ధర్మస్థల - హళేబీడు - బేలూరు

ర్మస్థల..రెండు వారాల క్రితం, రిటైరై ఖాళీగా ఉన్న మా తల్లిదండ్రులు వేసవి శెలవులలో బెంగుళూరు వచ్చినప్పుడు వచ్చిందీ ప్రస్తావన.ఇరవై మూడేళ్ళ క్రిందట, మూడేళ్ళ మా చెల్లికి రెండవసారి తలనీలాలివ్వటానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ధర్మస్థలను చూశాను. అప్పుడు మేము తిరుపతి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఎప్పుడు మేమెక్కెడికి వెళ్ళినా కుటుంబసభ్యులందరినీ వెంటేసుకొని బయలుదేరే మా నాన్నగారు అప్పుడు కుడా మాతోపాటూ నాన్నమ్మను, తాతను, అమ్మమ్మను వెంటబెట్టుకొని వెళ్ళారు. అప్పట్లోనే ఆయన బేలూరు,హళేబీడు, శ్రవణబెళ్గోల చూడాలని ప్లాన్ చేశారు. కానీ ఈయనకు కన్నడ రాక, ఆయన చెప్పింది కన్నడ కండక్టరుకి అర్థం కాక ఆ ప్లాను బెడిసికొట్టి మా యాత్ర ధర్మస్థల దర్శనంతోనే ముగిసిపోయింది. వాళ్ళు ధర్మస్థలను మాత్రమే చూడాలనుకొన్నా,ఆ యాత్రకు బేలూరు,హళేబీడు కూడా జోడించి ఈ సారైనా వాళ్ళ కోరిక తీర్చాలని నేను గట్టిగా అనుకొన్నాను. టికెట్ ఏర్పాట్లు మా తమ్ముడు చూసుకున్నాడు.

బెంగళూరు నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉంది ధర్మస్థల. డైరెక్ట్ ట్రైన్స్ ఏవీ లేవు. హస్సన్‌లేదా మంగళూరులో దిగి మళ్ళీ బస్సులో ప్రయాణం చెయ్యాలి. బస్సులో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం. రాత్రి తొమ్మిదిన్నరకు బస్సెకితే తెల్లవారుజామున ఐదున్నరకి ధర్మస్థల చేరుకున్నాం. అప్పటికి చీకట్లింకా తొలగిపోలేదు. మా తల్లిదండ్రులను ధర్మసత్రాల దగ్గర కూర్చోబెట్టి ఖాళీగదుల కోసం కాటేజీలను,గెస్టవుస్‌లను వెదుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళిన ప్రతిచోటా గదులు లేవన్న బోర్డు వెక్కిరిస్తూ కనపించింది. అలా ఒక గంటసేపు తచ్చాడి ఇక లాభం లేదని ఓ కాటేజిలో దూరాను. మరో గంటన్నరపాటూ చాంతాడంత పొడుగాటి లైన్లో నిల్చుంటే రూం దొరికింది. రూం కేటాయించే సమయంలో తప్పనిసరిగా మీ బంధుమిత్రులందరూ అక్కడే ఉండాలి. అప్పుడే రూం లభిస్తుంది. మాకు ఐదవ ఫ్లోర్‌లో కేటాయించారు. ఆ లభించిన గది కూడా పేరుకు గదే కానీ అందులో మంచాలు,మాట్రెస్సులు లాంటివేం లేవు. మూడు పొడవాటి సిమెంటు అరుగులను గదిలో నిర్మించి వాటిమీద బస్‌సీట్లలాంటి నల్లటి కవర్లను కప్పారు. హతోస్మి అనుకున్నాను. ఆ రోజు మా అదృష్టం బాలేదో లేక మాములుగానే ధర్మస్థలలో రూములంతేనో తెలియలేదు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా దేవస్థానం ఆధీనంలోనే ఉన్నాయని,ప్రైవేటు హోటళ్ళేవి లేవని విన్నాను. ఆలయ వెబ్‌సైట్‌లో అవుట్‌డేటెడ్ ఫోన్‌నంబర్లు దొరికాయి. పనిచేస్తున్న ఈ-మెయిల్ఐడి నుంచి జవాబు రాలేదు. గూగుల్‌లో వెదికినా ఇతర ప్రత్యామ్నాయాలు దొరకలేదు. ఒక్కటి మాత్రం నిజం. ధర్మస్థలలో సరైన వసతి సౌకర్యలు దొరికితే మీరదృష్టవంతుల కిందే లెక్క.

స్నానపానాదులు ముగించుకొని,టిఫన్ చేసి మంజునాథేశ్వరాలయానికి వెళ్ళాం. కేరళ లేక మంగళూరు సాంప్రదాయ శైలిలో కట్టిన ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. దీనిని జైనులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొలువై ఉన్న దేవుడు పరమశివుడు.
 


పూజలు చేసే పూజారులు వైష్ణవ తెగకు చెందినవాళ్ళు. ఇలా మూడు విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఇక్కడ శాంతి సౌభాతృత్వంతో మెలగుతూ దేవుడొక్కడే అన్న విషయాన్ని నిరూపిస్తారు. ఇక్కడ ప్రత్యేక దర్శనమంటూ ఏమీ లేదు. అందరూ మాములు క్యూలో వెళ్ళవలసిందే. క్యూలైన్లు పొడవుగా ఉన్నా క్యూ కదులుతూనే ఉంటుంది. గర్భాలయం సమీపమించినప్పుడు పురుషులు షర్టులు,బనియన్లు తీసివేయాల్సి ఉంటుంది. క్యూలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి బయటికి వచ్చేంతవరకు వివిధసేవలు,వాటికి దక్కే ప్రసాదాల వివరాలతో చెవులు ఊదరగొట్టేస్తారు నిర్వాహకులు. ఇది నాకు నచ్చలేదు. ఎంతసేపు ఈ గొడవే అయితే ఇక దేవుడి మీద మనస్సు లగ్నమయ్యేదెప్పుడు?

పూర్వకాలంలో ధర్మస్థలను కుడుమ అని పిలిచేవారు.ఇక్కడ జైన మతపెద్దైన పెర్గడె,అమ్ము బల్లత్తి దంపతులు ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు.ఒకనాడు మానవాకారాలు ధరించి వచ్చిన ధర్మదేవుని దూతలను పెర్గడె దంపతులు తమ ఆతిథ్యంతో సంతృప్తి పరుస్తారు.దేవదూతలు సంతోషించి ఆ రాత్రి పెర్గడె కలలో కనిపించి ప్రస్తుతం అతనుంటున్న ఇంటిని ఖాళీ చేసి ధర్మప్రబోధం చెయ్యవలసిందని అజ్ఞాపిస్తారు.

వారి ఆజ్ఞానుసారం కొత్తిల్లు కట్టుకొని,పాతింటిలో వెలసిన ధర్మమూర్తులను కొలుస్తూంటాడు పెర్గడె.మళ్ళీ వారు అతని కలలో కనబడి తమకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించాలని,వాటి నిర్వహణ బాధ్యతలు అతనే తీసుకోవాలని,దానికి బదులుగా అతని కుటుంబాన్ని తాము రక్షించి సమృద్ధినిస్తామని చెబుతారు. వారు చెప్పినట్లే చేసిన పెర్గడె, పూజారుల కోరిక మేరకు అన్నప్ప ద్వారా మంగళూరు దగ్గరున్న కద్రి నుంచి శివలింగాన్ని కూడా తెప్పించి ప్రతిష్ఠిస్తాడు. 16వ శతాబ్దంలో ఉడిపి వడిరాజస్వామి వేంచేసి లింగానికి శాస్త్రయుక్తంగా పూజలు చేసి ఈ ప్రదేశాన్ని ధర్మస్థలగా నామకరణం చేస్తాడు.

గంటలో దర్శనం పూర్తయ్యింది. వెంట్రుకలివ్వాలనుకొనే వారికి ఆలయం వెలుపలే టికెట్లు లభిస్తాయి. మనవైపు ఆడవాళ్ళు మూడు కత్తెర్లు వేయించుకుంటే ఇక్కడ ఐదు కత్తెర్లు వేయించుకోవాలి. దీనిని పంచముడి అంటారు.

అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న నేత్రావతి నదీ తీరానికి వెళ్ళాం. అది అధ్వానంగా ఉంది. భక్తులు నీటిని కలుషితం చేస్తారని నదికి చెక్‌డ్యాం కట్టి చిన్న చిన్న గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఆ నీరు ఏర్పరచిన గుంటలలో భక్తులు స్నానాలు

 


చేస్తూ,ఈదులాడుకుంటూ కనిపించారు. నదిలో దిగి నీళ్ళు చల్లుకొని ఒకటి రెండు ఫోటోలు దిగి తిరిగి వచ్చేశాం.అప్పటికి అపరాహ్ణవేళయ్యింది. సరైన హోటల్‌కోసం చూస్తే దేవస్థానం వారి ఉచిత అన్నదానం చాలా బావుంటుందని,అందరూ వాటినే ఆదరించటం మూలన పెద్దగా భోజన హోటల్స్ లేవని తెలిసింది. మేం దర్శనం కోసం క్యూలో నిలబడినప్పుడే అన్నదానం క్యూ ఆంజనేయుని తోకలా పొడవుగా ఉంది. మళ్ళీ గంటల తరబడి క్యూలో నిలబడే ధైర్యం లేక బస్టాండులో ఉన్న చిన్న హోటల్‌లో కాస్త కతికి భోజనం అయిందనిపించాం. అప్పటికే నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ధర్మస్థలలో ఎక్కువసేపుండటం కంటే ముందు హస్సన్ వెళ్ళిపోయి అక్కడ సరైన సౌకర్యాలున్న హోటలొకటి చూసుకోవాలని అనుకున్నాను. వెంటనే నా అలోచనను అమలులో పెట్టాను. మధ్యాహ్నం రెండున్నరకి హస్సన్‌బస్సు దొరికింది.మూడు దాటితే తర్వాత బస్సు రాత్రి ఎనిమిదిపైనేనని కండక్టరు చెప్పాడు. సౌకర్యలోపం కారణంగా తలెత్తిన ఇబ్బందులు ధర్మస్థల, దానికి చుట్టుపక్కలున్న ప్రదేశాలు చూడాలనుకొన్న నా పూర్వపు ఆలోచనలను వెనక్కి నెట్టేశాయి.

ధర్మస్థల నుంచి హస్సన్‌కు 110 కిలోమీటర్లు. ఘాట్‌రోడ్డు కాబట్టి బస్సులో నాలుగు గంటలు పట్టింది. దారికిరువైపులా పచ్చదనమే. ఎక్కడా రాయలసీమలోలా రాళ్ళగుట్టలు కనబడవు. పైగా విశాలమైన ఆవరణతో విలసిల్లే మంగళూరు శైలి గృహనిర్మాణాలు,పనసతోటలు,కాఫీ తోటలు మార్గమంతా ఎదురై ఆహ్లాదాన్ని పంచుతాయి. సకలేశ్‌పుర తర్వాత హోరున వర్షం కురిసి వాతావరణాన్ని మరింత ముగ్ధం చేసింది.

హస్సన్ కొత్తబస్టాండును తలదన్నే బస్టాండు ఆంధ్రదేశంలో ఏ జిల్లా కేంద్రంలోనూ లేదేమో .అంత స్టైలిష్‌గా విశాలంగా ఉంది. బస్టాండుకు కొద్ది దూరంలోనే మంచి హోటల్‌లో దిగి సేదతీరాం. ఆ తర్వాత బేలూరు,హళేబీడు,శ్రావణ బెళ్గోల చుట్టిరావడానికి టాక్సీలను, ప్రైవేట్ ట్రావెల్స్‌ను విచారించటానికి నేను రోడ్డు మీదకొచ్చాను. పదేళ్ళుగా బెంగుళూరులో పాతుకుపోయా కాబట్టి కన్నడ సంభాషణలపై నాకు మంచి పట్టే ఉంది. ట్రావెల్స్ వాళ్ళు 1500 అవుతుందని చెప్పారు. పైగా శ్రావణ బెళ్గోల హస్సన్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గంలో వస్తుందని, అక్కడ గోమటేశ్వరుని చూడ్డానికి ఎక్కవలసిన మెట్లు వందకుపైనే ఉన్నాయని చెప్పారు. మా తల్లిదండ్రులు అన్ని మెట్లెక్కలేరని లిస్ట్ లోంచి దాన్ని తీసేశాను. పాత బస్టాండు వెళ్ళి అక్కడున్న టాక్సీ డ్రైవర్లను కలిశాను. హీనపక్షం ఎనిమిదివందలిస్తే వస్తామన్నారు వాళ్ళు. అదే విషయం మా నాన్నగారికి ఫోన్లో చెబితే ' వృథా ఖర్చులెందుకు,అవే డబ్బులు హళేబీడు,బేలూరులో సైట్‌సీయింగ్‌కి ఖర్చుపెట్టోచ్చు.బస్సుల గురుంచి వాకబు చెయ్య'మని సూచించారు. బస్టాండులో ఆరాతీస్తే పొద్దున్నే ఆరున్నరకు హళేబీడుకు డైరెక్ట్ బస్సుందని చెప్పారు. ఆఖరికి అదే ఖరారయ్యింది. పొద్దున్నే స్నానం హళేబీడు బస్సెక్కేశాం. హస్సన్ నుంచి హళేబీడుకి 39 కిలోమీటర్ల దూరముంది. సమృద్ధమైన జలకళతో,పాడిపంటలతో,అరటి,కొబ్బరి తోటలతో అలరారే స్వచ్ఛమైన కన్నడ పల్లెసీమల్ని చూసి ముచ్చటపడుతూ గంటసేపటికి హళేబీడు చేరుకున్నాం.

హళేబీడు

హళేబీడు పల్లెటూరు. ఊరి మొదట్లో పెద్ద చెరువు. దాన్ని దాటుకొని లోనికివెళ్తే మూడురోడ్ల కూడలి మధ్య ఠీవీగా దర్శనమిస్తూ హొయశాల వృత్తం, అందులో సింహంతో పోరాడుతున్న శాళుడి ప్రతిమ(హొయశాల రాజచిహ్నం)కనువిందు

 


చేస్తాయి.అది ఈ మధ్యే నిర్మించినదైనా ఆ ప్రదేశానికున్న చారిత్రక ప్రాముఖ్యతను రొమ్ము విరుచుకొని చాటి చెప్పేలా ఉంది.దానికి ప్రక్కనే 890 ఏళ్ళనాటి హొయశాళేశ్వరుడు,శాంతలేశ్వరుల ఆలయాలున్నాయి. బస్టాండులో కాకాహోటల్లో టిఫన్ పూర్తిచేసి ఆలయసందర్శనకు ఉత్సాహంగా బయలుదేరాం.

హళేబీడు అసలు పేరు ద్వారసముద్రం. క్రీ.శ.12వ శతాబ్దంలో హొయశాలుల రాజధానిగా ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగింది. హొయశాలులు పశ్చిమ కనుమలలోని కొండజాతి వాళ్ళు. ప్రాథమికంగా జైనమతారాధకులైన వీరు తర్వాత హిందువులుగా మారిపోయి, అవసానదశలో ఉన్న ఆనాటి రాజవంశాల(పశ్చిమ గాంగేయులు, రాష్ట్రకూటులు) పరిస్థితులను ఆసరా చేసుకొని క్రమక్రమగా పట్టు సాధిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తృతం చేశారు. వారిలో ముఖ్యుడు విష్ణువర్థన మహారాజు. ఆయన ఆనతి ప్రకారమే రెండు శివాలయాలను నిర్మించారు. ఒకటి హొయశాళేశ్వరుడికి, ఇంకొకటి కేదారేశ్వరుడికి. హొయశాలేశ్వరాలయాన్ని క్రీ.శ 1121లో దండనాయకుడైన కేతుమల్లుని పర్యవేక్షణలో ప్రారంభిస్తే, కేదారేశ్వరాలయాన్ని మహారాణి శాంతలాదేవి పేరుమీదుగా క్రి.శ 1219లో ప్రారంభించారు. శాంతలాదేవి అభీష్టం మేరకు నిర్మింపబడిన గుడి కాబట్టి కేదారేశ్వరునికే శాంతలేశ్వరుడని మరో పేరు. నిర్మాణానికి 105 ఏళ్ళు పట్టింది.


ఆలయ నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది.నక్షత్రాకారంలో వెలసిన ఎత్తైన వేదికపై రెండు ఆలయాలనూ నిర్మించారు.ఆలయాంతర్భాగంలో పైకప్పుపై అద్భుతమైన శిల్పాలు చేక్కారు.గర్భగుడి ద్వారమైతే శిల్పకళకు పరాకాష్టగా నిలుస్తుంది. క్రిందినుంచి 




పైవరకూ మొత్తం శిల్పాలలో అలంకరించేశారు. ద్వారపాలురైన నంది,భృంగి విగ్రహాలు,మానవ కపాళాలతో నిండిన వారి కిరీటాలు చూసి నోళ్ళువెళ్ళబెట్టకతప్పదు. కపాలం ఎంత డొల్లగా ఉంటుందో నంది,భృంగి కిరీటాలలోని కపాలాలు కూడా అంతే డొల్లగా ఉంటాయి. కపాలంలో ఒక రంధ్రం నుంచి మరో రంధ్రానికి చిన్న పుల్లను దూర్చి తియ్యవచ్చు. అలాగే విగ్రహాలు ధరించిన నగల మధ్య కూడా చేతి వ్రేళ్ళు దూరేంత ఎడమ ఉంది. శాంతలేశ్వరునికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడి ప్రతిమ 


 


ఆకట్టుకుంటుంది. భారతదేశం మొత్తం మీద ఇంత అందంగా రకరకాల అలంకరణలతో చెక్కబడిన మరో నంది విగ్రహం లేదంటే అతిశయోక్తి లేదు. హొయశాళేశ్వరునికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా బావుంది కానీ దానికి ఇన్ని అలంకరణలు లేవు.

బాహ్యగోడలపై ఎనిమిది వరుసల శిల్పశైలి ద్యోతకమవుతుంది. క్రింద నుంచి మొదటి వరుసలో ఏనుగులు, రెండో వరుసలో సింహాలు, మూడవ వరుసలో లతలు తీగెలు,నాల్గవ వరుసలో ఆశ్విక దళం, ఐదవ వరుసలో మళ్ళీ లతలు తీగెలు, ఆరవ 


 


వరుసలో రామాయణ మహాభారత ఇతివృత్తాలు, ఏడవ వరుసలో మకరం, ఎనిమిదవ వరుసలో హంసలు కనిపిస్తాయి. వాటిపైన వెలసిన శిల్పాల అందచందాలని చూసి ఆస్వాదించాల్సిందే కానీ మాటలలో వర్ణించడం సాధ్యం కాదు.ప్రతి శిల్పం సహజత్వం ఉట్టిపడుతూ,శిల్పాచార్యుని సృజనాత్మక ప్రతిభకు నిలువుటద్దం పడుతుంది. ఒక్కో శిల్పం గురుంచి వివరిస్తూ పొతే చిన్న పుస్తకమే అవుతుంది. నాకు చేతనైన రీతిలో కొన్ని శిల్పాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

ఏనుగు ఉదరం చీల్చుకొని పరమశివుడు నృత్యం చేస్తున్న భంగిమ గజాసురవధ శిల్పంలో కనిపిస్తుంది.ఆనందంతో చిందులేస్తున్న నందిని, మృదంగం వాయిస్తున్న ప్రమదగణాలని పొట్టలోనే చూడవచ్చు. శంకరుని వాడైన గోళ్ళు ఎనుగు మృతకళేబరాన్ని చీల్చుకొని వెలుపలికి వచ్చినట్టు మలిచారు.త్రివిక్రమావతారమైన వామనావతార ఘట్టంలో ఒక పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతున్నట్లు, ఆ నీరే నదిగా మారి జాలువారినట్లు,అందులో చేపలు ఇతర జలచరాలు

 


ఈదులాడుతున్నట్టు, గరుడుడు భక్తిప్రపత్తులతో మ్రొక్కుతున్నట్లు, దేవతా స్త్రీ వింజామరలు వీస్తునట్లు మలిచారు. దశకంఠుడైన రావణుడు కైలాసాన్ని ఎత్తే శిల్పంలో, శిఖరాగ్రభాగాన పార్వతీసమేతుడై కూర్చున్న పరమేశ్వరున్ని మలిచారు. భక్తుని బలదర్పానికి ఆగ్రహించిన నిరంజనుడు తన కాలిబొటనవ్రేలితో పర్వతాన్ని తొక్కిపట్టగా, జీవనాడులన్నీ కదిలిపోయి రావణుడు కనుగుడ్లు తేలవేసిన దృశ్యాన్ని శిల్పం ప్రతిబింబిస్తుంది. ఈ శిల్పానికి చేరో వైపు బ్రహ్మవిష్ణువులను చెక్కారు.

సాధారణంగా త్రిమూర్తుల చిత్రాలలో మహావిష్ణువు మధ్యలో ఉంటే ఆయనకు చెరోవైపు బ్రహ్మరుద్రులుంటారు.కానీ ఇది శివాలయం కాబట్టి శివున్ని కేంద్రస్థానంలో ఉంచి,విష్ణువుకి స్థానచలనం కలిగించారు.

హిరణ్యకశిపుని వధ శిల్పంలో ఆగ్రహోదగ్రుడైన స్వామివారు రాక్షసి మూకలో ఒకడి తల చర్మం వలిచి పైకి లేపినట్లు చూపారు. వరహావతారంలో ఒక వైపు హిరణ్యాక్షుని తొక్కి పట్టి మరోవైపు ఆయుధాలతో రాక్షసగణాన్ని చీల్చిచెండాడుతున్న దృశ్యం 


 


కనిపిస్తుంది. గోవర్ధన గిరిధారి శిల్పంలో పర్వతంలో వేటగాన్ని, కోతిని ఇతర జంతువులను, వృక్షాలను చిత్రించి వాటికి జీవకళ తీసుకొచ్చారు. రోదసీ వీక్షణానికి టెలిస్కోపుని, త్రాగడానికి స్ట్రాని పాశ్చ్యాత్యుల కంటే మనమే ముందుగా ఉపయోగించామని చెప్పే శిల్పం,ఆంగ్లేయుల తలకట్టును, వస్త్రధారణను పోలిన శిల్పం


 

కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెలిస్కొపును కనుగొన్నది, ఆంగ్లేయులు వ్యాపారనిమిత్తం మనదేశానికి వచ్చినది 17వ శతాబ్దంలో. త్రాగడానికి వ్రాడే స్ట్రాను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ విశేషాలన్నీ అంతకుముందే ఎప్పుడో పన్నెండు పదమూడో శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాల్లో చూచాయగా బయటపడటం అప్పటికే మనదేశీయులు సాధించిన అపూర్వమైన అభివృద్ధికి సమ్మున్నత తార్కాణంగా భాసిస్తుంది . షరా మాములుగా అద్భుత శిల్పసంపదకు ఆలవాలమైన ఈ ఆలయాలను 1311లో మాలిక్ కాఫర్ ఒకసారి, 1326లో మహమ్మద్‌బిన్ తుగ్లక్ ఒకసారి ధ్వంసం చేసి సంపదనంతా మూటలు గట్టి అనేకసార్లు ఒంటెలపై మోసుకొనివెళ్ళారు. మహమ్మదీయుల దాడిలో ధ్వంసమై ప్రాభవం కోల్పోయిన ఊరు కాబట్టి హళేబీడు(పాత నగరం)అన్న పేరు స్థిరపడింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాధీశులు వీటి సంరక్షణభారం వహించారు. మొత్తం 35000 శిల్పాలకు పైగా శిల్పాలు ఈ ఆలయాల్లో ఉన్నాయని ఒక అంచనా. కొన్నింటిని ఆంగ్లేయులు తరలించుకొని పోయి లండన్‌లో భధ్రపరిచారని చెబుతారు.

ఆలయం వెలుపల పెద్ద సాక్షి గణపతి విగ్రహం ఉంది.దానికి ఎదురుగా హొయసల రాజలాంఛనం కనిపిస్తుంది.పూర్వం ఈ ద్వారం గుండానే మాహారాజ ప్రభృతులు పరతెంచి వచ్చి మొదట సాక్షి గణపతిని అర్చించి ఆ తర్వాత ఆలయ ప్రవేశం చేసేవారట. హొయసల రాజ చిహ్నం వెనుక ఓ కథ ఉంది. పూర్వం శాళుడు గురుకులంలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో అక్కడో సింహం జొరబడి భయోత్పాతం




 సృష్టించిందట. తక్కిన శిష్యులంతా భీతావహులై పరుగులుపెడితే, శాళుడు ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఒంటరిగానే సింహంతో కలియబడ్డాడట. శిష్యుడి ధైర్యసాహసాలకు ముగ్ధుడైన జైన గురువు సుదత్తుడు ' హొయ్ శాళా హొయ్ శాళా' అని అతన్ని ఉత్తేజపరిచారట.ప్రాచీన కన్నడ భాషలో' హొయ్ ' అంటే కొట్టు అని అర్థం. ఆ శాళుడు స్థాపించిన సామ్రాజ్యం కాబట్టి ఆ సంఘటనే రాజచిహ్నమయ్యింది.

ప్రధానమైన ఈ ఆలయాలు సందర్శించాక ప్రక్కనే ఉన్న జైనదేవాలయాలకు వెళ్ళాం. పార్శ్వనాథ స్వామి(జైనుల 23వ తీర్థంకరుడు) దేవాలయంలో నల్లశిలతో చెక్కబడిన పెద్ద విగ్రహం ఉంది. ఆ మూర్తి తలపై పడగలు విప్పిన ఏడుతలల సర్పాన్ని చెక్కారు. అయితే ఆలయమంతా గబ్బిలాల వాసనే. మందిరం ఎదురుగా ఉన్న రాతిస్తంభాల మండపం బావుంది. జైన దేవాలయాలకు కొద్దిగా ప్రక్కనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది.

హళేబీడు నుంచి బేలూరుకు 17మైళ్ళ దూరం. ప్రతి అరగంటకు బస్సులున్నాయి. మేం వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే సమయం పదకొండయ్యి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూండటంతో, ఇంకో అరగంట వేచి చూసే ఓపిక లేక ప్రవేట్ బస్సులో బేలూరు బయలుదేరాం.

బేలూరు



యగచి నదీతీరంలో ఉంది బేలూరు పట్టణం. దీని పూర్వనామం వేలాపురి.హళేబీడు ధ్వంసమయ్యాక హొయసలులు దీనిని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన గావించారు. ఇక్కడున్న ఏకైక దర్శనీయ స్థలం చెన్నకేశవాలయం. దీని నిర్మాణానికి నాంది పలికింది కూడా విష్ణువర్థనుడే. చోళులపై తన ఘనవిజయానికి గుర్తుగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. హళేబీడులోని శివాలయాల కంటే ఈ ఆలయం చాలా పెద్దది. క్రీ.శ.1116లో శంఖుస్థాపన జరుపుకున్న ఈ ఆలయాన్ని మూడు



తరాలవాళ్ళు 103 ఏళ్ళు కష్టపడి నిర్మించారు. ఇక్కడి మూర్తి, మోహినీ అవతారంలో ఉన్న చెన్నకేశవస్వామి(చెన్న అంటే కన్నడలో అందమైన అని అర్థం). ఈ స్వామికే విజయనారాయణుడని, సౌమ్యనారయణుడని మరో పేర్లు. హొయసాలులు నిర్మించిన అనేక దేవాలయాల్లో నేటికీ ప్రతి ఉదయం,సాయంత్రం క్రమంతప్పకుండా ధూపదీప నైవేద్యాలందుకొంటున్న ఏకైక దేవాలయం ఇదొక్కటే. మోహినీ అవతారంలో మహావిష్ణువు భస్మాసురున్ని అంతమొందించింది ఇక్కడే అని భక్తుల విశ్వాసం.

ఆలయం వెలుపల ఉన్న 42 అడుగుల ఏకరాతి కార్తీకదీపోత్సవ స్తంభాన్ని విజయనగర పాలకులు ప్రతిష్ఠించారు.ఎటువంటి పునాదులు లేకుండా ఒక రాతి 





వేదికపై నిలబెట్టబడిన ఈ స్తంభం నేటికీ పడిపోకుండా నిలబడి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.ఆలయ ఆవరణలో చెన్నకేశవునికి అభిముఖంగా, ధ్వజస్తంభం వద్ద వెలసిన గరుడప్రతిమను ఇటీవలే ప్రతిష్ఠించారు.

ఆలయ ప్రాంగణంలో నాలుగు గుడులున్నాయి.మొదటిది ముఖ్యమైంది అయిన చెన్నకేశవస్వామి గర్భగుడి మధ్యలో ఉంటే,దానికి ఒకవైపు కప్పే చెన్నిగరాయని ఆలయం,మరోవైపు సౌమ్యనాయకి(లక్ష్మీదేవి),రంగనాయకి(భూదేవి) ఆలయాలున్నాయి .

ఆలయ నిర్మాణశైలి చాలావరకు హళేబీడులోని శివాలయాలను పోలి ఉంటుంది. ఇక్కడ కూడా నక్షత్రాకారపు వేదిక మెట్లెక్కి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆలయంలోకి ప్రవేశించాలి. బాహ్యగోడలపై దర్శనమిచ్చిన శిల్పాలు హళేబేడులోని కొన్ని శిల్పాలను గుర్తుచేస్తాయి. అయితే హళిబేడుకి బేలూరుకి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే హళేబేడు దేవాలాయాలకు బాహ్యసౌందర్యం ఎక్కువ. బేలూరు ఆలయానికి బాహ్యసౌందర్యం, అంతస్సౌందర్యం రెండూ ఉన్నాయి.

చెన్నకేశవాలయంలో ఉన్న 48 స్తంభాలు వేటికవే వైవిధ్యంగా ఉంటాయి.ఇందులో ఐదు స్తంభాలు ముఖ్యమైనవి.వాటిలో నరసింహ స్తంభం వినుతికెక్కింది.ఒకప్పుడు ఈ స్తంభం తనంతట తానే తిరిగేదట. ఇప్పుడు నిలిచిపోయింది. హొయసాలుల 




ఇష్టదైవమైన నరసింహస్వామి ప్రతిమను,ఇతర చిన్న శిల్పాలను ఈ స్తంభంలో మలిచారు. ఒక చోట ఉద్దేశపూర్వకంగానే ఖాళీని ఉంచి ఏ శిల్పి అయినా ఈ స్తంభం విశిష్టత చెదరకుండా ఆ స్థలంలో సరిపోయే శిల్పం చెక్కవచ్చునని సవాలు విసిరారు.అది ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మిగిలిన నాలుగు స్తంభాలు గర్భాలయానికి ఎదురుగా ఉన్న నవరంగ మండపం దగ్గరున్నాయి. ఒక్కో స్తంభంపైన ఒక్కో సాలభంజికను చెక్కారు. ఈ సాలభంజికలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఈ శిల్పాలకన్నిటికీ జగదేకసుందరి మహారాణి శాంతలాదేవి అందచందాలే ప్రేరణ అని చెబుతారు. శాంతలాదేవికి భరతనాట్యంలో మంచి ఆభినివేశం ఉంది. పురజనుల కోరిక మేరకు దేవాలయాల్లో మూలవిరాట్టుకు ఎదురుగా నృత్యం చేసి అందరినీ మెప్పించి నాట్య సరస్వతి,నృత్యశారద లాంటి అనేక బిరుదుల్ని పొందింది. నవరంగ మండపంలోనున్న ఒక స్తంభంపై నృత్యం చేస్తున్న ఆమె భంగిమ మనసు దోచుకొంటుంది. ఆ ప్రతిమ తలపై వ్రేలాడుతున్న పాపటిబిళ్ళ అల్లాడుతున్నట్లే ఉంటుంది.మొత్తం నలభైరెండు సాలభంజికలున్నాయి. వాటిలో నాలుగు నవరంగ మండపంలో ఉంటే తక్కినవి బాహ్యకుడ్యాలపై వెలిశాయి.

నవరంగ మండపం మధ్యలో పైకప్పుపై అద్భుతమైన శిల్పకళ ఆవిష్కృతమవుతుంది.వేలాడే స్తంభాన్ని పైకప్పులో వీక్షించవచ్చు .

బాహ్యగోడలపై చెక్కిన సాలభంజికలలో జగత్ప్రసిద్దమైనది దర్పణసుందరి ప్రతిమ. త్రిభంగి నృత్యకారిణి ప్రతిమలోని భంగిమను ఇప్పటివరకూ ఏ నృత్యకారిణి అనుసరించలేకపోయిందని ప్రతీతి. అలాగే మహావిష్ణువు దశావతారాలు, ఇతర రూపాలు, రామాయణ మహాభారత గాథలలోని సన్నివేశాలు సునిశిత పరిశీలనాశక్తితో ప్రాణంపోసుకొని నయనమనోహరంగా దర్శనమిస్తాయి. 




ఇక్కడున్న కప్పే చెన్నిగరాయ దేవాలయం గురించి కూడా చెప్పుకోవాలి.ఈ ఆలయం శాంతలాదేవి కోరిక మేరకు అమరశిల్పి జక్కన నిర్మించినది.కొడుకు పుట్టక ముందే ఆలయ నిర్మాణం కోసం ఊరు విడిచి వస్తాడు జక్కన్న.పెరిగి పెద్దవాడైన కొడుకు డంకణ్ణ, తండ్రిని వెదుక్కుంటూ బేలూరు వచ్చి అక్కడ మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కుతున్న జక్కన్నను చూస్తాడు.తండ్రి వాడుతున్న శిల దోషభూయిష్టమైనది చెబుతాడు.ఆవాక్కై ఆగ్రహానికి గురైన జక్కన్న, నింద రుజువు చేసిన పక్షంలో తన కుడిచేతిని నరుక్కొంటానని శపథం చేస్తాడు.డంకణ్ణ గంధపు ముద్దను తీసుకొని విగ్రహమంతా పులుముతాడు.శరీరమంతా పూసిన పూత ఒక్క నాభి దగ్గరే తడిగా మిగిలిపోతుంది.అక్కడ ఉలితో మోదగానే, పగిలి అందులోంచి ఇసుక,నీరు,ఒక కప్ప గెంతుకుంటూ బయటపడతాయి.జక్కనాచారి మాటమీద నిలబడి తన చేతిని నరుక్కొంటాడు.అప్పుడే అతనికి డంకణ్ణ తన కన్నకొడుకని తెలుస్తుంది.మాహావిష్ణువు ఆదేశాల మేరకు అతని స్వగ్రామంలో ఒక కేశవాలయం నిర్మించి పోయిన తన కుడిచేతిని మళ్ళీ పొందుతాడు.



దురదృష్టవశాత్తూ మేమా ఆలయాన్ని దర్శించలేదు. మేం కుదుర్చుకున్న గైడ్ మాకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మాకా అవకాశం లేకుండా చేశాడు. కప్పే చెన్నిగరాయని దేవలయాన్ని ముందుగా సాంపిల్‌గా నిర్మించి మధ్యలోనే ఆపేసి చెన్నకేశవాలయాన్ని నిర్మించారని మాకతను చెప్పాడు. దానికి తగ్గట్టుగానే బాహ్యకుడ్యాలపై ఎటువంటి శిల్పాలు లేక ఖాళీగా కనిపించటంతో మేమటువైపు వెళ్ళలేదు.ఫోటోలు తీసేపనిలో గుడికి అనేక ప్రదక్షిణలు చేసి అప్పటికే అలసిపోయాం. దానికితోడు మధ్యాహ్నం ఒంటిగంట కావడంతో, రాత్రికి బెంగళూరు చేరుకోవాలన్న విషయం గుర్తొచ్చి అప్పటికి స్వస్తి చెప్పాం. అయితే మా అమ్మగారు మాత్రం వాటిని కవర్‌చేశారు.

బేలూరులో మంచి వసతి సౌకర్యాలున్నాయి. మధ్యాహ్నం బేలూరులోనే భోజనం చేసి హస్సన్ బస్సెక్కాం. ఈ బస్సు మళ్ళీ హళేబీడు మీదుగా వెళ్ళి గంటన్నరపాటూ మా సమయాన్ని వృథా చెయ్యకుండా,వేరొక మార్గంలో ప్రయాణించి అరగంటలోనే గమ్యస్థానం చేరుకుంది. అక్కడ దిగి కాస్త ఫ్రెషపయ్యి రెండున్నరకంతా బెంగుళూరు బస్సెక్కేశాం.

అక్కడితో మా యాత్ర పరిసమాప్తమయ్యింది .


1 comment

January 18, 2012 at 5:07 PM

very nice brother

Reply
Post a Comment