శివపురాణం నుంచి కొన్ని విశేషాలు




  1. 1.   పార్వతీదేవి విష్ణువు చెల్లెలు.అందుకే ఆయనలా నల్లగా ఉంటుంది.లక్ష్మీదేవి బ్రహ్మదేవుని చెల్లెలు.ఎర్రగా ఉంటుంది.సరస్వతి శివుని చెల్లెలు.తెల్లగా ఉంటుంది.

  2. 2.   సత్యము, శౌచము, తపస్సు, దయ నాలుగు పాదాలుగా ఉంటాయి.

  3. 3.   శివ కుటుంబంలో ఐదవవాడు చండీశ్వరుడు. చండీశ్వర స్థానంలో చిటికె మాత్రమె వెయ్యాలి. శివప్రసాదంలో మిగిలినదాన్ని ముందు చండీశ్వరుడు తింటాడు.ఆయనకు అర్పించిన తర్వాతే భక్తులు ఆరగించాలి.

  4. 4.   నవనందులుగా నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాలు ఆంధ్ర దేశంలో ఉన్నాయి.

  5. 5.   విభూతి పెట్టుకున్నవాళ్ళంతా శైవులు కారు.విభూతి వైదికం.ఎవరైనా భస్మారాధరన చెయ్యవచ్చు. నుదుటి రాతను సైతం మార్చే శక్తి భస్మకుంది.స్నానం చేస్తే తడి విభూతిని పెట్టుకోవాలి. మూడు వ్రేళ్ళతో బూడిద పెట్టుకోరాదు. స్నానం చెయ్యనప్పుడు పొడి విభూతిని లలాటం మీద పూసుకొని వెళ్ళవచ్చు. మృగముద్ర పట్టి బూడిద పెట్టుకోవలి. ఆవు పేడను బాగా కాల్చి పొడి చేసి తయారు చేసిన బూడిద,యజ్ఞంలో ధర్భలను కాల్చి చేసిన బూడిద శ్రేష్ఠమైనవి .

  6. 6.   తల్లిదండ్రులకి రోజుకి ఒక్కసారి మాత్రమే నమస్కారం చెయ్యాలి. శివాలయంలో నాలుగైదు సార్లు నమస్కారం చెయ్యాలి. సన్యాసికి నాలుగు మార్లు నమస్కారం చెయ్యలి. ఆలయంలో తప్పకుండా కోర్కెలు కోరాలి.

  7. 7.   శివుడికి పునః ప్రతిష్ఠ లేదు.శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దాన్నే పూజిస్తారు.

  8. 8.   ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డ మొట్ట మొదటి పట్టణం -కాశీ నగరం. ప్రపంచమంతా లయమయ్యే సమయంలో కూడా మునిగిపోని ఎకైక నగరం కాశీ. వారణ,అశి అనే రెండు నదులు కలిసి ప్రవహించటం వలన అది వారణాశి అయ్యింది. విష్ణువు చెమటలో తడిసి మునిగిపోయిన భూమి కాశి.

  9. 9.   కేదారేశ్వర లింగస్వరూపాన్ని దర్శించినవారికి మోక్షం తధ్యం. నేరుగా కన్నుతో లింగాన్ని దర్శించకుండా ఒక రాగి కంకణంలో నుంచి చూడాలి.

  10. 10.   మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూంటాయి.

  11. 11.   నారద మహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు రామావతారంలో భార్యావియోగం పొందవలసి వస్తుంది. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించిన నారదుడు, మన్మథున్ని కూడా జయించానని గొప్పలు పోవటంతో ఆయన్ను పరీక్షించటానికి మహావిష్ణువు ఒక నాటకమాడుతాడు. తన మాయతో కాశీరాజు కూతురుగా జగదేక మోహనాంగిని సృష్టించి, నారదుని కళ్ళలో ఆమె పడేలా చేస్తాడు. ఆమె అందానికి వివశుడైన నారదుడు, ఆమెను ఎలాగైనా పొందాలని నిశ్చయించుకుంటాడు.ఆమె జాతకం పరిశీలించి హరియే ఆమె భర్తవుతాడని గ్రహించి, విష్ణువును ప్రార్థించి, తనను హరిలాగే చెయ్యమంటాడు. హరి అంటే కోతి అని మరొక అర్థం కూడా ఉంది. నారాయణుడు చిరునవ్వుతో అంగీకరించి నారదున్ని తనలా మార్చివేసి ముఖాన్ని మాత్రం కోతిలా చేసేస్తాడు. కాశీరాజు కూతురు స్వయంవరానికి అట్టహాసంగా వెళ్ళిన నారదుడు, ఆమె తనను కాకుండా అసలు శ్రీమహావిష్ణువును పెళ్ళాడటంతో ముందు తెల్లబోయి తర్వాత నవ్వులపాలవుతాడు. మానవ జన్మనెత్తి భార్యావియోగం అనుభవించాలని విష్ణువుని ఆగ్రహంతో శపిస్తాడు.





2 comments

March 9, 2015 at 5:20 AM

లోకేష్ గారు, 6వ పాయింట్ లో లయమవ్వని పట్టణం పూరి జగన్నాథ్ అని చదివాను. ఒకసారి మీరు కూడా ఈ విషయం పై మరొక్కసారి ఆలోచించగలరు.

Reply

శశికుమార్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.పూరి జగన్నాథ క్షేత్రం గురుంచి అంతగా తెలియదండి.కాశీ పట్టణం గురుంచి మాత్రం చాలా సార్లు విన్నాను.

Reply
Post a Comment