విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మొదటి భాగం



విసమ్రాట్ అన్న బిరుదానికి కొత్త సొబగులు అద్ది దానికి పరిపూర్ణత చేకూర్చిన వారు విశ్వనాథ సత్యనారాయణ. సంస్కృతాంధ్ర,ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేసి మేరుసమానమైన ఖ్యాతి పొందారు. విద్వత్తులో,ఆయనతో పోల్చదగిన వారు ఆ కాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా అంధ్రదేశంలో పుట్టలేదంటే అతిశయోక్తి లేదు. ఆయనకు అజారమరమైన కీర్తిని సంపాదించి పెట్టిన వాటిలో వేయిపడగలు ప్రముఖమైనది. ధర్మశాస్త్రానికి ప్రతీకలా భాసించే ఈ పుస్తకానికి వేయికి పైగా పేజీలు,37 అధ్యాయాలు. ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్ స్టోయ్ 'వార్ అండ్ పీస్' రచనతో పాటూ సమానహోదా అందుకున్న ఈ పుస్తకం గురుంచి నేటి తరం పాఠకులకి తెలిసింది చాలా తక్కువ. (నిజానికి పుస్తకం చదివేంత వరకు నాకు దీని గొప్పదనం తెలియలేదు). ఆ ఉద్గ్రంథం ఔన్నత్యాన్ని తెలియచేసే చిరుప్రయత్నమే యిది. రచన మొత్తం గ్రాంథిక భాషలోనే సాగుతుంది.

కథ:

సుబ్బన్నపేట మూడువందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఊరు. మూడువందల సంవత్సరాల క్రితం ఈ సుబ్బన్నపేట ఒక మహారణ్యం. ఆ అడవిలో ఒక చిన్న పల్లెలో,ఒక పెదకాపు కట్టెలు కొట్టుకుంటూ తన భార్యా,కూతురుతో జీవనం సాగించేవాడు. అతనికి కామధేనువు లాంటి ఒక ఆవు ఉండేది. ఆ ఆవు రోజూ బిందెల కొద్దీ పాలిస్తుండేది.అలాంటి ఆ గోవు హఠాత్తుగా పాలివ్వటం మానేస్తుంది. పాలు పితకబోయిన కాపు ని అతని భార్యని తంతుంది. మేతకు తీసుకెళ్ళినప్పుడు ఎవరో దొంగతనంగా పాలు పితికేస్తున్నారని సందేహంతో కాపు తనే ఆవు వెంట వెళ్తాడు. ఆవు తన కనుగప్పి ఒక పెద్ద పుట్టలో పాలు పోయటం.ఆ పుట్ట లో నుంచి వేయి పడగల పాము ఒకటి వెలుపలకి వచ్చి ఆవు పాలు పూర్తిగా తాగెయ్యటం చూసి మూర్ఛపోతాడు. తర్వాత తెప్పరిల్లి ఇంటికి వెళ్ళి విషయం భార్యతో చెప్తాడు.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా వ్యాపిస్తుంది. ఆ రాత్రి కాపు కలలో సుబ్రమణ్యేశ్వరుడు కనిపించి తను పాలు త్రాగిన స్థలం లో గుడి కట్టించమని చెప్తాడు. ఆ సంగతి గ్రామస్తులకు చెబుతాడు కాపు. కాని గుడి నిర్మాణానికి అవసరమైన ధనం వారి దగ్గర వుండదు.

సుబ్రమణ్యేశ్వరుని మహిమ వలన ఆ ఊరిలో ప్రజల చిరకాల సమస్యలన్నీ పరిష్కారమవుతుంటాయి.స్వామి మహత్తు చుట్టుప్రక్కల ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.ప్రక్క ఊరిలోని ఒక బ్రాహ్మణుడు తనకు సంతానం కలిగితే స్వామి సన్నిధిలోనే వుంటానని మ్రొక్కుకుంటాడు.అతనికి పండంటి కొడుకు పుడతాడు.బ్రాహ్మణుడు భార్యాపిల్లలతో వచ్చి స్వామి కి సేవలు చేసుకుంటూంటాడు .ఆంగ్లేయులు దేశంలో తమ పట్టును పెంచుకుంటున్న కాలంలో,వ్యాపారంలో అనుహ్య సంపద పొందిన వీరన్ననాయుడనే భాగ్యవంతుడు ఒక కోట కట్టి, జమిందారుగా వెలగాలని అందుకు అనువైన స్థలం చూపమని అతన్ని అడుగుతాడు. బ్రాహ్మణుడు కోటని ఆ ఊరిలోనే కట్టమని,ఆ ప్రాంతం మూడువందల యేళ్ళవరకు సుభిక్షంగా వుంటుందని చెప్పి అతన్ని వొప్పిస్తాడు. అలా సుబ్బన్నపేట పేరుతో,ఆ ప్రాంతం అభివృద్ధి చెంది,ఎందరో వచ్చి అక్కడ స్థిరపడతారు.వీరన్న నాయుడు ఆ ఊళ్ళో శివలింగం ప్రతిష్ఠించి,నాగేశ్వరాలయం, సుబ్రమణ్యేశ్వరాలయం,వేణుగోపాలస్వామి ఆలయం నిర్మిస్తాడు. ఆయనికి దివానుగా బ్రాహ్మణుడు నియమింపబడతాడు.

ఏ ఆవు పాలు సుబ్రమణ్యేశ్వరుడు త్రాగాడో,ఆ ఆవు యజమానైన కాపు కి ఒక్క కూతురుంటుంది. ఆమెకు ఎప్పుడు పెళ్ళి చేయ నిశ్చయించినా సుబ్రమణ్యేశ్వరుడు ఆమెను పూనే వాడు. గ్రామస్తులంతా 'తప్పు తప్పు' అని లెంపలు వేసుకొనేవారు. అలా ఆ వంశంలో ఒక్కటే ఆడపిల్ల పుట్టం, ఆమె అవివాహితగా, గణాచారిగా మిగిలిపోవటం ఆనవాయితీగా మారిపోతుంది.స్వామి వారు,స్వామి కి ప్రతినిధులుగా వీరన్ననాయుని వంశీకులు ,ప్రచారకులుగా బ్రాహ్మణ వంశీయులు, వ్యాఖ్యాతలుగా కాపు వంశీయులు ఉంటూ ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తూ ఆ ఊరికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూంటారు.

మూడువందల యేళ్ళు గడుస్తాయి.బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే సుబ్బన్నపేట నాశనానికి బీజం పడుతుంది.

వీరన్ననాయుని వంశం నుంచి కృష్ణమనాయుడు జమిందారుగా వున్న కాలంలో, బ్రాహ్మణ వంశంలో ఐదవ తరం వాడైన రామేశ్వరశాస్త్రి దివానుగా ఉండేవాడు. ఆయనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులముల నుండి నలుగురు భార్యలు, రత్నగిరి అనే భోగాంగన ఉండేవారు. రామేశ్వరశాస్త్రి విద్వాంసుడు,ధీరోదాత్తుడు, ఉదార స్వభావుడు,గొప్ప దాత. ఆయన దానగుణం వికటించి ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఆయన మోచేతి నీళ్ళపై ఆధారపడి జీవితంలో స్థిరపడ్డ ఎందరో,ఆయనకే వడ్డీలకిచ్చి,చివరి రోజులలో డబ్బు కోసం పీక్కు తింటారు. దరిద్ర దేవత సహస్ర హస్తాలతో కబళించినట్లై, కట్టుకున్న బట్టలు కూడా దానం చేసి, తిండికి కూడా నోచుకోని స్థితిలో,ఆయన, తనకంటే దరిద్రుడైన ఆ ఊరి నాగేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడే తుదిశ్వాస విడుస్తాడు. ఆయన మరణంతో శాస్త్రి గారి ధర్మపత్ని,పదహారేళ్ళ కొడుకు ధర్మారావు వీధిన పడతారు.వారిని ఆదుకోటానికి బంధుమిత్రులెవ్వరూ ముందుకు రారు.

జమిందారు కృష్ణమనాయుడు,రామేశ్వరశాస్త్రి గొప్ప స్నేహితులు. ధర్మారావు దీన పరిస్థితిని తన సేవకుని ద్వారా తెలుసుకున్న ఆయన,అప్పులవారి బాధ నుండి అతన్ని రక్షించి, స్కూలులో చేర్పించి అతని బాగోగులు చూసుకోవటం మొదలుపెడతాడు.ఇదంతా నాయుడి కొడుకు రంగారావుకి నచ్చదు.


(మిగతా రెండవ భాగంలో..)


3 comments

yuktha
September 27, 2009 at 10:30 PM

ee pustakam gurinchi vinadame gaani eppudu chadavaledu. inkaa migilina anni baagaalu prachuristaaru ani aasistunnaanu

Reply
September 27, 2009 at 10:31 PM

ee pustakam gurinchi vinadame gaani eppudu chadavaledu. inkaa migilina anni baagaalu prachuristaaru ani aasistunnaanu

Reply
Anonymous
September 27, 2009 at 10:31 PM

ee pustakam gurinchi vinadame gaani eppudu chadavaledu. inkaa migilina anni baagaalu prachuristaaru ani aasistunnaanu

Reply
Post a Comment