కాంగ్రెస్ మార్కు మతసామరస్యం !



స్వతంత్ర భారద్దేశంలో సెక్యూలరిజం అనేది ఒక కొరుకుడుపడని పదం. ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయనాయకుల పదకోశంలో దీని అర్థాలు అతివేగంగా మారిపోయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెర్షన్లు విడుదలవుతూంటాయి. ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఈ విషయంలో మినహాయింపు. 125 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి యాభైఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించి ఇంకా
శాసిస్తున్న పార్టీ, దేశసమస్యలపై నిర్దుష్టమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోకపోయినా ఒక్క విషయం మీద మాత్రం ఆది నుంచి కుండబద్దలు కొట్టినట్లుగా తన వైఖరి స్పష్టం చేస్తునే ఉంది. మతసామరస్యమంటే కేవలం కొన్ని వర్గాలకి కొమ్ముకాయడమేనని కాంగ్రెస్ పెద్దల ఆభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే కొత్తగా మతహింస నిరోధక బిల్లు (Prevention of Communal and Targetted voilence bill 2011)తో మన ముందుకు వస్తోంది.


మతహింస కేవలం ఒక వర్గానికే పరిమితం కాదు. కవ్వించేది ఎవరైనా అల్లర్లంటూ చెలరేగాక ఆస్తినష్టం ప్రాణనష్టం రెండువైపులా ఉంటుంది. ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా నిజనిర్ధారణ చేసి కులమతాలకు అతీతంగా శిక్షలు విధించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. అలా కాకుండా వోటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, పక్షపాత బుద్ధులతో ఒక వర్గాన్ని చిన్నచూపు చూసి, మరో వర్గంపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తేనే వస్తుంది చిక్కు. అందుకే ఈ బిల్లు వివాదాస్పదమయ్యింది.

ముందుగా బిల్లులోని ముఖ్యాంశాలు చదవండి (పూర్తి బిల్లు ఇక్కడ )
  • సెక్షన్ 3 ప్రకారం ఒక వర్గానికి చెందారన్న కారణంగా దానికి చెందిన వ్యక్తిని కాని, ఆస్తిని కానీ అసంకల్పితంగా గానీ, పథకం ప్రకారం గానీ దాడిచేయ్యటం నేరం.
  •  క్లాజ్ 7 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులపై శారీరకమైన వేధింపులకు పాల్పడటం నేరం.
  • క్లాజ్ 8 ప్రకారం ఆ వర్గం పైన కానీ, ఆ వర్గానికి చెందిన వ్యక్తిపై కానీ మాటల ద్వారా గానీ, వ్రాతల ద్వారా కంటికి కనిపించే మరే విధమైన పనుల ద్వారా కానీ ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యడం నేరం.
  • క్లాజ్ 9 ప్రకారం వ్యక్తిగా గానీ, సామూహికంగా గానీ ఆ వర్గం మీద పథకం ప్రకారం దాడి చెయ్యటం నేరం.
  • క్లాజ్ 10 ప్రకారం ఆ వర్గానికి వ్యతిరేకంగా ధనసహాయం గానీ మరే విధమైన సహాయం గానీ చెయ్యటం నేరం.
  • క్లాజ్ 12 ప్రకారం ప్రభుత్వోద్యోగులెవరైనా ఆ వర్గానికి చెందిన వ్యక్తులను మానసికంగా గానీ,శారీరకంగా గానీ హింసించడం నేరం.
  • క్లాజ్ 13 మరియు 14 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులను రక్షించకుండా అలసత్వం ప్రదర్శించిన ప్రభుత్వోద్యోగులను కఠినంగా శిక్షించవచ్చు  
  • క్లాజ్ 15 ప్రకారం ఈ విషయంలో తన క్రింది ఉద్యోగులు సరిగ్గా పనిచెయ్యకపోయినా వారి పైనున్న అధికారి అందుకు బాధ్యుడవుతాడు.
  • క్లాజ్ 16 ప్రకారం ఉన్నతాధికారుల ఆజ్ఞలను సాకుగా చూపడానికి వీల్లేదు .
  • సెక్షన్ 58 ప్రకారం నిందితులకు బెయిల్ కూడా రాదు.ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు.
  • సెక్షన్ 66 ప్రకారం ఫోటోలు,వీడియోలను సాక్ష్యాలుగా ప్రవేశపెట్టవచ్చు  
సెక్షన్లు క్లాజులు బాగానే ఉన్నాయనిపిస్తుందా? ఇక్కడే అసలైన మెలిక ఉంది. మతకల్లోలాలు జరిగినప్పుడు మెజారిటీ వర్గాన్ని అందుకు బాధ్యులుగా బిల్లు రూపకల్పన చేశారు. సెక్షన్ 3 ప్రకారం వర్గం అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మతపరంగా లేదా భాషాపరంగా మైనారిటికి చెందిన వారు మరియు షెడ్యూల్డు కులాలు లేదా తెగలకు చెందిన వారు . మనదేశంలో ఒక్క హిందువులు తప్ప మిగతా
అన్ని మతాల వారు మతపరమైన మైనారిటి క్రిందకు వస్తారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ చట్టం ప్రకారం ఎప్పుడైనా మతఘర్షణలు జరిగితే న్యాయం కోసం పోరాడే హక్కు కేవలం మైనారిటీలకే ఉంది. సబ్ క్లాజ్ 3j ప్రకారం మైనారిటి ప్రజలనే బాధితులుగా పేర్కొన్నారు కాబట్టి అధిక సంఖ్యాక వర్గాల ప్రజలు నష్టపోయినా కిక్కురుమనడానికి వీలు లేదు . మెజారిటీ వర్గం ప్రజలే మతకల్లోలాలు ప్రేరేపిస్తారని, 
వారికి  ఎటువంటి ఆపదలు కలగవని ఈ బిల్లు ఉద్దేశ్యం కాబోలు. అలాగే వర్గం అన్న పదానికిచ్చిన నిర్వచనం కారణంగా మైనారిటీ ప్రజలు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినా, మానసికమైన, శారీరికమైన చిత్రహింసలకు పాల్పడినా, ఆస్తుల పై దాడులు చేసినా, అందుకు సహాయం చేసినా, ఈ బిల్లు పరిధిలోకి రారు.


సెక్షన్ 74 మరింత వివాదాస్పదంగా ఉంది. భారతీయ న్యాయసుత్రాల ప్రకారం నేరం నిరూపింపబడేవరకు ముద్దాయిని నేరస్తుడిగా భావించడానికి వీల్లేదు. సెక్షన్ 74 ఈ సుత్రానికి విరుద్ధంగా ఉంది. దీని ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను నేరస్తులగానే భావిస్తారు. నిజంగా నేరస్తులు కానివారు ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మతకలహాలను, జాతుల మధ్య
వైరాన్ని విచారించటానికి ప్రభుత్వం National Authority for Communal Harmony, Justice and Reparation అనే సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థకు వున్న విశేషాధికారాల ప్రకారం అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల్లోనే కాదు, జరుగవచ్చని భావిస్తున్న ప్రదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వాధికారుల పనితీరులో కూడా ఇష్టనుసారం జోక్యం చేసుకోవచ్చు. ఎవరినైనా విచారించే అధికారం అర్హత ఉంది. వీళ్ళ ఆదేశాలను సమీక్షించే అధికారం ఎవరికీ లేదు. పథకం ప్రకారం జరిగే ఘర్షణలను అంతఃకలహాలుగా పేర్కొంటూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. దీనివల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైపోవాల్సి ఉంటుంది. అమోదం పొందిన పక్షంలో ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్‌కు తప్ప తక్కిన అన్నీ రాష్ట్రాలకూ వర్తిస్తుంది. హిందువులు తక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం అక్కడి ప్రభుత్వ అనుమతి అవసరం.


 ఇంతటి మోసపూరితమైన బిల్లు మరొకటుంటుందా? ఇది ఏ రకమైన మతసామరస్యానికి ప్రతీక ? అసలిటువంటి బిల్లుల వల్ల మతసహనం పరిఢవిల్లుతుందా ? మెతక వైఖరితో మతపరమైన రిజర్వేషన్లతో విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండాలనే ఇంగితజ్ఞానం ఎప్పుడలవడుతుంది ?


3 comments

August 27, 2011 at 11:30 PM

శ్రీకాంత్ గారూ! నిజంగా మీ బ్లాగు ఒక ఎన్సైక్లోపీడియా....భలే వైవిధ్యభరితంగా రాస్తుంటారు, ఆలోచింపజేస్తుంటారు....ఒకలా చెప్పాలంటే మీ బ్లాగునుంచి నేను చాలా జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నానని చెప్పొచ్చు...

చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్నొవేటివ్ టపా ఇది....

Reply
August 30, 2011 at 11:04 AM

// ఇంతటి మోసపూరితమైన బిల్లు మరొకటుంటుందా? //
ఎందుకు లేదండీ..? గృహహింస బిల్లు కూడా ఇలాంటిదే కదా..! అందులో గృహహింస కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుందని భావించడం జరిగింది....
ఇటువంటి పనికిమాలిన బిల్లులన్నీ కాంగ్రెస్‌ మార్క్‌తో వస్తున్నవే..!

Reply

కౌటిల్య గారు,వామనగీత గారు కృతజ్ఞతలు

Reply
Post a Comment