చలం - మైదానం - మొదటి భాగం



లం గారి గురించి,వారి స్త్రీవాద సాహిత్యం గురించి అనేకసార్లు విన్నాను కానీ,వారి రచన చదవడం ఇదే మొదలు.చదివిన మొదటి పుస్తకానికే సమీక్ష రాయటం నా దుస్సాహసమే అయినా,నా అభిప్రాయాలు చదివి దాని మీద కొంచెమైనా చర్చ జరిగి నాకు తెలియని విషయాలు బోధపడితే ఈ సమీక్షకు అర్థం పరమార్థం నెరవేరినట్లే.

కథ

రాజేశ్వరి ఒక సదాచార బ్రాహ్మణ గృహిణి.అందమైనది.

ఆమె భర్త ఒక ప్లీడరు. కోర్టు వాజ్యాల విషయమై ఆయన దగ్గరకు ఎంతోమంది క్లైంట్లు వస్తూపోతూంటారు. అలాంటి వాళ్ళలో ఒకడు అమీర్.

ఆఫీసు గదిలోంచి ఏవీ మాటలు వినబడకపొతే ఎవరూలేరనుకొని భర్త కోసం కాఫీ తీసుకెళ్ళిన రాజేశ్వరికి మొదటిసారి తారసపడతాడు అమీర్. తొలిచూపులొనే వాళ్ళిద్దరి మధ్య బలమైన ఆకర్షణ ఏర్పడుతుంది. అమీర్ మోహపారవశ్యపు ఉద్ధృతిలో ఉక్కిరిబిక్కిరైన ఆమె,అతని ప్రొద్బలంతో భర్త ఊరికి వెళ్ళిన ఒకనాటి రాత్రి అతనితో లేచిపోతుంది. అలా వెళ్ళిపోయి వాళ్ళు ఒక మైదానం చేరుకుంటారు..చుట్టూవున్న ఆకాశాన్ని,కొండల్ని, చింతచెట్లని,మైదానం ఆనుకొని ప్రవహిస్తున్న చిన్న సెలయేరుని చూసి ఆమె మనస్సు సంతోషంతో పరవళ్ళు తొక్కుతుంది. అక్కడే ఒక చిన్నిపాకలో అమీర్ తో తన క్రొత్త జీవితం ప్రారంభిస్తుంది ఆమె.

అమీర్ సహచర్యంలో ఆమెకు తనవాళ్ళు ఎవరూ గుర్తురారు. తినడానికి సరైన తిండి,కట్టుకొవడానికి సరైన బట్టలు లేకపొయినా, ఉన్నదాంతోనే సర్దుకుంటూ,అతనితో కలిసి మైదానం లో అటలాడుతూ,గెంతుతూ,ఏటిలో స్నానాలు చేస్తూ,సుఖిస్తూ అదే జీవిత పరమార్ధం అనుకుంటూంటుంది. ఒకప్పుడు తాను అసహ్యించుకున్న తురక తెలుగు, చేపల కూర ఇప్పుడు ఆమెకు ప్రియంగా కనిపిస్తాయి. వైష్ణవులకు విష్ణువే సర్వస్వం అయినట్లు,ఆమెకు అమీరే లోకం అవుతాడు. అలా కొన్ని రోజులు,నెలలూ దొర్లాక ఒకరోజు ఆమె స్వంత మావయ్య వస్తాడు. ఆమెకు నచ్చజెప్పి తీసుకువెళ్దాం అని పరిపరివిధాలా ప్రయతిస్తాడు. ఆమె ససేమిరా అంటుంది. పైగా మావయ్య ముందే అమీర్ తో కలిసి ఒకే మూకుట్లో అన్నం తింటుంది."ఏనాటికైనా మా గుమ్మం తొక్కవా" అని మావయ్య అంటే "మీ గుమ్మాలు తొక్కుతానని భయం లేకుండా బ్రతకండి" అంటుంది.

సాఫీగా సాగుతున్న రాజేశ్వరి జీవితంలోకి హఠాత్తుగా ఇంకో స్త్రీ ప్రవేశిస్తుంది. కొద్దిరోజులుగా అమీర్ దిగులుపడుతూ, అన్నం తినకుండా, పలక్కుండా, పలకరిస్తే విసుక్కొని ముసుగుపెట్టి పడుకోవటం ఆమె గమనిస్తుంది. మీరా అనే కుర్రవాడితో అమీర్ రహస్యంగా మట్లాడటం,అతనితో కలిసి చాలాసార్లు వూళ్ళోకి వెళ్ళిరావటం, వచ్చాక మరీ దిగాలుగా వుండటం చూసి పరిస్థితి విషమిస్తోందని ఆమె గ్రహిస్తుంది. మీరా ఒంటరిగా నడిచివస్తూండగా అతన్ని బ్రతిమాలి అసలు విషయం కనుక్కుంటుంది.

అమీర్ ఆ ఊరి తోళ్ళసాయిబు కూతురి మీద మనసుపడతాడు!

ఆ అమ్మాయి ఇతన్ని నిరాకరిస్తూంటుంది.మీరా ఆ అమ్మాయికి బంధువు.ఇద్దరికీ రాయబారం నడుపుతూంటాడు..!

విషయం తెలిసాక రాజేశ్వరి మనస్సులో రొద మొదలవుతుంది. ఆవేశంతో వెళ్ళి గుడిసెలో వున్న అమీర్ ను నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. అమీర్ ఏడుస్తాడు. ఆమె కరిగిపోయి అతన్ని దగ్గరకు తీసుకొని లాలిస్తుంది. మరుసటిరోజు మీరాని వెంటబెట్టుకొని వెళ్ళి సాయిబు కూతురుని కలిసి ఆమెను వొప్పిస్తుంది. రోజూ అమీర్ ను తనే తీసుకువెళ్ళి సాయిబు యింట్లో దిగబెట్టి తర్వాత తీసుకొని వచ్చేది.అమీర్ కు కొద్దిరోజుల్లోనే సాయిబుకూతురి మీద విముఖత కలుగుతుంది. ఆమెతో పోట్లాడి మళ్ళీ రాజేశ్వరికి దగ్గరవుతాడు.

కొంతకాలానికి రాజేశ్వరి గర్భవతి అవుతుంది. అమీర్ దాన్ని వదిలించుకోమంటాడు. ఆమె వినదు. మాతృత్వపు మమకారం పుట్టుకొచ్చి ఏమైనాసరే బిడ్డను రక్షించుకోవాలని నిశ్చయించుకుంటుంది.అమీర్ తాగొచ్చి ఆమెను కొడతాడు. తర్వాత ప్రేమ చూపిస్తాడు. అయినా వినకపోయేసరికి ఆరునెలలు ఆమెని విడిచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు.వెళ్తూ వెళ్తూ ఆమె పర్యవేక్షణ బాధ్యతలు మీరాకి అప్పగిస్తాడు.

మీరా పదహారేళ్ళ నాజూకైన కుర్రవాడు. అనుక్షణం తోడుగావుంటూ ఆమె బాగోగులు చూసుకుంటూంటాడు. ఆమె అతన్ని తమ్ముడిలా భావించి ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమను మరోరకంగా తీసుకుంటాడు అతను. ఆమె పురుడు పోసుకోవటానికి ఒక స్త్రీని తీసుకొస్తాడు. ఆమెను కాపాడటానికి ఒకరోజు రాత్రి ఓ త్రాగుబోతుతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాడు. ఆమె కష్టాలకు కారణం ఆ బిడ్డే అని భ్రమించి,ఆమె బిడ్డను కూడా లుంగచుట్టి తీసుకెళ్ళి పారేసి వస్తాడు. అమీర్ కోసం, ఆమె వద్దు అనదు. మీరా తనకోసం పడ్డ కష్టాలు చుసి ఆమె మనస్సు కరిగిపోతుంది. ఆఖరుకి తన సర్వస్వం అర్పించటానికి సైతం సిద్ధపడుతుంది.

మీరా కబురందుకొని అమీర్ వస్తాడు. వచ్చిన కొద్దిరోజుల్లోనే రాజేశ్వరి,మీరాల మధ్య వున్న చనువు అతనికి అర్థమవుతుంది. మీరా కూడా మొదట సంకోచించినా తర్వాత చనువుగా వస్తూపోతూంటాడు. అయితే ఇద్దరికీ పొసగదు. తనకు ఇద్దరూ కావాలి అనుకొనే ఆమె వాళ్ళిద్దరి మధ్యా సతమతం అవుతూంటుంది. ఒకరోజు రాత్రి మీరా లోయలో పడిపోతే అతన్ని రక్షిస్తాడు అమీర్.

ఓ రాత్రి ఆమె అమీర్ తో ఏకాంతంగా నిద్రిస్తూన్న సమయాన,మీరా వచ్చి "నువ్వు లేకుండా నేను వుండలేను" అని ఆమెను తీసుకువెళ్ళి తనదాన్ని చేసుకుంటాడు.ఆ దృశ్యం చూసి అమీర్ ఉద్రేకంతో కత్తి తీసుకొనివస్తాడు. మీరాని చంపబోయి, ఆమె అడ్డుపడేసరికి చివరికి తనకుతానే పొడుచుకుంటాడు. ఈ విషయం తెలియక,అమీర్ ని చంపింది రాజేశ్వరి అనుకొని,ఆమెను కాపాడ్డానికి డాక్టరుతో,పోలీసులతో తనే చంపినట్టు అబద్ధం ఆడుతాడు మీరా. అతన్ని రక్షించడానికి తనే హత్య చేసినట్లు చెబుతుంది ఆమె.

ఇదీ కథ..


(మిగతా సమీక్ష రెండవ భాగంలో.)


1 comment

Post a Comment

తపస్వీ.. కళ్ళుతెరు !




చీమలు దూరని చిట్టడవిలో !
చెట్టునీడన చట్రాతిపై !
పద్మాసనం వేసుక్కూర్చొని
ప్రపంచంతో పనిలేనట్లు
దేనికోసం ఓ తపస్వీ
దివారాత్రులు ధ్యానిస్తున్నావ్?!
మోక్షమే నీ లక్ష్యమైతే
కళ్ళు తెరుచుకొని !
ఒళ్ళు విరుచుకొని !
తపస్వీ కదలిరా !!
విధి కాటేస్తే !
వ్యథ కోసేస్తే !
బ్రతుకు దుర్భరమై !
భవిత బుద్బుదమై !
మందిరాల ముంగిట !
మసీదుల సందిట !
చౌరస్తా దారుల్లో !
చౌకబారు వాడల్లో !
అన్నిచోటులా !
అన్నివేళలా !
స్మృతిహీనుల్లా సంచరించే !
అభాగ్యులెందరో !
అనాథలెందరో !
ధరిత్రినిండా పండి ఉన్నారు !!
వాళ్ళంతా నీ తోబుట్టువులే !
నీ తల్లి వసుధ వొడిలో పాపలే !
నువ్వు వెదికే విశ్వేశ్వరుడు
పరివ్యాపితుడై పరివేష్ఠితుడై
ప్రతిప్రాణిలో వొదిగి ఉన్నాడు !!
ఉగ్రతపస్సులు !
యజ్ఞహవిస్సులు !
ఉన్న సమయం వృథాచేస్తాయ్ !!
జగత్సత్యాన్ని అవలోకించి !
జపతపాలను విసర్జించి !
జనస్రవంతిలో మమేకం కా !
అన్నార్తులకూ ఆపన్నులకూ
నీ ఆత్మీయహస్తం అందించు !
దీనులసేవలో దేవుడున్నాడు
సేవించి తరించు !
దర్శించి తరించు !!





7 comments

Post a Comment

స్మృతులు




చిరుమబ్బు సాగితే
తొలిచినుకు రాలితే
నీ రాకనూహించి
నీ నిశ్చలమయ్యా !

హరివిల్లు విరిస్తే
విరిజల్లు కురిస్తే
నీ నవ్వుల కొరకై
నే దొసిలి పట్టా !

వెన్నెల చిగురిస్తే
వన్నెలు పులకిస్తే
నీ వయారాలేరి
వెఱ్ఱికేక పెట్టా !

మల్లియలు విరిస్తే
మారుతం చలిస్తే
నీ స్పర్శనే తలచి
నన్ను నేను మరిచా !

ప్రకృతిలో ప్రతి అణువూ
తెలిపేది నీ ఉనికే
పలికేది నీ ఊసే
నీ స్మృతులే నాకు శ్వాస !
నీ వలపే జీవితాశ !!

('ఆంధ్రభూమి' మాసపత్రిక ఫిభ్రవరి 2001 ఎడిషన్లో ప్రచురితం )


4 comments

Post a Comment

ఆమె..!




రత్కాల సుందర రాత్రి
సిగ్గులొలికే మొగ్గ ధాత్రి ఆమె..!

ఆమె వదనం
పూర్ణ చంద్రం
లలిత నయనాలు
చలిత మీనాలు
వినీలాకాశమే వేణీభరము
శతకోటి తారలు
సిగముడిలో పూలు

కరుణభరితం
ఆమె హృదయం
మధుర హాసాలు
మువ్వ లాస్యాలు
సౌందర్యాస్వాదనే శ్వాస
ప్రేమే మతం
ప్రపంచ సౌఖ్యం అభిమతం

వశుడనై
వివశుడనై
వలపంతా మూటకట్టి
నే వనిత చెంత వాలితే
చిరునవ్వులు రువ్వుతూ
చకచకా వెళ్ళిపోయింది !!


(ప్రముఖ మాసపత్రిక 'ఆంధ్రభూమి' (డిసెంబరు 98) ఎడిషన్లో ప్రచురితం..)


3 comments

Post a Comment

ఎవరో..?

ళుకు సోకుల త్రుళ్ళి మురిసే తారకామణో
కళాశోభిత చంద్ర వికసిత కలువ కన్యకో
వలపు కొలనులో వన్నెలుబోవు వయ్యారి హంసో
ఎవరో ఆమెవరో
వెన్నెలనాటి వెలుగుల రాత్రి
విరితోటల పెరటిలో
విరజాజుల మధ్యలో
వాల్చిన ప్రక్కపై వివశంతో వాలి
కంబళిని లాగి కన్నుల్ని మూసి
కునుకు కోరేటి కమ్మటి వేళల
ఊహల ఊయలలో
ఊసుల బాసలలో
సుశంత సుషుప్తిలో
స్వప్నాల సొంపులో
మదిని దోచి మైమరపించు మానినీలతికమెవరో ?


1 comment

Post a Comment