన భుజస్కందాల పై వేసుకొని,అబలగా తనను సమకట్టిన శత్రుసమూహానికి సబలనని నిరూపించి, తాత తండ్రుల కీర్తికి ఏ మాత్రం తగ్గకుండా రాజ్యపాలన చేసి సుస్థిర యశోచంద్రికలందుకొన్న ధీర వనిత ఆమె. ఆమె చరిత్ర నిత్యస్మరణీయం . భావితరాలకి ఆదర్శప్రాయం. 

ఇటువంటి ఉత్కృష్టమైన కథను ఎన్నుకొని తెరకెక్కించే సాహసం చేశారు దర్శకుడు గుణశేఖర్. మరి ఆయన ప్రయత్నం ఫలించిందా ?

చరిత్ర చెప్పిన రుద్రమదేవి కథకు చిత్రంలో చూపెట్టిన కథకూ ఉన్న వ్యత్యాసాలేమిటి ?

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితనం ఎలా ఉంది ?


చరిత్ర చెప్పిన కథ

తెలుగువాళ్ళ ఇంటిపేర్లు సాధారణంగా గ్రామాల పేర్లతోనో, లేక వాళ్ళు ఆరాధించిన దేవతల పేర్లతోనో ప్రారంభమవుతూంటాయి. కాకతి పేరుతో చాలా గ్రామాలున్నాయి కాబట్టి వీటిలో కాకతీయులు ఏ గ్రామానికి చెందినవారో చెప్పటం కష్టం. అయితే వీళ్ళు కాకతి అనే కులదేవతను ఆరాధించటం చేత కాకతీయులైనారని ప్రామాణికాలు చెబుతున్నాయి. కాకతీయులు గుమ్మడితీగకు పుట్టినవాళ్ళని ఒక అద్భుతమైన కథ శాసనాల్లో ఉంది. ఈ వంశపు మూలపురుషుడైన మాధవవర్మ మహారాజు కొడుకు పద్మసేనుడికి చాలా కాలం సంతానం కలుగలేదు. చివరకి ఆయన గుమ్మడికాయలతో అనుమకొండ పద్మాక్షిదేవిని పూజిస్తే ఆ దేవి అనుగ్రహంతో సంతానం కలిగిందట. వీళ్ళ వంశం అనుమకొండలో వేయ్యేళ్ళు వర్ధిల్లుతుందని దేవి అభయం ఇచ్చిందట. పద్మసేనుడి తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు కానీ వీరిలో కాకతి గుండ్యనను కాకతీయ సామ్రాజ్యానికి బాటలు వేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ వంశంలో ప్రఖ్యాతి కెక్కిన మహారాజులలో గణపతిదేవ మహారాజు ఒకడు. కాకతీయుల స్వర్ణయుగం ఆయనతోనే ప్రారంభమయ్యింది. ఆయనకు, సోమదేవికి కలిగిన ప్రథమ సంతానమే రుద్రమదేవి.


అమిత పరాక్రమవంతుడు,సుపరిపాలనా దక్షుడైన  మహారాజుకు పుత్ర సంతానం లేదన్న వార్త ప్రజలకు ఆశనిపాతం,శత్రురాజులకు ఆనందదాయకం. ఈ విషయం గ్రహించిన గణపతిదేవుడు శివదేవయ్య మంత్రి సూచనలతో రుద్రమదేవిని పురుషుడిగానే పెంచుతాడు.  రుద్రదేవ మహారాజుగా తన కూతురుని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. తండ్రి ఆశయాలను అర్థం చేసుకున్న రుద్రమదేవి తదణుగుణంగానే ఎన్నో త్యాగాలకోర్చి రాటుదేలుతుంది. యుక్తవయస్సు వచ్చాక ,రాజ్య రహస్యం తెలిసినవాడు, సర్వ సైన్యాధ్యక్షుడైన జయాపసేనాని కుతురు ముమ్ముడమ్మను రుద్రమ్మదేవికిచ్చి వివాహం జరిపిస్తాడు గణపతిదేవుడు. ముమ్ముడమ్మకు విషయం తెలియనివ్వకుండా తానొక వ్రతం చేస్తున్నానని అంతవరకూ దీక్షలో ఉండాలని చెబుతుంది రుద్రమదేవి.

గణపతిదేవుడు వృద్ధుడవుతాడు. రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం అధిరోహిస్తుంది. రాజ్యంలో అల్లకల్లోలం బయలుదేరుతుంది. గోనగన్నారెడ్డి తండ్రి గోనబుద్ధారెడ్డి. ఈయన కాకతీయులకున్న అనేకానేక సామంత రాజులలో ఒకడు. రంగనాథ రామాయణం అనే ప్రసిద్ధమైన కావ్యాన్ని కూడా వ్రాసి కవిగానూ తన సత్తా చాటిన వాడు. అతని తమ్ముడు లకుమయారెడ్డి. బుద్ధారెడ్డి ప్రభుభక్తి పరాయణుడు. యాభై యేళ్ళకు అతనికి సంతానం కలుగుతారు. వారు కుప్పాంబ, గన్నారెడ్డి, విఠలరెడ్డి. వయోభారం పెరిగి అవసానదశకి చేరిన బుద్ధారెడ్డి, తమ్ముడు లకుమయ్యని పిలిచి, తన పెద్ద కొడుకు గన్నారెడ్డి పేరుతో రాజ్యపాలన చెయ్యమని, అతను పెద్దయ్యాక రాజ్యం అతనికే అప్పగించి, వేరొక నగరం పరిపాలించుకొమ్మని చెప్పి కన్నుమూస్తాడు. లకుమయ్య తన అన్నకుమారులను   విద్యాభ్యాసం కోసం ఓరుగల్లు పంపి తనే రాజులా చెలామణి అవుతాడు. రుద్రమ్మ పీఠం ఎక్కాక, ‘ఒక ఆడదాని మోచేతినీళ్ళు తాగాలా’ అని హుంకరించి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే స్త్రీపాలనలో తలదాచుకోవడానికి ఇష్టపడని మిగతా సామంతరాజులతో, రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహరదేవులు, మురారిదేవులు, ఇతర శత్రురాజులతో చర్చలు జరుపుతూంటాడు.

గోనగన్నారెడ్డి తండ్రిలాగే కాకతీయవంశ వీరాభిమాని. పినతండ్రి తనకు చేసిన అన్యాయం, దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనించి కొంతమంది వీరులను తయారుచేసి, రుద్రమ్మదేవిని కలుస్తాడు. తామంతా గజదొంగలగా అవతారమెత్తి, రాజ్యంలో చెలరేగుతున్న అక్రమాలను పారద్రోలి, తిరుగుబాట్లను అణిచివేస్తామని, అందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతాడు. రుద్రమ్మదేవి సరేనంటుంది. గన్నారెడ్డి నల్లమల అడవులలో ఒక పాడుబడిన దుర్గాన్ని బాగుచేయించి, తన సేనతో రహస్యంగా అక్కడ ఉంటూ అధర్మనిర్మూలనం చేస్తూంటాడు.

లకుమయ్య తన కుమారుడు వరదారెడ్డిని ఆదవోని రాకుమారి అన్నాంబికకిచ్చి వివాహం చెయ్యాలని తలపోస్తాడు. అన్నాంబికకు ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. గన్నారెడ్డి మెరుపులా వచ్చి వరదారెడ్డిని అపహరించుకుపోయి, కొంతకాలానికి విడిచిపెడతాడు. లకుమయ్య మళ్ళీ వివాహ ప్రయత్నం చెయ్యబోగా, గన్నారెడ్డి ఈ సారి వధువైన అన్నాంబికను అపహరించి, అక్క కుప్పాంబను తోడునిచ్చి బావగారి రాజ్యానికి చేరవేస్తాడు. కుప్పాంబ అన్నాంబికను ఓరుగల్లులో రుద్రమ్మ దగ్గర చేర్చి తిరిగి వస్తుంది.


ఒకనాడు రుద్రమ్మదేవి, అన్నాంబిక కొంతమంది వీరులతో కలిసి మొగిలిచెర్ల వెళ్ళి కాకతమ్మకు పూజలు చేస్తారు. తిరిగివస్తూండగా రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహర మురారిదేవులు సైన్యంతో విరుచుకపడతారు. సామంత రాజైన చాళుక్య వీరభధ్రుడు సుడిగాలిలా ఊడిపడి వారిని తుదముట్టించి ఆమెను రక్షిస్తాడు. దేవగిరి యాదవ మహాదేవరాజు ఎనిమిది లక్షల మాహాసైన్యం పోగుచేసుకోని ఓరుగల్లు మీద దండయాత్రకు వస్తాడు. గన్నారెడ్డి అతని సైన్యంపై పడి అపారమైన ప్రాణనష్టం కలిగిస్తాడు. రుద్రమ్మదేవి మంత్ర దండనాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పక్కా ప్రణాళికతో, హోరాహోరీగా యుద్ధం చేసి అతన్ని తరిమికొడుతుంది. పారిపోతున్న అతని సైన్యాలని కొండలమాటున దాగి గన్నారెడ్డి సర్వనాశనం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో మహదేవరాజు రుద్రమ్మదేవి శరణుకోరి బ్రతికి బయటపడతాడు.


ఓరుగల్లులో సంబరాలు మిన్నంటుతాయి. నిండుసభలో గన్నారెడ్డి గజదొంగ కాదని స్పష్టం చేస్తాడు శివదేవయ్య మంత్రి. లకుమయ్యను, ఇతర స్వామిద్రోహులను క్షమించి విడిచిపెడతారు. రుద్రమ్మదేవి మారుపెళ్ళికి గణపతిదేవుడు విధించిన షరతులు మూడు. రుద్రమ్మను పెళ్ళాడిన పురుషుడు ఎంతగొప్పవాడైనా చక్రవర్తి కారాదు. రుద్రమ్మదేవియే రాజ్యాన్ని పాలించాలి. ఆమె కుమారుడు రాజ్యం వహించబోయే ముందు కాకతి వంశానికి దత్తత రావాలి. ఆ షరతులకన్నీ ఒప్పుకొని చాళుక్య వీరభధ్రుడు ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. తను ఇదివరకే పెళ్ళి చేసుకున్న ముమ్ముడమ్మను దత్తత తీసుకుని భర్త సోదరునితో ఆమెకు వివాహం చేయిస్తుంది రుద్రమ్మదేవి. మరో వైపు  అన్నాంబికకు గన్నారెడ్డికి వివాహం జరిపిస్తుంది. గోనగన్నారెడ్డి వర్ధమానపురం(నేటి మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డిమాని) రాజుగా పట్టాభిషక్తుడవుతాడు.

 రుద్రమదేవి దంపతులకు ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమె పేరు రుయ్యమ్మ .రుద్రమదేవి దత్తపుత్రిక అయిన ముమ్ముడమ్మ కుమారుడే ప్రతాపరుద్రుడు. ఇతన్నే భావి చక్రవర్తిగా బాల్యం నుంచి తీర్చిదిద్దుతుంది రుద్రమదేవి. విధివశాత్తూ పెళ్ళైన కొన్నేళ్ళకే చాళుక్య వీరభద్రుడు మరణిస్తాడు. భర్త మరణంతో కుమిలిపోతున్న రుద్రమదేవి వయోవృద్ధుడైన తండ్రి శివైక్యం చెందటంతో మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోతుంది. పరిపరివిధాలా శోకించి ఒక దశలో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయి అంతలోనే కుదుటబడి ప్రతాపరుద్రుడి రక్షణభారాన్ని నెత్తిన వేసుకొంటుంది. స్వయంగా రణరంగంలోకి ఉరికి అనేక యుద్ధాలలో పాల్గొని విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. చివరికి అదే ప్రయత్నంలో కళ్ళుమూస్తుంది.

సినిమాలో కథ

నాటకీయత కోసం మార్పులు చేర్పులు చేసుకున్నామని, ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షంతవ్యులమని సినిమా ప్రారంభంలోనే ప్రకటించి ముందు జాగ్రత్త పడ్డారు గుణశేఖర్. తమ రాజ్యంలో పుత్ర సంతానం లేకపోవటం వల్ల కలిగిన పరిస్థితి గురుంచి విశ్లేషిస్తూ హిందూ దేశంలో ఒక మహరాజుకు ఇటువంటి పరిస్థితే ఎదురైతే ఆయనేం చేశాడో  ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. రుద్రమదేవి బాల్యాన్ని,చాళుక్య వీరభద్రుడితో ఆమె ప్రణయాన్ని, ముమ్ముడమ్మతో పెళ్ళిని స్పృశిస్తూ చివరకు మహదేవ రాజును ఓడించి ఆమె పట్టాభిషక్తురాలవటంతో చిత్రం సుఖాంతమవుతుంది. మిగతా కథను ఈ చిత్రానికి కొనసాగింపుగా తీయబోయే 'ప్రతాపరుద్రుడు ' కోసం అట్టి పెట్టారు దర్శకుడు.  కమర్షియల్ సక్సెస్ కోసం గోనగన్నారెడ్డి సన్నివేశాలను మార్చి వ్రాశారు. ఎక్కడో జరిగాల్సిన అన్నాంబిక (సినిమాలో అనామిక-కేథరీన్ థెరెసా ),వరదారెడ్డి సన్నివేశాలను  రుద్రమ్మదేవి సమక్షంలో జరిగినట్లు చూపించారు. అలాగే రుద్రమ్మదేవిని చంపడానికి హరిహర మురారిదేవులు ఏనుగుబొమ్మ ద్వారా పథకం పన్నితే గోనగన్నారెడ్డి వచ్చి రక్షించినట్లు చూపించారు. చాళుక్య వీరభద్రుడు-రుద్రమ్మదేవి ప్రణయ సన్నివేశాలు ,నాగదేవుడి పాత్ర వాణిజ్య అంశాల కోశమే. తమను పరిపాలిస్తున్నది యువరాణి కానీ యువరాజు కాదని తెలిసి ప్రజలు తిరుగుబాటు చేసినట్లు చూపించారు. ఇన్నాళ్ళూ మగవాడిగా తమను మభ్యపెట్టినందుకు ప్రతిగా మరణశిక్షకు సమానమైన రాజ్యబహిష్కరణ శిక్ష విధించినట్లు చరిత్రను తిరగ వ్రాశారు.

నటీనటులు , సాంకేతిక నిపుణులు, దర్శకత్వం 

రుద్రమ్మదేవి తన చిరాకాల స్వప్నమని,చిత్రం కోసం చాలా పరిశోధనలు చేశానని ఉద్వేగంగా చెప్పుకున్నారు గుణశేఖర్ . ఆయన ఆశయాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే.  వెకిలి హాస్యం, ప్రత్యేక గీతాలున్న ఫార్ములా చిత్రాలే రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో తెలుగు వాడికి తన మూలాలు గుర్తుచేసే ఒక చారిత్రాత్మక చిత్రం,అందునా స్త్రీ ప్రాధాన్యత ఎక్కువున్న చిత్రాన్ని  ఇవ్వాలనుకోవడం , దాని కోసం సర్వశక్తులూ ఒడ్డి చిత్రాన్ని నిర్మించటం నిజంగా చాలా ధైర్యసాహసాలతో కూడుకున్న పని. ఇందుకు ఆయన్ని తప్పకుండా అభినందించాల్సిందే. 




అయితే గుణశేఖర్ అంటే సగటు ప్రేక్షకుడికి ముందుగా గుర్తుకొచ్చేది సెట్టింగులు. ఈ చిత్రంలో కూడా కథనం, పాత్ర పోషణ మీద కంటే అదనపు హంగుల మీదే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. ఒక్క గోనగన్నారెడ్డికి తప్ప ఇతరులందరికీ ఆహార్యం చాలా బాగా కుదిరింది. గన్నారెడ్డి వస్త్రధారణలో మాత్రం తెలుగుదనం కంటే ఇటీవల విడుదలైన పాశ్చ్యాత్య సినిమా పోకడలు కనిపించాయి. అలాగే అంతఃపుర మందిరాలు, గ్రామాలు, అడవులలో వేసిన సెట్లు బాగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయాయి. సన్నివేశానికి అవసరం లేకపోయినా భారీతనం ఉట్టిపడటం కోసం చాలా చోట్ల అనవసరమైన గ్రాఫిక్స్ వాడారు. ఉదాహరణకు చిత్రంలో ప్రతినాయకుడైన మహదేవరాజును చూపించిన ప్రతిసారీ అతనో ఎత్తైన ఒంటిస్తంభపు మేడపై ఉన్నట్లు గ్రాఫిక్స్ వాడారు. అలాగే రుద్రమదేవి పరిచయ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు అతుకుల బొంతలా ఉన్నాయి. 3D సాంకేతికత ఇంకో అనవసర ఆకర్షణ . ఆ డబ్బును ముఖ్యమైన గ్రాఫిక్స్ కోసం వాడుకున్నా ఫలం దక్కేది. 

చారిత్రాత్మక సినిమాలకు కథనం, సంగీతం రెండుకళ్ళని చెప్పుకోవచ్చు. కథాపరంగా రుద్రమదేవిలో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే బలమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో  ఏ సన్నివేశమూ వీక్షకుడిపై ఎటువంటి ప్రభావం చూపదు. నటీనటులు కూడా ఆ స్థాయి నటన ప్రదర్శించలేదు. సినిమా అంతా డాక్యుమెంటరీలా నిదానంగా సాగుతూ వెళ్తుంది. ప్రథమార్థంలో ఉన్న ఆసక్తి ద్వితీయార్థంలో సన్నగిల్లుతుంది.  ఇది దర్శకుడి వైఫల్యం .నేపథ్య సంగీతం మరో ప్రధాన లోపం . సగటు సంగీత దర్శకుడు సైతం సాధారణ సన్నివేశాలకు  నేపథ్య సంగీతంతో ప్రాణం పోసే  ఈ రోజుల్లో, సంగీతజ్ఞాని ఇళయరాజా అందించిన సంగీతం పూర్తిగా నిరాశపరుస్తుంది.  ఇళయరాజా అభిమానులైన నాలాంటి వాళ్ళు సైతం రాజా ఇంత నాసిరకంగా ఎలా కొట్టారని ఆశ్చర్యపోకతప్పదు.   ఒక్క రి-రికార్డింగ్‌కే రెండుకోట్లు ఖర్చుబెట్టారన్నారు . విదేశాల్లో రి-రికార్డింగులు చేసి ఏం ప్రయోజనం స్వదేశీ పామరున్ని ఆకట్టుకోలేకపోతే ?


రుద్రమదేవిగా అనుష్క చక్కగా ఇమిడిపోయింది. అందానికి తగ్గ ఒడ్డూ, పొడవూ, ఠీవి తనలో ఉన్నాయి. తనకు తప్ప ఇతర ఏ నటీమణులకీ ఈ మేకప్ నప్పదేమో అనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే మేకప్ కుదరటం వేరు నటనలో మెప్పించటం వేరు. అనుష్క నటన గొప్పగా లేకున్నా ఫర్వాలేదనిపిస్తుంది. గంభీరమైన ముఖకవళికలతో సినిమా మొత్తం నెట్టుకొచ్చింది. వీరోచిత సన్నివేశాలలో ఇంకాస్త బాగా చేసి ఉండొచ్చు. ముమ్ముడమ్మతో తొలిరాత్రి సన్నివేశాలలో అంతర్మథనాన్ని, ప్రజలంతా తనను తిరస్కరించినప్పుడు హావభావాలను ఒకేలా పలికించింది. పోరాట విన్యాసాలలో ఆమె పడ్డ కష్టం తెలుస్తుంది.

చిత్రంలో కరువైన వినోదాన్ని గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ప్రేక్షకులకు పంచిపెట్టాడు. గన్నారెడ్డికున్న మహబూబ్‌నగర్ జిల్లా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అతని సంభాషణలు తెలంగాణా యాసలో చెప్పించారు.  కొన్ని డైలాగులు పట్టి 



చెప్పినట్లున్నాయి,ఇంకొన్ని బాగానే చెప్పాడు. అయితే గొంతు బలహీనమవ్వటం వల్ల అవీ ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని లేకి సంభాషణలు కూడా ఉన్నాయి. ' గమ్ముండవోయ్' అన్న ఊతపదం బాగా పేలింది. క్లైమాక్స్లో  శిరస్త్రాణం ధరించి యుద్ధం చేస్తున్న సన్నివేశాలు తన మూర్తిమత్వాని(personality)కి నప్పలేదు. గన్నారెడ్డి ఒక రాజకుమారుడని,  పర్యవసానాల కారణంగానే అతను బందిపోటుగా మారాడనే విషయం స్పష్టంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. గన్నారెడ్డి గురుంచి తెలియని వాళ్ళు సినిమా పూర్తయ్యాక అతనొక బందిపోటు ముఠా నాయకుడని,శత్రు సంహారంలో రుద్రమ్మదేవికి సహాయం చేశాడనే అనుకుంటారు కాని అతనో రాజకుమారుడని తెలుసుకోలేరు. చిత్ర జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేవలం దర్శకుడి మీద గౌరవంతో ఎంతో ఆసక్తితో ఆగిపోయిన చిత్రంలో నటించి, చిత్రాన్ని పునరుద్ధరించి, విడుదలకు నోచుకునేలా చేసిన అర్జున్ నిజంగా అభినందనీయుడు. 

రుద్రమదేవి ప్రియుడు చాళుక్య వీరభద్రుడిగా రాణా నటన గురుంచి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. శివదేవయ్య మంత్రిగా ప్రకాష్‌రాజ్ సాంఘిక సినిమాలకు మల్లే తనదైన శైలిలో సంభాషణలు పలికినా ఉన్నంతలో కాస్త న్యాయం చేశాడు. గణపతిదేవుడుగా కృష్ణంరాజు, ముమ్ముడమ్మగా నిత్యమీనన్ పాత్రోచితంగా నటించారు. సుమన్ జయప్రకాష్ రెడ్డి తదితరులు ఆయా పాత్రలకు సరిపోయారు.

చివరగా 
రుద్రమదేవి అంతా గొప్పగా లేదు,అంత నాసిరకంగానూ లేదు. అలాగని రుద్రమదేవి కథ మీద గుణశేఖర్‌కున్న అంకితభావాన్ని కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. కానీ అంకితభావంతో పాటూ ఆలోచన కూడా అవసరం. ముఖ్యంగా ఏది అవసరమో,ఏది అనవసరమోనన్న స్పష్టత చాలా అవసరం.ఎంత అవసరమంటే నాగదేవుడు లాంటి ప్రాముఖ్యత లేని పాత్రకు బాబాసైగల్ లాంటి పరభాషా గాయకున్ని నటుడిగా పెట్టుకోవడమే అవివేకం అనుకుంటే, అతనికో ప్రత్యేక గీతాన్ని పెట్టి చివరకి దాన్ని తొలగించడం ఇంకా అవివేకం అని తెలుసుకునేంత. కొసరు హంగుల కంటే అసలు కథ, కథనం ముఖ్యమని తెలుసుకునేంత . రుద్రమదేవి కథలో వీరరసం ప్రధానమని, ఆమె పెంపకం, ప్రణయం, మరో స్త్రీతో పెళ్ళి ఇవన్ని ఆసక్తికరమైన అంశాలే అయినప్పటికీ వాటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతవరకే ఇచ్చి మిగతా భాగాన్ని రుద్రమ విజయాలపై, కార్యనిర్వహణా దక్షతపై కేంద్రీకరించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలుసుకునేంత.

( కాకతీయుల చరిత్రకు ఆధారాలు- ఖండవల్లి లక్ష్మీరంజనం  గారి కాకతీయ యుగము, ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రం
గోనగన్నారెడ్డి - అడవి బాపిరాజు గారి గోనగన్నారెడ్డి నవల అధారంగా.ఈ పుస్తకం పై నా సమీక్షను ఇక్కడ చదవండి.)


3 comments

Post a Comment

ముదితల్ నేర్వగరాని..


బెంగుళూరులో పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు నేర్పించటం కష్టంతో కూడుకున్న పని. స్కూళ్ళలో కన్నడ లేదా హిందీ తప్ప మరో భాషను ఎన్నుకొనే అవకాశం లేదు. ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తూ ఎనిమిదేళ్ళ మా పాపకు కొన్ని తెలుగు పద్యాలు నేర్పించాను. పనిలో పనిగా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను :-)







2 comments

Post a Comment

బాక్సాఫీస్ ఛత్రపతి రాజమౌళి బాహుబలి - సమీక్ష






మూడేళ్ళుగా తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాహుబలి విడుదలయ్యింది. ప్రభాస్,రాణా,అనుష్క,తమన్నా లాంటి భారీ తారాగణమున్నా,మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలతో  మాములు మాస్ దర్శకులకు తనకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని విస్పష్టంగా లోకానికి చాటిచెప్పిన రాజమౌళి మీదే భారీ అంచనాలు  పెట్టుకున్నారు అందరూ. ప్రచార చిత్రాలు అంచనాలని మరింత రెట్టింపు చేసి ' మొదటి రోజు ఈ సినిమాని చూడకపోతే ఎలారా భగవంతుడా ' అనుకునే స్థాయికి సగటు ప్రేక్షకున్ని తీసుకెళ్ళాయి. మొదటి మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఫుల్లయిపోయి ఎక్కడా టికెట్లు దొరక్క థియేటర్లపై దాడి చేసే పరిస్థితి.

  • ఇన్నికోట్ల మంది భారీ అంచనాలని రాజమౌళి అందుకున్నాడా  ?
  • భారత చలనచిత్ర దశని దిశని మార్చగల సినిమా వచ్చిందా ?
  • తెలుగు సినిమా స్థాయి ఇది అని తెలుగోడు తొడగట్టగలిగాడా  ?

కథ:


రాజ్యం కోసం అన్నదమ్ములైన ఇద్దరు రాకుమారులు పోట్లాడుకున్న సాదా సీదా కథ. ఈ విషయం రాజమౌళే అనేక సందర్భాలలో చెప్పాడు. ఇంతకన్నా రెండు ముక్కలు ఎక్కువ చెబితే సినిమా మొత్తం చెప్పినవాన్నవుతాను కాబట్టి చెప్పను.

నటీనటులు, కథనం,దర్శకత్వం :

బాహుబలి లో మొదట చెప్పుకోవల్సినవి ఫోటోగ్రఫీ, విజ్యువల్ ఎఫెక్ట్స్. తర్వాత చెప్పుకోవల్సినవి యుద్ధసన్నివేశాలు.

జలపాతాల దగ్గర సన్నివేశాలు, మహీష్మతి నగరం, యుద్ధ సన్నివేశాలు నభూతో. వంద అడుగుల భళ్ళాలదేవుడి విగ్రహాన్ని నిలబెట్టడానికి చేసే యత్నాలు, అంతఃపురం నుంచి పారిపోతున్న శివున్ని పట్టుకోవడానికి సైనికులు దొర్లించే అగ్నిగోళాలు, యుద్ధంలో వాడే చిత్రవిచిత్రమైన ఆయుధాలు, పనిముట్లు అమోఘం. సినిమాలో ప్రతి షాటూ కన్నులవిందే. కొన్ని  వందల మంది రాత్రనక పగలనక పడిన కష్టం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒకటి రెండు సన్నివేశాల్లో గ్రాఫిక్స్ సరిగ్గా కుదరకపోయినా చాలా సన్నివేశాలు భారత చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేవే. టైంమెషిన్ ఎక్కితే వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు, ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి ప్రేక్షకుల కళ్ళెదుటే మహీష్మతీ నగరాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి. సినిమాకు ప్రాణమైన యుద్ధ సన్నివేశాలలో అయితే విజృంభించాడు . యుద్ధ వ్యూహాలు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా వివరించడం, ఆయుధ సామగ్రిని తరలించడం, యుద్ధగజాల అలంకరణ నుంచి, పోరాటల చిత్రీకరణ వరకూ అతని పనితనంలో పతాక స్థాయి కనిపిస్తుంది.  యుద్ధసన్నివేశాలు నిస్సందేహంగా హాలీవుడ్‌స్థాయిలో ఉన్నాయి. భీముడు గదాధారియై యుద్ధరంగంలో అడుగుపెడితే ముందుగా భయపడేవి మత్తగజాలేనట-ఎక్కడ తమ  కుంభస్థలాలు  పగిలిపోతాయేమోనని. భళ్ళాలదేవుడు  గదాధారియై  కాలకేయుడి యుద్ధగజాన్ని నేల కూల్చినప్పుడు ఆ సన్నివేశం గుర్తొచ్చింది.  అమరేంద్ర బాహుబాలి సవ్యసాచిలా శూలపాణియై శత్రుసేన తలలు తురుముకుంటూ వెళ్తూంటే అలా చూస్తూండిపోవాల్సిందే. 

అయితే నాణేనికి మరోవైపూ ఉంది. 

నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. ట్రైలర్‌లో వాడిన మ్యూజిక్ బిట్‌నే కీరవాణి సినిమా మొత్తం తిప్పి కొట్టాడు. ఇక పాటల సంగతి సరే సరి. దీనికి తోడు డాల్బీ అట్మోస్ టెక్నాలజి వాడారు. ఇది ఎన్ని థియేటర్లలో పనిచేస్తుందన్నది ఓ ప్రశ్న .బెంగుళూరు లాంటి మహా నగరంలోనే డాల్బీ అట్మోస్ సర్టిఫైడ్ థియేటర్ ఒక్కటే ఉంది. సరైన సౌండ్ సిస్టం లేకపోతే మొదటి ముప్ఫై నిమిషాలు నేపథ్య సంగీతం ఇంత బలహీనంగా ఉందేంటి అని ప్రేక్షకుడు ఆశ్చర్యపోయినా తప్పులేదు.

రాజమౌళి చిత్రాలలో ప్రతినాయకుడు బలంగా ఉంటాడు. అతని మనస్తత్వం కౄరం హావభావాలు వికృతంగా ఉండి ప్రేక్షకులను భయభ్రాంతులను చేస్తాయి. ఛత్రపతిలో కాట్రాజ్ అయినా, విక్రమార్కుడులో విలన్ అయినా అటువంటివాడే. అతను పెట్టే చిత్రహింసలు భరించలేక ప్రజలు అవస్థలు పడుతూంటే ప్రేక్షకుడు కన్నీరు పెట్టుకుంటాడు. ప్రజల పట్ల జాలి, కథానాయకుడి మీద అభిమానం పెంచుకొని ఎప్పుడెప్పుడు అతను ప్రతినాయకుడి మీద తిరగబడతాడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తాడు. కథానాయకుడు ఆవేశంతో సంభాషణలు పలుకుతూ ఒంటిచేత్తో కలియబడితే ' ఇది కదరా మనకు కావల్సిన ఎమోషన్' అని పూనకంతో ఉగిపోతాడు. అతను గెలిచిన ప్రతిసారి ఉత్సాహంతో చప్పట్లు కొడతాడు.

బాహుబలిలో అదీ లోపించింది. సువాసన లేని స్వర్ణరత్నఖచిత పుష్పం బాహుబలి.


బాహుబలిలో ప్రతినాయకుడు భళ్ళాలదేవుడు(రాణా). అతని పాత్ర మహాభారతంలో దుర్యోధనున్ని పోలి ఉంటుంది. అతనికి ఉన్నట్లే ఇతనికీ ఒక బలమైన గద ఆయుధంగా ఉంది. రాజమౌళి పొందిన ప్రేరణ అక్కడితోనే అంతమైనట్లు అనిపిస్తుంది. భళ్ళాలదేవుడి పాత్రపోషణ తేలిపోయింది. అసూయ, కౄరత్వం చాటుకునే బలమైన సన్నివేశాలు లేవు. ఉన్న ఒకటీ అరా సరైన సంభాషణలు, హావభావాలు పలక్క చప్పబడిపోయిపోయాయి. సాంకేతికంగా ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా రాబట్టుకునే రాజమౌళి, భావోద్వేగాలకు సంబంధించిన ఇంత మౌలికమైన అంశాన్ని పట్టించుకోలేదెందుకో . రాణాని ఇంతకంటే కౄరంగా చూపెడితే భవిష్యత్తులో అతని హీరోయిజానికి ఇబ్బందని సందేహించాడో లేదో తెలియదు. నిజానికి బలమైన నటుడికి సంభాషణలు సన్నివేశాలతో పనిలేదు. కేవలం ముఖకవళికలు మాటవిరుపులతో సాధారణ సన్నివేశాన్ని అసాధరణంగా మలచగలడు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న యువతరం నటుల్లో ఒకరికో ఇద్దరికో తప్ప మిగతావాళ్ళెవరికీ మొహంలో అన్ని భావాలూ పలకవు. అటువంటప్పుడు సన్నివేశాలు సంభాషణలు బలంగా ఉండాలి. బాహుబలిలో చెప్పుకోదగ్గ సంభాషణలు ఏవంటే తడుముకోవాలి . అయితే పరిచయ సన్నివేశాలలో,యుద్ధ సన్నివేశాలలో రాణా నటన బాగుంది.

ధృతరాష్ట్రుడు, శకుని ప్రేరణతో అల్లుకున్న బిజ్జలదేవుడి పాత్ర (నాజర్) కుడా అంతంతమాత్రమే. చెడు ఎంతో తీవ్రంగా ఉంటే తప్ప మంచి విలువ తెలియదు. బిజ్జలదేవుడిలో ఆ కుటిలత్వం చూపించే సన్నివేశాలు బలంగా లేవు. నాజర్ కంటే కోటశ్రీనివాసరావుకి ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి.


దేవసేన (అనుష్క) దైన్యం వెనుక ఉన్న కారణాలేమిటో తెలిస్తే తప్ప ప్రేక్షకుడికి సానుభూతి కలగదు. ఈ సన్నివేశాలన్నీ రెండవ భాగంలో ఉన్నాయి కాబట్టి అంతవరకూ కేవలం కథానాయకుడి కన్నతల్లిని కట్టిపడేశారన్న కారణంతో జాలి చూపించాలి.

మమతల తల్లిగా శివగామి(రమ్యకృష్ణ), కళ్ళముందు ఎంత ఘోరం జరుగుతున్నా రాజరికానికి కట్టుబడిన బానిస నాయకుడిగా కట్టప్ప(సత్యరాజ్),కౄరత్వం మూర్తీభవించిన రాజ్యాధినేత కాలకేయ (ప్రభాకర్) పాత్రలు బావున్నాయి. రమ్యకృష్ణ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తను సహజంగా మంచి నటి కాబట్టి బాగా చేసింది. గొంతు కూడా తనదే. ప్రతినాయకుడు తనే అనుకునేలా ఉన్న కాసేపూ గొప్పగా చేశాడు ప్రభాకర్. అతనికి ఇచ్చిన విచిత్రమైన భాష అదనపు ఆకర్షణ. మాస్ ప్రేక్షకులకు ఇట్టే నచ్చుతుంది. పర్షియా ఆయుధవ్యాపారి అస్లాం ఖాన్(సుదీప్) పాత్ర నిడివి చాలా తక్కువ. రెండవ భాగంలో పరిధి పెంచుతారేమో.

అవంతికగా తమన్నా నటన ఆకట్టుకుంటుంది. మొదటి సారి రౌద్రరస ప్రధానమైన పాత్ర పోషించినా మంచి మార్కులే కొట్టేసింది.


కథానాయకుడికి ఉండాల్సిన కనీసార్హతలు అన్నీ ప్రభాస్‌కు ఉన్నాయి. తన ' కటౌట్‌ ' కి ఏ వేషమైనా నప్పుతుంది. ఇక యువరాజుగా కత్తి చేతబట్టి జవనాశ్వం ఎక్కి యుద్ధవిన్యాసాలు చేస్తే అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుంటాయా ? శివుడిగా ప్రభాస్ మెప్పించాడు. ఇంతెత్తున్న శివలింగాన్ని అలవోకగా ఎత్తి రెండు చేతులతో పట్టుకొని వచ్చే సన్నివేశాల్లో అతన్ని చూసి మనసు పారేసుకోని టీనేజీ అమ్మాయిలుండరు. భద్రుడి(అడవి శేష్) తల ఎగరగొట్టే సన్నివేశంలో అతని హావభావాలు బాగా పండాయి. అమరేంద్ర బాహుబలిగా మాత్రం ఇంకాస్త బాగా చేసి ఉండొచ్చని అనిపించింది. వాచకం చాలా మెరుగవ్వాలి. పతాక సన్నివేశాల్లో వచ్చే కొన్ని శక్తిమంతమైన సంభాషణలను అస్పష్టంగా చెప్పి మమ అనిపించాడు. రచయితలు గంభీరమైన సంభాషణలు వ్రాయకపోబట్టి సరిపోయింది కాని లేకపోతే అల్లరిపాలయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో రాణా కొంత నయం. 

ముగింపు: 

సమీక్షలతో సంబంధం లేకుండా సినిమా కనకవర్షం కురిపించడం ఖాయం. మొదటి భాగం చూసిన ప్రతి ప్రేక్షకుడికీ రెండవ భాగం ఎలా ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతుంది-ఎమైనా ఊహించని మలుపులుంటే తప్ప. నాకు మాత్రం రెండవ భాగాన్ని మొదటి భాగంగా విడుదల చేసి అరచేతిపై శిశువు తేలుతున్న సన్నివేశం దగ్గర సశేషం అని పడి ఉంటే బాగుండేదని అనిపించింది.నా అభిప్రాయం తప్పని రాజమౌళి నిరూపిస్తే మరీ మంచిది.




ఉత్తరకాండ నుంచి జనక మహారాజు జన్మ వృత్తాంతం ఇతర విశేషాలు


  • 1. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాతే రామాయణ రచన ప్రారంభిస్తారు వాల్మీకి. 

  • 2. రావణపత్ని మండోదరికి ఇద్దరు సోదరులు -మాయావి,దుందుభి.

  • 3. కుంభకర్ణుడి భార్య వజ్రజ్వాల. విభీషణుడి పత్ని సరమ,పుత్రిక అనల. ఇద్దరూ లంకలో ఉండగా సీతాదేవికి ధైర్య వచనాలు చెప్పి స్వస్థత చేకూరుస్తారు. 

  • 4. కుంభకర్ణుడి సౌకర్యార్థం రావణుడు నిర్మించిన మందిరం మూడు యోజనాల పొడవు, ఒక యోజనం వెడల్పుతో ఉండేది . ఒక యోజనం పదిహేను కిలోమీటర్లకు సమానం.

  • 5. రావణుడి దుష్కృత్యాలను భరించలేకపోయిన అతని అన్న కుబేరుడు, తమ్ముడికి హితబోధ చేసి సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో రాయబారిని పంపుతాడు. రావణుడు ఆగ్రహంతో ఊగిపోయి రాయబారి శిరస్సు ఖండించి,అతని శరీరాన్ని రాక్షసులకు విందు చేసి ,అన్నపై, ముల్లోకాలపై దండయాత్రకు బయలుదేరుతాడు. 





  • 6. కుబేరున్ని ఓడించి పుష్పక విమానాన్ని దొంగలించి అందులో తిరిగి వెళ్తున్న దశకంఠుడు అకస్మాత్తుగా విమానం ఓ చోట ఆగిపోయి కదలకుండా మొరాయించేసరికి ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పరమశివుడు కేళీవిలాసంలో ఉంటాడని,అందుకే ఆ వైపుగా ఎవ్వరినీ అనుమతించరని నందీశ్వరుని ద్వారా తెలుసుకుంటాడు. అయినా అహంకారదర్పంతో తన మార్గానికి అడ్డొచ్చిన కైలాస పర్వతాన్ని పెకలించి పారేస్తానని పిచ్చి ప్రేలాపనలు చేసి కైలాసాన్నే కదిలించబోగా పరమశివుడు తన కాలి బొటనవ్రేలితో అతన్ని అదిమిపెట్టి గర్వభంగం కలిగిస్తాడు. బరువు మొయ్యలేక దశకంఠుడు వెయ్యి సంవత్సరాల పాటూ అరుస్తూ శివ స్తోత్రాలు వల్లిస్తాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అతనికి వెయ్యి సంవత్సరాల ఆయుష్షును తిరిగి ప్రసాదించి, చంద్రహాసమనే దివ్య ఖడ్గాన్ని కానుకగా ఇస్తాడు. 

  • 7. రావణుడి ధాటికి భయపడిపోయి ఇంద్రుడు,యముడు,వరుణుడు,కుబేరుడు పక్షులుగా జంతువులుగా మారిపోయి తప్పించుకుంటారు. ఇంద్రుడు నెమలిగా మారిపోతే,యముడు కాకిగా, వరుణుడు హంసగా, కుబేరుడు తొండగా మారిపోయి దాక్కుంటారు. ఆపదలో ఆదుకొన్నందుకు ప్రతిగా ఆయా పక్షి,జంతు సంతతికి వరాలిస్తారు దేవతలు. నెమలికి సర్పభయం లేకుండా దేవేంద్రుడు వరం ఇస్తాడు. తన ఒంటిపైనున్న వేయి కన్నులే నెమలి పింఛానికి వస్తాయని,వర్షాగమనానికి ముందు నెమలి పురి విప్పి నాట్యం చేస్తుందని వరమిస్తాడు. కాకికి ఏం తిన్నా ఏం కాదని,ఇతరులు చంపితే తప్ప దానికి చావు లేదని,దాని ద్వారానే పితరులకి ఆహారం అందుతుందని వరమిస్తాడు యముడు. వరుణుడు హంసలకు తెలుపు రంగును ప్రసాదించి, నిత్యం నీళ్ళలో ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు .కుబేరుడు తొండకు బంగారు వర్ణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. 

  • 8. మేఘనాథుడు (ఇంద్రజిత్) మండోదరీ-రావణుల ప్రథమ సంతానం. శౌర్యపరాక్రమాలలో తండ్రిని మించిన తనయుడు. శివున్ని ప్రసన్నం చేసుకొని భూమ్యాకాశాలలో ఎక్కడైనా సంచరించగల రథాన్ని, తామసి అనే మాయా విద్యను వరంగా పొందుతాడు. దేవేంద్రున్నే బంధించి బ్రహ్మ వచ్చి బ్రతిమాలితే విడిచిపెడుతూ మరిన్ని వరాలు పొందుతాడు. యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతి సారీ యజ్ఞం చేయటం,ఆ యజ్ఞకుండంలోంచి వచ్చిన రథాన్ని అధిరోహించి శాత్రవ సంహారం చెయ్యటం అతనికలవాటు. యజ్ఞం చేస్తున్నప్పుడు మధ్యలో ఆయుధం పట్టరాదనే నియమం ఉంది. యజ్ఞం నిర్విఘ్నంగా పుర్తయ్యి రథాన్ని ఎక్కాడా, ఇక తనకు పరాజయమన్న మాటే లేదు. లక్ష్మణుడు యాగాన్ని ధ్వంసం చెయ్యటంతో ఇంద్రజిత్ యాగ సామగ్రినే విసురుతూ అస్త్రాలు ప్రయోగించి అవి నిష్ఫలమవ్వటంతో అవతలివాడు మాములువ్యక్తి కాదని గ్రహించి, రావణుడికి హితబోధ చేసి విఫలుడై చివరికి యుద్ధభూమిలో వీరమరణం పొందుతాడు. 

  • 9. వాలి,సుగ్రీవులకు తల్లిదండ్రీ ఇద్దరూ ఋక్షరజస్సనే వానరమే. ఒకప్పుడు బ్రహ్మదేవుడు యోగదీక్షలో ఉండగా ఆయన కళ్ళ నుండి జారిపడ్డ అశ్రుకణమే వానర రూపం దాల్చి ఋక్షరజస్సుగా పిలవబడ్డాడు. ఈ ఋక్షరజస్సే ఒకానొక సందర్భంలో స్త్రీమూర్తిగా మారిపోయి ఇంద్రుని ద్వారా వాలిని, సూర్యుని ద్వారా సుగ్రీవున్ని పిల్లలుగా పొంది మళ్ళీ పురుషాకృతిని పొందుతాడు. 


  • 10. బాల్యంలో తన అల్లరి చేష్టలతో ఆశ్రమవాసులను విసిగిస్తూండటంతో మహర్షులు కోపించి ఇతరులు గుర్తు చేస్తే తప్ప స్వశక్తి గుర్తుకురాదని హనుమంతున్ని శపిస్తారు. 

  • 11. ఇక్ష్వాకు మహారాజుకు నూర్గురు కుమారులు. వారిలో చివరివాడు పరమ అయోగ్యుడు. అతని పేరు దండుడు. ఇక్ష్వాకు మాహారాజు వాడిని వింధ్య పర్వత ప్రాంతానికి రాజును చేసి శుక్రాచార్యులను గురువుగా నియమిస్తాడు. మూర్ఖుడైన దండుడు గురువు గారు ఆశ్రమంలో లేని సమయంలో ఆయన కుతురైన అరజను బలవంతంగా వశపరచుకొని ఆ పిమ్మట తన దారిన తను వెళ్ళిపోతాడు. జరిగిన ఘోరం గ్రహించిన శుక్రాచార్యులు ఏడు రోజుల్లోగా మట్టి వాన కురిసి దండుని రాజ్యం సర్వనాశనమవుతుందని శపిస్తాడు. అలా అప్పుడు సర్వనాశనమైన ప్రాంతమే నేటి దండకారణ్యం.

  • 12. పట్టాభిషేకానంతరం పుష్పక విమానాన్ని కుబేరుని వద్దకు పంపించేస్తాడు శ్రీరాముడు. అయితే ఆ విమానం తన వద్దనుండటం కన్నా శ్రీరాముని వద్దనుండటమే శ్రేష్ఠం అని భావించిన కుబేరుడు విమానాన్ని మళ్ళీ రాముడి వద్దకే తిప్పి పంపుతాడు. 

  • 13. శ్రీరామ పట్టాభిషేకం అయ్యాక కొద్ది రొజులు అయోధ్యలో గడిపి సుగ్రీవుడితో కలిసి కిష్కింధ కు వెళ్ళిపోతాడు హనుమంతుడు. తిరిగి అశ్వమేధయాగ సమయంలో శ్రీరాముడు కబురంపగా వానర రాజైన సుగ్రీవుడు, అతని బృందంతో అయోధ్య వస్తాడు. మన సినిమాలలో చూపించినట్లుగా పట్టాభిషేకమయ్యాక శాశ్వతంగా అయోధ్యలో శ్రీరాముడి వద్దనే ఉండిపోడు.

  • 14. లక్ష్మణుడు సీతాదేవిని అడవులలో వదిలివెళ్ళినప్పటికీ గంగా నది ఆవలి గట్టుపై నిలబడి వాల్మీకి మహర్షి వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళేంత వరకు వేచి చూస్తాడు. తర్వాతే భారమైన హృదయంతో మంత్రి సుమంత్రుని వెంట అయోధ్యకు తిరుగు ప్రయాణమవుతాడు. శ్రీరాముడి జాతకంలో తరచూ భార్యావియోగం ఉందనే విషయం తనకు,దశరథ మహారాజుకు దుర్వాస మహర్షి ద్వారా అంతకు పూర్వమే తెలుసునని,ఇది ఒకప్పుడు భృగు మహర్షి విష్ణువుకిచ్చిన శాపఫలమేనని చెప్పి లక్ష్మణున్ని ఊరడిస్తాడు సుమంత్రుడు. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తన నిజనామధేయంతోనే రక్షణ పొందుతుంది. ఆమె శ్రీరాముని ధర్మపత్ని సీత అని ఆశ్రమవాసులందరికీ తెలుసు.

  • 15. సీతాదేవి తండ్రియైన జనక మహారాజు అయోనిజుడు. పూర్వం నిమి అనే ఇక్ష్వాకు వంశ మహారాజు ఒక గొప్ప యాగం తలపెట్టి వశిష్ఠ మహర్షిని ఋత్విక్కుగా ఆహ్వానించబోతే ఆ మహర్షి తానిప్పుడు దేవేంద్రుడు నిర్వహించే యాగంలో ఉన్నానని,యాగం పరిసమాప్తమయిన వెంటనే వస్తానని చెబుతాడు. అంత వరకు వేచి ఉండలేక నిమి చక్రవర్తి తన యాగాన్ని గౌతమునితో నిర్వహిస్తాడు. యాగం జరుగుతూండగా వచ్చిన వశిష్ఠుడు తన స్థానంలో మరొకరు యాగాన్ని నిర్వహించటం గమనించి కోపోద్రిక్తుడై నిమి చక్రవర్తి శరీరం చైతన్యం కోల్పోయి జడత్వం పొందాలని శపిస్తాడు. నిమి చక్రవర్తి కుడా అదే ప్రతిశాపం వశిష్ఠునికిచ్చి గాలిలోనే యాగదీక్ష పూర్తిచేసి తన పూర్వశరీరంలో ఉండటం కంటే సకల ప్రాణుల కంటిరెప్పల పై ఉండాలని దేవతలను వరం వేడుకుంటాడు. అలా ప్రాణుల కళ్ళు విశ్రాంతి కోరుకున్నప్పుడు ఆయన కారణంగానే కంటిరెప్పలు మూసుకుంటాయి (అందుకే నిమేషము అన్నారు. దేవతల కంటిరెప్పలు కొట్టుకోవు. కాబట్టి వాళ్ళు అనిమిషులు). వారసుడి కోసం నిమి దేహాన్ని మథిస్తే పుట్టిన పిల్లవాడే జనక మహారాజు. శరీర మథనం వల్ల నిలబడిన రాజ్యం కాబట్టి ఆయన రాజ్యం మిథిలా నగరమయ్యింది.

  • 16. రావణుడి పినతల్లి కూతురు కుంభీనసి. ఆమె భర్త మధువనే రాక్షసుడు. రావణాదులు లంకలో లేని సమయంలో అతని సోదరియైన కుంభీనసిని అపహరించి రాక్షస వివాహం చేసుకుంటాడు మధువు. రావణుడికి విషయం తెలిసి మధువుని చంపబోతే, కుంభీనసి పతిభిక్ష కోరుతుంది. అప్పటికే స్వంత చెల్లెలైన శూర్పణఖకు పతీ వియోగం కలిగించి పాపం మూటగట్టుకున్న రావణుడు మరొకమారు అలాంటి కార్యమే చేయడం ఇష్టంలేక తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు. మధువు తన అపూర్వమైన భక్తిప్రపత్తులతో పరమేశ్వరున్ని మెప్పించి ఆయన శులాన్ని పొంది,అది చేతనున్నంత వరకు తనకు,తన కొడుకు లవణాసురునికి చావు లేకుండా వరం పొందుతాడు. లవణాసురుడు వరగర్వంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తూంటే మహర్షులంతా వచ్చి ప్రభువైన శ్రీరామునికి మొరపెట్టుకుంటారు. శ్రీరాముని కనిష్ఠ సోదరుడైన శతృఘ్నుడు సమరోత్సాహియై ముందుకు వచ్చి అన్నగారి నుంచి దివ్యాస్త్రం సాయంగా పొంది లవణాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతని చేతిలో శూలం లేని క్షణంలో నిర్జించి విజయాన్ని సాధిస్తాడు. అలా ఒకప్పుడు లవణాసురుడు పాలించిన నగరమే ఇప్పటి మధురా నగరం. లవణాసుర వధ తర్వాత శతృఘ్నుడు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు.


3 comments

Post a Comment

శివపురాణం నుంచి కొన్ని విశేషాలు




  1. 1.   పార్వతీదేవి విష్ణువు చెల్లెలు.అందుకే ఆయనలా నల్లగా ఉంటుంది.లక్ష్మీదేవి బ్రహ్మదేవుని చెల్లెలు.ఎర్రగా ఉంటుంది.సరస్వతి శివుని చెల్లెలు.తెల్లగా ఉంటుంది.

  2. 2.   సత్యము, శౌచము, తపస్సు, దయ నాలుగు పాదాలుగా ఉంటాయి.

  3. 3.   శివ కుటుంబంలో ఐదవవాడు చండీశ్వరుడు. చండీశ్వర స్థానంలో చిటికె మాత్రమె వెయ్యాలి. శివప్రసాదంలో మిగిలినదాన్ని ముందు చండీశ్వరుడు తింటాడు.ఆయనకు అర్పించిన తర్వాతే భక్తులు ఆరగించాలి.

  4. 4.   నవనందులుగా నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాలు ఆంధ్ర దేశంలో ఉన్నాయి.

  5. 5.   విభూతి పెట్టుకున్నవాళ్ళంతా శైవులు కారు.విభూతి వైదికం.ఎవరైనా భస్మారాధరన చెయ్యవచ్చు. నుదుటి రాతను సైతం మార్చే శక్తి భస్మకుంది.స్నానం చేస్తే తడి విభూతిని పెట్టుకోవాలి. మూడు వ్రేళ్ళతో బూడిద పెట్టుకోరాదు. స్నానం చెయ్యనప్పుడు పొడి విభూతిని లలాటం మీద పూసుకొని వెళ్ళవచ్చు. మృగముద్ర పట్టి బూడిద పెట్టుకోవలి. ఆవు పేడను బాగా కాల్చి పొడి చేసి తయారు చేసిన బూడిద,యజ్ఞంలో ధర్భలను కాల్చి చేసిన బూడిద శ్రేష్ఠమైనవి .

  6. 6.   తల్లిదండ్రులకి రోజుకి ఒక్కసారి మాత్రమే నమస్కారం చెయ్యాలి. శివాలయంలో నాలుగైదు సార్లు నమస్కారం చెయ్యాలి. సన్యాసికి నాలుగు మార్లు నమస్కారం చెయ్యలి. ఆలయంలో తప్పకుండా కోర్కెలు కోరాలి.

  7. 7.   శివుడికి పునః ప్రతిష్ఠ లేదు.శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దాన్నే పూజిస్తారు.

  8. 8.   ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డ మొట్ట మొదటి పట్టణం -కాశీ నగరం. ప్రపంచమంతా లయమయ్యే సమయంలో కూడా మునిగిపోని ఎకైక నగరం కాశీ. వారణ,అశి అనే రెండు నదులు కలిసి ప్రవహించటం వలన అది వారణాశి అయ్యింది. విష్ణువు చెమటలో తడిసి మునిగిపోయిన భూమి కాశి.

  9. 9.   కేదారేశ్వర లింగస్వరూపాన్ని దర్శించినవారికి మోక్షం తధ్యం. నేరుగా కన్నుతో లింగాన్ని దర్శించకుండా ఒక రాగి కంకణంలో నుంచి చూడాలి.

  10. 10.   మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూంటాయి.

  11. 11.   నారద మహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు రామావతారంలో భార్యావియోగం పొందవలసి వస్తుంది. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించిన నారదుడు, మన్మథున్ని కూడా జయించానని గొప్పలు పోవటంతో ఆయన్ను పరీక్షించటానికి మహావిష్ణువు ఒక నాటకమాడుతాడు. తన మాయతో కాశీరాజు కూతురుగా జగదేక మోహనాంగిని సృష్టించి, నారదుని కళ్ళలో ఆమె పడేలా చేస్తాడు. ఆమె అందానికి వివశుడైన నారదుడు, ఆమెను ఎలాగైనా పొందాలని నిశ్చయించుకుంటాడు.ఆమె జాతకం పరిశీలించి హరియే ఆమె భర్తవుతాడని గ్రహించి, విష్ణువును ప్రార్థించి, తనను హరిలాగే చెయ్యమంటాడు. హరి అంటే కోతి అని మరొక అర్థం కూడా ఉంది. నారాయణుడు చిరునవ్వుతో అంగీకరించి నారదున్ని తనలా మార్చివేసి ముఖాన్ని మాత్రం కోతిలా చేసేస్తాడు. కాశీరాజు కూతురు స్వయంవరానికి అట్టహాసంగా వెళ్ళిన నారదుడు, ఆమె తనను కాకుండా అసలు శ్రీమహావిష్ణువును పెళ్ళాడటంతో ముందు తెల్లబోయి తర్వాత నవ్వులపాలవుతాడు. మానవ జన్మనెత్తి భార్యావియోగం అనుభవించాలని విష్ణువుని ఆగ్రహంతో శపిస్తాడు.





2 comments

Post a Comment