సిగలో అవి విరులో

పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో,రమేష్‌నాయుడు స్వరకల్పనలో,అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ,జయప్రద నటించిన మేఘసందేశం  చిత్రం లోనిది.భావకవితాప్రవక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్నందించిన ఆఖరి చిత్రం కూడా ఇదే.ఆయన వ్రాసిన మూడు గేయాలను ఈ చిత్రంలో వాడుకున్నారు(మిగాతా రెండూ-ఆకులో ఆకునై,శీతవేళ రానీయకు).దురదృష్టవశాత్తూ ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన పరమపదించారు .





ఈ పాట వింటే ముందుగా ట్యూన్ అనుకొని తర్వాత సాహిత్యం వ్రాసినట్లనిపిస్తుంది .అద్భుతమైన బాణీకి,మధురమైన సాహిత్యం తోడైతే,వీనులవిందైన గాత్రం దాన్ని అజరామరం చేస్తుంది.గాంధర్వగాత్రంతో తనవంతు బాధ్యతను సమర్థవంతంగా పోషించారు కే.జే.యేసుదాస్.

సువాసనలు వెదజల్లటం పువ్వుల ధర్మం.అవి శక్తివంతమైనవి.సుకుమారమైనంత మాత్రాన వాటిని తీసిపారెయ్యటానికి వీలు లేదు.దేవుళ్ళ దగ్గర్నుంచి దుర్మార్గుల వరకు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలన్నా పువ్వులు తప్పనిసరి.అంతటి శక్తివంతమైనవి కాబట్టే వాటినే బాణాలుగా మన్మథునికి కట్టబెట్టి లోకకార్యాన్ని నిర్వర్తిస్తున్నారు త్రిమూర్తులు . ఇప్పుడంటే తలలో పువ్వులు పెట్టుకోవటం నామోషీగా భావిస్తున్నారు కానీ,నిండుగా తలలో పువ్వులు పెట్టుకున్న స్త్రీమూర్తిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.ఆ స్త్రీమూర్తి భార్య అయితే,అది తొలిరేయైతే అంతకంటే చెప్పేదేముంది.సరిగ్గా అటువంటి సందర్భమే ఈ చిత్ర కథానాయకుడికీ ఎదురయ్యింది .

అతను భావావేశం కలిగిన ఒక ఉపాధ్యాయుడు.అసలే కవి.పైగా పెళ్ళైయ్యింది.గదిలో ఎదురుగా చక్కని చుక్కలాంటి భార్య సిగ్గుపడుతూ నిల్చుని ఉంది.జడలో పెట్టుకున్న మల్లెపువ్వులు, అగరుధూమాల సువాసనను,అత్తరుల ఘుమఘుమలను జ్ఞప్తికి తెస్తూ
అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతే ! అతనిలో ప్రణయానురాగాలు పెల్లుబుకి ఒక మధురగీతాన్ని అందుకున్నాడు.



సిగలో అవి విరులో
అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో
మసలే వలపు తొలకరులో



ఒకదానిమీద ఒకటి పేర్చినట్లు దొంతరలు కట్టిన ఆమె సిగ్గు,వలపు తొలకరి జల్లులా ఉందట.తొలకరి వర్షం మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కమ్మని మట్టివాసన వెదజల్లుతూ కురిసే చిరుజల్లులో తడవాలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? ఇక్కడ నాయిక సిగ్గు కథానాయకుడికి తొలకరిలా ఉందట.ఒట్టి తొలకరికాదండోయ్ వలపు తొలకరిలా .మాములు చిరుజల్లులకే మనం మైమరిచిపోతాం.ఇక ప్రేమతో నిండిన తొలకరి అయితే... అది అనుభవించాల్సిందే కానీ చెప్పశక్యం కాదు.



ఎదుట,నా ఎదుట,ఏవో సోయగాల మాలికలు
మదిలోన, గదిలోన, మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు ||సిగలో


గదిలో కట్టిన మాలికలు గమ్మత్తుగా ఉంటే,ఎదుట ఉన్న నాయిక సోయగాలు ఏకంగా అతని మదిలోనే మాలికలు కట్టేసుకొని కొత్తకోరికలు రేపుతూ  అతని తలపులు నిలువనీయటం లేదట.



జరిగి, ఇటు వొరిగి, పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన, చిగురాకు పెదవులను మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు  ||సిగలో


ఒకప్పుడు ప్రతి చిత్రంలోను భావుకత ప్రాధాన్యతున్న పాటలుండేవి.రాను రాను వాటి సంఖ్య తగ్గి ఇప్పుడు దాదాపుగా మృగ్యమైపోయాయి.ఇటువంటి పాతపాటలు వింటూంటే తెలుగు సినిమా పాటకు మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది .


4 comments

March 26, 2011 at 9:30 AM

మరిప్పుడైతే తొలిరాత్రి సాంగ్ అంటే ఏ మలేషియా లోనో, న్యూజిలాండ్ లోనో రోడ్డు మీద గ్రూప్ డాన్సర్ల మందతో "లస్కుటపా ఉస్కుటపా హేయ్య జిన్గిచిక జన్గుచక జియ్య" అని ఒక అర్ధం లేని పాట, అర్ధం కాని స్టెప్పులు, అర్ధ నగ్న డ్రస్సులు. అక్కడిదాకా ఎందుకు ఇంత భావుకత నిండిన పాట తీసిన దాసరే తన తీరు ఎలా మార్చుకున్నాడో చూస్తున్నాం గా.

మంచి పాటను గుర్తు చేశారు. కృష్ణ శాస్త్రి, రమేష్ నాయుడు గార్లు ఇద్దరూ ఇద్దరే.

Reply

శంకర్‌గారు..ధన్యవాదాలు.వైవిధ్యం పేరుతో పాండురంగడు లాంటి భక్తి కథకి విదేశాలు వెళ్ళి శృంగార గీతాలు చిత్రీకరించిన దర్శకేంద్రులున్నారు మనకి.

Reply
April 5, 2011 at 7:36 PM

surprisingly enough , I was reading the same beutiful lines in almost the same days when u have written it and posted in on my buzz :)
I absolutely love these lyrics - thanks! :)

Reply
April 21, 2011 at 8:37 PM

చిన్న సవరణ అండీ.. కథానాయకుడు రవీంద్రబాబు ఉపాధ్యాయుడు కాదు, భూస్వామి మరియు ఊళ్ళో పెద్దమనిషి..

Reply
Post a Comment